సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, November 30, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ - 3






పట్టిసీమ :

మూడవరోజు ఎక్కడికెళ్ళాలో ప్లాన్ లేదు కాబట్టి కాస్త ఆలస్యంగా లేచాము. ఆ రోజు రాత్రికే కాకినాడలో అత్తయ్యగారిని కలిసి, రైలు ఎక్కాలి. అంతర్వేది, అదీ ఇది అని రకరకాలు అనుకుని చివరకు "పట్టిసీమ" వెళ్ళొచ్చేద్దాం అని నిర్ణయించుకున్నాము. పోలవరం బస్సులు ఎక్కమని మావయ్య చెప్పాడు. బస్టాండ్ లో మేం వెళ్ళిన సమయానికి పోలవరమ్ బస్సులేమీ లేవు. "తాళ్లపూడి" బస్సు ఉంది, అది ఎక్కమని టికెట్ కౌంటర్లో చెప్తే అది ఎక్కాము. ఆ బస్సు గోదావరి దాటి "కొవ్వూరు" మీదుగా గంటన్నర కి తాళ్లపూడి చేరింది. ఎర్రబస్సులెక్కి చాలా కాలమైంది. పైగా రోడ్డు కూడా బాగోలేదు. అక్కడ నుండి షేర్ ఆటోలో పట్టిసం వెళ్లటానికి అరగంట పట్టింది. ఆ రోడ్డు మరీ దారుణంగా ఉంది. అన్నీ గొయ్యిలే. పిల్ల ఇబ్బంది పడింది పాపం. దగ్గరే కదా వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నాం కానీ రోడ్డు ఇంత ఘోరంగా ఉంటుందని తెలిస్తే ఏ టాక్సీనో మాట్లాడుకుని ఉందుమే అనుకున్నాం.  


పట్టిసీమకు వెళ్ళే రేవు దగ్గర షేరాటో దిగి రేవుకి వెళ్లాం. పేద్ద ఆంజనేయస్వామి విగ్రహం, అందమైన రేవు ఆహ్లాదాన్ని కలిగించాయి. అక్కడే జీళ్ళు చేసి అమ్ముతూంటే వాటి ఫోటోలు తీసా. దేవాలయానికి లడ్డూ ప్రసాదం కూడా అక్కడే చేస్తున్నారు. అవతల ఒడ్డుకు వెళ్ళిన పడవ రావటానికి కాసేపు ఆగాము. మేం  ఎక్కిన పడవలో మోటారు ఉంది కానీ అది మేము కాశీలో  ఎక్కిన తెడ్డు పడవలాగానే ఉంది. చెయ్యి పెడితే నీళ్ళు అందుతున్నాయి. పడవ వెళ్తుంటే వంగి నీళ్ళలో చెయ్యిపెట్టడం భలే తమాషాగా ఉంటుంది. కనుచూపు మేరదాకా చుట్టూరా అంతా నీళ్ళు, దూరంగా కనబడుతున్న పాపికొండలు, ఎదురుగా చిన్న కొండ మీద వీరేశ్వరస్వామి ఆలయం.. ఎంతో అందమైన దృశ్యం అది. ఈ మొత్తం ప్రయాణంలో మేము బాగా సంతోషంగా ఎక్కువసేపు గడిపిన ప్రదేశం ఇది.
















అవతల ఒడ్డు ఒక ద్వీపంలాగ ఉంది. పడవ లేకపోతే అవతలి ఒడ్డుకు మళ్ళీ వెళ్ళలేము. తిరిగి వెంఠనే వెళ్లకుండా రెండు మూడు ట్రిప్స్ వదిలేసి ఓ గంట సేపు అక్కడ గడిపాము. మిట్టమధ్యాన్నం ఒంటిగంట అవుతోంది. ఎండబాగా ఉంది కానీ నదీతీరం కాబట్టి చల్లగా ఉంది. తడిసిన ఇసుక సముద్రపు ఒడ్డును గుర్తుకు తెచ్చింది. గోదావరి అంచు, ఇసుక తప్ప ఇంకేమీ లేదక్కడ. మా పాప నీళ్లలో ఆడుతుంటే, లోతులేని ప్రాంతం చూపెట్టి అక్కడ ఆడుకోవచ్చన్నాడు పడవబ్బాయ్. ఇక అక్కడికి వెళ్ళి మేం కూడా మా మా లోకాల్లో ములిగిపోయాం. పిల్ల ఒడ్దునే ఇసుక గూళ్ళు కడుతూ కూచుంది. తనేమో కాస్త నీళ్లలోపలికి వెళ్ళారు. నేనేమో white డ్రస్ పాడవుతుందని మరీ నీళ్లలోపలికి వెళ్లలేదు. ఒడ్డునే కాస్త పాదాలవరకు నీళ్ళల్లో మునిగేలా చూసుకుని ఆ అంచమ్మటే నడుచుకుంటూ అటూ ఇటూ తిరిగాను. 


