సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 26, 2013

వరంగల్ ప్రయాణం - రామప్ప గుడి





ఈ వేసవిలో ఏ ప్రయాణాలు కుదరలేదు. ఇక శెలవులు అయిపోతుంటే రెండు షార్ట్ ట్రిప్స్ కు వెళ్ళాము. అందులో ఒకటి వరంగల్ జిల్లా ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో మూడు చారిత్రాత్మక ప్రదేశాలను మాత్రమే చూడగలిగాము. వరంగల్ కు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప గుడి, హనుమకొండలో గల వేయిస్థంభాల గుడి, వరంగల్ లో ఉన్న భద్రకాళి ఆలయం.


రామప్ప గుడి ప్రయాణం:

గొప్ప శిల్పకళా నైపుణ్యం, ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఈ గుడి చూడాలన్నది నా చిరకాల కోరిక. చిన్నప్పటి నుండీ ఎన్నోసార్లు పేపర్లలో, పుస్తకాలలో ఈ గుడి గురించిన వివరాలు, నిర్మాణ విశేషాలూ చదివి నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. వరంగల్లో పిన్నీవాళ్ళు మూడేళ్ళుగా ఉంటున్నారు. బాబయ్యకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని, మేం వెళ్పోయేలోపన్నా రమ్మని పిన్ని ఎప్పటినుండో అడుగుతోంది. పుణ్యం, పురుషార్థం రెండూ కల్సివస్తాయని, ఇన్నాళ్లకైనా రామప్ప గుడి చూపించమని మావారిని బయల్దేరదీసాను. పొద్దున్నే ఏడున్నరకి రైలెక్కితే పదిన్నరకి వరంగల్లో దింపింది. "రైల్లో ఉన్నాం.. వస్తున్నాం, చూడాల్సినవన్ని చూసేసి వస్తాము.. మా కోసం ఏమీ వడద్దని.. " రైల్లోంచే పిన్నికి ఫోన్ చేసాను.

