సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 31, 2012

స్కూల్ ప్రాజక్ట్





"ఏదన్నా వెహికిల్ మోడల్ చేసి పంపమని" పిల్లకి స్కూల్లో ప్రాజక్ట్ వర్క్ ఇచ్చారు. అసలు శలవుల్లో ఇచ్చిన ప్రాజక్ట్ వర్కులన్నీ పూర్తిచెయ్యమని తను అమ్మమ్మ ఇంటికి వెళ్ళేప్పుడు చెప్పి పంపితే సగమే పూర్తి చేసుకు వచ్చింది పిల్ల. అవన్నీ ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున్న కూచుని అతికష్టం మీద పూర్తిచేసా. ఈ ఒక్కటీ నావల్ల కాదని ఈ వెహికిల్ ప్రాజెక్ట్ ని వదిలేసా. క్లాస్ లో కొందరు మోటార్ బైక్, సైకిల్ అలా చేసుకువచ్చారుట. "రేపే లాస్ట్ డే..ఎలాగన్నా చేసి తెమ్మన్నారు EVSసార్.. కార్డ్ బోర్డ్ తో చెయ్యాలి" అని నిన్న స్కూల్ నుండి వస్తూనే పిల్ల గొడవ.  అంతకు ముందు రోజే అన్ని ప్రాజక్ట్స్ చేసిన మీదట "నావల్ల కాదు నన్నొదిలెయ్యి తల్లీ, మీ నాన్న వచ్చాకా చూసుకోండి" అనేసా నేను.

అయ్యగారు ఆఫీసు నుండి వచ్చాకా బేరం పెట్టింది పిల్ల. అలానే చేసేద్దాం అని అభయమిచ్చేసారు ఈయన.  "ఇదిగో..పువ్వులు, ఆకులు అంటే చేస్తాను కానీ ఈ వెహికిల్స్ అవీ నాకు రావు నావల్ల కాదు. మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పేసా. నిన్న రాత్రి పిల్ల బజ్జున్నాకా ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లారు. కాసేపయ్యాకా పెద్ద పెద్ద థర్మొకోల్ షీట్లు, కార్డ్ బోర్డ్ తెచ్చారు. నెట్లో ఏవో వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే "ఫార్ములా వన్" మోడల్స్ డెస్క్ టాప్ మీద పెట్టి చేసేద్దాం..రా.. అన్నారు. నాకు బోలెడు కోపం వచ్చింది. అసలు నేను చెయ్యనన్నా కదా,ఇప్పుడీ ఫార్ములా కార్లెవరు చేస్తారు? నావల్ల కాదు. ఏ సైకిలో చేసేయచ్చు కదా" అన్నాను. అందరిలా మనమూ చెయ్యటమేంటి వెరైటీ గా ఉంటుంది. హెల్ప్ చెయ్యి.." అన్నారు. నిజం చెప్పద్దూ.. ఆ మోడల్ కార్లు చూస్తే నాకూ సరదా వేసింది. ఈజీగా ఉన్న ఓ మోడల్ కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టి, ఆ ప్రకారం ఇద్దరం చిన్నపిల్లల్లా కూచుని ఆ మోడల్ చెయ్యటం మొదలెట్టాం. నాకు తృప్తి కలగలేదు కానీ ఏదో ఓ మాదిరిగా చేసాం.  టైమ్ ఉంటే ఇంకా బాగా చేద్దుము అనుకున్నాం.


మొత్తం అయ్యాకా రంగు వేద్దాం అని వెతికితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ టైర్లకి కావాల్సిన బ్లాక్ కలర్ మాత్రం లేదు. ఫ్యాబ్రిక్ కలర్స్,పోస్టర్ కలర్స్ అన్ని వెతికాం, ఆఖరుకి పిల్ల వేసుకునే వాటర్ కలర్స్ లో కూడా బ్లాగ్ కలర్ అయిపోయింది. అప్పటికే రాత్రి ఒంటిగంట అయ్యింది ! ఇక పొద్దున్న ఆరున్నరకే ఏ షాపన్నా తెరుస్తారేమో అని బయల్దేరారు తను. మా ఏరియా నుంచి మార్కెట్ రోడ్డు చాలా దూరం. ఎనిమిదింటికే పాప ఆటో వచ్చేస్తుంది. పది నిమిషాల తక్కువ ఎనిమిదికి కలర్స్ బాక్స్ తీసుకొచ్చారు. అప్పుడు టైర్లకి గబగబా బ్లేక్ కలర్ వేసాను. కానీ ఎంత ఫ్యాన్ క్రింద పెట్టినా పది నిమిషాల్లో ఎక్కడ ఆర్తాయి? ఇంతలో ఆటో వచ్చేసింది. పిల్ల వెళ్పోయింది. "ఆటో స్కూల్ గేట్ దాకా వెళ్ళటానికి టైం పడుతుంది.. ఈలోపు ఆరబెట్టేస్తాను.. పట్టుకెళ్ళండి" అన్నా. ఆఫీసుకి లేటయిపోతుంది ఇప్పుడిక కుదరదు.రేపు పంపు..అంతే" అన్నారు. నాకు బోలెడు కోపం,బాధ,ఉక్రోషం అన్నీ వచ్చేసాయి. "రేపు పంపేదానికి నిన్న రాత్రంతా అంత కష్టపడటం ఎందుకు?పొద్దున్నే మీరు రంగుల కోసం ఊరంతా తిరగటం ఎందుకు? పైగా ఇవాళే లాస్ట్ డే అని వాళ్ల సార్ చెప్పరుట.. రేపటికి ఇస్తేఒప్పుకోరేమో... మనదంతా వృధా ప్రయాస అయిపోతుంది.." అని నేను గొడవ పెట్టాను. ఏమయినా ఆఫీసుకి వెళ్పోవాలి అని తను తయారైపోయారు. ఈ మోడల్ చెయ్యటం కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డామో తలుచుకుంటే నాకు చాలా బాధ కలిగింది. మూడ్ అంతా దిగులుగా అయిపోయింది.


 అంతలో నాకు తటాలున ఒక ఐడియా వచ్చింది. పట్టుకెళ్ళి క్లాసులో ఇమ్మని స్కూల్ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తే..? అని. వెంఠనే చేసాం. ముందు కుదరదన్నాడు. తర్వాత డబ్బులిస్తాం రమ్మంటే సరేనన్నాడు. ఓ అరగంటలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఈ హడావుడిలో పిల్లకి ఇవాళ హాఫ్డే అని మర్చిపోయి కేరేజ్ కూడా ఇచ్చేసాను నేను. (నెలలో లాస్ట్ వర్కింగ్ డే హాఫ్ డే వాళ్ళకి.) మధ్యాహ్నం బెల్లు కొడితే ఎవరో అనుకుని తలుపు తెరిస్తే పిల్ల ! అప్పుడు గుర్తుకొచ్చింది హాఫ్ డే సంగతి. ఇంతకీ సార్ ఏమన్నారు అనడిగితే "బావుందన్నారు. అందరి వెహ్కిల్ మోడల్స్ క్లాస్ లోనే గూట్లో పెట్టారు. నాది ఏక్టివిటీ రూమ్ లో పెట్టించమని పంపారు" అని చెప్పింది. ఇంకేముంది.. నా మొహంలో వంద చిచ్చుబుడ్లు, వెయ్యి మతాబలూ ఒక్కసారిగా వెలిగిపోయాయి. వెంఠనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా. "వెరీ గుడ్ వెరీ గుడ్!" అన్నారు. లోపల్లోపల మాత్రం "బ్రతికానురా దేవుడా!" అనుకుని ఉంటారు..:-)




Tuesday, October 30, 2012

కన్నులదా.. ఆశలదా..




ఈమధ్య రేడియోలో విన్న ఈ పాట ఎందులోదా అని వెతికితే "3" సినిమాలోదని గూగులమ్మ చెప్పింది. నాకు ఈ ట్యూన్ బాగా నచ్చింది. పాటలో ఎక్కువగా వాడిన గిటార్, వయోలిన్ బిట్స్ చాలా బాగున్నాయి.