ఆ గోదావరి తీరం అంచున చాలా బుజ్జి బుజ్జి చేపల గుంపులు తెగ తిరిగేస్తున్నాయి కానీ ఎన్నిసార్లు ఫోటో తీసినా ఫోటోలోకి రాలేదవి. క్లిక్ మనేలోపూ పారిపోతున్నాయి. నా పాదాల మధ్యన  బుజ్జి బుజ్జి చేపలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే అలా నీళ్ళల్లో నడవటం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళీ కాస్త ఇవతలకి వచ్చి తడి ఇసుకలో నా పాదాలగుర్తులు కనబడేలా నడిచి వాటికి ఫోటో తీస్కున్నా :) అలా ఎంతోసేపు ముగ్గురం సరదాగా పట్టిసీమలో గడిపాము.








ఆ ప్రకృతిలో, నిశ్శబ్దంలో మమేకమవ్వాలని చేసే ప్రయత్నంలో నాకు Thoreau తన "Walden" ఎంత ఉద్వేగంతో రాసి ఉంటాడో అర్థమైంది. ఇటీవల ఓ పుస్తకంలో చదివిన నది నేర్పే పాఠాలు కూడా గుర్తుకువచ్చాయి.  ఈ చిన్నచిన్న ఆనందాలన్నీ ఆస్వాదించగలుగుతూ ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది. కానీ ఇక్కడుండేవాళ్ళు ఇలా అనుకోరేమో... సిటీ రణగొణధ్వనుల మధ్యనుంచి, ఆదరాబాదర జీవితాల నుండీ వచ్చాం కాబట్టి ఇలాంటి గొప్ప అనుభూతిని కలిగిందేమో అని కూడా అనిపించింది.

మేం వెనక్కి తిరిగి రాజమండ్రి వచ్చేసరికీ నాలుగున్నర. పాపకి అన్నం పేక్ చేసుకుని, ఇద్దరు మావయ్యల దగ్గరా శెలవు తీసుకుని బస్సు ఎక్కేసరికీ ఆరున్నర. కాకినాడ చేరేసరికీ పావుతక్కువ ఎనిమిది. ఈ చివరి కాసేపు మాత్రం హడావుడి అయ్యింది. మేమింకా రాలేదని అత్తగారికి కంగారు. అత్తయ్యగారిని తీసుకుని రైల్వేస్టేషన్ చేరేసరికీ సరిగ్గా ట్రైన్ వచ్చే టైం అయ్యింది. మర్నాడు పొద్దున్న ఇక్కడ రైలు దిగి ఇల్లు చేరేసరికీ పొద్దున్న ఏడున్నర. ఎనిమిదింటికి పిల్ల స్కూల్ ఆటో వస్తుంది. అప్పటి నుండీ మళ్ళీ నా మామూలు తకధిమి తకతైలు మొదలైపోయాయి !! ఎన్నాళ్ళకో అరుదుగా దొరికిన ఈ అందమైన అనుభూతిని, ప్రకృతి ఇచ్చిన ప్రశాంతతనీ మర్చిపోకూడదని ఇలా బ్లాగులో పొందుపరుచుకుంటున్నా..!


***              ***               ***


మరికొన్ని ఫోటోలు ఇక్కడ:





Thursday, November 29, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ - 2





నేను బ్లాగు రాయటం మొదలెట్టినప్పటి నుండీ ఎందరో బ్లాగ్మిత్రులు తమ టపాల్లో "పాపికొండలు" అందాలు చూపించి, వారి అనుభూతిని పంచి.. ఊరించి ఊరించి... ఎలాగైనా పాపికొండలు చూడాలి అనే కోరికను బలపరిచేసారు..:)  కానీ ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందుకని అటువైపు వెళ్తున్నా కూడా ఉన్న రెండురోజుల్లో ఈసారి పాపికొండలు ప్రయాణం కుదరదులే అని అసలు ప్లాన్ చేసుకోలేదు మేము. కానీ మేము యానాం దగ్గర ఉళ్ళో ఉండగా మా పిన్నత్తగారు ఫోన్ చేసి నేను టికెట్లు బుక్ చేస్తాను. శెలవుల టైమ్ కాదు కాబట్టి రష్ తక్కువగానే ఉంటుంది అందరం సరదాగా వెళ్దాం అని వత్తిడి చేసేసరికీ సరేననేసాం. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి "అనుకోకుండా బంధువులు వస్తున్నారు మాకు కుదరదు.." అనేసారు. మా అత్తగారు కూడా రాలేననేసారు. అనుకున్నాం కదా మనం వెళ్ళొచ్చేద్దాం అని శ్రీవారిని ఒప్పించాను.