రైలు దిగి అక్కడ గేట్లో ఉన్న గార్డ్ ని వెళ్లాల్సినవాటి వివరాలు అడిగాము. రామప్ప గుడి ఓ వంద కిలోమీటర్లు దూరంలో ఉంది. వెయ్యి స్థంభాల గుడి హనుమకొండలో ఉంది. భద్రకాళి ఆలయం ఇక్కడే ఉంది. ఈ రెండు దగ్గర దగ్గరే. కాబట్టి ముందు బస్సెక్కి రామప్ప గుడికి వెళ్పోండి. రైల్వేస్టేషన్ ఎదురుగా బస్టాండ్ ఉందని చెప్పాడు. అసలు హనుమకొండ నుండి త్వరగా వెళ్తారు. ట్రైన్ కన్నా బస్సులో హనుమకొండ వెళ్ళాల్సింది మీరు అన్నాడా గార్డ్. రైల్వే స్టేషన్ కు వెళ్ళే ముందు JBSలో ఆగి ఎంక్వైరీలో వరంగల్ బస్సులు ఇప్పుడు లేవు. హనుమకొండ బస్సు ఉంది కానీ హనుమకొండ నుండి వరంగల్ గంట ప్రయాణం అని చెప్పారు. అందుకని రైలెక్కేసాం.(వరంగల్, హనుమకొండ పక్కపక్కనే అని వెళ్లాకా కానీ తెలీలేదు మాకు.) 'అసలు ఇన్నాళ్ళుగా పిన్నీవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు కదా రైల్లో వచ్చేప్పుడన్నా అవన్నీ ఎక్కడెక్కడున్నాయో కనుక్కోవచ్చు కదా.. ఇవన్నీ వరంగల్లో ఉన్నాయి.. వరంగల్ వెళ్లాలి అనుకోవటమే గానీ  కనీసం నెట్లో అన్నా వెతకలేదు డిస్టెన్స్.. ఇప్పుడు ఎలా వెళ్లాలో, ఎప్పటికి చేరతామో..' అని నా సహజ ధోరణిలో తెగ కంగారు పడిపోయాను. సుపర్ కూల్ అయ్యగారేమో "కంగారెందుకు పడతావ్? ఏదో ఒక మార్గం దొరుకుతుంది..బస్సులు ఉంటాయిలే. కనుక్కుని వెళ్ళొద్దాం.." అని అభయమిచ్చారు. బస్టాండ్ కు వెళ్లామో లేదో 'ఏటూరినాగారం' బస్సొకటి బయల్దేరుతోంది. 'రామప్ప గుడి వైపే వెళ్తుంది. ఎక్కండి' అని చెప్తే.. అది ఎక్కేసాం. కండక్టరేమో "జంగాలపల్లి" అనే పల్లేటూరి దగ్గర బస్సు దిగి "పాలంపేట" వెళ్ళాలి మీరు. అక్కడ గుడి ఉంది. జంగాలపల్లి లో ఆటో గానీ షేరింగ్ జీప్ గాని ఎక్కాలి మీరు.. అని చెప్పాడు. మధ్యలో సుమారు ఓ గంటన్నరకి అంటే 11.45 కి జంగాలపల్లి లో మమ్మల్ని దించేసి బస్సు వెళ్పోయింది. అదో చిన్న పల్లెటూరి జంక్షన్. అటుగా వెళ్ళే షేరింగ్ ఆటోలో, షేరింగ్ జీప్ లో ఎక్కాలిట "పాలం పేట" వెళ్లడానికి.  బండి నిండే బయల్దేరరు కదా షేరింగ్ వాళ్ళు. పన్నెండింటికి ఒక జీప్ బయల్దేరింది. మధ్యలో "ములుగు" అనే పల్లెటూరు కూడా వచ్చింది. దారిలో ఇంకా ఇంకా జనం ఎక్కుతూనే ఉన్నారు. ఒక్క జీప్ లో పంచెలు,కర్రలు పట్టుకున్న 'ముసలి యువకుల'తో సహా(ముసలివాళ్లైనా భలే ఏక్టివ్ గా ఉన్నారు వాళ్ళంతా.అందుకే ముసలి యువకులు అన్నా!) మొత్తం ఇరవై మందిని కుక్కాడు డ్రైవరు. అంత ఇరుకులో, గతుకుల రోడ్డులో చిరాకుగా ఉండగా డ్రైవరు పెట్టిన "సౌందర్య లహరి.." అనే పాట విని చచ్చేంత నవ్వు వచ్చింది..:)


అరగంట తరువాత మధ్యాహ్నం12.30కి జీప్ ఓ చోట ఆపి అదిగో ఆ కనబడేదే "రామప్ప గుడి". ఈ దారి గుండా నడుచుకుపొండి.. తిరిగి వచ్చేప్పుడు వెనుకవైపు మరో దారి ఉంది. అటు రండి. అక్కడ బస్సులు దొరుకుతాయి మీకు. అదే అసలు దారి.. ఇది దగ్గరని ఇటు దింపాను" అనేసి  చెరో పది తీసుకుని వెళ్పోయాడు. జీప్ వెళ్పోయాకా ఆ సున్సాన్ ప్రదేశంలో మేం తప్ప ఎవ్వరూ లేరు! సన్నటి మట్టి రోడ్డూ, చుర్రని బోలెడు ఎండ, చుట్టూ పొలాలు.. కీచురాళ్లరొద, దూరంగా చెట్ల మధ్య నుండి సినిమా సెట్టింగా నిజమా అన్నట్టు కనబడుతున్న రామప్ప గుడి. ఏ కారులోనో వచ్చి ఉంటే సుఖంగా ప్రయాణం జరిగేది కానీ ఈ ఎడ్వంచరస్ ఎక్స్పీరియన్స్ దక్కేది కాదు కదా అనుకున్నాం. ఆంధ్రదేశంలో గొప్పగా చెప్పుకోదగ్గ ప్రఖ్యాత గుడి. ఇలా ఎక్కడో మూలన ఎవరికి పట్టనట్లు పడి ఉండేంటి? అనిపించింది. దగ్గరగా వెళ్ళే కొద్దీ గుడి వద్ద కొందరు మనుషులు కనబడ్డారు. 'హమ్మయ్య పర్వాలేదు' అని ధైర్యం వచ్చింది నాకు. గబగబా కెమేరా తీసి బ్యాట్రీలు వేసా.





