సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 31, 2012

శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి "జానకితో జనాంతికం" ఆడియో



శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారి రచన "జానకితో జనాంతికం" ఒక అద్భుతమైన వాక్ చిత్రం. 1975లో ఆయనే సొంతంగా చదవగా విజయవాడ ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఒకసారి దువ్వూరివారు విజయవాడ రేడియోస్టేషన్ కి విచ్చేసిన సందర్భంలో ఏదైనా మాట్లాడవలసిందిగా వెంకటరమణశాస్త్రిగారిని కోరితే, ముందస్తు తయారి లేకపోయినా అప్పటికప్పుడు "జానకితో జనాంతికం" స్క్రిప్ట్ చదివారిట వారు. రికార్డింగ్ సదుపాయాలు సరిగ్గాలేని అప్పటి పాత విజయవాడ ఆకాశవాణి స్టూడియోలో రికార్డింగ్ జరిగిందిట.


అప్పటికే పెద్ద వయసు అయినా, ఇందులో దువ్వూరి వారు తన స్వరంలో కనబరిచిన ఆర్ద్రత, సీతమ్మవారిపై కనబరిచిన గౌరవాభిమానాలు, వాయిస్ మాడ్యులేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక వాక్యాన్ని ఎలా పలకాలి, మైక్ ముందర ఎలా మాట్లాడాలి అని కొత్తగా ఆకాశవాణిలో చేరినవారికి చెప్పటానికి టేపుని వినిపిస్తూ ఉండేవారుట.

రేపటి శ్రీరామనవమి సందర్భంగా దువ్వూరివారి స్వరంలో ఉన్న వాక్ చిత్రాన్ని టపాలో అందించాలని ప్రయత్నం. చాలా పాత రికార్డింగ్ అవటం వల్ల స్పష్టత కాస్త తక్కువైంది.. ! దువ్వూరివారి స్వరంలో ఉన్న పాత రికార్డింగ్ క్రింద లింక్లో వినవచ్చు.

 

పదిహేనేళ్ల క్రితం ఒక శ్రీరామనవమి సందర్భంలో ఆంధ్రప్రభ పత్రిక వారు వాక్ చిత్రాన్ని అక్షరరూపంలో ప్రచురించారు. కాపీ ఇక్కడ చూడవచ్చు.


దువ్వూరి వారి స్వీయ చరిత్ర ( కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర ) గురించి పుస్తకం.నెట్ లో ప్రచురితమైన 'మెహెర్'గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.


Friday, March 30, 2012

మోరీ పళ్ళు - Chironji






నిన్న ఒక టపా రాసాను "ఈ పళ్ళు ఏమిటో తెలుసా? " అని. పైన ఫోటో లోనిది ఆ పళ్ళు కాసే చెట్టు.నిన్నటి టపాలో ఇద్దరు(కృష్ణ గారు, సైలజ గారు) సరైన సమాధానం రాసారు.





ఇది ఒక ఔషధవృక్షం. ఈ పళ్ళను "మోరీ పళ్ళు" అంటారు. ఇవి ఈ సీజన్లోనే దొరుకుటాయి. చెట్టు నిండా పళ్ళు విరగ కాస్తాయి.జనవరి ఫిబ్రవరిల్లో ఈ చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుందిట. ఇలా







మార్చి, ఏప్రిల్ నెలల్లో పళ్ళు కాస్తాయిట. గుండ్రంగా, ఆకుపచ్చ గా ఉండి తర్వాత నల్లగా మారిపోతాయి ఈ పళ్ళు. అచ్చం నేరేడు పళ్లలాగే వగరుగా,తియ్యగా,పుల్లగా ఉంటుందీ పళ్ళ రుచి.






వీటిలోపల గింజలను ఎండబెట్టి ఓపిగ్గా కొట్టుకుంటే లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పునే మనం "సారపప్పు" అంటాం. ఇంగ్లీషు లో chironji అంటారు. స్వీట్స్ లోనూ, ఖీర్ లోనూ వేస్తారు.







ఈ చెట్టు వివరాలు, సారపప్పు వివరాలూ ఆసక్తి ఉన్నవారు క్రింద వెబ్సైట్ లింక్స్ లోకి వెళ్ళి చూడవచ్చు.











Thursday, March 29, 2012

ఈ పళ్ళు ఏమిటో తెలుసా?


చిన్నగా, గుండ్రంగా, నల్లగా ఉన్న ఈ పళ్ళ పేరు తెలుసా?
నేరేడుపళ్ల రుచి కలిగి ఉంటాయి ఈ పళ్ళు. అన్నికాలాల్లోనూ రావు ఇవి.

బహుశా ఇది ఈ పళ్ళు దొరికే సీజనేమో మరి.. నిన్నను దొరికాయి.

పళ్ల క్రింద ఉన్నవి ఆ చెట్టు ఆకులే.


ఈ ఫొటోలోవి ఈ పండు లోపల ఉన్న గింజలు.

ఇవి ఎండబెట్టి లోపల ఉన్న పప్పు కూడా తింటారు.







Monday, March 26, 2012

తిరుపతి - శ్రీకాళహస్తి

 







మేం నడిచివచ్చిన దారి - పైనుంచి


సుమారు నాలుగైదేళ్ల తరువాత తిరుమలేశుని దర్శనానికి రెండువారాల క్రితం వెళ్ళి వచ్చాం. రెండుమూడు సార్లు అనుకున్న ప్రయాణం ఆగిపోయి ఇప్పటికి కుదిరింది. పరీక్షల సమయంలో రద్దీ తక్కువ ఉంటుందని ఇప్పుడు పెట్టుకున్నాం. సావకాశంగా రాయాలనుకోవటం వల్ల వెళ్ళొచ్చిన పదిహేనురోజులకి ఇప్పటికి టపా రాయటం అవుతోంది. తిరుపతి చాలామంది చాలాసార్లు వెళ్ళి వస్తుంటారు. ఇదేమీ అరుదైన ప్రయాణం కాదు కానీ మేము గత నాలుగుసార్లుగా కొండపైకి నడిచి వెళ్తున్నాము. అలా నడిచివెళ్ళాలనుకునేవారికి ఏదైనా వివరాలు తెలిపినట్లుంటుందని ఈ టపా.

 
తిరుమలకి మెట్లు ఎక్కివెళ్ళిన గత మూడుసార్లు కూడా మేము అలిపిరి వద్ద నున్న మెట్ల దారి మీదుగానే వెళ్ళాం. ఆ దారి మొదట్లో లగేజ్ ఇచ్చేస్తే మనం వెళ్ళే సమయానికి పైకి తెచ్చేస్తారు. దారి పొడుగునా ఏవో స్టాల్స్, తినుబండారాలు అమ్ముతూనే ఉంటారు. ఉదయంపూట బయల్దేరితే ఈ మెట్లదారి అనువుగా ఉంటుంది. ఎండపెరిగే సమయనికి పైకి చేరిపోవచ్చు. మధ్య మధ్య ఉండే కాలి బాట, రోడ్డు, డీర్ పార్క్లోని లేళ్ళు, చుట్టూ ఉండే చెట్లు, కొండలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందీ దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వెళ్తే మంచి అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. నాలా ఫోటోల పిచ్చి ఉన్నవాళ్ళు అయితే కొత్తగా కనబడిన ప్రతి చెట్టుకి,పుట్టకి ఫోటోలు తీసుకోవచ్చు. సగం దారికి వెళ్ళేసరికీ వేడి వేడి మిర్చి బజ్జీలు మొదలైనవి మనల్ని వాటివైపుకి లాగుతూ ఉంటాయి.