సంగీతం: అనిరుధ్ధ్ రవిచందర్
సాహిత్యం: భువనచంద్ర
పాడినది: ధనుష్, శృతి హాసన్

http://www.raaga.com/play/?id=334560



 




సాహిత్యం:

ప: కన్నులదా.. ఆశలదా..
బుగ్గలదా.. ముద్దులదా..
పెనవేసుకున్న పెదవులదా
నువ్వు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవే కదా
కలలా కదిలే వలపుల చిలకా
అందని అందం నీవే కదా

చ: ఏదెదో పాడుతు, నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయల్ని చేయకు
గుండెల్లో ఆడుతు, కళ్లల్లో సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకూ
హృదయం హృదయం కలిసెనమ్మా.. వయసే విరిసెనమ్మా
అమృతం పొంగి అణువణువూ.. తలపే కురిసెనమ్మా
ముద్దుల్నే పేర్చవా, ముచ్చట్లే ఆడవా,
నా మీదే చాలగ నీ ఒడి చేర్చవా

కన్నులదో.. బుగ్గలదో..
ముద్దులదో.. నవ్వులదో..
మదిలో మెదిలే వలపుల మొలక..
నాలో ప్రాణం నీవే కదా!


Monday, October 29, 2012

అతను




నిన్న మేము బస్సులో ఎక్కేసరికీ లేడీస్ సీట్లు ఖాళీ లేవు. లేడీస్ సీట్ లో కూచున్న ఒకతన్ని వెనక ఖాళీగా ఉన్న సీట్ చూపెట్టి వెనక్కు కూచోమని అనడిగా. వెంఠనే అవతల పక్క సీట్లో ఉన్న ఆయన "అతన్ని లేపకండి.. ఇక్కడ కూచోండి" అని తన సీట్ ఖాళీ చేసి వెనక్కు వెళ్పోయాడు. మా పాప వాళ్ల నాన్న దగ్గర కూచుంది. నేను సీట్లో కూచున్నాకా ఇందాకటి మనిషి చేతిపై గాయం ఉండటం చూసాను. కట్టు లేదు కానీ దూది అంటుకుపోయి ఉంది అరచేతి వెనుకవైపు. ఎవరైనా రిలెటివ్స్ ఏమో  అందుకనే అతన్ని లేపవద్దన్నారు అనుకున్నా. అంతేతప్ప అతడిని పెద్దగా పరీక్షగా చూడలేదు.

నే కూచున్న సీట్ కాళ్ళ దగ్గర ఒక పాత, చిరిగిన రగ్గు ఉంది. ఎవరిదో ఇలా పడేసారు..అనుకున్నా. బ్యాగ్ లోంచి పుస్తకం తీసి అందులో మునిగిపోయా. కాసేపటికి నా పక్క సీట్ ఖాళీ అయ్యింది. ఇక పుస్తకం మూసి కిటికీ వైపు జరిగి బయటకు చూస్తూ కూచున్నా. అంతకు ముందు జరిగిన సంఘటనల వల్ల మనసు చిరాగ్గా ఉంది. ఎందుకో నే తల తిప్పేసరికీ ఇందాకటి దెబ్బ తగిలినతను నెమ్మదిగా నా సీట్ క్రింద ఉన్న రగ్గు లాగుతున్నాడు. ఇదేమిటి ఈ పాత రగ్గుని లాగుతున్నాడు? అని అప్పుడతన్ని బాగా పరీక్షగా చూశా. పాత మాసిన బట్టలు, ఎవరినీ పట్టించుకోకుండా తన లోకంలో తానున్నట్లున్నాడు. ఈ రగ్గు ఇతనిదా అని ఆశ్చర్యపోయా. ఇందాకా బస్సు ఎక్కిన హడావుడిలో అతన్ని సరిగ్గా చూడలేదు.. అనుకున్నా. అప్పటికి బస్సు సగం పైగా ఖాళీ అయిపోయింది. అతను నెమ్మదిగా సీట్లోంచి లేచి ఎవరినీ చూడకుండా, ఏ సంకోచం ప్రకటించకుండా బస్సులోని అటు ఇటు సీట్ల మధ్యన ఉండే నడవలో ఆ దుమ్ముకొట్టుకుపొయిన పాతరగ్గు కప్పుకుని పడుకుండిపోయాడు. అతనలా పడుకుంటుంటే బస్సులో కండక్టర్ తో సహా ఆతన్నిఎవరూ ఏమీ అనకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా వెనుక సీట్ ఖాళీగా ఉందని కండక్టర్ అక్కడే కూర్చున్నాడు.  లేచి వెనుక సీట్లో పడుకో అన్నాడు అతనితో. అతని ఓసారి కండక్టర్ వైపు మళ్ళీ లేవలేనన్నట్లు చూసి.. పక్కకు వత్తిగిల్లి పడుకుండిపోయాడు. కండక్టర్ ఇంక ఏమీ అనలేదు. లోకంతో ప్రమేయం లేకుండా ఎంత హాయిగా పడుకుండిపోయాడో!

బహుశా అతను రోజూ అదే బస్సులో వెళ్తుంటాడేమో. ఈ రూట్లో వెళ్ళే కొంతమందికి అతను తెలుసేమో. ఇందాకా నాకు సీట్ ఇచ్చిన వ్యక్తి కూడా అందుకనే అతన్ని లేపవద్దన్నాడేమో అని అప్పుడనిపించింది. ఎక్కడో తిరుగుతున్న నా ఆలోచనలన్నీ ఆ వ్యక్తి వైపుకి తిరిగాయి. అతనికెవరన్నా ఉన్నారో లేదో? ఇల్లూ వాకిలీ ఉందో లేదో? ఆ దెబ్బ ఎలా తగిలిందో? మతిస్థిమితం కాస్త ఉండే ఉంటుంది...మరీ పిచ్చివాడిలా లేడు కానీ ఇలా బస్సు మధ్యలో ఎలా పడుకుండిపోయాడు?.... ఇలా ఆలోచిస్తుంటే అంతకు ముందు నుంచీ నన్ను ఇబ్బంది పెడ్తున్న వేరే ఆలోచనలు మాయమైపోయాయి. ఎక్కడ పడుకుంటున్నాడో కూడా తెలీకుండా, జీవితానికి ఏ ఆధారం లేకుండా, నా అనేవాళ్ళు లేకుండా ఉన్న ఇతనిలాంటివాళ్ళు ఈ ఊళ్ళో, దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో బోలెడు మంది ఉంటారు కదా.. అలాంటివాళ్ల బ్రతుకులు ఎంత దయనీయమైనవి! మరి నాకున్న లోటేమిటి? నా చుట్టూ నా కోసం నా వాళ్ళు బోలెడుమంది. ఇతనిలా చిరిగిపోయిన రగ్గు కప్పుకునే పరిస్థితి అసలే లేదు. ఉన్నంతలో దేనికీ లోటు లేదు.  అతనిలా దిక్కులేని పరిస్థితి కాదు. మరెందుకు నేను బాధ పడుతున్నాను? చిన్న చిన్న సమస్యలను భూతద్దం లోంచి ఎందుకు చూస్తున్నాను? పెద్ద కష్టం వచ్చేసినట్లు ఎందుకు మనసు కష్టపెట్టుకుంటున్నాను? ఓపిగ్గా ఆలోచిస్తే ఏ సమస్యకైనా ఏదో ఒక మార్గం దొరుకుతుంది కదా! అలా అనుకోగానే ఇందాకటి నుంచీ ఉన్న చికాకు మాయమైపోయింది. మనసు తేలికైపోయింది.. కిటికీ బయట నుంచి వీస్తున్న చల్లగాలి ఆహ్లాదాన్ని పెంచింది.

 హఠాత్తుగా మరో ఆలోచన వచ్చింది. బహూశా నా ఆలోచనలో మార్పు తేవటం కోసమే అతను ఇలా బస్సులో కనబడ్డాడేమో అని. ఏదేమైనా ఈ చిన్న సంఘటన నా ఆలోచనల్లో పెద్ద మార్పునే తెచ్చింది !