ఎన్నో ఏళ్ళుగా చూడాలనుకుంటున్న చారిత్రాత్మక గుడి. దగ్గరగా చూస్తూంటే మనసు పరిపరివిధాల పోయింది.. ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో గంతులు వేసింది. ఎంత అద్భుతంగా ఉందీ!! నలభైఏళ్ళపాటు కట్టారుట. ఎంతమంది శిల్పులు, ఎంతమంది కూలీలు అహోరాత్రాలూ శ్రమించి ఉంటారు? ఎన్ని వందల ఏనుగులు ఎన్ని వందల రాళ్లను మోసి ఉంటాయి? అక్కడ ఒక గైడ్ గుడి చరిత్ర చెప్తానంటే సరేనన్నాము. ఏ.పి.టూరిజం వాళ్ళు లోకల్ మనుషులు ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నియమించారుట. గైడ్ వల్లనే ఈ గుడి విజిట్ ని ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది మాకు. మొన్న ఏప్రిల్ నెలకి ఈ గుడి కట్టి ఎనిమిది వందల ఏళ్ళు అయ్యిందట. అష్టమ శతాబ్ది ఉత్సవాలు జరిగాయిట. ఆ ఉత్సవ సంచిక అతనే అమ్ముతుంటే కొన్నాము. ముఫ్ఫై రూపాయిలకి ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన ఆ పుస్తకం అపురూపంగా తోచింది నాకు. ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు గంటలు ఎలా గడిచాయో తెలీకుండా గడిచిపోయాయి.






రామప్ప గుడి విశేషాలు:

ఎనిమిదివందల ఏళ్ల క్రితం కాకతీయ రాజైన "గణపతి దేవుని" సేనాని "రేచర్ల రుద్రయ్య" నిర్మించాడు ఈ గుడి, దీని పక్కనే ఒక చెరువును. గుడి ప్రధాన శిల్పి  కర్నాటక కు చెందిన "రామప్ప". అద్భుతమైన శిలా నైపుణ్యంతో నలభైఏళ్ల పాటు ఈ గుడిని నిర్మించాడు రామప్ప. మొదట "రుద్రేశ్వరాలయం" అని పిలవబడేది కానీ తర్వాతర్వాత రామప్ప పేరు మీద రామప్ప గుడి, రామప్ప కొలను అని పిలువబడ్డాయి. గుడి ఆవరణలో రేచర్ల రుద్రయ్య వేయించిన శిలాశాసనం ఉంది. కన్నడ,తెలుగు రెండు భాషల్లోనూ లిపి ఉందిట. ఇప్పుడు బాగా కనబట్టం లేదు కానీ మండపం ఉంది. ఆ శిలాశాసనం ప్రకారం శాలివాహన శకం 1135వ సంవత్సరం, శ్రీముఖ సంవత్సరం, చైత్ర మాసం, శుక్ల పక్షం, అష్తమి తిధి, పుష్యమీ నక్షత్రం, ఆదివారం(31-3-1213 క్రీ.శ) నాటికి గుడి నిర్మాణం పూర్తయ్యిందని ఉందిట.
రేచర్ల రుద్రయ్య వేయించిన శిలాశాసనం

గుడిలోని రుద్రుడు "రామలింగేశ్వరుడు"గా పిలువబడతాడు. దక్షిణ, ఉత్తర శిల్పకళా నైపుణ్యాలు రెంటిని కలిపి కట్టించారు ఈ గుడి. గుడిపై చెక్కిన శిల్పాలు కూడా వివిధ సంస్కృతులకీ, వాస్తు, నీతి, గణిత, శృంగార, భవన శాస్రాలకీ, చరిత్రకి అద్దం పట్టేలా ఉన్నాయి. శివ, విష్ణు తత్వాల ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ రుద్రాక్షలను వైష్ణవనామాల్లా చెక్కటం అద్భుతంగా తోచింది నాకు.