 
కానీ ఈ దారిలో వెళ్ళినప్పడల్లా నాకొక సందేహం వచ్చేది.. ఇలా కులాసాగా తింటూ, టీలు, కూల్డ్రింకులూ తాగుతూ, కావాల్సినంత సేపు ఆగుతూ కష్టం తెలీకుండా మెట్లు ఎక్కితే పుణ్యమేనా? అని. కొందరయితే చెప్పులు కూడా వేసుకుని ఎక్కేస్తారు. ఈ మెట్ల దారికిరువైపులా రాసి ఉండే గోవిందనామాలు చదువుకుంటూ ఎక్కటానికి వీలుగా బావుంటాయి. మాకు మొదటిసారి అమ్మనాన్న కూడా ఉండటంతో వాళ్లతో నెమ్మదిగా ఎక్కటం వల్ల ఐదు గంటలు పట్టిది. తర్వాత రెండుసార్లు కూడా మూడున్నర, నాలుగు గంటల్లో ఎక్కేసాం. ఒక్కళ్లం వెళ్ళేకన్నా నలుగురితో కలిసి వెళ్తే కబుర్లలో అలుపు తెలియదు. రెండవసారి వెళ్ళినప్పుడూ మొక్కులేకపోయినా వీలయినన్నిసార్లు మెట్లదారిలోనే వచ్చే శక్తిని ఇమ్మని వెంకటేశ్వరుడికి దణ్ణం పెట్టేసుకున్నా. అలా ఇప్పటికి అలిపిరి దగ్గరి మెట్లదారిలో మూడు సార్లు వెళ్లివచ్చాం. 








మేం వెళ్ళిన మెట్లదారి మొదలు


మళ్ళీ నాలుగైదేళ్ల తరువాత పదిహేనురోజులక్రితం తిరుపతి వెళ్ళివచ్చాం. అయితే ఈసారి అలిపిరి దారి కాక శ్రీనివాస మంగాపురం నుండి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మెట్ల దారి గురించి తెలిసింది. ఈ కొత్తదారిలో వెళ్దాం అని బయల్దేరాం. ఏడాది క్రితమే ఈ దారిని బాగుచేసారని ఆటో అబ్బాయి చెప్పాడు. సుమారు రెండువేలనాలుగొందల మెట్లు ఉంటాయి ఈ దారిలో. అన్ని మెట్లే. మధ్యలో రోడ్డు ఉండదు. సమంగా ఎక్కగలిగితే రెండుగంటల్లో చేరిపోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ దారిలో ఏ విధమైన తినుబండారాలు అమ్మరుట. దారిపొడుగునా టిటిడి వాళ్ళు పెట్టిన పంపుల్లో మంచినీళ్ళు, వాష్ రూమ్స్ మాత్రం ఉంటాయని చెప్పారు.
 









నడకదారిలో ధ్యానముద్రతో దర్శనమిచ్చిన శంకరుడు


అందువల్ల క్రిందనే ఓ రెండులీటర్ల బిస్లరీ వాటర్ బాటిల్ కొనేసుకుని బయల్దేరాం. మెట్లకు పసుపు-కుంకుమ పెట్టి ఎక్కేవారు ఇటు ఎక్కువగా వెళ్తూంటారేమో అనుకున్నాం. నయనానందకరంగా లేకపోయినా అలిపిరి మెట్లదారి కన్నా ఈ మెట్ల దారి మాకు బాగా నచ్చింది. అడుగడుక్కీ తినుబండారాల కొట్లు లేకపోవటం మరీ నచ్చింది. అటుఇటు గోవిందనామాలు రాసి ఉంచారు. మెట్లు కూడా ఏంతో పరిశుభ్రంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడికక్కడ టిటీడి సిబ్బంది మెట్లు తుడుస్తూ కనబడ్డారు. అడుగడుక్కీ మంచినీళ్ల పంపులు కూడా బాగా పెట్టారు. దారిపొడుగునా మెట్లపైన షెల్టర్ వేడి తగలకుండా కాపాడుతుంది.

మొదట్లో త్వరగా మెట్లు ఎక్కేస్తే త్వరగా అలసిపోతాము. అలాకాకుండా మొదటి నుంచీ నెమ్మదిగా ఎక్కితే త్వరగా అలసట రాదు. మేము అలా నెమ్మదిగా రెండున్నర గంటల్లో ఈ మెట్లన్ని ఎక్కేసాము. ఇక్కడ మధ్యలో మెట్లదారిలో వచ్చేవారికి "దివ్య దర్శనం" టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్ ద్వారా శ్రీవారి దర్శనం కూడా మామూలు కన్నా త్వరగా అయిపోతుందిట.









దారిలో విచిత్రంగా తోచిన చెట్టుకాయలు


మెట్లు ఎక్కగానే వెళ్పోయి ఉంటే మాకూ అలా రెండుగంటల్లో దర్శనం అయిపోయేది. కానీ మా పాపను క్రిందన ఉంచాము. తను వచ్చి మేము క్యూలో చేసేసరికీ బ్రేక్ దర్శనం టైమ్ అయిపోయి లోపల జైల్లో ఇరుక్కుపోయాం. జైల్లా ఉండే ఆ కంపార్టుమెంట్లలో గంటల తరబడి కూచోవటం ఓ పెద్ద శిక్ష. ఈ పధ్ధతిని మార్చే ప్రయత్నం ఏదైనా టిటిడి వాళ్ళు చేస్తే బావుంటుంది. ఆ జనాల్లో ఏ హార్ట్ పేషంట్ కో ఏదైనా జరిగితే పట్టించుకునే దిక్కు, బయటపడే మార్గం కూడా లేవక్కడ. ఇది చాలదన్నట్లు క్యూల్లో జనాలకు కంట్రోల్, సహనం ఉండవు. తలుపు తియ్యగానే పొలోమని తోసేసుకుంటారు. ఏ గుడిలో చూసినా ఇదే తోపులాట. శిరిడి వెళ్ళినా, వేరే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా దైవదర్శనం జరిగిందన్న ఆనందం కన్నా ఈ తోపులాటల వల్ల పెరిగే అశాంతే ఎక్కువౌతోంది. అలా నాలుగుగంటలు పట్టినా తిరుమలేశుని దర్శనం బాగా జరిగింది.

శ్రీకాళహస్తి:

తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో "శ్రీకాళహస్తి" ఉంది. "శ్రీ" అనగా సాలెపురుగు, "కాళము" అంటే పాము, "హస్తి" అంటే ఏనుగు. ఈ మూడు ప్రాణులూ ఈ చోట పరమేశ్వరుడిపై తమకున్న భక్తిని చాటుకుని మోక్షాన్ని పొందాయి కాబట్టి ఈ ప్రాంతానికి "శ్రీకాళహస్తి" అని పేరు వచ్చింది. ఈ ప్రాంత మహత్మ్యం గురించి "శివపురాణం", "శ్రీ కళహస్తి మహత్మ్యం " మొదలైన పురాణాల్లో తెలుపబడింది. స్వయంభూలింగంగా భావించే ఈ కాళహస్తీశ్వరుడిది వాయులింగ స్వరూపమట. కాళహస్తి ఆలయానికి దగ్గరలో "స్వర్ణముఖి" నది కూడా ప్రవహించేదిట...ఇప్పుడు ఎండిపోయింది. ఈ నదిలో నీరు లేకపోవటానికి అగస్త్యుడి శాపమే కారణమని కొందరు చెప్తారు.








శ్రీకాళహస్తి గుడి


ఊహ తెలిసాకా శ్రీకాళహస్తి వెళ్లలేదు నేను. అందుకని ఈసారి ప్రత్యేకం శ్రీకాళహస్తి వెళ్లాం. లక్కీగా అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామికి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబల దర్శనం బాగా జరిగింది. మేం వెళ్ళిన సమయంలో బయటకు పల్లకీ ఊరేగింపుకి వచ్చారు స్వామివారు. గుడి తాలూకూ కట్టడం, ప్రాకారాలు అన్నీ బాగున్నాయి. అయితే ఇక్కడ కూడా చాలా చోట్లలాగ గుడి ఆవరణంలో పసుపు కుంకుమ ఇచ్చి డబ్బులడిగే అర్చకులను చూడ్డం విచారకరంగా తోచింది.



తిరుగుప్రయాణంలో తిరుపతి స్టేషన్లో నాకు ఇష్టమైన సన్నజాజుల చిక్కటిమాల దొరకటం సంతోషాన్నిచ్చింది.