అసలు రాజమండ్రి నుండి భద్రాచలం దాకా బోటులో వెళ్ళాలి అనేది మా కోరిక. సమయాభావం వల్ల పేరంటపల్లి వరకే టికెట్ తీసుకున్నాం. పొద్దున్నే ఏడున్నరకే రావాలని టూరిజం వాళ్ళు చెప్పారు. మేం వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఆ రాత్రికి కాకినాడ వచ్చి, అక్కడ నుంచి రాజమండ్రి చేరేసరికి పదకండు అయ్యింది. పొద్దున్నే లేచి ఏడున్నరకల్లా పుష్కరాల రేవు వద్దకు చేరాం. హైదరాబాద్ లో చలి చంపుతోంది కానీ ఇక్కడ చలి జాడే లేదు. పొద్దున్నే చుర్రున ఎండ. ఎనిమిదిన్నరక్కూడా మమ్మల్ని ఎక్కించుకోవాల్సిన టూరిజం వాళ్ల బస్సు రాలేదు. టిఫిన్, భోజనం వాళ్ళే బోటులో పెడతానన్నారు. పిల్లకి ఇంట్లోనే తిఫిన్ పెట్టేసి, దారిలో అది తినడానికి బిస్కెట్లు,బ్రెడ్ మొదలైనవి కూడా కొని తెచ్చాను. బస్సు రాలేదు కదా అని ఈలోపూ రేవులోకి వెళ్ళి కాసేపు గోదారిని చూసి వచ్చాం..:) తొమ్మిదవుతూండగా వచ్చింది బస్సు. బస్సులో వెళ్తుండగా ఫోటోలు తీద్దాం అని బ్యాటరీలు వేసేసరికీ కెమేరా "లో బ్యాటరీ" అని బ్లింక్ అవ్వటం మొదలెట్టింది. రాత్రంతా చార్జ్ చేసా కదా..ఏమయ్యిందో తెలీలే...:( ఇంతదూరం రాకరాక వచ్చి ఫోటోలు తీసుకోలేకపోతే...నా ప్రాణం గిలగిలలాట్టం మొదలెట్టింది. పాపికొండలు ఫోటోలు తీసాకా అప్లోడ్ చెయ్యమని ఎంతమంది చెప్పారో ! బస్సువాడు పురుషోత్తపట్నం రేవుకి తీస్కెళ్ళి అక్కడ బోటు ఎక్కించాడు. ఆ రేవులో డ్యూరాసెల్ బ్యాటరీలు దొరకలేదు. దారిలో గండి పోచమ్మ గుడి వద్ద దొరుకుతాయి అనిమాత్రం చెప్పారక్కడ. ఏడుపుమొహం వేసుకుని బోటెక్కి కూచున్నా.









బోట్ లోపల ఏసి ఉన్నా, పైన అయితే బాగా చూడచ్చని పైనే కూచున్నాం. కడుపు నకనకలాడుతుంటే పదకొండింటికి తిఫిన్ పెట్టాడు. పెద్ద బాలేకపోయినా ఆకలి మీద తినేసాం. గండి పోచమ్మ గుడి ఎప్పుడు వస్తుందా...అని నిమిషాలు లెఖ్ఖేసుకుంటూ కూచున్నా. వచ్చింది. శ్రీవారు బ్యాటరిల కోసం వెళ్లారు. ఊళ్ళో బయల్దేరేప్పుడు మా మొబైల్ ఛార్జర్స్ తేవటం మర్చిపోయా :( రైల్లో అది గమనించాకా కూడా సుభ్భరంగా పాటలు పెట్టుకు వినేసా. రైలు దిగేసరికీ మా ఇద్దరి ఫోన్లు ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు తిరిగి బోట్లోకి అంతా వచ్చేసారు కానీ తను రాలేదు. ఫోన్ చెయ్యటానికి ఇద్దరి వద్దా ఫోన్లు లేవు. ఎందాకా వెళ్లారో తను... నా కంగారుకి తోడు అన్నీ ఇలాగే అవుతాయి అని నన్ను నేను బాగా తిట్టేసుకున్నా ! "మావారు రావాలి..కాసేపు ఆపమని బోటువాడికి చెప్పా.." చేతులూపుకుంటూ వస్తున్న మావారిని చూసి నా కంగారు ఎక్కువయ్యింది. మెట్లెక్కి పైకి వచ్చి "హాయిగా ట్రిప్ ఎంజాయ్ చెయ్యి. ఫోటోల గురించి మర్చిపో..." అన్నారు. మరో నిమిషంలో కుళాయి కారుతుంది అనగా జేబులోంచి బ్యాటరీలు తీసారు. వెంఠనే వెయ్యి వాట్లు బల్బ్ లా నా మొహం వెలిగిపోయింది. అమాంతం బ్యాటిరీలు లాగేసుకుని కెమేరాలో వేసేసి కరువుతీరా ఫోటోలు తీసేయటం మొదలెట్టేసా :)


దారిలో వచ్చే గిరిజన పల్లెల వివరాలు, షూటింగ్ స్పాట్స్ (సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి మొదలైన సినిమాలు) అన్నీ చూపిస్తూ మధ్య మధ్య కాటన్ దొర గారి గురించి, గోదావరి నది గురించీ, పోలవరం ప్రాజక్ట్ గురించి కబుర్లు చెప్పాడు గైడ్. మధ్యాన్నం భోజనాలు బానే ఉన్నాయి. కాస్త కడుపు నిండకా చుర్రున ఎండ మండిస్తుంటే క్రింద ఏసి హాల్లోకి వెళ్ళి సేదతీరాం. దాదాపు రెండింటికి "పాపికొండలు" మొదలయ్యాయి. అసలు అక్కడ నుండే బోటు ప్రయాణం ఆస్వాదించాం అని చెప్పాలి. నెమ్మదిగా బోటు కదులుతుంటే, బయట నడవలో నిలబడి ప్రవహించే గోదారినీ, అటుఇటు పచ్చని చెట్లతో మనల్ని దాటి వెన్నక్కు వెళ్తున్న పాపికొండల అందాలనూ చూసి తీరవలసిందే. అక్కడ కోండల్లో ఉండే గిరిజనవాడల గురించి వింటుంటే నాకు వంశీ "మన్యంరాణి" గుర్తుకు వచ్చింది. దారిలో నైట్ స్టే ఉండే వెదురు కాటేజీలు అవీ చూపించాడు.

