శివ, విష్ణు తత్వాల ఏకత్వo

గుడి నిర్మాణానికి వాడిన శిల ఎరుపు, నలుపు రంగుల మిశ్రితం. ఆ ప్రాంతం చుట్టూరా ఉన్న కొండల్లో ఈ రకం శిలలు కనబడతాయిట. శివలింగానికీ, స్థంభాలపై ఉన్న ప్రతిమలకీ, బయట ఉన్న నందీశ్వరుడికీ, గుడి మధ్య ఉన్న రంగమండపంలో ఉన్న నాలుగు స్థంభాలకీ నల్లటి శిలను వాడారు. ఎక్కడి నుండి తెచ్చారో! అసలు ఇప్పుడు కూడా నునుపుగా ఉన్న ఆ పాలిషింగ్ కు,  ఆ డిటైల్డ్ వర్క్ కు ఏ మషీన్లు లేని అప్పటి కాలంలో ఎంత సమయం పట్టిందో! పునాదుల్లో పది, పదిహేను అడుగుల లోతు తవ్వి, అది ఇసుకతో నింపి, దానిని తడిపి, అందిపైన పీఠము వేసి, మరో లేయర్ వేసి.. అలా కట్టారుట గుడి. గుడి పై భాగంలో వాడిన ఇటుకలు నీటిలో తేలగల తేలికైన ఇటుకలుట. ఆ గోపురం బరువుకి గుడి కృంగిపోకుండా అలాంటి ఇటుకలను వాడారుట. గుడి పక్కనే ఒక చిన్న సాంపిల్ గుడిలాంటిది ఉంది. ముందు అది కట్టి ఆ మోడల్ లో ఇది కట్టారు అని గైడ్ చెప్పాడు. మరో పక్క ఉండే రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయిట. ఒకటి మాత్రం పునర్నిర్మిస్తున్నారు. ఆ గుడి తవ్వకాల్లోంచి వచ్చిన ఇసుక కుప్పలుగా పోసి ఉంది పక్కనే. ప్రధానాలయానికి మరో పక్క మరో చిన్న గుడి ఉంది. అది ప్రసాదాలు చేయటానికి వాడేవారుట.


స్థంభాలపై చెక్కిన ప్రతిమలు

ప్రసాదాలు చేయటానికి వాడేవారుట




కాకతీయుల పతనం తర్వాత ఐదువందల ఏళ్ల పాటు ఈ అద్భుతమైన కట్టడాన్ని ఎవ్వరూ పట్టించుకొనేలేదట. ఈలోపూ దోచుకునేవాళ్ళు దోచుకుని, పగులగొట్టేవారు పగులగట్టగా ఇప్పుడున్నది మిగిలిందిట. 1985 నుండీ టూరిజంవాళ్ళ పర్యవేక్షణలో ఉందిట. గుడి మూడు ద్వారాల వద్ద అటు ఇటు ఉన్న స్థంభాలపై చెక్కిన పన్నెండు నల్లటి శిల్పాలు అప్పటి మహిళల వస్త్రాలంకారాలనూ, శిల్పి  యొక్క కళానైపుణ్యాన్నీ చూపుతాయి. ఎలా చెక్కారో గానీ ఒక శిల్పంపై మెడలోని హారం తాలూకూ నీడ కూడా కనబడుతుంది. శివలింగానికి ఎదురుగా బయట ఉన్న మండపంలో ఉన్న నందీశ్వరుడు కాకతీయుల శిలానైపుణ్యానికి ప్రతీక అనవచ్చు. మువ్వలు, అలంకారం, నందీశ్వరుడి కళ్ళు అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. శివాలయాల్లో అన్ని చోట్లా కనబడే నంది విగ్రహంలా కాక ఇది ప్రత్యేకంగా శివుడు పిలిస్తే లేవటానికి రెడీగా ఉన్నట్లుగా చెక్కారు. గర్భగుడి ద్వారం వద్ద పేరిణి నృత్యభంగిమల పక్కన ఒక కృష్ణవిగ్రహం ఉంది. కృష్ణుడి పక్క చెట్టు తడితే వేణువాదనలాంటి స్వరం వినిపిస్తుంది. కళ్ల నీళ్ళు వచ్చాయి అది వింటుంటే. ఇక గర్భగుడిలో శివలింగం మీద లైట్ లేకపోయినా కూడా సూర్యరశ్మి పడి వెలుతురు ఉన్నంత వరకూ లింగం కనబడుతూనే ఉంటుందిట. నిజంగా రామప్ప అనే కళాకారుడు, మహా శిల్పి ఉండి ఉంటే అంతటి అద్భుతసృష్టి చేసిన మహానుభావుడికి మొక్కాలనిపించింది. ఇటువంటి గుడికి ఎలాంటి ప్రచారం, ఆదరణ లేనందుకు బోలెడు దు:ఖం కలిగింది.