Saturday, October 27, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారి "మా ఊరు" కబుర్లు - పాటలు




ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి మరణ వార్త యావత్ సంగీతలోకాన్నీ, వారి అభిమానులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంగీతజ్ఞుడు స్వరపరిచిన లలితగీతాలబాణీలు తెలుగువారికి చిరస్మరణీయాలు. ముఖ్యంగా లలిత సంగీతానికి పాలగుమ్మివారు అందించిన సేవ అనంతం.  ఆయన పాటలు చాలా వరకూ వారి వెబ్సైట్ 'http://palagummiviswanadham.com/’ లో వినటానికి, కొన్ని డౌన్లోడ్ కు కూడా విశ్వనాథంగారు ఉండగానే అందుబాటులో పెట్టడం హర్షించదగ్గ విషయం. 


గత నవంబర్ లో దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేసిన ’మా ఊరు’ అనే కార్యక్రమంలో విశ్వనాథంగారు కూడా పాల్గొన్నారు. ఆయనపై అభిమానం కొద్దీ మా నాన్నగారు ఆ కార్యక్రమాన్ని బయట రికార్డ్ చేయించుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఉన్న బిట్ వరకూ ఎడిట్ చేసి ఆ కార్యక్రమ్మాన్ని ఇక్కడ పెడుతున్నాను. విశ్వనాథం గారు పాడిన ’మా ఊరు ఒక్కసారి పోవాలి..’ పాట కూడా ఇందులో ఉంది. ఆ కార్యక్రమానికి సిగ్నేచర్ ట్యూన్ క్రింద ఈ పాటనే పెట్టుకున్నారు.



ఆయన పాడిన ఇతర లలిత గీతాల్లో "అమ్మదొంగ..’, "ఎన్నిసారులు అన్నదో..’ , "ఎంత సుందరమైనదో..’ మొదలైనవి నాకు ఇష్టమైన పాటలు.  

1) శ్రీమతి బి.వరహాలుగారు పాడిన ’అమ్మదొంగ..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:
http://samgeetapriyaa.blogspot.in/2012/10/blog-post_27.html


2) ఎన్నిసారులు అన్నదో ఎన్నెన్ని తీరులు విన్నదో..
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/ennissarulu.mp3


3) ఎంత సుందరమైనది భగవానుడొసగిన బహుమతి...
http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/sweeyarachanalu/enthasundaramainadi-palgummi.mp3




గుడిపూడి శ్రీహరి గారు రచించిన "పాలగుమ్మి విశ్వనాథం గారి ఆత్మకథ" చాలా బావుంటుంది. ఆ పుస్తకం సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ళు ప్రచురణ. అప్పట్లో పుస్తకం రిలీజైందని తెలిసిన వెంఠనే అన్నయ్యను సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ల షాపుకి పంపి తెప్పించుకున్నాం. ఈ ఆత్మకథను చాలా ఆసక్తికరంగా రాసారు శ్రీహరి గారు. ముఖ్యంగా విశ్వనాథంగారి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూపిన తెగువ,ధైర్యం, వారు పడ్డ ఇక్కట్లు చదువుతూంటే కళ్ళు చెమరుస్తాయి.

సంగీతం పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఇటువంటి కళాకారులు చాలా అరుదు, అవసరం అనే చెప్పాలి.


శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..."




ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి స్మృత్యర్థం ..

ప్రముఖ లలిత సంగీతదర్శకులు, గేయ రచయిత శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి లలిత గీతాల్లో "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే "నాకు చాలా ఇష్టమైన పాట. 

రాత్రిపూట పిల్లలను జోకొడుతూ "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగ.." అని పాడే తల్లులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నామటుకు నేనే చిన్నప్పుడు ఫ్యామిలీ గేదరింగ్స్ లో.. ఈ పాట తప్పక పాడేదాన్ని. నేను పాడకపోతే " అమ్మదొంగా నువ్వు పాడకుంటే నాకు బెంగ .." అని మా మావయ్యా పాడేవాడు :) 

బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో ఈ పాట గురించి ఒక టపా కూడా రాసాను. అది వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట. అదే బాగా ప్రచారంలోకి వచ్చింది కూడా. కానీ ఇదే పాటను శ్రీమతి ’బి.వరహాలు’ అనే గాయని విజయవాడ రేడియోస్టేషన్ కొరకు పాడారు. వరహాలు గారి మధురమైన స్వరంలో అది కూడా బావుంటుంది.


శ్రీమతి బి.వరహాలుగారు పాడిన "అమ్మదొంగా..నిన్ను చూడకుంటే..." క్రింద లింక్ లో వినవచ్చు:





సాహిత్యం:
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ(2)

కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

కధ చెప్పే దాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తొచనీక మూతిముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీవైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీదరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే... నాకు బెంగ !!
====================

అమ్మదొంగా వేదవతీ ప్రభాకర్ గారు పాడిన పాట క్రింద వినవచ్చు. ఇది నేను ఎప్పుడో టివిలో వస్తుంటే చేసుకున్న రికార్డింగ్.

 

Thursday, October 25, 2012

"తల్లీ! నిన్ను దలంచి"



తెలుగువారికి మాత్రమే సొంతమైన "పద్య"సంపద గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తనివితీరదు. మాధుర్యం, తెలుగుతనం ఉట్టిపడే మీగడతరకలు మన తెలుగుపద్యాలు. గతంలో "తెలుగు పద్యాలా? బాబోయ్ !" అని చక్కని తెలుగు పద్యాల గురించిన పుస్తకం గురించి రాసాను కదా.. ఇప్పుడు అలాంటిదే మరిన్ని ఎక్కువ తెలుగు పద్యాలతో ఉన్న మరో మంచి పుస్తకం దొరికింది. ప్రముఖ కథకుడు, కవి, విమర్శకుడు శ్రీ పాపినేని శివశంకర్ గారి "తల్లీ! నిన్ను దలంచి". అమెరికాలో "తెలుగునాడి" పత్రికలో ధారావాహికంగా సాహిత్యాభిమానులను అలరించిన ఈ పద్య విశ్లేషణలకు మరిన్ని పద్యవిశ్లేషణలను జోడించి "తల్లీ! నిన్ను దలంచి" పుస్తకం తయారుచేసారుట. 


ప్రముఖ ప్రాచీనకవులు నుండీ ఇరవైయ్యవ శతాబ్దం తొలిపాదం వరకూ రచింపబడిన పద్యాల్లో కొన్ని, కొన్ని చాటువులు, కొన్ని చమత్కార పద్యాలు కలిపి మొత్తం ఓ నూటపది మధురమైన పద్యాలకు అర్థవిశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి పద్యానికీ అర్థవిశ్లేషణలతో పాటూ పద్యరచన సంబంధిత కొన్ని చారిత్రక విశేషాలను కూడా తెలిపారు శివశంకర్ గారు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, భర్తృహరి, శ్రీనాథుడు, పోతన, శ్రీకృష్ణదేవరాయులు, తెనాలి రామకృష్ణుడు, వేమన మొదలైనవారి పద్యాలను మనము ఈ పుస్తకంలో చూస్తాము. అట్ట ముందువెనుల భాగాల్లో బాపూ గీసిన అందమైన చిత్రాలతో,  ప్రతి పద్యానికీ  శ్రీ కొల్లోజు గారు వేసిన అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం కాపీలు "విశాలాంథ్ర"లో దొరుకుతున్నాయి. వెల: రెండువందల ఏభై రూపాయిలు.