 చివరి మజిలీగా పేరంటపల్లి లో శ్రీరామకృష్ణ మునివాటిక,శివాలయం చూసిరమ్మని ఆపాడు. మునివాటిక పక్కగా అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గలగలా శబ్దం చేస్తూ రాళ్ల మీదుగా పారుతున్న చిన్న జలపాతం అత్యంత మనోహరంగా ఉంది. ఆ నీళ్ళు కూడా చాలా నిర్మలంగా మొహం కడిగితే హాయిగా అనిపించింది. అసలిలాంటి జలపాతాల తాలూకూ నీటిలో, నదీ ప్రవాహాల్లో బోలెడు ప్రాణ శక్తి ఉంటుందిట. వాటిని తాగినా, స్నానం చేసినా ఎంతో మంచిదిట. నది నీటిని గొట్టాల్లోంచి ప్యూరిఫై చేసి మన ఇళ్ళకి తెప్పించటంతో నీటిలోని ప్రాణశక్తి నశిస్తుందిట. అందుకే నదీ స్నానం, జలపాతాల్లో స్నానం మంచిదనేదీ, ఆ నీళ్ళు బాటిల్స్ లో పట్టుకుని తెచ్చుకునేదీ. ఈసారి వస్తే ఈ చోటుకు ఎక్కువ సమయం గడిపేలా రావాలని అనుకున్నాం. రేవు మొదట్లో ఉన్న పేద్ద చెట్టు మరొక ఆకర్షణ. పైకి కనబడేలా చెట్టు తాలూకూ పేద్ద పేద్ద వేళ్ళు బయటకే ఉండి విచిత్రంగా తోచింది. చాలా మంది వాటిపై కూచుని కబుర్లాడుకుంటున్నారు. రాత్రపూట అక్కడ తప్పకుండా భయంవేస్తుందేమో! "గోపి,గోపిక గోదావరి" సినిమాలో ఓ పాట వెనుక కనబడేది ఈ చెట్టే అనుకుంటా.






తిరుగు ప్రయాణంలో మళ్ళీ పైన బావుంటుందని పైకి చేరాం. ఈసరికి చాలా మంది క్రిందనే కునికుపాట్లు పడుతుండటంతో పైన బోటు గోడ పక్కనే కుర్చీలు వేసుకుని కూచోవటానికి వీలయ్యింది. సాయంత్రం అరగంట సేపు గుప్పున వాసనలు తెప్పించి ఓ గుప్పెడు పకోడీలు, కస్తంత టీ ఇచ్చాడు. చక్కని సాయంత్రం, చల్లని గాలి, వేగం తగ్గి సద్దుమణిగిన నది ప్రవాహం, ముసురుతున్న చీకట్ల నడుమ అక్కడక్కడ ఒడ్డునున్నగూడాల్లో మిణుకు మంటున్న దీపపు కాంతులు, కాసేపటికి నిర్మలంగా ఉన్న ఆకాశంలోంచి తోడొచ్చిన తెల్లని చందమామ... షాల్ కప్పుకుని ఆ బోట్ డెక్ మీద ఎంత ప్రశాంతతని ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను. అయితే ఆ ఆనందాన్ని పరిపూర్ణం చెయ్యటానికి వెనకాల ఏ సంతూరో, ఫ్లూటో.. వాద్య సంగీతం వినిపించి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. పేద్ద సౌండ్ లో సినిమా పాటలు పెట్టి, వాటికి నృత్యం చెయ్యటం, పొద్దు గడపటానికి అన్నట్లు హౌసీ మొదలైన గేమ్స్, బోట్లో ఉన్న మనుషులతో డాన్సులు చేయించటం మొదలైనవి మా ఇద్దరికీ అస్సలు నచ్చలేదు. చాలా చిరాగ్గా, ఆనందానికి అంతరాయంగా తోచింది వారి ఎంటర్టైన్మెంట్.


ప్రపంచానికి దూరంగా, ప్రశాంతంగా, ప్రకృతి ఒడిలో ఓ రోజంతా గడపటానికి, మనం రీఛార్జ్ అవ్వటానికీ ఆ బోటు ప్రయాణం చాలా ఉపయోగపడుతుంది. బోటులో ఉండి ప్రకృతిని ఆస్వాదించకుండా ఈ కార్యక్రమం ఎందుకో, పనిగట్టుకుని మా పొద్దు గడపటానికి వాళ్లంత శ్రమ పడ్డం ఎందుకో తెలీలే. టివీ చూపినట్లు అక్కడ కూడా డాన్స్, గేమ్స్ ఎందుకో అర్థం కాలేదు. అవి ఒడ్డున ఉండి కూడా చేయచ్చు. బోట్ ఎక్కటం ఎందుకు? ఆ ఇద్దరు అబ్బాయిలూ చాలా కష్టపడి ఆ డాన్సులు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్దవాళ్ళు బోట్లలో వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు వస్తాయని, టిప్స్ వస్తాయని అలా చేస్తున్నాం అని వాళ్లు చెప్పటం, డబ్బులు అడగటం విచిత్రంగా తోచింది. ఇంకో విచిత్రం ఏంటంటే దాదాపు అందరూ వాళ్ల డాన్సులు ఎంజాయ్ చేసి, వాళ్ళు డాన్స్ చేయిస్తే కూడా పులకించిపోతూ, మెలికలు తిరిగిపోతూ డాన్సులు చేసేసి ఆనందించేయటం ! బహుశా మేమే ఆదివాసుల్లాగానో, గ్రహాంతరవాసుల్లాగానో ఉన్నమేమో. అందుకే మేము అందరిలా ఎంజాయ్ చెయ్యలేకపోయాం. అసలు అంత చక్కటి నిశ్శబ్దాన్ని ఆస్వాదించే అవకాశం ఊళ్లల్లో జనజీవనస్రవంతిలో వస్తుందా? ప్రకృతిని అంత నిశ్శబ్దంగా ఆస్వాదించగల అవకాశం ఎక్కడుంది? నేల మీద దొరకని అందమైన నిశ్శబ్దాన్ని ఆ కొండలు, నదీప్రవాహం అందిస్తుంటే జనాలు ఎందుకు ఆస్వాదించలేరో తెలీలేదు..:((