నంది మంటపం

అందులోని నందీశ్వరుడు

నమూనా గుడి


స్వరం వినబడ్డ కృష్ణవిగ్రహం ఇదే..


ఆలయం మధ్యలో ఒక రంగ మంటపం ఉంది. కాకతీయుల కాలంలో శివలింగం ముందర నాట్యానికి వాడేవారట ఆ మంటపాన్ని. గుండ్రంగా ఉన్న ఆ మంటపానికి నలువైపులా నాలుగు పెద్ద పెద్ద నల్లని స్థంభాలు, వాటిపై చెక్కిన అపురూపమైన శిల్పాలను ఎంత సేపు చూసినా తనివితీరలేదు. నిజమో కాదో తెలీదు కానీ ఈ నల్లరాతిచెక్కడాలను చూసే నారాయణ రెడ్డి గారు "ఈ నల్లని రాలలో" అనే పాట రాసారుట. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా వివిధ నాట్యభంగిమల్లో చిత్రాలు చెక్కారు. అవన్నీ గణపతిదేవిని బావమరిది అయిన "జాయపసేనాని" రాసిన "నృత్యరత్నావళి" అనే నాట్యగ్రంధం ఆధారంగా చెక్కారుట. అవన్నీ కూడా మరుగున పడిన "పేరిణి శివతాండవ నృత్యం" తాలుకూ నాట్యభంగిమలుట. సైనికులు యుధ్ధానికి వెళ్ళేప్పుడు వారిని ఉత్తేజపరచటం కోసం కాకతీయులు ఈ నృత్యప్రదర్శన జరిపించేవారుట. ప్రముఖ నాట్యాచార్యులు కీ.శే. శ్రీ నటరాజ రామకృష్ణ గారు  ఈ గుడిలో ఈ నృత్యభంగిమలు చూసి, మూడేళ్ళు అక్కడ ఉండి వాటిపై పరిశోధన చేసి మరుగునపడిపోయిన ఈ "పేరిణీ శివతాండవనృత్యాన్ని" పునరుధ్ధరించారుట. ఏభై ఏళ్లకు పైన వీరి పరిశోధన, అధ్యయనం, పుస్తకరచన నడిచిందిట. పరిశోధనానంతరం 17-2-1985 శివరాత్రినాడు రామప్పగుడిలో రుద్రుడిని అభిషేకించి, పదివేల నూనెదీపాలు వెలిగించి, తన శిష్యబృందంతో శ్రీ నటరాజ రామకృష్ణ గారు అక్కడ పేరిణి శివతాండవ నృత్య ప్రదర్శన ఇప్పించారుట. ఆయన కష్టపడి చెసిన ప్రచారానికి జనాలు తండోపతండాలుగా వచ్చారుట ఆ నృత్యాన్ని చూడటానికి.