సన్నజాజులు తురిమిన మా చిన్నది



Friday, March 23, 2012

బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు




శ్రీ నందననామ నూతన సంవత్సరం ప్రతి ఇంటా విజయాన్నీ, ఆనందాన్నీ నింపాలని,
అందరికీ ఆయురారోగ్యాలను అందివ్వాలని మనసారా కోరుకూంటూ...
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

Wednesday, March 21, 2012

బీరకాయ పీచు చుట్టరికం

చుట్టరికాలు రకరకాలు. మనం ముఖ్యంగా పరిగణించే అమ్మ తరఫువాళ్ళు, నాన్న తరఫువాళ్ళు కాక అమ్మమ్మ,తాతయ్య వైపు చుట్టాలు, నాన్నమ్మ,తాతయ్య వైపు వాళ్ల అన్నదమ్ముల తాలూకా, అక్కచెల్లెళ్ళ తాలూకా చుట్టాలుంటారు కదా వాళ్ళ చుట్టరికాలని బీరకాయ పీచు చుట్టరికం అంటారు. పూర్వకాలపు ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఈ దూరపు చుట్టరికాలు కూడా అందరికీ తెలుస్తూ ఉండేవి. కానీ రానురానూ కుటుంబాలు చిన్నవి అయ్యే కొద్దీ బంధుత్వాలు, చూట్టరికాలు కూడా దూరంగానే జరిగిపోతున్నాయి. ఎప్పుడైనా అందరం కలిసినప్పుడు వీళ్ళు ఫలానా అని మన అమ్మమ్మలో, మావయ్యలో చెప్తే తప్ప మనకెవరూ తెలియదు. అలా అందరం కలిసే సందర్భాలు కూడా తక్కువైపోతున్నాయి రానురానూ.


గృహప్రవేశాలూ, ఇతర చిన్నపాటి వేడుకల్లో కన్నా పెళ్ళిళ్లలో మాత్రం చాలావరకు దూరపు బంధువులను మనం కలుస్తూ ఉంటాము. వేరే ఎక్కడా,ఎప్పుడు మనం వాళ్లను కలవకపోయినా కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళలో మాత్రం కొందరిని తప్పక కలుస్తూంటాము. హలో అంటే హలో అనుకోవటం, ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారని పలకరించుకోవటం మినహా పెద్దగా స్నేహబాంధవ్యాలు ఉండవు వీరితో. అమ్మ ద్వారానో, పిన్ని ద్వారానో వాళ్ల తాలుకూ కబుర్లు వింటుంటాం తప్ప వాళ్ల ఇళ్ళకు కూడా ఎప్పుడు వెళ్లం మనం. కానీ అలా అప్పుడప్పుడు కేవలం పెళ్ళిళ్ళలో మాత్రమే కలిసే కొందరు చుట్టాలు ఎందుకనో గుర్తుండిపోతారు మనకి. అలా నేను చిన్నప్పటి నుండీ చూస్తున్న/ఎరిగిన ఒక బీరకాయ పీచు బంధువు గురించి అమ్మ చెప్పిన వార్త విని ఈ టపా రాయాలనిపించింది.


ఆ బంధువు మా అమ్మమ్మ అక్కయ్యకు మనవడో ఏదో అవుతారు. నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లోని అన్ని ముఖ్యమైన పెళ్ళీళ్లకూ హాజరయ్యేవారు. ప్రతీ పెళ్ళి లోనూ ఎక్కడో ఆడుకుంటున్న నన్ను పిలిచి "ఏమే బావున్నావా? ఏం చదువుతున్నావు? " అని పలకరించేవారు. వాళ్ళావిడను పిలిచి "ఇదిగో ఈ అమ్మాయి గుర్తుందా..?" అని నేనెవరో చెప్పేవారు. ఎంత హడావుడి పెళ్ళిలోనైనా కనీసం భోజనాల సమయంలో అయినా సరే ఆయన పలకరింపు అలా అలవాటైపోయింది నాకు. కాస్త ఊహ వచ్చాకా ఏ పెళ్ళిలో అయినా ఆయన కనబడకపోతే "ఫలానావాళ్ళు ఈ పెళ్ళికి రాలేదా?" అని అమ్మని అడిగేంతగా నాకు ఆయన గుర్తుండిపోయారు. నాచిన్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు ఆయనకు.


నాపెళ్ళయాకా నేను కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళు మిస్సయ్యా. చాలారోజులతర్వాత ఒకసారి మాత్రం వాళ్ళను కలిసాను. "మీరిద్దరూ మా ఊరు రండి" అని ఆహ్వానించారు. ఓ పేరున్న హిల్ స్టేషన్లో ఉండేవారు వాళ్ళు. తర్వాత అమ్మ ద్వారా వాళ్ల అమ్మాయికి ఇంటర్ అవ్వగానే పెళ్ళి చేసేశారని విన్నాను. ఇప్పుడు మనవలు కూడాట. ఇక అబ్బాయికి ఇంజినీరింగ్ పూర్తయ్యి ఉద్యోగంలో చేరాడని విన్నాను. ఈమధ్యన ఆయన అమ్మకి ఫోన్ చేసారుట వాళ్ల అబ్బాయి పెళ్లి.. శుభలేఖ మిస్సయినా తప్పకుండా పెళ్ళికి రావాలి అని. మా పిల్లలందరిని పేరుపేరునా అడిగారుట. అమ్మ మళ్ళీ నాకీ సంగతి చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో బీరకాయపీచు చుట్టరికం.. ఇంకా గుర్తుపెట్టుకుని పేరుపేరునా అడగటం, పెళ్ళికి అహ్వానించటం..! ఏళ్లపాటు బంధుత్వాలు నిలిచిఉన్న కొందరు చుట్టాల దగ్గరే సఖ్యత కనిపించదు. అలాంటిది ఇళ్ళకు వెళ్ళటాలు, ఉత్తరప్రత్యుత్తరాలు లేకపోయినా కేవలం పెళ్ళిళ్లలో కలిసిన పరిచయంతోనే ఇంతవరకూ ఈ బీరకాయ పీచు చుట్టరికం నిలిచి ఉండటం...నాకయితే విచిత్రంగానే తోస్తుంది. పైగా నే చిన్నప్పుడు చూసిన పాకే వయసుపిల్లలు ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చి పెళ్ళిళ్ళు అయ్యేంత పెద్దవారయిపోయారని విని ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి !!

Tuesday, March 20, 2012

మార్నింగ్ స్కూల్


వేసవి ఎండలు ముదురుతున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఒంటిపూట బడి అని ప్రకటిస్తారు. ప్రైవేటు స్కూల్స్ వారు కూడా వారివారి వీలుని బట్టి ఓ వారం అటు ఇటులో మార్నింగ్ స్కూల్ ప్రకటన ఇస్తారు. రెండవ క్లాస్ చదువుతున్న మా పాపకు ఇవాళ్టి నుంచీ మార్నింగ్ స్కూల్. స్కూలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉన్నా, పాపను త్వరగా లేపి, రోజూ కన్నా ఓ గంట ముందే తయారుచేయాల్సి ఉంటుంది.




నాకు చిన్నప్పటి నుండీ ఈ మార్నింగ్ స్కూల్ అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. నా చిన్నప్పుడు ఏడవ తరగతి దాకా మేము చదివిన స్కూల్ ఇంటి దగ్గర్లోనే ఉండేది. పది, పదిహేను నిమిషాల నడక పెద్ద దూరం కాదప్పట్లో. నడచివెళ్ళేవాళ్ళం. ఐదో క్లాస్ దాగా అమ్మ మా బ్యాగ్గులు భుజాన వేసుకుని దిగపెట్టు, మళ్ళీ సాయంత్రం తీసుకువెళ్ళేది. ఈ మర్నింగ్ స్కూల్ టైం లో మాత్రం పొద్దున్న 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు ఉండేది స్కూల్. అప్పుడు మాత్రం మధ్యాన్నం ఎండగా ఉంటుందని ఎండుపూటలకీ మా కోసం రిక్షా మాట్లాడేది అమ్మ. పొద్దున్నే ఏడున్నరకే రిక్షా వచ్చేసేది. అదికూడా అందరిలా ఓ పదిమందితో ఇరుక్కుని కూర్చునేలా కాకుండా మేమిద్దరం, ఇంకో ఇద్దరూ కలిపి నలుగురం మాత్రమే ఉండేలా రిక్షా మాట్లాడేది అమ్మ. అలా ఇరుకు లేకుండా ఫ్రీగా కూచునేలా రిక్షాలో స్కూలుకి వెళ్లటం ఎంతో దర్జాగా అనిపించేది.