మరొక నచ్చని విషయం.. బోటు ప్రయాణం పేరుతో గోదావరిని చెత్తతో నింపటం. వద్దంటున్నా ప్లాస్టిక్ గ్లాసులు, తినేసిన చిప్స్ తాలుకూ ప్లాస్టిక్ కవర్లు నదిలో పారేయటం. నదేమన్నా డస్ట్ బిన్నా? ఇంకా ఘోరమేమిటంటే తుక్కు పాడేయద్దని చెప్పిన బోటువాళ్ళే మాకు భోజనం పెట్టిన ప్లేట్లు, గిన్నెలూ, డబ్బాలూ అక్కడే కడిగేస్తున్నారు. ఆ సబ్బునీళ్ళన్నీ  గోదావరిలో కలిసిపోతున్నాయి...:(( ఇలా రోజుకి ఎన్ని బోట్లవాళ్ళు ఎన్ని ప్లాస్టిక్ గ్లాసులు, ఎన్ని తినేసిన ఖాళీ కవర్లు, ఎంత సబ్బు నీరు గోదావరిలో కలిపేస్తున్నారో కదా...!!! ఇక బోటు మీదున్న రెండు బాత్రుమ్స్ తాలూకూ నీళ్ళు ఎటు పోతాయో పరమాత్మకే ఎరుక ! విహారం పేరుతో నన్ను ఇన్నిరకాలుగా అపవిత్రం చేస్తున్నారేమని గోదావరితల్లి అడగలేదని అలుసు కదూ ??! నా మాట ఈ బ్లాగులో కల్సిపోయేదే అయినా.. విహారం వెళ్ళే చోట్ల ఒడ్డున బాత్రూమ్స్, బోటులో కాక ఒడ్డునే ఆగిన చోటనే తినే ఏర్పాట్లు, బోటులో వినటానికి కేవలం వాద్య సంగీతం ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్రయణం అంత అద్భుతమైనది మరోటి ఉండదు.


చివర చివరకి పురుగులు వచ్చేస్తున్నాయని అందరం క్రిందకు చేరిపోయాం. రాత్రి ఏడుంపావుకల్లా ఒడ్డు చేరి, మేం మళ్ళీ రాజమండ్రి చేరేసరికీ ఎనిమిదిన్నర అయ్యింది.



పాపికొండలు తాలుకూ మరిన్ని ఫోటోలు "ఇక్కడ" చూడండి...


(రేపు చివరిరోజు ప్రయాణం 'పట్టిసీమ' కబుర్లు..)

Tuesday, November 27, 2012

యానాం - పాపికొండలు - పట్టిసీమ -1




కాకినాడ - యానాం - రాజమండ్రి - పాపికొండలు - పట్టిసీమ..
పడవలు - రేవులు - గోదావరి - కొబ్బరిచెట్లు..
రెల్లుపూలు - ఇసుక - సూర్యుడు - వెన్నెల..
అన్నింటితో మరోసారి చెలిమి చేసి.. 
నేను ఈమట్టిలో పుట్టినదాన్నే.. అని..
ప్రతి చెట్టుపుట్టకీ గుర్తుచేసి..
తిరిగి తిరిగి.. అలసి సొలసి.. వచ్చా !!


బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో వెళ్ళిన "తూర్పుగోదావరి ప్రయాణం" కబుర్లు సిరీస్ రాసాను. అప్పుడు బిక్కవోలు, ద్వారపూడి, ద్రాక్షారామం, కోటిపల్లి, యలమంచలి మొదలైన చోట్లకి వెళ్ళాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో అటువైపే వెళ్ళినా మరికొన్ని చూడని ప్రదేశాలు చుట్టి వచ్చాం ...







శిర్డీ ప్రయాణం అనుకోనిదే కానీ మొన్నవారంలో వెళ్ళివచ్చిన ప్రయాణానికి మాత్రం రెండునెలల క్రితమే రిజర్వేషన్లు చేయించాము. ఈ ప్రయాణంలో కాకినాడ, యానాం, రాజమండ్రి, పాపికొండలు, పట్టిసీమ చుట్టివచ్చాం. అసలు యానాం దగ్గర్లో ఉన్న ఒక ఊరికి ముఖ్యమైన ఫంక్షన్ నిమిత్తం వెళ్ళాము. ముందుగా కాకినాట్లో దిగి అత్తయ్యగారిని మా పెద్దత్తగారి దగ్గర దిగపెట్టి, మా కోసం పంపిన కారులో యానాం దగ్గర ఉన్న బంధువుల ఊరికి బయల్దేరాం.