"ప్రాచీన భాషగా తెలుగుకు గౌరవం లభించిన సందర్భంగా ఈ చిరుకానుకను తెలుగు రసజగత్తుకు సమర్పిస్తున్నాము" అన్నారు ముందుమాటలో వల్లూరు శివప్రసాద్ గారు. అప్పట్లో ఈ పద్య విశ్లేషణలను ప్రోత్సాహించిన జంపాల చౌదరి గారికీ, ఈ పుస్తకం ప్రచురణకు కారణమైన మిత్రులు శ్రీ వల్లూరు శివప్రసాద్ గారికీ, గ్రంథసేకరణలో సహాయ పడిన ఇతర మిత్రులందరకూ శివశంకర్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, పద్యకవిత్వాన్ని ఎక్కువ మంది ఎందుకు ఆస్వాదించలేరో చెప్తూ, ప్రాచీన కవిత్వంలోని విశేషగుణాలను కూడా తెలిపారు తన ముందుమాటలో. "ప్రాచీన కవిత్వంలో అతిమానుషమైన లేదా దేవియమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు, భక్తుడు నిజం. భక్తకవి అస్థిత్వవేదన నిజం.ఆత్మనివేదనలో నుంచి వచ్చిన ఏ భావోద్వేగాన్నీ మనం తక్కువ చేసి చూడనక్కరలేదు. దేవుడిపై అవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజేంద్రుడి ఆర్తినో ఆస్వాదించటానికి అడ్దం కాబోదని నా అవగాహన" అంటారు పాపినేని శివశంకర్ గారు.

పుస్తకంలోని కొన్ని మధురపద్యాలు: (అర్థాలు రాయటం లేదు)

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి, జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ ! సరస్వతీ ! భగవతీ ! పూర్ణేందుబింబాననా !
(చాటువు)
(-ఎవరు రాసారో తెలియని పద్యాన్ని చాటువు అంటారుట. చాటువు అంటే 'ప్రియమైన మాట' అని అర్ధంట. )


శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హారపమ్క్తులం
జారుతరమ్బులయ్యె, వికసన్నవ కైరవ గమ్ధబంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధామ్శు వికీర్యమాణ క
ర్పురపరాగ పాండురుచిపూరము లంబర పూరితంబులై
(నన్నయ, శ్రీమదాంధ్రమహాభారతము)
 --శరత్కాల రాత్రులను వర్ణించే పద్యమిది.


కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితర వైభవముల్ పదివేలు మానసమ్
బంటునె? మానుషమ్బు గలయట్టి మనుష్యున కెట్టి వానికిన్
కంతకుడైన శాత్రవుcడొకండు తనంతటివాcడు గల్గినన్
(శ్రీనాధుడు, కాశీఖండము)


కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వొన్నతిం బొందరే
వారేరీ సిరి మూటకట్టుకుని పోవంజాలరే భూమిపై
పేరైనం గలదే శిబి ప్రముఖులున్ బ్రితిన్ యశ:కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
(బమ్మెర పొతన, శ్రీమహాభాగవతము)
- పలురాజుల గర్వాన్ని, భయాన్నీ, స్వార్థాన్నీ , వాళ్ళు చివరకు ఏం పట్టుకెళ్లారు? అని ప్రశ్నించే ఈ పద్యం నాకు బాగా నచ్చింది.


చనవిచ్చినాడని - సకియరో నీవు
పలుమాటలకు నెట్లు - పాలుపడ వద్దు
పొలతి నమ్మగరాదు - పురుషుల నెపుడు
పలురీతి కృష్ణ స - ర్పమ్ములై యుండ్రు
కొంచక కృష్ణకు - కూర్మితో నుండు
వంచన సేయకు వనిత యెప్పుడును
(తాళ్ళపాక తిమ్మక్క, సుభద్రా కల్యాణము)
- ఇవి రుక్మిణి సుభద్రకు అప్పగింతల సమయంలో చెప్పిన మాటలట.


నారదులైరి సన్మునులు, నాక మహీజములయ్యె భూజముల్
శారదలైరి భామినులు, శంకర శైలములయ్యె గోత్రముల్
పారదమయ్యె నీరధులు, పన్నగ నాయకులయ్యె నాగముల్
వారిద వర్గమెల్ల సితవర్ణములయ్యెను బండు వెన్నెలన్
(మెల్ల, రామాయణము)
-- శరత్కాలపు వెన్నెలలో మునులు, చెట్లు, స్త్రీలు, కొండలు, సముద్రాలూ, పాములూ, మబ్బులు మొదలైనవి ఎలా మారిపోతాయో తెలిపే అందమైన వర్ణన ఇది.


చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
(మారన వెంకయ్య, భాస్కర శయకము)
-- చదువు ఎలా చదువుకోవాలో తెలిపే పద్యం ఇది.


తప్పు లెన్నువారు తండోపతందము
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరో
విశ్వదాభిరామ! వినురవేమ!
(వేమన)


బొంకనివాcడె యోగ్యుc డరిబృందము లెత్తినచోటc  జివ్వకున్
జంకనివాcడె జోదు, రభసమ్బున నర్థి కరంబు సాcచినన్
గొంకనివాcడె దాత, మిముc గొల్చి భజించిన వాcడె పో నిరా
తంక మనస్కుc డెన్నcగను దాశరథీ! కరునాపయొనిథీ!
(కంచర్ల గోపన్న, దాశరథి శతకము)
- యోగ్యత, వీరత్వం, భక్తి, దానగుణం మొదలైన మానవగుణాలకు నిర్వచనాలు చెప్తాడు గోపన్న ఈ పద్యంలో.


బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
(తిరుపతి వేంకటకవులు, పాండవోద్యోగము)


ఆశ్చర్యం కలిగించిన విషయం:
"సిరికిం జెప్పడు.." పద్యం విశ్లేషిస్తూ శ్రీనాధుడికీ, పోతనకూ జరిగినట్లుగా చెప్పుకునే సంభాషణ తాలూకూ కథ గురించి కూడా చెప్తారు శివశంకర్ గారు. కానీ ఈ కథకు కాళ్ళే కాదు కళ్ళు కూడా లేవంటారు ఆయన. శ్రీనాధుడికి దగ్గుబల్లి పోతన, దుగ్గన అనే బావమరదులున్నట్లు వేరే గ్రంథాల వల్ల తెలిసిందనీ; శ్రీనాధుడి కాలానికీ, పోతన కాలానికీ నడుమ దశాబ్దాల కాలవ్యవధి ఉందనీ, అంత కాలవ్యత్యాసం ఉంటే ఈ పద్యం గురించి వారిద్దరూ ఎలా సంభాషించుకున్నరో శ్రీమహావిష్ణువుకే తెలవాలి అని చమత్కరిస్తారు శివశంకర్ గారు. తెలుగు సాహిత్యచరిత్ర గురించి ఏమీ తెలియనందున ఈ సంగతి నన్ను ఆశ్చర్యపరచింది.






Wednesday, October 24, 2012

శ్రీ దుర్గా ఆపదుధ్ధార స్తోత్రం


శ్రీ దుర్గా ఆపదుధ్ధార స్తోత్రం



 

 బ్లాగ్మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Monday, October 22, 2012

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి




ప్రముఖ భారతీయ సంస్కృత పండితుడు, కవి కాళిదాసు రచించిన "శ్యామలా దండకం" బహుళ ప్రచారాన్ని పొందింది. కాళిదాసుచే లిఖింపబడిన మరో అందమైన స్తుతి "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". కాళి కి సేవకుడు కాబట్టి "కాళిదాసు" అనే పేరు కాళిదాసుకి స్థిరపడింది అంటారు. కాళికాదేవి ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించిన వెంఠనే ఆశువుగా కాళిదాసు చేసిన దేవీ స్తుతే ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". ఈ రచనలో కాళిదాసు ఉపయోగించిన పదజాలం క్లిష్టమైనది కావటం వలన ఇది ఎక్కువ ప్రచారంలోకి రాలేదేమో మరి. 

'వేగవంతమైన ఆడగుర్రము పరుగు కంటే తీవ్రమైన వేగము కల కవిత్వ ధాటిని తనకు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి ప్రసాదించుగాక' అని ప్రార్ధిస్తూ అశువుగా చెప్పిన స్తుతి ఇది. అందుకనే అశ్వధాటితో చెప్పబడినది అని కూడా అంటారు. పది శ్లోకాలు గల ఈ స్తుతిని "దేవీ దశశ్లోకి" అని, "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి" అని కూడా అంటారు. 