ఇక స్కూల్లో సాయంత్రం దాక ఉండక్కర్లేకుండా మధ్యాన్నమే ఇంటికి వచ్చేయటం మరీ ఇష్టంగా ఉండేది. చక్కగా త్వరగా హోంవర్క్ చేసేస్కుంటే బోలెడంత ఖాళీ సమయం. కావాల్సినంత సేపు ఆడుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఏడూ ఎప్పుడు మార్నింగ్ స్కూల్స్ మొదలవుతాయా అని ఎదురుచూసేదాన్ని. 8th క్లాస్ లో కాస్త పెద్ద స్కూల్ కి మారాకా స్కూల్ బస్ ఉండేది. మాములు రోజుల్లోనే స్కూల్ బస్ 7.45 a.m కి వచ్చేసేది. ఇక మార్నింగ్ స్కూల్ అప్పుడు స్కూల్ ఎనిమిదికైనా బస్సు మరీ ఆరున్నరకే వచ్చేసేది. చాలా చోట్ల తిరగాలి కదా. అందుకని మరీ అంత త్వరగా తెమలటం కాస్త కష్టం గానే ఉండేది. అందుకని పెద్ద స్కూల్లో కంటే నాకు చిన్నప్పటి మార్నింగ్ స్కూల్ అంటే ఉన్న ప్రత్యేకమైన ఇష్టం అలానే ఉండిపోయింది.


అయితే, ఇప్పుడు మా పాప చదివే స్కూల్ ఇంటి దగ్గరే అవ్వటంతో తన మార్నింగ్ స్కూల్ అంటే కూడా నాకు భలే ఇష్టం. దీనివల్ల నాకు బోలెడు ఆనందాలు...
నేను హడావిడి పడి లంచ్ బాక్స్ ఇవ్వక్కర్లేదు,
రోజూలా లంచ్ బాక్స్ లోని గుప్పెడు మెతుకులు కాక పిల్ల ఇంటిపట్టున కాస్త కడుపునిండా అన్నం తింటుందని,
ఒంటిపూట స్కూలే కాబట్టి రోజూలా బండెడు పుస్తకాల బస్తా మోయక్కర్లేదు,
మరికాసేపు ఆడుకోవటానికి పిల్లకి కాస్త టైం దొరుకుతుంది...
నేను కూడా ఎక్కువ సమయం పాపతో గడపచ్చు..
ఇలా అన్నమాట. ఓ ఇరవై రోజులు ఇలా గడిపేస్తే ఇక వేసవి సెలవలే !!

Sunday, March 18, 2012

KAHAANi - It's a one-woman show !





రిలీజైన పది రోజుల తర్వాత, బాగుందన్న టాక్ విన్నాకా నిన్న విద్యాబాలన్ నటించిన "కహానీ"(హిందీ) సినిమా చూశాం. హీరో డామినేషన్ ఎక్కువ ఉన్న భారతీయ సినిమాల్లో నాయికకు పెద్ద పాత్ర ఉండటం అరుదుగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది తన ఒక్క పాత్రతోనే సినిమా మొత్తం నడిపించగల సత్తా తనకు ఉంది అని మరోసారి విద్యాబాలన్ నిరూపించింది. It's a one-woman show !



"పరిణీత" లో ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర నాయిక లలితగా ఒదిగిపోయినా, "గురు" సినిమాలో చక్రాల కుర్చీ లోంచి లేవలేని అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా కంట తడిపెట్టించినా, "పా" లో సింగిల్ మదర్ గా జీవించినా, "భూల్ భులయ్య" (మన చంద్రముఖి సినిమా రీమేక్)" లో మానసిక రుగ్మత ఉన్న పాత్రలో మెప్పించినా, "డర్టీ పిక్చర్" లో స్టార్ హోదా నుంచి అపజయంపాలైన నటిగా మారిపోయినా... అది విద్య కే చెల్లింది. ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టిన "ఇష్కియా", "హూ కిల్డ్ జెస్సికా" నేను మిస్సాయా.

తాజాగా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్నీ, ఉత్తమ నటిగానే మరికొన్ని పురస్కారాలను అందుకున్న విద్యాబలన్ "కహానీ" సినిమాలో హీరోయిన్ ఇమేజ్ కు భిన్నమైన ప్రెగ్నెంట్ లేడీ పాత్ర పోషించింది. విభిన్నమైన పాత్రలు పోషించటంలో తనదంటూ ఒక ప్రత్యేక పంథా సృష్టించుకున్నవిధ్యాబాలన్ ఈ సినిమాలో కూడా అసామాన్య ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. లండన్ నుంచి భర్తను వెతుక్కుంటూ వచ్చిన "విద్యా బాగ్చీ" అనే ప్రెగ్నెంట్ పాత్ర చుట్టూ మొత్తం సినిమా అల్లుకుపోయి ఉంటుంది. విద్య చెప్పే డైలాగ్స్ కన్నా ఆమె కళ్ళే ఎక్కువ సందేశాన్ని అందిస్తాయి. ఇక ఆమె నవ్వు వెన్నెలలు కురిపిస్తుంది అనటం అతిశయోక్తి కాదు. ఆందోళననూ, అమాయకత్వాన్నీ, కోపాన్నీ, హాస్యాన్నీ, ధైర్యాన్నీ, తెగింపునూ సమపాళ్లలో నింపుకున్న ఈ మహిళ చిట్టచివరిదాకా భర్త కోసం జరిపే వెతుకులాటలో మనమూ భాగమైపోతాం.


మెయిన్ స్ట్రీం మసాలా సినిమాలకు భిన్నంగా తయారైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు దర్శకుడైన Sujoy Ghosh సహనిర్మాత కూడా. టైటిల్స్ మొదలుకుని చివరి దాకా ఎక్కడా కూడా చూసేవారికి విసుగు రాకుండా స్క్రీన్ ప్లే ను తయారుచేసుకోవటం ఈ దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. సినిమాలోని ఆఖరి సీన్ మంచి ట్విస్ట్ ను అందించింది. ఆ సీన్ లో విద్య నటన కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే నెల క్రితం ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నేను ఈ సినిమా క్లైమాక్స్ ఊహించాను. నేను ఊహించిన రెండు గెస్ లూ నిజమయ్యాయి.


సబ్ ఇన్స్పెక్టర్ రాణా/సాత్యకి పాత్రలో బెంగాలీ నటుడు Parambrata Chattopadhyay చాలా బాగా ఇమిడిపోయాడు. విద్యా బాగ్చీ పాత్ర తరువాత నాకు బాగా నచ్చేసిన పాత్ర ఇది. సాత్యకి పేరుని ఈ పాత్రకు పెట్టడం సింబాలిక్ గా బాగుంది. ఇతను విద్యాబాలన్ కెరీర్ మొదట్లో ఆమెతో కలిసి ఒకటి రెండు సినిమాలు వేసాడుట. క్లర్క్ + కాంట్రాక్ట్ కిల్లర్ గా చూపెట్టిన మనిషి ఫన్నీగా, ఇలా కూడా ఉంటారన్న మాట అనిపించేలా ఉన్నాడు. విశాల్-శేఖర్ అందించిన నేపధ్యసంగీతం ఆకట్టుకుంది. చివర్లో నాకు చాలా ఇష్టమైన రవీంద్రుడి గీతం "ఏక్లా చలో" వినిపించటం చాలా బావుంది. అది అమితాబ్ పాడినట్లున్నాడు.


కలకత్తా నగరాన్ని సినిమా నేపథ్యంగా చేసుకోవటం బాగుంది. పురాతన నగరం, పండుగ వతావరణం, దుర్గ పూజ ఇవన్నీ చూపించిన విధానం సినిమాలోని సస్పెన్స్ వాతావరణానికి సమంగా సరిపోయాయి. ఈ సినిమా భవిష్యత్తులో మరిన్ని సస్పెన్స్ సినిమాలకు దారి చూపెడుతుందేమో అనిపించింది.

Friday, March 9, 2012

తెలుగు పద్యాలా ? బాబోయ్!