చాలా చిన్న పల్లెటూరు అది. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. బహుశా పల్లెటూర్లన్నీ ఇలానే ఉంటాయేమో. దేశంలో ఇటువంటి రిమోట్ పల్లెలు ఎన్ని ఉన్నాయో అనిపించింది. ప్రతి ఇంటికీ చక్కని పెరడు, అందులో బోలెడు మొక్కలు, కొందరి ఇళ్ళల్లో ఓ పక్కగా ఆవులు, గేదెలు. మేం వెళ్ళిన ఇంట్లో మందారాలు, పనస, బత్తాయి, మామిడి, అరటి, ఉసిరి, పొగడ చెట్లు ఉన్నాయి.  అపార్ట్మెంట్లు ఎంత సౌకర్యంగా, అధునాతనంగా ఉన్నా ఇలా మొక్కలు వేసుకుందుకు ఇంటి చూట్టూ జాగా ఉండే ఇల్లే ఇల్లు కదా..! మా పాప అయితే "అమ్మా ఇక్కడే ఉండిపోదాం.. బావుంది" అని గొడవ. పెరట్లో నుయ్యి చూసి శ్రీవారు అక్కడే ఆగిపోయారు. వాళ్ల నూతిలో నీళ్ళన్నీ మీరే పోసేసుకునేలా ఉన్నారు ఇక రండి...అని పిలవగా పిలవగా కదిలారు :) నాకు మా కాకినాడ ఇల్లు గుర్తుకు వస్తే, తనకి ఏలూరులో ఉన్న వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు గుర్తుకొచ్చిందట. అలా ఇద్దరం ఎవరి స్మృతుల్లో వాళ్లం తిరగాడుతూ ఉండిపోయాం..!





ఆ సాయంత్రం కాసేపు ఆ ఊరు చూసిన తర్వాత యానాం బయల్దేరాం. యానాం ఫెర్రీ రోడ్డులో photos..


















యానాం ఫెర్రీ రోడ్డులో కాసేపు గడిపి, తిరిగి ఊరు వెళ్తూంటే దారిలో ఒకచోట అచ్చం వంశీ సినిమాల్లో సీన్ లాగ బావుందని ఆగాం. గోదావరి ఒడ్డు, పడవలు, జాలరులు, ఇసుకతిన్నెలు, సూర్యాస్తమయం... ఆ సాయంత్రం మాకందించిన అనుభూతి నిజంగా మరువలేనిది. లోతులేని గోదారినీళ్ళలో కాళ్ళు పెట్టుకుని నించోవటం భలేగా అనిపించింది. చేపల కోసం అప్పుడు వెళ్ళి, వల పన్ని రాత్రంతా గోదారి పైనే ఉండి, మళ్ళీ పొద్దున్నే వస్తారుట. అక్కడి జాలరులు చెప్పారు. అందుకే నిద్ర వచ్చినా ఇబ్బంది లేకుండా ఒక్కో పడవలో ఇద్దరుంటారుట.












 పిల్లతో పోటీపడి అక్కడున్న ఇసుకతిన్నెలు ఎక్కిదిగటం, ఆ ఇసుకతిన్నెలపై నిలబడి దూరంగా ఉన్న బ్రిడ్జి నీ, సూర్యాస్తమయాన్నీ, ఆ కిరణాలవల్ల మిలామిలా మెరుస్తున్న గోదారినీ చూడటం గొప్ప అనుభూతి. రైలు అందుకోవటానికి వెనక్కి వెళ్పోవాలని అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాం. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కువ సేపు గడపాలని గాఠ్ఠిగా అనుకున్నాం. రోడ్డు మీదకి వచ్చేసరికీ  కన్నులకింపైన దృశ్యం.








వెనక్కెళ్ళే దారిలో కొబ్బరి చెట్లతో పాటూ అరటిచెట్లు, వాటికి వేళ్ళాడుతున్న గెలలు, అరటిపూలూ కన్నులపండగ చేసాయి. అయితే, ఈసారి కూడా నా చిరకాల కోరిక తీరలేదు..:( ఎక్కడా కూడా తామరపూలున్న కొలనేది కనబడనేలేదు. మేము వచ్చామని తెలిసి మా పిన్నత్తగారు పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేసారు అప్పటికప్పుడు. ఎలాగూ పొద్దున్నే బోట్ దగ్గరకు వెళ్లాలి కదా అని ఆ రాత్రికి రాజమండ్రి చేరుకున్నాం.  కానీ అనుకోకుండా బంధువులు వచ్చారని పాపికొండలు ట్రిప్ కు మా పిన్నత్తగారు వాళ్ళూ డ్రాప్ అయిపోయారు. అనుకున్నాం కదా మానేయటం ఎందుకని, మేం మాత్రమే వస్తామని ట్రావెల్స్ వాళ్లకి చెప్పేసాం.