పేరిణి శివతాండవ నృత్యభంగిమలు

రంగమంటపం నలువైపులా   స్థంభాల్లో ఒకటి
గుడి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న విరిగిన శిలలు, శిధిలాల గుట్టలూ వదిలి అసలు వెనుదిరగాలనిపించలేదు. పోగొట్టుకున్న బొమ్మేదో ఇన్నేళ్లకు దొరికినట్లు, ఇక అసలు వదిలిపెట్టలేనట్లు అనిపించింది. అప్పటికే మూడున్నరవుతోంది. ఆకలి దంచేస్తోంది. రామప్ప చెరువు చూడలేదింక. అక్కడికి దగ్గర్లో లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారుట. అది బావుంటుందిట. ఈసారెప్పుడైనా మళ్ళి వస్తే అటు వెళ్లాలి. రామప్పగుడి రెండో వైపు ద్వారం నుండి రెండు కిలోమీటర్లు నడిస్తే మెయిన్ రోడ్డు వచ్చింది. రెండు కిరాణాకొట్లు, చిన్నచిన్న పాకలు తప్ప మనుష్య సంచారం లేదా రోడ్డుపై. అదృష్టవశాత్తు ఒక ఆటో దొరికితే వంద రూపాయలకి మాట్లాడుకుని మళ్ళీ జంగాలపల్లి చేరి, హనుమకొండ బస్సు ఎక్కాం. హనుమకొండ బస్సు ఎక్కితే "వెయ్యిస్థంభల గుడి" సులువుగా చేరచ్చు అని ఆటో అబ్బాయి చెప్పాడు. హనుమకొంద వెళ్తూంటే బస్సులో పట్టిన కలత నిద్రలో ఏవేవో కోట గోడలు, నృత్యాలూ, అస్పష్ట దృశ్యాలు కనబడుతూనే ఉన్నాయి..!

గుడి ఆవరణలో శిధిలాలు 
గుడి ఆవరణలో శిధిలాలు 


('వెయ్యిస్థంభాల గుడి' గురించి రేపు...) 

13 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయండీ ఫోటోలూ వివరాలూనూ.

శిశిర said...

అద్భుతం. ఎంత విలువైన సమాచారమిచ్చారండీ. Thanks for the post.

A Homemaker's Utopia said...

మీ ప్రయాణం కబుర్లు బాగున్నాయండీ.ఫోటోలు చాలా బాగా తీశారు :) పర్యాటక శాఖ వారు కాస్త ఇలాంటి మంచి కట్టడాలను పట్టించుకుంటే బాగుండును..:-)

Sujata M said...

Very good experience Trishna garu.. Asalu enta bavundo temple. I could not go there, because of same mis-guidance of the distance from Warangal. Read about Laknavaram in Sunday Eenadu a couple of weeks ago. Looking forward for your 1000 pillars experience. Because, after our visit to the temple in narrow lanes, I heard that Dist Collector had altruistically expanded the road that leads to the temple. And the temple is now easily accessible from the main road. Is it true ?

Indira said...

చాలా మచి ప్లేస్ కి వెళ్ళారు.రెండురోజులు స్పేర్ చెయగలిగితే వరంగల్ కోట,పద్మాక్షి అమ్మవారి గుడి మిగిలినవి అన్నీ చూడచ్చు.ఇక్కడినుంచి వెహికిల్ తీసుకుని వెళితే దోవలో కొలనుపాక అనేవూళ్ళొ మంచి జైన్ టెంపుల్స్ వున్నాయ్,అవికూడా చూడచ్చు.చారిత్రక ప్రాధాన్యత వున్న ప్లేసులకి వెళితే ఆ అనుభూతే వేరుకదా?

ranivani said...

చాలా విలువైన సమాచారం ఇచ్చారు . మేము కూడా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము .మీ సమాచారం .మాలాంటి వారికి బాగా ఉపయోగ పడుతుంది మంచిటపా .

సిరిసిరిమువ్వ said...

చాలా బాగా వ్రాసారండి. మళ్ళీ మేము వెళ్ళి వచ్చినట్లుంది.

నిజమే మీరన్నట్లు ఇంత ప్రసిద్ద గుడి ఇలా దిక్కూ మొక్కూ లేకుండా పడి ఉందేంటి అనిపిస్తుంది. అంతటి శిల్పకళ అలా ముక్కలు ముక్కలుగా పడి ఉండటం చూసి భలే భాథ కలుగుతుంది.

ఆ మధ్య ఏదో ప్రాజెక్టు కాలువ రామప్ప గుడి పక్కగుండా వెళ్తుందన్నారు..దానికి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చదివాను..మరి ఏమయందో దాని సంగతి.

Balu said...