తాజాగా మొదలైన ఈయేటి 'విద్యుత్ కోత' రోజూవారీ పనులకు చాలా ఆటంకాలను కలిగిస్తున్నా, ఒక మంచి పని మాత్రం జరుగుతోంది. ఈ విద్యుత్ కోత డిసెంబర్ పుస్తక ప్రదర్శనలో కొన్న చదవాల్సిన పుస్తకాల జాబితాను తగ్గిస్తోంది...:) ఈ బృహత్కార్యంలో భాగంగా నిన్న చదివిన ఒకానొక మంచి పుస్తకం ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి గారు రాసిన "తెలుగు పద్యాలా ? బాబోయ్ !".


అప్పుడప్పుడు నాన్న వినే "రంగస్థల పద్యాలు", శ్రీవారు వెతికి వెతికి కొనుక్కున్న గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం పద్యాలు వింటూ ఉన్నా, చిన్నప్పుడు స్కూల్లో తెలుగు పద్యం అప్పజెప్పలేకపోయినందుకు మా తెలుగు మాష్టారి బెత్తం దెబ్బ తిన్నప్పటి నుంచీ నాకు తెలుగు పద్యాలంటే భయం. తెలుగు పద్యాలంటే నిజంగానే బాబోయ్... అంటూ ఆమడ దూరం పరిగెట్టే నాలాంటివాళ్లకోసమే ఈ పుస్తకం రాసారేమో అనిపించింది. "తెలుగు వచ్చినా, తెలుగు పద్యాల జొలికి పోనివాళ్లకు, వాటిలో మజా చూపించటమే నా ఉద్దేశం....నేను తెలుగులో పద్య సాహిత్యం చదవలేదు. ఆ సాహిత్యపు సముద్రపు లోతులకెళ్ళే సామర్ధ్యం, అదృష్టం మనలో చాలమందికి లభించవు." అంటారు శ్రీనివాసశాస్త్రి గారు తన 'ముందు మాట'లో.


తాను చిన్ననాటి నుంచీ విన్న, చదివిన, నచ్చిన తెలుగు పద్యాలను ఇందులో పోందుపరిచాననీ, అందువల్ల చాలామంది ప్రసిధ్ధ కవుల పద్యాలు ఇందులో కనబడవు అని చెప్తారు శ్రీనివాసశాస్త్రి గారు. ఈ పుస్తకంలో బొమ్మలు ప్రముఖ కార్టూనిస్ట్ 'రాగతి పండరి'గారు.


డభ్భై ఏడు పేజీలు మాత్రమే ఉన్న ఈ చిన్ని పుస్తకం నాకు తెలుగు పద్యాల గురించి ఎన్నో తెలియని సంగతులు చెప్పింది. ఈ పుస్తకంలో పేరుపొందిన వేమన పద్యాలు, సుమతి శతకాలు, నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాధుడు నుంచీ గరికపాటి నరసింహారావు గారి వరకు ఎందరో ప్రముఖులు చెప్పిన ఉత్తమమైన తియ్యని తెలుగు పద్యాలు, వాటి అర్ధం చదువుతూంటే నిజంగానే పద్యసాహిత్యం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది నాకు. నాకెంతో ఆనందాన్ని ఇచ్చిన ఈ పుస్తకంలోని కొన్ని పద్యాల గురించి రాసి తీరాలనే సరదా ప్రయత్నం ఈ టపా..


1) "మృత్యుంజయ శతకం"లో మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు రాసిన ఒక పద్యం:


మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
విడతో నీకెపుడొక్కటే గుసగుసల్, వీక్షించి ఈ చంద మె
క్కడ లేనట్టుగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీచెవిన్
పడుటేలాగునో మామొరల్ తెలియ దప్పా మాకు మృత్యుంజయా !

2) "పారిజాతాపహరణం" లో నంది తిమ్మన రాసిన ఈ పద్యం చెప్తూ "సత్యభామ కృష్ణుడ్ని తన్నిందా? లేక తోసిందా అన్నది స్పష్టంగా చెప్పక, చదివేవాళ్లకొదిలేసి తమాషా చేసాడు తిమ్మన" అంటారు శ్రీనివాసశాస్త్రిగారు. ఈ కావ్యం తిమ్మన ఎందుకు రాసాడో కారణం కూడా చెప్పారు.

జలజాతాసన వాసవాది సురపుజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధ కన్నతండ్రి శిర మచ్చో వామపదంబునన్
తొలగం ద్రోచె లతాంగి, యట్లయగు, నాథుల్ నేరముల్ సేయ, బే
రలుకం చెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే.


3) పదహారవ శతాబ్దపు కవి నంది తిమ్మన కు "ముక్కు తిమ్మన" అని పేరు తెచ్చిన పద్యం:

నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి, బల్ కానన్ తపంబంది, యో
షానాసాకృతిబూని సర్వసుమన్నస్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్

పై పద్యానికి అర్ధం ఇదిట -- తుమ్మెద తనపై వాలట్లేదని సంపెంగ కోపంతో అడవిలో తపస్సు చేసిందిట. తప:ఫలంగా అందమైన అమ్మాయి ముక్కుగా అవతరించిందట. అప్పుడు రెండువైపులా తుమ్మెదలు బారులు కట్టాయట. అంటే తుమ్మెదలు అమ్మాయి కళ్ళుట. ఈ పద్యాన్ని అష్టదిగ్గజాల్లో ఒకరైన భట్టుమూర్తి డబ్బిచ్చి మరీ కొనుక్కుని, తన "వసు చరిత్ర"లో ఎక్కించాడుట.

4) కృష్ణదేవరాయలవారి అష్టదిగ్గజాల్లో ప్రముఖుడైన అల్లసాని పెద్దన మంచిరచనకు ఏ వాతావరణం కావాలో చెప్తూ ఇలా వర్ణించాడుట:

నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయల మంచ మొప్పుత
ప్పొరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖిక పాఠకోత్తముల్
దొరికిన కాక యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే !



5) ఓర్వలేనివాళ్ల ఈసడింపులకు గుర్రం జాషువా గారి జవాబుట:

గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచేత న
న్నెవిధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే?
యివ్వసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు? గంటమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్రవాణికిన్

వారిదే మరోటి:

రాజుమాణించె, నొక తార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగన మొక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు


6) తాను "ఆముక్తమాల్యద" తెలుగులో ఎందుకు రాసాడో చెప్తు శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన పద్యం:

తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.


7) శాశ్వత సత్యాలనిపించే కొన్ని సుమతీ శతకాలు:

** అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమిని వేల్పు, మొహరమున తా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు, కదరా సుమతి !

** తలనిండ విషము ఫణికిని
వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్
తలతోక యనక ఉండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !

* ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పింపక, తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ !



8) చిన్నప్పుడు చదివినవే అయినా మరోసారి చదివాకా ఆహా... అద్భుతమనిపించిన కొన్ని వేమన పద్యాలు:

** చాకి కోక లుదికి చీకాకుపడ జేసి
మైల దీసి లెస్సమడిచినట్లు
బుధ్ధి చెప్పువాడు గుద్దితే నేమయా
విశ్వదాభిరామ వినురవేమ

** చెప్పులోని రాయి,చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు, కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ

** తప్పులెన్నువారు తండోపతండమ్ము
ఉర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

శతాబ్దాల క్రితపువైనా ఇవాళ్టికి కూడా అన్వయించుకోదగ్గ తాజాతనం ఈ వేమన పద్యాలది.


9) రచయిత, జర్నలిస్టు, రాజకీయవేత్త నార్ల వెంకటేశ్వరరావుగారు చెప్పిన ఈ వాస్తవం నాకు నచ్చింది:

గుడ్లగూబ పెద్ద గుడ్లున్న దైనను
సుంతయైన వెలుగు చూడలేదు
విద్యలున్న నేమి? విజ్ఞత లేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట.


10) గరికపాటి నరసింహారావు గారి "గూగ్లీ" :

ఘనులందరు మనవరని
అనుకొన్న అదొక్క తృప్తి అఖిలజనులకున్
మన వాడే ఘనుడౌ నెడ
మనమున భరియింపలేము మాయ యిదేమో ?