మొదటిరోజు ప్రయాణం తాలూకూ మరిన్ని ఫోటోలు ఇక్కడ:
http://lookingwiththeheart.blogspot.in/2012/11/blog-post_28.html


(తదుపరి టపాలో పాపికొండలు ప్రయాణం కబుర్లు...)



Wednesday, November 21, 2012

షిర్డి - ఘృష్ణేశ్వర్ - ఎల్లోరా - 2





ఎల్లోరా గుహలు: 

ఘృష్ణేశ్వరుడి దర్శనం అయ్యాకా "ఎల్లోరా" గుహలకి తీసుకువెళ్ళాడు. బౌధ్ధ, జైన, హిందూ మతాలకి స్మారక చిహ్నాలు ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ఈ ఎల్లోరా నిర్మాణాలు. ఈ మూడు మతా వ్యవస్థలనూ ప్రతిబింబించే శిల్పకళారీతులు ఈ గుహల్లో మనకు కనబడతాయి. అతిప్రాచీనమైన ఈ గుహల నిర్మాణం క్రీ.శ.500 మరియు 700 మధ్యన జరిగిఉంటుందని అంచనా. న్యాయంగా చెప్పాలంటే ఒక రోజంతా తీరుబడిగా ఉండి మొత్తం ముఫ్ఫైనాలుగు గుహలూ చూడాల్సిన మాట. అంత అద్భుత కట్టడాలు ఇవి. అన్నింటిలో ముఖ్యమైనవి పదహారవ గుహ, ముఫ్ఫై రెండవ గుహా ట. మాతో వచ్చిన ఢిల్లీ వాళ్ళు డిస్కవరి ఛానల్లో ఎల్లోరా గుహలను గురించిన కార్యక్రమం చూసారుట. వాళ్ళే మాకు ఏ గుహలో ఏమున్నాయో అన్నీ చెప్పారు. సో, మేము సైతం ఎల్లోరా గుహల విశేషాలను పరోక్షంగా డిస్కవరి ఛానల్ ద్వారా తెలుసుకున్నామన్న మాట :౦  ముఫ్ఫైదాకా గుహలన్నీ చూసాం. ఆ పై దారి మూసేసారు. మరమత్తు జరుగుతోంది. వేరే రోడ్డు మార్గం ఉంది ఆ ముఫ్ఫై రెండవ గుహకు తీసుకెళ్లవయ్యా అంటే మా వాన్ డ్రైవర్ ఒప్పుకోలేదు :( ఇక next  tripలో అజంతా గుహలతో పాటూ మిగిలినవీ చూడాలి అనుకున్నాం.








"శిలలపై శిల్పాలు చెక్కినారు...మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు...",  "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో.." అని పాడుకుంటూ, చాలామటుకు శిధిలమైపోయిన ఆ శిల్పకళాసృష్టిని చూస్తూ ఉద్వేగపడుతూ.. ఏవో ఆలోచనల్లోకి వెళ్పోయా నేను. ఎందుకనో ఈ చారిత్రాత్మక కట్టడాలంటే నాకు చాలా ఇష్టం. కోటలూ, మ్యూజియమ్స్, గుహలు, పురాతనమైన ఆలయాలూ.. ఇలాంటివన్నీ వీలయినన్ని చూడాలని నా కోరిక. ఎప్పుడో.. ఏ గతజన్మలోనో ఏదో ఒక చరిత్రతాలుకూ పుటల్లో నేనూ ఓ భాగమై ఉంటానని నాకో పిచ్చి విశ్వాసం..:) ఆలోచిస్తూ కంటికి నచ్చిన ప్రతిశిల్పాన్నీ ఫోటో తీసాను.

అసలు మన దేశ కళాత్మక చరిత్రకూ, అద్భుత శిల్పకళా నైపుణ్యానికీ ప్రతీకలైన ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలను గూర్చిన చరిత్రను తెలుసుకుంటూ, చాలా పరిశీలించి, అనుభూతి పొందుతూ, గర్వపడుతూ చూడాలి. కానీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చే మాబోటి యాత్రికులకు ఈ దొరికే గంటా, రెండుగంటల సమయమే మహాప్రసాదం.










భద్ర మారుతీ సంస్థాన్: 
ఆ తర్వాత  "భద్ర మారుతీ మందిర్" అనే హనుమంతుడి గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ గుడి తాలూకూ కథ ఒక చోట రాసి ఉంది. భద్రసేనుడనే రాజు కి ఇచ్చిన మాటపై హనుమంతుడు అక్కడ వెలసాడుట. ఇక్కడి విశేషం ఏమిటంటే ఎప్పుడూ చూడనటువంటి రీతిలో మారుతి పవళించి ఉన్న విగ్రహం అక్కడ ఉంది.  గుడి లోపల అద్దాలతో చేసిన నిర్మాణం ముచ్చటగొలిపేలా ఉంది. అక్కడ కూచున్న కాసేపూ అలౌకికమైన ప్రశాంతతతో మనసు ఆహ్లాదంగా మారిపోయింది.