 ఈమధ్యన కొన్న ఒక (స్తోత్రాలు,అష్టకాలు ఉన్న) పుస్తకంలో "అంబాష్టకమ్" పేరుతో ఉన్న ఈ స్తుతి 'శంకరాచార్య విరచితం' అని రాసారు. అందువల్ల ఈ స్తోత్ర రచన ఎవరు చేసారన్నది కూడా సందిగ్థమేనన్నమాట అనుకున్నా. 
సందిగ్థత సంగతి ఎలా ఉన్నా ఈ స్తోత్రం మాత్రం చాలా బావుటుంది. నాకు ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి" గురించి ఎలా తెలిసిందో, ఆఖరికి ఎలా దొరికిందో ఈ టపాలో  రాసాను..:)


దేవి ప్రణవ శ్లోకీ స్తుతిని ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/play/?id=39246



క్రింద రాసినవి నాకు దొరికిన పుస్తకం లోని "దేవీ దశశ్లోకి" పద్యాలు:


చేటీభవన్నిఖిల ఖేటీ కదంబవవనవాటీషు నాకిపటలీ
కోటీర చారుతర కోటీమణీకిరణ కోటీకరంబితపదా
పాటీరగంధ కుచశాఠీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతాం
ఘోటీకులా దధికధాటీ ముదారముఖవీటీరసేనతనుతాం

బాలా మృతాంశునిభఫాలా మనాగరుణచేలా నితంబఫలకే
కోలాహలక్ష పితకాలామ రాకుశల కీలాల శోషణరవి:
స్థులాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబవిపినే
శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజతనయా

యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తులశుకా
సుత్రామ కాలముఖ సత్రాశన ప్రకర శుత్రాణ కారి చరణా
చత్రా నిలా తిరయ పత్రాభిరామ గుణ మిత్రా మరీ సమవధూ
కు త్రాన సహన్మమణి చిత్రాకృతి స్వరిత పుత్రాది దానవ పుణా

ద్వైపాయన ప్రభృతి  శాపాయుధ త్రిదివ సోపానధూళిచరణా
పాపాపహశ్వమను జాపానులీన జనతా పాపనోదనిపుణా
నీపాలయా సురభిధూపాలకా దురితకూపా దుదంచయతు మాం
రూపాధికా శిఖరి భూపాల వంశమణిదీపాయితా భగవతీ

యా ళీభి రాత్తతను రాళీ లసత్ప్రియ కపాలీషు ఖేలతి భవ
వ్యాలీనకుల్య సితచూళీభరా చరణధూళీలసన్మునిగణా
యాళీభ్రుతిశ్రవసి తాళీదలంవహతి యాళీకశోభితిలకా
సాళీ కరోతు మమ కాళీ మన: స్వపదనాళీకసేవనవిధౌ

న్యంకాకరే వపుషి కంకాలరక్త పుషి కంకాదిపక్షివిషయే
త్వం కామనా మయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజాం
శంకాశిలానిశితటంకాయ మానపద సంకాశా మానసుమనో
ఝంకారి భ్రుంగతతి మంకానుపేత శశి సంకాశవక్త్ర కమలాం


ఇంధానకీరమణిబంధా భవే హృదయబంధా వతిన రసికా
సంధావతీ భువన సమ్ధారనేశ్యమృతసింధా వుదార నిలయా
గంధాను భావముహ రంధాళి పీతకచ బంధా సమర్పయతు మే
సంధామ భానురపి రుంధాన మాశు పదసమ్ధాన మస్య సుగతా

దాసాయమానసుమహాసా కదంబవనవాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసావిధుతమధుమాసా రవిందమధురా
కాసారసూనతతి భాసాభిరామతను రాసారశీతకరుణా
నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయే దుపరతం

జంభారికుంభిపృథు కుంభాపహాసికుచ సంభావ్య హారలతికా
రంభా కరీంద్ర కరడంభాపహోరు గతిడింబానురంజితపదా
శంభా వుదారపరికుంభాంకురత్పులకడంభానురాగపిశునా
శంభా సురాభరణగుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా

దాక్షాయనీ దనుజ శిక్షావిదౌ వితతదీక్షా మనోహరగుణా
భిక్షాశినో నటన వీక్షావినోదముఖి: దక్షాద్వర ప్రహరణా
వీక్షాం విదేహి మయి దక్షా స్వకీయజనపక్షా విపక్షవిముఖీ
యక్షేశసేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా

వందారు లోకవర సంధాయనీ విమలకుందావదాత రదనా
బృందార బృందమణి బృందారవింద మకరందాభిషిక్త చరణా
మందానిలాకలిత మందారదామభి రమందాభిరామమకుటా
మందాకినీ జవనభిందానవాచ మరవిందాననా దిశతుమే

Friday, October 12, 2012

"దేవరకొండ బాలగంగాధర తిలక్" -- "శిఖరారోహణ"


ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ రచనలతో తనదైనటువంటి గాఢముద్రను వేసిన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి జీవితం,సాహిత్యం గురించి కవి, రచయిత, విమర్శకుడు శ్రీ ఇంద్రగంటి శ్రికాంతశర్మ గారు ఒక పుస్తకం రాసారు. పుస్తకం పేరు "దేవరకొండ బాలగంగాధర్ తిలక్". సాహిత్య అకాదెమీ వారి ప్రచురణ. (వెల నలభై రూపాయిలు). శర్మగారు చిన్నప్పుడు తణుకులో తాను తిలక్ గారిని కలుస్తుండే రోజుల నుండీ ప్రారంభించి, తిలక్ జీవితం, తిలక్ జీవనదృక్పథం , సాహిత్య వ్యక్తిత్వం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు మొదలైన తిలక్ ఇతర రచనలన్నింటి గురించీ ఎంతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఈ పుస్తకంలో. పుస్తకం చివరలో మార్క్సిస్టు విమర్శకులు "అర్వీయార్" గారి వ్యాసం "తిలక్ కవిత్వంలో విషాద అలంకారికత" అనే అనుబంధాన్ని కూడా జత చేసారు. 


తిలక్ గురించి శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాల సారం: 

ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయోద్యమకాలానికి చెందిన కవి, కథకుడు, నాటకరచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్(1921-1966). అందమైన రూపం, ఆ రూపాన్ని మించిన అందమైన మనసు; సున్నితత్వం,భావుకత కలగలిసిన వ్యక్తిత్వం వారిది. ప్రారంభంలో భావకవిత్వాన్ని రాసినా ఆ తర్వాత ఆనాటి అభ్యుదయోద్యమప్రభావాన అభ్యుదయ గీతాలను, వచన పద్యాలనూ రాసారు. ఆదర్శవంతమైన నాటకాలనూ, ఉత్తమమైన కథలనూ కూడా తిలక్ రాసారు. ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "అమృతం కురిసిన రాత్రి"; ఇంకా "గోరువంకలు", "తిలక్ కథలు" ; "సుప్తశిల", "సుశీల పెళ్ళి" నాటికలు మొదలైన రచనలు సాహిత్యాభిమానుల మన్ననలనందుకున్నాయి. 


సాహిత్యంలో తన ముందు తరానికి చెందిన కాల్పనికతకు, తన కాలం నాటి సామ్యవాద ధోరణికీ సమన్వయాన్ని సమకూరుస్తూ తనకు మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేకశైలిని ఏర్పరుచుకున్న కవి శ్రీ తిలక్. మద్రాసులో ఇంటర్ చదివిన తిలక్ ఆ తర్వాత మరెక్కడా చదవలేదు. పధ్నాలుగు పదిహేనేళ్ల వయసు నుండే పద్య రచనను ప్రారంభించిన తిలక్ అభ్యుదయ రచనోద్యమకాలంలో కవిగా , సోషలిస్ట్ గా మారారు. డిగ్రీలు చదవకపోయినా తమ ఇంట్లోని ఐదారువేల పుస్తకాల వల్ల తిలక్ తెలుగు,ఇంగ్లీషుల్లో మంచి చదువరి అయ్యారు. స్వస్థలమైన తణుకులోనే ఉండిపోయారు. తిలక్ కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ప్రభావంతో కాల్పనిక సౌందర్యమూ, శ్రీశ్రీ ప్రభావంతో సామాజిక వాస్తవికత చోటు చేసుకున్నాయి. కవిత్వంలో తిలక్ ది ప్రత్యేకమైన శైలి. తెలుగు,సంస్కృత, అన్యదేశ సమాసాలు ఆయన రచనలలో కనబడతాయి. ఆయన కథల్లో మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యం అధ్యయనం చేసేవరికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందేమో అనిపించింది నాకు. 