పుస్తకంలో ఇంకా ఏమున్నాయంటే,

* తెలుగు భాషకు గర్వకరణమైన ఆష్టావధానాల గురించి,
* పోతన భాగవతంలో గజేంద్రమోక్షం లోని "సిరికిన్ చెప్పడు..." మొదలైన ప్రముఖ పద్యాలు,
* తిరుపతి వేంకట కవులు "పాండవోద్యోగం" నాటకానికి రాసిన మూడు ప్రముఖ పద్యాలు "బావా ఎప్పుడు వచ్చితీవు?" , "చెల్లియో చెల్లకో..", "జెండాపై కపిరాజు..."
* ఏనుగు లక్ష్మణ కవి, విశ్వనాథ మొదలైనవారి పద్యాలు, శ్రీశ్రీ, దేవులపల్లి వారి వచన కవిత్వం


చివరిగా చక్కటి గురజాడ అప్పారావుగారి పాటతో పుస్తకం ముగించటం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.

"దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేలు తలపెట్టవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేలు
కూర్చి జనులకు చూపవోయ్

స్వంతలభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్

చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయి,
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయి


అందమైన ఈ
తియ్యని తెలుగు పద్యాలన్నింటినీ చదవటమే కాక, కనీసం టైపు చేసుకునే పుణ్యమన్నా దొరికిందని మురిసిపోతున్నాను..!!


Wednesday, March 7, 2012

"Children of Heaven"


మా చిన్నప్పుడు దూరదర్శన్ లో అన్ని భారతీయ భాషా చలనచిత్రాలతో పాటూ విదేశీ భాషా చలనచిత్రాలను కూడా తరచుగా చూపెట్టేవారు. ఇతర దేశాల తాలుకూ ఎన్నో ఉత్తమ చిత్రాలను దూరదర్సన్ వల్లనే చూడగలిగాం అప్పట్లో. ఇప్పుడు రకరకాల ఛానల్స్ ఎన్నో ఉన్నా కూడా ఆ క్వాలిటి ఉన్న సినిమాలు తక్కువగా చూస్తున్నాం. నేను ఇటీవల చూసిన "Children of Heaven" అనే ఇరానియన్ ఫిల్మ్ మళ్ళీ పాత దూరదర్శన్ రోజులను గుర్తు చేసింది. అసలు ఇంత చిన్న అంశం మీద కూడా సినిమా తీయచ్చా? అని ఆశ్చర్యం వేసింది. దర్శకుడు ’Majid Majidi’ కి ఎన్నో అవార్డులను, ప్రశంసలనూ తెచ్చిపెట్టిన ఈ సినిమాకు 1998 లో దక్కాల్సిన ఆస్కార్ అవార్డ్ ను మరో Italian Film "Life Is Beautiful" చేజిక్కించేసుకుంది. ఆ సినిమా కూడా అంతటి గొప్ప సినిమానే మరి.


ఒక పేద కుటుంబం. అందులో కష్టపడే తండ్రి, చదువుకునే ఇద్దరు పిల్లలు, మూడవ కాన్పు తరువాత ఆరోగ్యరీత్యా ఇంకా కోలుకోని తల్లి. స్కూలుకెళ్ళే పిల్లలిద్దరూ అన్నాచెల్లెళ్ళు. అన్నగారు అలీ(Amir Farrokh Hashemian) ఒకరోజు చెల్లెలు జారా(Bahare Seddiqi) షూ రిపేరు చేయించి తెస్తూండగా ఒక కూరల కొట్లో ఆ షూస్ ఉన్న కవర్ మిస్సవుతుంది. రోజూ స్కూలుకి వేసుకుని వెళ్ళాల్సిన షూస్ లేకపోతే ఎలా? వెతుక్కురాకపోతే నాన్నకు చెప్పేస్తా.. అని బెదిరిస్తుంది చెల్లెల్లు. అన్న వెనక్కు వెళ్ళి ఎంత వెతికినా అవి దొరకవు. తల్లితండ్రి మాట్లాడుకుంటూ ఉండగా, హోంవర్క్ చేస్తూ అన్నాచెల్లెలూ షూస్ గురించి రహస్యంగా మాట్లాడుకునే సన్నివేశం చాలా హృద్యంగా ఉంటుంది. తండ్రి కొత్త షూస్ కొనలేడని, షూస్ పోయిన సంగతి తెలిస్తే బాధపడతాడనీ, తల్లితండ్రులకి ఆ సంగతి తెలియకుండా దాచాలని పిల్లలు చేసే ప్రయత్నం మనసుకు హత్తుకుపోతుంది. పిల్లలు ఏ మాలిన్యం అంటని స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు కాబట్టి సినిమాకు "Children of Heaven" అని పేరు పెట్టారని నాకనిపించింది.





తన షూస్ చెల్లెలు స్కూలుకి వేసుకెళ్ళి, ఆమె స్కూల్ నుంచి రాగానే తాను వాటిని వేసుకుని వెళ్ళేలా అలీ ఒప్పందం కుదుర్చుకుంటాడు చెల్లితో. రోజూ చెల్లి స్కూల్ నుంచి వచ్చేదారిలో నించోవటం, ఆమె షూస్ ఇవ్వగానే అవి వేసుకుని గబగబా పరిగెత్తుకువెళ్లటం జరుగుతూ ఉంటుంది. ఇలా తంటాలు పడుతుంటే ఒకరోజు చెల్లెలు స్కూల్ నుంచి వస్తుంటే ఒక షూ మురికికాలవలో పడిపోతుంది. కాలవ ప్రవాహంలో ఆ షూ కొట్టుకుపోయేప్పుడు వెనకాల వచ్చే నేపథ్యసంగీతం చాలా బావుంటుంది. చివరికి ఎవరో ఒక పుణ్యాత్ముడి సాయంతో షూ బయటకు తీసుకోగలుగుతుంది ఆ అమ్మాయి. స్కూలుకి లేటయిపోయిందని అన్నగారు కేకలేస్తాడు పాపం. రోజూ స్కూలుకి ఆలస్యంగా వస్తున్నాడని ప్రిన్సిపాల్ అతన్ని కోప్పడుతూంటాడు మరి.

ఒకరోజు షూస్ దుమ్ముకొట్టుకుపోతాయి. రాత్రి వాటిని ఉతికి ఆరబెడతారు పిల్లలు. కానీ ఆ రాత్రి వర్షం వచ్చి అవి సరిగ్గా ఆరవు. ఇలా జరుగుతుండగా ఒకరోజు మొక్కలకు తోటపని చేసేందుకు తండ్రి వెళుతూ పిల్లవాణ్ణి కూడా తీసుకువెళ్తాడు. పెద్దపెద్ద ఇళ్ళలో తోటలో కలుపు ఏరి, మొక్కలకు ఎరువు వేసి తోటంతా బాగుచేస్తే ఆ ఇంటివాళ్ళు కాసిని డబ్బులిస్తారన్నమాట. అలా ఇల్లిల్లూ వెతుక్కుంటూ వెళ్తే ఒక ఇంట్లో వాళ్ళు పిలిచి తోటపని చేయించుకుని డబ్బులిస్తారు. పిల్లాడి సహాయానికి తండ్రి సంతోషించటం, ఇద్దరూ సైకిల్ మీద వెళ్తూ మాట్లాడుకోవటం బావుంటుంది. చేతికి డబ్బు వచ్చిందని తండి అవీ ఇవీ కొంటానంటుంటే, "ఇవేం కాదు చెల్లి షూస్ పాతవయిపోయాయి కొత్తవి కొను నాన్నా" అంటాడు ఆ పిల్లాడు తెలివిగా. ఈ మొత్తం సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది.



ఒకరోజు తన స్కూల్లో ఒకమ్మాయి తన పోయిన షూస్ వేసుకుని ఉండటం చూసి, అన్నగారితో కలిసి ఆ పిల్లను వెంబడిస్తారు. కానీ వాళ్లది తమకన్నా దయనీయమైన స్థితి అని తెలుసుకుని నిరాశతో వెనక్కు తిరిగివెళ్పోతారు. తర్వాత స్కూలు నోటీసు బోర్డ్ లో పరుగుపందెం గురించిన ప్రకటన చూస్తాడు అన్న. దాంట్లో మూడవ బహుమతి షూస్ అని చూసి, వాటి కోసం పరుగుపందెంలో పాల్గొంటాడు. చివరికి ఏమయ్యింది? అతనికి షూస్ దక్కాయా లేదా ఓడిపోయాడా? అన్నది పతాక సన్నివేశం.