ఆ తర్వాత దేవగిరి కోట మీదుగా "బీబీ కా మక్బరా" కు తీసుకువెళ్లాడు డ్రైవర్. దౌలతాబాద్ కోటే శివాజీ రాజయ్యాకా దేవగిరి కోట అయ్యిందిట. "మినీ తాజ్ మహల్" అంటూ ఔరంగజేబ్ భార్య గోరీపై అతని కుమారుడు తల్లి స్మృత్యర్థం కట్టిన "బీబీ కా మక్బరా" కు తీసుకువెళ్ళాడు. ఆ నిర్మాణానికి అప్పట్లోనే ఆరులక్షల అరవైఎనిమిదివేల రెండువందల చిల్లర అణాలు ఖర్చు అయ్యిందిట. నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే కట్టడం లోపల ఉన్న మక్బరా పై జనాలు చిల్లర విసిరి దణ్ణం పెడుతున్నారు. ఆవిడ ఓ రాజుకి భార్య తప్ప దేవత కాదు కదా.. ఒకళ్ళు చేస్తే అందరూ చేస్తారు.. అలా ఎందుకు చెయ్యాలి అని ఆలోచించరేమిటో ! బయట వాటర్ బాటిల్ కొంటూంటే చిల్లర లేదంటే కొట్టువాడు కూడా "జనాలు చిల్లరంతా లోపలికి తీశుకువెళ్ళి వ్యర్థంగా వేసేస్తారు. మాకేమో ఇవ్వరు..’ అన్నాడు. అతనికున్న ఆలోచన లోపల చిల్లరవేసేవాళ్ళకి కలగదో ఏమో! ఆ చిల్లర నిండిన మక్బరాకి ఫోటో తియ్యబోతూంటే ఇకచాలన్నట్లు బ్యాటరీల్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇంతకన్నా దేవగిరి కోట చూపించమని అడగాల్సింది అనుకున్నాం.



మేము ఎక్కిన వాన్ లో మాతో పాటూ మరో నాలుగు కుటుంబాలవారు ఎక్కారు. ఒక తెలుగు, ఒక ఢిల్లీ, ఒక ఒరియా, మరొక మరాఠీ. డైవరు మరాఠీ. ఒరియావాళ్ళు నదిలో వదలాల్సినదేదో ఉందనీ, ఏదైనా ప్రవహించే నది వద్ద వాన్ ఆపమనీ బండాగిన ప్రతి చోటా డ్రైవర్ని అడుగుతున్నారు. ఎక్కిన దగ్గర్నుంచీ "పానీవాలా జగహ్..పానీ వాలా జగహ్.." అని చంపుతున్నారు అని డ్రైవర్ విసుక్కున్నా, చివర్లో చీకటిపడినా గోదావరి ప్రవహించే ఓ చోట ఆపాడు.

మళ్ళీ శిర్డీ:
ఆ రాత్రి తొమ్మిదిన్నరకి మమ్మల్ని శిర్డీ లో దింపాడు డ్రైవర్. రూంకెళ్ళి ఫ్రెష్ అయ్యి, రాత్రి హారతికి మందిరంలోకి వెళ్లాం. బాబా విగ్రహం ముందర ఉన్న హాలుదాకా వెళ్ళాకా లైన్ ఆపేసారు. అక్కడే కూచోబెట్టేసారు అందరినీ. ఆ విధంగా హాయిగా బాబాగారి ముందర కూచుని రాత్రి హారతి కూడా తిలకించాం. ఇదివరకూ హారతి అయ్యాకా దర్శనానికి పంపేవారు. కానీ ఇప్పుడు హారతి అయ్యాక తలుపులు మూసేసి, హాల్లోవాళ్లని బయటకు పంపేస్తున్నారు. క్లీనింగ్ కి టైం దొరకట్లేదుటవాళ్లకి. అందుకని మర్నాడు పొద్దున్నే మళ్ళీ దర్శనానికి వెళ్ళాం మేము. అప్పటికి జనాలు పెరగటం గమనించాం. ఇక ఆదివారం నుండీ దీపావళి శెలవులయ్యేదాకా బాగా జనం ఉంటారుట. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి జనం ఉన్నా గంటన్నరలో మరో మంచి అద్భుతమైన, ప్రశాంతమైన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం.


శిర్డి దగ్గర్లోని పంచముఖ గణపతి గుడి ఈమధ్యన బాగా పేరుపొందిందిట. అక్కడికి వెళ్లాం. అక్కడ పక్కనే ఉన్న హనుమంతుడి గుడి, అన్నపూర్ణాదేవి గుడీ బాగున్నాయి.









అనుకున్న దర్శనాలు, సందర్శనాలు అయిపోయాయి కాబట్టి ఇక రిటర్న్ బస్సు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టాం. ఏడొందల బస్సు టికెట్లు పదమూడొందలు పలికాయి ఆరోజు. లక్కీగా మాకు కాస్త తక్కువకే దొరికాయి. మందిరం పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాకా నేను మిస్సవ్వని "రాజధాని" భోజనం చేసేసి, కాస్త షాపింగ్ చేసేసి, సాయంత్రం బస్సెక్కేసాం. అలా మూడురోజులు పడుతుందనుకున్న ప్రయాణం బాబా దయవల్ల  రెండ్రోజుల్లోనే దిగ్విజయంగా పూర్తయిపోయింది.



ఈ ప్రయాణం తాలుకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ:
http://lookingwiththeheart.blogspot.in/2012/11/1.html
http://lookingwiththeheart.blogspot.in/2012/11/2.html



సర్వేజనా:సుఖినోభవంతు!