తిలక్ సొంత గళంలో ఆయన "వెన్నెల" కవితనిఇదివరకూ బ్లాగ్లో పెట్టాను.. http://trishnaventa.blogspot.in/2009/11/blog-post_17.html

***   ***    *** 

 శిఖరారోహణ: 

'ముందుమాట'లో శ్రీకాంత శర్మ గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి బాలగంగాధర్ తిలక్ జీవన సాహిత్యాల గురించి ప్రసారమైన ఒక డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు. తను ఆకాశవాణిలో పనిచేసే కాలంలో శర్మగారే రచించిన ఈ డాక్యుమెంటరీ పేరు "శిఖరారోహణ". దీనికి ప్రయోక్తగా శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి(మా నాన్నగారు) వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో ఆనాటి ప్రముఖ రచయితలు శ్రీ సోమసుందర్, ఆర్.ఎస్.సుదర్శనం, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తిలక్ సోదరులు గంగాధర రామారావు పాల్గొన్నారు. ఆకాశవాణి కళాకారులు పద్యాలు, వచన కవిత్వం చదివారు. గంట నిడివి ఉన్న ఈ కార్యక్రమం 1983లో ప్రసారమైంది. తిలక్ కవిత్వం పై ఆసక్తి ఉన్న పాఠకులు ఈ కార్యక్రమాన్ని క్రింద లింక్ లో వినగలరు.. 

 


పైన కార్యక్రమం వినలేనివారికి ఇదే కార్యక్రమంలో "అమృతం కురిసిన రాత్రి" లోని "వానలో నీతో" అనే కవిత ఒక్కటీ విడతీసి క్రింద లింక్ లో ఇస్తున్నాను. ఇందులో కవిత చదివిన గళం నాన్నగారిది. 

Tuesday, October 9, 2012

నా ఉదయాలు..




రివ్వున వీస్తున్న పవనాలు మనసుని చల్లబరుస్తాయి
పచ్చదనంతో మెరుస్తున్న పైర్లు తలలుపుతూ శుభోదయం చెప్తాయి
కరెంట్ తీగ మీద వాలిన నీలిరంగు పిట్ట నా అందం చూడమంటుంది
హడావుడిగా పరిగెడుతున్న తొండ తలఊపి హలో చెప్తుంది.




పువ్వుల చుట్టూ తిరగాడే రంగురంగుల సీతాకోకచిలుకలు.. 
నా కెమేరాకు అందకుండా కవ్విస్తాయి
మంచుతో తడిసిన గడ్డిపరకలు తళుక్కుమంటుంటాయి
మబ్బుల మధ్యనుండి తొంగి చూస్తున్న సూరీడు 
అప్పుడే రానా.. వద్దా.. అని ఊగిసలాడుతూంటాడు
 తోటలోని ఎర్రని,తెల్లని గులాబీలు విరగబూసి 
నన్ను చూడు..నన్ను చూడు అంటూ గోముగా పిలుస్తూంటాయి



ఈ అందాలతో పనిలేదన్నట్లు ఆ పూరిపాకలోని పాప.. 
తనలోకంలో తాను కేరింతలు కొడుతుంటుంది
ఎర్రని చిగుర్లతో వేపచెట్లు నోరారా పలకరిస్తాయి కానీ
చేతులు చాచుకుని కూచున్న చింతచెట్లు ఎందుకో భయపెడతాయి!


ముళ్లచెట్టు మధ్యన నీలిపూలు మనోహరంగా కనబడతాయి
విరగబూసిన నందివర్థనాలు వెన్నెలని తలపిస్తాయి
నాకు తోడుగా చెవిలో కబుర్లాడుతున్న రేడియో జాకీ
కమ్మని పాటలతో నా ఆనందం పరవళ్ళుతొక్కుతుంది..


అలా.. ఈ ప్రకృతితో నేనూ మమేకమై పరవశించేవేళ
కుయ్యి మన్న రైలు కూతతో ఉలిక్కిపడతాను!
సందుచివర్లో కనబడుతున్న స్కూలు బస్సులు
ఇక చాలు ఈ లోకంలోకి వచ్చేయమని తొందరపెడతాయి
ప్రతి రాత్రీ రేపటి అనుభూతి గురించి కలలు కంటూ నిద్దరోతానా..
మళ్ళీ ఉదయానే నిన్నటి అనుభూతుల్ని వెతుక్కుంటూ నడచిపోతాను...





Monday, October 8, 2012

అమ్మ విలువను గుర్తుచేసిన "English Vinglish"


"मुझॆ प्यार की कमी नही हैं..कमी है तॊ सिर्फ थॊडी इज्जत की..." అంటుంది శశి. ఈ సినిమాలోని female protagonist ! మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. ఈ ఒక్క పాయింట్ మీదే మొత్తం సినిమా నిలబడి ఉంటుంది. అదే ప్రేక్షకుల మనసులకూ సినిమాకూ వారధి కూడా. Toronto Film Festival లో ఈ చిత్రం ప్రీమియర్ చేయబడినప్పుడు, చివర్లో "standing ovation" ఇచ్చారుట అక్కడి ప్రేక్షకులు. అంతటి మర్యాదను పొందే పూర్తి అర్హతలున్న సినిమా ఇది.


సినిమా చూస్తున్నంత సేపూ కథ తో పాటూ మనమూ కనక్ట్ అయి చూసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలా ప్రతి ఒక్కరూ సినిమాలోని పాత్రలతో(శశి లో, ఆమె భర్త లో, కూతురిలో) తమను తాము identify చేసుకునే సినిమా "English Vinglish". తొంభై శాతం ప్రతి భారతీయ కుటుంబం లోనూ జరిగిన, జరుగుతున్న కథే ఈ సినిమాలోనూ కనబడుతుంది. ఇల్లాలిని లోకువగా చూడటం. ఇంటెడు చాకిరీ చేసి, అందరు అవసరాలను చూసే అమ్మని కొందరు పిల్లలు లక్ష్యపెట్టరు. ఇంటినీ, కుటుంబాన్ని తీర్చిదిద్దే భార్యను కొందరు లోకువ కట్టేస్తారు. సినిమాలో "శశి"కి ఇంగ్లీషు రాదని భర్త, కూతురు హేళన చేసి లోకువ కట్టేస్తూంటారు. కానీ కొన్ని ఇళ్ళల్లో ఇంగీషు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో ఇల్లాల్ని లోకువ కట్టేస్తూ ఉంటారు. శశి అన్నట్లు చాలా చోట్ల ప్రేమ ఉంటుంది కానీ గౌరవమే ఉండదు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని తెరపైకి ఎక్కించడానికి కారణం తన తల్లి అంటారు దర్శకురాలు "గౌరి షిండే"(ఈవిడ "చీనీ కమ్", "పా" దర్శకుడు బాల్కీ భార్య).