పిల్లలిద్దరు కూడా చక్కగా నటించారు. ముఖ్యంగా అలీ గా వేసిన పిల్లాడు నాకు బాగ నచ్చాడు. పాత్రకు తగ్గ హావభావాలను, పరిపక్వతను బాగా కనబరిచాడు. పిల్లలు తమ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని నడుచుకోవాలనే నీతిని కూడా ఈ సినిమా చెబుతుంది. నేపధ్యసంగీతం చాలా బావుందీ సినిమాలో. అతిచిన్న కథాంశంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఇలాంటి సినిమాలు నిరూపిస్తాయి.


ఈ సినిమా ట్రైలర్:





డా.జంపాల చౌదరి గారి రేడియో ఇంటర్వ్యూ


Rainbow FM లో "
సరదాసమయం" శీర్షిక లో ఈ Feb 21న ప్రసారమైన డా. జంపాల చౌదరి గారి రేడియో ఇంటర్వ్యూ అనుకోకుండా నేను వినటం జరిగింది. పుస్తకం.నెట్లోనూ, నవతరంగం లోనూ ప్రచురితమైన వారి వ్యాసాల ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి డా. జంపాల గారు బ్లాగ్మిత్రులకు పరిచితులే.


తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చైర్మన్, తానా ప్రచురణల కమిటీ కి చైర్మెన్, చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరి గారు ఈ ఇంటర్వ్యూలో చర్చించిన అనేక అంశాలు చాల ఆసక్తికరంగా ఇంటర్వ్యును పూర్తిగా వినేలా చేసాయి. అంతేకాక నేను మిస్సయిన మొదటిభాగాన్ని కూడా సంపాదించి వినాలనిపించింది. అడిగిన వెంఠనే ఈ కార్యక్రమం నాకు అందించిన ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమనస్పతి
రెడ్డి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


ఈ ఇంటర్వ్యూలో డా. జంపాల గారు తన స్వస్థలం, చదువు, అమెరికా, సినిమాలు, సైకియాట్రీ, సామాజిక సేవ, రాజకీయాలు, సాహిత్యం, పుస్తకాలు, పుస్తకం.నెట్, తానా కార్యకలాపాలు, భారత్-అమెరికా సంబంధాలు... మొదలైన ఎన్నో విభిన్న అంశాలను గురించి మాట్లాడారు. ఈ చర్చలో డా. జంపాల గారి మిత్రులు శ్రీ నవీన్ వాసిరెడ్డిగారు కూడా పాల్గొన్నారు. పరిచయకర్త ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమనస్పతి రెడ్డి గారు.



ఇంటర్వ్యూ మొత్తం పదకొండు bits ఉంది. వరుసగా విన్నా సరే, లేదా ఏ అంకె మీద కిక్ చేస్తే ఆ భాగం వినబడుతుంది.





డా. జంపాల చౌదరి గారి గురించి... ( పుస్తకమ్.నెట్ సహాయంతో)

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.


Monday, March 5, 2012

nostalgic with Ananda Shankar...




నాన్నకు వాద్య సంగీతం అంటే మహా ఇష్టం. మా చిన్నప్పుడూ నాన్న ఇంట్లో ఉంటే ఏదో ఒక వాద్య సంగీతం వినబడుతూ ఉండేది. సంతూర్, సితార్, వీణ, ఫ్లూట్ మొదలైనవి కాకుండా Accordion, Electric guitar, Acoustic guitar, Piano, Saxophone, Trumpet మొదలైన పాశ్చాత్య వాయిద్యాల తాలుకు కేసెట్లు కూడా కొనేవారు. అలా మాకు నాన్నవల్ల రకరకాల సంగీత వాయిద్యాలు, పాశ్చాత్య సంగీతం పట్ల కూడా ఆసక్తి పెరిగింది.

మేం చిన్నప్పుడు బాగా విన్న కేసేట్లలో ఆనందా శంకర్ వి కొన్ని. బెంగాలీ సంగీతకారుడైన ఆనందా శంకర్(1942 - 1999) ప్రఖ్యాత సితార్ వాద్యకారుడైన పండిట్ రవిశంకర్ బంధువు. భారతీయ, పాశ్చాత్య సంగీత వాయిద్యాల కలయికలతో చేసిన "Fusion music" ఆనందా శంకర్ ప్రత్యేకత. Ananda Shankar And His Music, melodies from india, Enchanting India, Shubh- The Auspicious, I REMEMBER, Temptations మొదలైన ఆల్బంస్ జనాదరణ పొందాయి.


ఆనందా శంకర్ ట్యూన్స్ విన్నప్పుడలా నాకు చిన్నప్పుడు ఇంట్లో నాన్న ఆఫీసుకి తయారవుతూనో, ఏవో పనులు చేసుకుంటూనో వింటున్న రోజులు గుర్తుకు వస్తాయి. అంతేకాక, 1970s & '80s రోజుల్లో నాన్న రేడియోలో ప్రొడ్యూస్ చేసిన సంగీత ధారావహిక కార్యక్రమం " సంగీతప్రియ"లో ఓపెనింగ్ ట్యూన్ ఆనందా శంకర్ దే. "సంగీతప్రియ శ్రోతలకు మీ రామం నమస్కారం.." అనగానే "akbar's jewels" అనే ట్యూన్ వచ్చేసేది... దీనిలో 0.24 to 0.55 వరకు సంగీతప్రియ టైటిల్ మ్యూజిక్ !



మరికొన్ని ఆనందా శంకర్ ట్యూన్స్ :


The River:




"Dancing peacocks"



light my fire




namaskar:





ఆనందా శంకర్ ను గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ:

The Artist - ఒక సృజనాత్మక ప్రయోగం




ఈ సినిమా ట్రైలర్


రెండు హాల్స్ లో రెండే షోలు, అవి కూడా టైమింగ్స్ సరిగ్గా లేని కారణంగా పదిహేను రోజులుగా వెళ్లాలనుకుంటన్నా ఓ సినిమా చూడటం కుదర్లేదు. ఈలోపూ అదృష్టవశాత్తు ఈ సినిమాకు ఐదు ఆస్కార్స్ వచ్చేసి మరో థియేటర్లో మరో షో వెయ్యటం మొదలెట్టాకా నిన్న ఆదివారం మాకు వెళ్లటం కుదిరింది. 2011 - 'Cannes International Film Festival' లో ప్రీమియర్ కాబడి, అప్పటి నుంచీ వరుసగా ఎన్నో అవార్డులను చేజిక్కించుకుంటున్న ఫ్రెంచ్ సినిమా "The Artist". ఇటీవలే ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న ఈ చిత్రానికి మరో నాలుగు విభాగాల్లో కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. ( ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, సంగీతం, కాస్ట్యూమ్స్). కేవలం ఒక ప్రయోగాత్మక చిత్రంగా ఈ సినిమా తీసిన ఫ్రెంచ్ దర్శకుడు Michel Hazanavicius కు ఒక్కసారిగా యావత్ ప్రపంచం ప్రశంసల బంగారు కిరీటం పెట్టించిన సినిమా ఇది. ఈ black & white సినిమా నిజంగా ఒక పాత తరం సినిమాను చూస్తున్నామనే భ్రమను, మాటలు అవసరం లేకుండా దర్శకుడి భావాలను ప్రేక్షకుల మనసులకు అందించే ప్రయత్నంలోనూ నూరు శాతం సఫలం అయ్యిందనే చెప్పాలి.