ఇంతటి గొప్ప చారిత్రక సంపద అశ్రద్దకు గురవ్వడం బాధగా అనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడకు వెళితే బాగుంటుంది అని అందరూ అంటారు. ఎప్పుడు వెళ్తానా అని ఎదురుచూస్తున్నానండి.

Kottapali said...

చక్కటి సమాచారంతో, బొమ్మలతో విలువైన వ్యాసం.
ఒక్కోసారి అనిపిస్తుంది, టూరిజం డెవలప్మెంటు లేకపోవడం వల్లనే ఇవి ఈమాత్రమైనా ప్రెజర్వు అయి ఉన్నాయని. నేను ఇక్కడికి వెళ్ళి పాతికేళ్ళు దాటింది కానీ పరిసరాలన్నీ అలాగే ఉన్నాయి. పక్కనే ఉన్న రామప్ప చెరువు చూళ్ళేదా?

చిన్న సవరణ: సాలభంజిక అంటే చెక్కలో చెక్కిన బొమ్మ.

తృష్ణ said...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు వేణు గారూ.
@శిశిర: వీలైతే వెళ్లండి.. చాలా బాగుంది గుడి. ధన్యవాదాలు.
@నాగిని: అవునండి..ప్చ్ ! ధన్యవాదాలు.

తృష్ణ said...

@Sujata: జనాలకి దూరాల గురించిన సరైన అవగాహన లేక మిస్గైడ్ చేసేస్తున్నారండి..:(
మీరన్న రోడ్డు బాగుందండి. కొత్తగా వేయించిన రోడ్డు నుండి రెండు కిలోమీటర్లు నడిస్తే గుడి వస్తుంది. మరోవైపున్న పొలాల మధ్యనున్న మట్టి రోడ్డు మీంచి వెళ్తే ఐదు నిమిషాలు కూడా పట్టదు గుడిని చేరటానికి. కాని అక్కడ ఆటోలు దొరకవు.
ధన్యవాదాలు.

@ఇందిర: ఆ రెండు రోజులు దొరకకే అవస్థంతా :) కోట సంగరి మరోసారి చూడాలి.
అవును..హిస్టారికల్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టమండి.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@nagarani yerra: మీరు వెళ్ళేప్పుడు అన్నీ టైమ్ ప్రకారం ఎడ్జస్ట్ చేసుకుని, ప్లాన్ చేసుకుని వెళ్లండి.
ధన్యవాదాలు.

@సిరిసిరిమువ్వ: థాంక్సండీ. ఈ ప్రదేశాల ద్వారా మన వద్ద ఉన్న అపురూపమైన శిల్పకళా నైపుణ్యాన్నీ, భవన నిర్మాణ పధ్ధతులనీ ముందు తరాల కోసమన్నా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.
పురావస్తు శాఖ ఇప్పటికైనా మేల్కొంటే బాగుండు..

తృష్ణ said...

@Balu:వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుండేమోనండి. బస్సు రూట్ చాలా గతుకులు గతుకులుగా ఉంది. ఎత్తి కుదేసాడు.
చలికాలంలోనే బెటరేమో. ధన్యవాదాలు.

@Narayanaswamy S.:కొత్తపాళీగారూ, ధన్యవాదాలు. మీ పాయింట్ కరక్టేనేమో కానీ పురావస్తు శాఖవారు మరింత శ్రధ్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇటువంటి గొప్ప కట్టడం పొరుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే ఈపాటికి ప్రపంచప్రసిధ్ధి చెందిఉండేవేమో అనిపించిందండి.
* టైం లేక వచ్చేసామండి. రామప్ప చెరువు చూళ్ళేదు. మరోసారెప్పుడొ వెళ్ళాలి.
* పదం మార్చాను. అక్కడ గైడ్ 'సాలభంజికలు' అని చెప్పాడండి. నాకూ డౌట్ వచ్చింది. కానీ విక్రమార్కుడి కథలో సింహాసనానికి ఇరువైపులా సాలభంజికలు ఉండేవి అంటారు కదా, మరి అంతటి చక్రవర్తికి ఇంద్రుడు ఇచ్చిన సింహాసనం చెక్కతో ఉండేదంటారా?