"I made this film to say sorry to my mother." అంటున్న గౌరి ఇంటర్వ్యూ క్రింద లింక్ లో.
http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/I-am-a-better-director-than-Balki-Gauri-Shinde/articleshow/16697950.cms


నేను కూడా బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో మా అమ్మ గురించి  ఓ టపా  రాసాను! ఎందుకంటే నాకు అమ్మ విలువ పెళ్ళయ్యాకా కానీ తెలీలే. అసలు పెళ్ళాయ్యాకా కానీ ఏ అమ్మాయికీ అమ్మ పూర్తిగా అర్ధం కాదేమో అనుకుంటాను నేను. ఎన్నో సందర్భాలో "అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా"  అమ్మ పట్ల నాకు గౌరవం పెరిగిపోయేది. మనకు తెలీకుండానే మనం అమ్మని ఎన్ని వందలసార్లు బాధపెట్టి ఉంటామో అనుభవం లోకి వచ్చాకా కానీ తెలీదు. ఎందుకంటే మనం కసిరినా, కోప్పడినా,తిట్టినా, అరిచినా, మాట్లడకుండా ఉన్నా... మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!

ఈ కొత్త దర్శకురాలి మీద ఆశలు పెట్టుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తుందీ సినిమా. ప్రతి పాత్ర తమ తమ పరిమితుల్లో ఉండి, ఎవర్నీ ఎవరూ డామినేట్ చేయకుండా  తమతమ పాత్రల్లో(చిన్నవైనా) ఒదిగిపోయారు నటులందరూ. Female protagonist గా శ్రీదేవి డామినేట్ చేసేస్తోంది అని ఒక్కచోట కూడా అనిపించదు. చక్కని కథనంతో, ఆకట్టుకునే డైలాగ్స్ తో, మనసును హత్తుకునే సన్నివేశాలతో మనల్ని బాగా ఆకట్టుకుంటుందీ సినిమా. మనుషుల్లో వస్తున్న మర్పుని గమనించి అందుకు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. బరువైన థీం ని లైట్ గా చూపించటం కొత్త పంథా ఏమో మరి. "బర్ఫీ" అలానే ఉంది. ఇప్పుడు ఇదీ అలానే తీసారు. చాలాచోట్ల మానసు భారంగా అయిపోయినా, వెంఠనే నెక్స్ట్ ఫ్రేమ్ లో మన మూడ్ లైట్ అయిపోతుంది. సినిమా అయ్యాకా ప్రతిభావంతురాలైన ఈ దర్శకురాల్ని అభినందించకుండా ఉండలేం మనం.



 శ్రీదేవి కట్టిన సాదాసీదా కాటన్ చీరలు చాలా బాగున్నాయి.
ఈ సినిమాకి ప్రాణం శ్రీదేవి నటన అన్న సంగతి సినిమా మొదటిభాగంలోనే మనకి అర్ధమైపోతుంది. నటనకు పూర్తి అవకాశం ఉన్న అంతటి శక్తివంతమైన protagonist పాత్ర దొరకటం శ్రీదేవి అదృష్టం అనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ, అన్ని రకాల హావభావాలనూ అద్భుతంగా కనబరిచి తన సత్తాను మరోసారి చాటుకుంది శ్రీదేవి. మాధురీ దీక్షిత్ లాగ, కరిష్మా కపూర్ లాగ పేలవమైన సినిమాల్లో కాక పదిహేనేళ్ల తర్వాత వెండితెరపై ఇటువంటి విజయవంతమైన సినిమాతో కనబడటం మంచి విషయం. కానీ రంగుల ప్రపంచపు ప్రలోభాల్లో పడి మళ్ళీ ఓ ఆంటిలానో, అక్కగానో, తల్లిగానో స్థిరపడకుండా ఇకపై తెలివైన పాత్రల్ని ఎంచుకుంటుందా లేదా అన్నది బేతాళ ప్రశ్నే..!

అయితే శ్రీదేవిని ఒక కొత్త నటిలా నేను చూడగలిగాను తప్ప ఆమెలో పాత శ్రీదేవిని ఒక్క క్షణం కూడా పోల్చలేకపోయాను . somehow i felt pitiful to see a skinny sridevi. అందమైన పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేం బాలేదనిపించింది. ఏభైలకి దగ్గర పడుతున్న ఏ స్త్రీ అయినా, శరీరాకృతి కోసం ఎంత శ్రమించినా.. జీవనసంఘర్షణ తాలూకూ ఆనవాళ్ళని దాచిపెట్టలేదేమో!!! ఏదేమైనా Beauty has to wither some day..కదా...అనుకున్నా!



సినిమాలో నాకు నచ్చిన కొన్ని సంగతులు:

* సినిమా మొదట్లో అందరికీ అన్నీ సమకూరుస్తూ తన కోసం కలుపుకున్న కాఫీ తాగుతు పేపర్ కూడా చదువుకునే తీరిక దొరకదు శశికి. పిల్లాడితో ఆమె సమయం గడపటం, వాళ్ల మధ్యన అనుబంధం లాంటి చిన్న చిన్న డీటైల్స్ చూపించటం బాగుంది. మళ్ళీ భర్త అమెరికా వచ్చిన మర్నాడు అతను కాఫీ అనగానే చదువుతున్న పేపర్ ఆపేసి కాఫీ కోసం వెళ్తుంది శశి. చివరలో "వీళ్ళు నా ముఖ్యమైన స్నేహితులు" అని శశి చూపిస్తే "నీక్కూడా స్నేహితులా " అన్నట్లు చూసే చూపు..  అలాంటి మరి రెండు సన్నివేశాల ద్వారా టిపికల్ భర్తల స్వభావాన్ని బాగా చూపించారు.

* శశి వెళ్ళే ఇంగ్లీష్ క్లాస్ లో స్టూడెంట్స్ బాగున్నారు. ప్రపంచంలో ఎన్నిరకాలవాళ్ళున్నారో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వెళ్ళేవాళ్ళు అనిపించింది.


*శశిని ఇష్టపడే ఫ్రెంచ్ దేశీయుడు క్లాస్ లో నిర్భయంగా తన భావాలను చెప్పటం బావుంది. అతనిలోని నిజాయితీ ఆ పాత్రకు నిండుతనాన్ని ఇచ్చింది.

* క్లాసులు అయ్యేకొద్దీ భాష నేర్చుకుంటున్న వాళ్లలో ధైర్యం, వాళ్ళ నడకలో పెరిగే కాన్ఫిడెన్స్ బాగా చూపెట్టారు.



* "మగవాడు వంట చేస్తే కళ అంటారు.. అదే ఆడది చేస్తే అది తన బాధ్యత అంతే అంటారు.." అనే డైలాగ్ ; అలానే "పిల్లలకు తల్లిదండ్రుల లోటుపాట్లను ఎత్తిచూపి వేళాకోళం చేసే హక్కు ఎక్కడుంది?" అని శశి ఆవేదన పడే సన్నివేశం కళ్ళు తడిచేస్తుంది.

* శశి తన కుటుంబం నుండి గౌరవాన్ని కోరుకుంటోంది అని చెప్పటం కోసం తగినన్ని కారణాలు చూపించారే తప్ప భర్తను గానీ పిల్లని గానీ తక్కువగా చూపెట్టలేదు. అలా వాళ్ళ పాత్రలను మర్యాదపూర్వకంగా నిలబెట్టి ఉంచటం బావుంది.

*సినిమా చివరలో నూతన వధూవరులకు శశి చెప్పే వాక్యాలు చాలా బాగున్నాయి. అవి భార్యాభర్తలకే కాదు స్నేహితులకీ, మరే బంధమైనా నిలబడటానికి ఉపయోగపడేలా ఉన్నాయి.



కథ పెద్దగా లేకపోవటం వల్ల సినిమా కొన్ని సన్నివేశాల్లో సాగదీస్తున్నట్లు స్లోగా నడిచింది. అయినాకూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. కుటుంబం మొత్తం వెళ్ళి హాయిగా చూసిరావచ్చు. ప్రేమించటంతో పాటూ అమ్మను,భార్యనూ గౌరవిస్తూ కూడా ఉండాలి అనే సంగతి ఓసారి గుర్తుచేసుకుని కూడా రావచ్చు.




Thursday, October 4, 2012

నీవల్లే.. నీవల్లే..



రేపు శెలవు అంటే ఇవాళ రాత్రి ఏవన్నా సిడీలు(సినిమాలు) పెట్టుకుని చూడటం మాకు అలవాటు. పొద్దున్నే లేచి పరుగులు పెట్టక్కర్లేదని. అలాగ మొన్న వికెండ్ లో ఒక రోజు రాత్రి ఏదన్నా సీడీ పెట్టండి కాసేపు చూద్దాం.. అని నేను వంటింట్లోకి వెళ్పోయా.