ఇది పూర్తిగా దర్శకుడి చిత్రం. సినిమాలో డైలాగులు లేకున్నా జరుగుతున్న కథ సులువుగా ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా సన్నివేశాలను రూపొందించారు. కాకపోతే మధ్య మధ్య కొన్ని ముఖ్యమైన డైలాగ్స్ స్లైడ్స్ లాగ(చార్లి చాప్లిన్ సినిమాల్లో లాగ) చూపెట్టారు. కొన్ని సన్నివేశాల్లో ఇవి అనవసరం అనిపించాయి కూడా. డైలాగులు లేవు కాబట్టి చిత్రం అంతా నటీనటుల హావభావలపై నడుస్తుంది. తెరపై ఎక్కువగా కనబడ్డ హీరో, హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యుత్తమ నటన కనబరిచారు. జార్జ్ పాత్ర వేసిన ఫ్రెంచ్ నటుడు Jean Dujardin ఆస్కార్ నే కాక, 2011 ప్రీమియర్ తోటే Cannes Film Festival లో తన నటనకు గానూ Palme d'Or (Golden Palm) అవార్డ్ దక్కించుకున్నాడు. ప్రముఖ మూకీ చిత్ర హీరోగా, ఆ తర్వాత ఓటనిమి అంగీకరించలేని అహంకారాన్ని, అంతలోనే నిస్సహాయతనూ, పెప్పీ పై అభిమానాన్నీ, సాటి నటిగా ఆమెలోని ప్రతిభను మెచ్చుకునే నటుడిగా అతడు కనబరిచిన హావభావాలు బాగా ఆకట్టుకుంటాయి. పెప్పీగా నటించిన ఫ్రెంచ్ నటి "బెరెనిస్ బిజో" (ఈ సినిమా దర్శకుడి భార్య) కూడా ఉత్తమ అభినయాన్ని కనబరిచింది. డాన్సర్స్ లో ఒకతెగా అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు కావల్సిన సహజత్వాన్ని, తరువాత ప్రముఖ నటి అయ్యాకా అవసరమైన హుందాతనాన్నీ రెండిటినీ సమపాళ్ళలో తన నటనలో చూపెట్టింది.


హాల్లో ఈ సినిమా మొదలవగానే నాకు మొట్టమొదట గుర్తుకొచ్చిన వ్యక్తి "సింగీతం శ్రీనివాసరావు". చెప్పదలుచుకున్న సందేశాన్ని వ్యక్తపరచటానికి భాష, మాటలు ఏదీ అవసరం లేదు... అనే ఉద్దేశంతో సృజనాత్మక ప్రయోగంగా "పుష్పక విమాన"మనే మూకీ చిత్రాన్ని పదిహేనేళ్ల క్రితమే తీసి, అదే 'Cannes International Film Festival' లో అందరి ప్రశంసలు పొందారు 'సింగీతం' గారు. ఇది colour లో తీసిన ఒక social satire. "The Artist" సినిమా పూర్తిగా నలుపు తెలుపుల్లో చిత్రీకరించిన ఒక నటుడి జీవితకథ.1927 లోని మూకీ చిత్రాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడి నటజీవితం ఎలా, ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఈ చిత్ర కథాంశం. కేవలం ముఫ్ఫై ఐదు రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలా తీసారో, ఏ ఏ విధానలను వాడారో ఈ వికీ లింక్ లో చదివి తెలుసుకోవచ్చు.


ఈ చిత్రం గురించి చెప్పుకునేప్పుడు దర్శక నటీనటులతో పాటూ తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో వ్యక్తి సంగీత దర్శకుడు. డైలాగులు లేని ఈ సినిమాకు ప్రాణం సంగీతమే. ప్రతి సన్నివేశానికీ అనుగుణమైన, భావవ్యక్తీకరణకు అవసరమైన సంగీతాన్ని అందించటంలో ఫ్రెంచ్ స్వరకర్త Ludovic Bource సఫలీకృతుడయ్యడు.



1927 లోని మూకీ చిత్రాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడి నటజీవితం ఎలా, ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఈ చిత్ర కథాంశం. కథాసమయం ఐదారేళ్ళు. జార్జ్ వేలెంటిన్ ఒక ప్రముఖ మూకీ చిత్ర నటుడు. డైలాగులు ఉండే మాట్లాడే సినిమాల నిర్మాణం మొదలవ్వగానే జార్జ్ వెలుగు తగ్గిపోతుంది. పంతంతో అతడు తన ఆస్తంతా పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా నష్టపోతుంది. ఆస్తిని, ఇంటిని, పేరుప్రతిష్ఠలనూ అన్నింటినీ పోగొట్టుకున్న అతనితో గొడవపడి అతని భార్య కూడా విడిపోతుంది. తన విలువైన సామానులను సైతం వేలం వేసుకుని అంత గొప్ప నటుడూ వీధినపడతాడు. అతనిని అభిమానించే 'పెప్పీ మిల్లర్' అనే ఒక సాధారణ డాన్సర్ అంచలంచలుగా ప్రముఖ నటి స్థాయికి ఎదుగుతుంది. మొదట్లో తనను ఆదరించిన జార్జ్ కు ఆమె ఏ విధంగా సహాయపడింది అనేది మిగిలిన కథ. కొంతవరకూ ఈ సినిమా గురుదత్ తీసిన "కాగజ్ కే ఫూల్" సినిమాను గుర్తుకు తెస్తుంది.



సినిమాలో నాకు అందరికన్న బాగా నచ్చినది హీరో పెంపుడు కుక్క. ఆత్మహత్యకు పాల్పడుతున్నప్పుడు తన యజమానిని రక్షించుకోవాలనే తపనతో పరిగెత్తుకువెళ్ళి వీధిలో కనబడ్డ పోలీసాఫీసరును తీసుకువచ్చే సీన్ కళ్ళ నీళ్ళు తెప్పించింది. మనుషులకు లేని విశ్వాసం, ప్రేమ పెంపుడు జంతువుల్లో ఉంటాయి. వాటికి మనిషి డబ్బుతో గానీ, పరపతితో గాని పనిలేదు అని ఈ సన్నివేశం చెప్తుంది. మరి కొన్ని సన్నివేశాల్లో.. ఈ పెంపుడు కుక్కతో కూడా ఎంత చక్కగా నటింపజేసాడీ దర్శకుడు అనిపించింది.


ఇక గుర్తుండిపోయే సన్నివేశాల గురించి చెప్పాలంటే,

* సినిమా మొదట్లో సెట్స్ లో తెర వెనుక ఉన్నదెవరో ఒకరికొకరికి తెలీకుండా హీరోహీరోయిన్లు చేసే టాప్ డాన్స్ సీన్ చాలా నచ్చింది నాకు.

* తర్వాత జర్జ్ కోట్ లో చెయ్యిపెట్టి పెప్పీ చేసిన అభినయం,

* "నువ్వు గొప్ప నటివి అవ్వాలంటే అందరికన్న విభిన్నమైనదేదైనా నీలో ఉండాలి.." అంటూ ఆమె పై పెదవిపై ఒక బ్యూటీ స్పాట్ పెట్టే దృశ్యం,

* పెప్పీ గొప్ప నటిగా మారే విధానాన్ని టైటిల్స్ ద్వారా చూపెట్టడం (చివరిలో ఉండే పేరు నెమ్మది నెమ్మదిగా మైన్ టైటిల్స్ లోకి మారినట్లుగా చూపెట్టడం)

*  నలుగురైదుగురు మాత్రమే ఉన్న హాల్లో  తాను కూర్చుని ఫ్లాప్ అయిన జార్జ్ తీసిన సినిమాను చూసి పెప్పీ కంటతడిపెట్టే సన్నివేశం,

* పెంపుడు కుక్క జార్జ్ ని రక్షించటం

* తాను వేలం వేసిన తన వస్తువులను పెప్పీ ఇంట్లో జార్జ్ చూసే సన్నివేశం

* బజార్లో షాపులో సేల్ కు ఉన్న కోటును బయట నుంచుని అద్దంలోంచి చూసుకునే దృశ్యం

* చివర్లో ఇద్దరు కలిసి టాప్ డాన్స్ చేసే సన్నివేశం

ఈ చివరి దృశ్యంలో నిజంగా వాళ్ళిద్దరి కళ్ళలో ఉన్న ఆనందం మన కళ్ళలో,మనసులో కూడా నిలిచిపోతుంది. అది ఇద్దరు నటులు తమ గెలుపును చూసుకునే ఆనందం.



అద్బుతమైన సినిమా అనను కానీ సినిమా అమ్టే ఇష్టం ఉన్నవారంతా చూసి తీరాల్సిన చాలా మంచి సినిమా ఇది. ఇటువంటి మంచి సినిమాలను మల్టిప్లెక్సులకు, ఒకటి రెండు షో లకూ పరిమితం చేయటం మంచి సినిమాలకు సామాన్య ప్రేక్షకుడికి దూరం చేయటమే అవుతుంది !