త్వర త్వరగా వంటిల్లు క్లీన్ చేసేసుకుని హాల్లోకి వచ్చేసరికీ అయ్యగారు సీరియస్ గా "Rudali" సినిమా చూసేస్తున్నారు. ఇదేమిటీ విధివైపరీత్యం అని హాచ్చర్యపడిపోయేసా. భాషాభేదం లేదు కానీ అసలు సీరియస్ సినిమాల జోలికే తను పోరు. "సినిమా అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి" అన్నది తన సిధ్ధాంతం. అలాంటిది Rudali లాంటి గంభీరమైన సినిమా..అదీ వీకెండ్ లోనా? నాకే చూడాలనిపించలేదు. పాటలు బావుంటాయి కదా అని పెట్టాను అన్నారు. అది నిజమేననుకోండి కానీ ఇప్పుడా... అని నేను నిరాసక్తంగా కూచున్నా. సరే ఏదోఒకటిలే..ఆయనతో కలిసి చూడాలనే కదా నా కోరిక అని సగం అయిపోవస్తున్న సినిమాని నేనూ చూడ్డం మొదలెట్టా.

"దిల్ హూం హుం కరే.." పాట మొదలయ్యింది. జై భూపేన్ హజారికా.. అహా..ఓహో... అనేసుకున్నాం. "ఝూటి మూటి మితవా ఆవన్ బోలే..", "బీతేనా..బీతేనా రైనా..", "సమైయో... ధీరే చలో.." అన్నీ అయిపోయాయి. రాజ్ బబ్బర్ గురించీ, రాఖీ గురించీ, డింపుల్ టేలెంట్ గురించీ చర్చలు అయిపోయాయి. సినిమా అయిపోవచ్చింది. అదేమిటీ ఇంకా ఆ పాట రాలేదు అన్నారు తను. "ఏ పాట?" అన్నా నేను. అదే లతా పాట "యారా సీలీ సీలీ.." అన్నారు తను. "నేనొచ్చేసరికీ సినిమా సగం అయిపోయింది. మీరు ఏవన్నా సీన్స్ ఫాస్ట్ చేసేప్పుడు మిస్సయి ఉంటారు. వెనక్కి తిప్పి చూడండి.." అన్నా. అయ్యో నేను ఆ పాట కోసమే ఈ సినిమా పెట్టాను. ఏం పాట అసలు..ఏం పాట అసలు... లతా ఎంత అద్భుతంగా పాడుతుంది.." అంటూ మళ్ళీ సినిమా మొదటినుంచీ పెట్టారు. కాస్త కాస్త ఫాస్ట్ చేస్కుంటూ ఇద్దరం మళ్ళీ సీరియస్ గా సినిమా రెండోసారి చూట్టం పూర్తిచేసాం. సినిమా రెండోసారి అయిపోయింది కానీ పాట కనబడలేదు.

"ఇదేమిటీ పాట లేదు.." అన్నాన్నేను. కాసేపాగి..."అసలా పాట ఏ సినిమాలోదో కూడా మర్చిపోయావు నువ్వు?" అన్నారు. నాకప్పటికి కూడా గుర్తు రాలేదు. "యారా సీలీ సీలీ..పాట "Lekin" సినిమాలోది కదా..ఎలా మర్చిపోయావు? ఇంత సీరియస్ సినిమా రెండోసారి కూడా చూపించేసావు" అన్నారు. "ఇది మరీ బావుంది. ఈ సినిమా కావాలని పెట్టుకున్నది మీరు... పోనీలే అని చూస్తూ కూర్చున్నందుకు నన్నంటారేం?" అన్నా నేను. "రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడైనా గుర్తుకు రాలేదా నీకు? పాటలన్నీ నా నోటిమీదుంటాయి అంటావుగా.." అన్నారు. "అవునవును.. అలానే ఉండేవి పెళ్లయ్యేవరకూ..." అన్నాను. "సరేలే ఇప్పుడు చరిత్రలెందుకు.. వీకెండ్ పూటా ఇలాంటి సినిమా నాకు రెండుసార్లు చూపించేసావు.." అన్నారు. "అసలు రెండిటిలోనూ "డింపుల్.." ఉంది అందుకే కన్ఫ్యూజ్ అయ్యా.." అన్నా నేను. అలా నీవల్లే.. నీవల్లే.. అని కాసేపు అనేసుకున్నాకా.. మళ్ళీ Rudali సినిమా గుర్తుకొచ్చి ఇద్దరం పడీ పడీ నవ్వుకున్నాం.

అయినా నిజంగా అంత ఇష్టమైన పాట ఏ సినిమాలోదో కూడా గుర్తులేనంత మరపు వచ్చేసిందా? అని నాలో నేనే కాసేపు మధనపడిపోయా! ఈ చిలిపిజగడానికి మూలకారణమైన ఆ అద్భుతమైన పాట ఇదే...

 

Wednesday, October 3, 2012

Manna Dey's "कुछ ऐसे भी पल होते है.."


ప్రముఖ హిందీ గాయకుడు  మన్నాడే ది ఒక విలక్షణమైన గళం. "आजा सनम ...", "तु प्यर क सगर है ", "लागा चुनरी मॆं दाग..", "प्यार हुआ इक्रार हुआ..", "ये मेरॆ प्यारॆ वतन..", "ज़िंदगी कैसी है पहॆली हायॆ.."सुर ना सजॆ क्या गावू मैं..." మొదలైన పాటలు మన్నాడే కి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. క్లాసికల్ టచ్ ఉన్న హిందీ పాటలు ఎక్కువగా పాడారు ఈయన. ఒక ప్రత్యేకమైన మూసలో ఉండిపోకుండా అన్నిరకాల పాటలు పాడగలగటం మన్నాడే గొప్పతనమే కానీ ఆయన గొంతులోని ఈ versatility వల్ల ఒకోసారి ఇది మన్నాడే పాడినదా?కాదా? అని సందేహం వస్తుంటుంది.

సినిమా పాటలే కాక ప్రైవేట్ పాటలు కూడా చాలా పాడారు మన్నాడే. వాటిల్లో "कुछ ऐसे भी पल होते है.." పాట చాలా బావుంటుంది. నాన్నగారి పాత కేసెట్లలో ఉన్న ఈ పాటను రాసుకుని నేర్చుకున్నా నేను. ఇవాళ అనుకోకుండా యూట్యూబ్ లో దొరికింది. ఈ పాట సాహిత్యం కూడా ఎంతో బావుంటుంది. గేయ రచయిత "యోగేష్" రచించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు మన్నాడే. మీరూ వినండి..


lyrics:
 ప: कुछ ऐसे भी पल होते है(२) 
जब रात कॆ गेहरॆ सन्नाटॆ 
गेहरी सी नींद मॆं सॊतॆ हैं 
तब मुस्कानें कॆ दर्द यहां 
बच्चॊं की तरहा सॆ रॊतॆ हैं 

౧చ: जब छा जाती है खामोशी 
 तब शोर मचाती है धड़कन 
 एक मेला जैसा लगता है 
 बिखरा बिखरा ये सूनापन 
 यादों के साए ऐसे में
 करने लगते है आलिंगन 
 चुभने लगते है साँसों में 
 बिखरे सपनें का हर दर्पण 
 फिर भी जागे ये दो नैना 
 सपनें का बोझ संजोता है ((ప)) 

 २చ:यु ही हर रात ढ़लती है 
 यु ही हर दिन ढलजाता है 
 हर साँझ यु ही ये बिरही मन 
 पतझर में फूल खिलाता है 
 आखिर ये कैसा बंधन है 
 आखिर ये कैसा नाता है 
 जो जुड़ तो गया अनजाने में 
 पर टूट नहीं अब पाता है 
 और हम उलझे इस बंधन में
 दिन भर ये नैन भिगोते है ((ప))