సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, July 31, 2011

"రఫీ" ని గుర్తుచేసుకుందామని..




"चैदावी का चाँद हो..या आफताब हो..
जो भी हो तुम खुदा की कसम ला जवाब हो.."



"क्या हुआ तेरा वादा..वो कसम वो इरादा..
भूलोगी तुम जिसदिन मुझे
वो दिन ज़िन्दाजी का आखरी दिन होगा "



"दिल के झरोकोमें तुझको बिठाकर.."


"याहू...चाहे कोयी मुझे जंगली कहे..
एहसान तेरा होगा मुझ पर
दिल चाहता है वो कहने दो.."



"मैं गाऊ तुम सो जावो
सुख सपनोमें खो जावो.."



"मन रे तू काहे न धीर धरे
तू निर्मोही मोह न जाने..."



"तुम जो मिल गए हो...
तो ये लगता है ये जहा मिल गया.."



"ये दुनिया अगर मिल भी जाए तो क्या है..
जिन्हें नाज़ है हिंद पर वो कहा है..
कहा है कहा है कहा है.."



"लिखे जो ख़त तुझे जो तेरी याद में
हज़ार रंग के नज़ारे बन गए.."

ఇవాళ తన వర్ధంతి అని "రఫీ" ని గుర్తుచేసుకుందామని పొద్దున్నుంచి అనుకుంటే ఇప్పటికి కుదిరింది. ప్రస్తుతానికి ఇవే గుర్తుకొస్తున్నాయి.. "హందోనో" సినిమాలోవి పాటలు చాలా బావుంటాయి....రఫీ పాడిన మరో రెండు పాటలు బావుంటాయి. ఒకటి 'में ज़िंदगी का साथ निभाता चला गया', "अभी ना जाऑ छोड कर, के दिल अभी भरा नही.." రెండు చాలా బావుంటాయి. अभी ना जाऑ పాట తరువాత వచ్చే "जहा में ऐसा कौन है.. के जिसको गम  मिला नही..." కూడా చాలా బావుంటుంది.



"अभी ना जावो  छोड कर.." ఒక్కటి ఇక్కడ క్రిందన చూసేయండి..


 






Thursday, July 28, 2011

స్ఫూర్తి

(looking at the brighter side)




మేం ఈ ఇంట్లోకి వచ్చి ఆర్నెల్లు దాటింది. వచ్చినప్పటినుంచీ ఆమెను గమనిస్తున్నాను. ఆమె మా ఇంటి ఎదురుగా చిన్న బడ్డి కొట్టు నడిపే ముసలమ్మ. వయసు ఖచ్చితంగా అరవైకి పైనే. పొద్దున్నే ఆరింటికల్లా కొట్టు తెరిచేస్తుంది. రాత్రి పది,పదిన్నర దాకా తెరిచే ఉంటుంది కొట్టు. మధ్యాన్నం ఓ రెండు గంటలు సేపు మూసేస్తుంది. మా చిన్నప్పుడు బడ్డీ కొట్టు అంటే ఏవో ఓ పది గాజు సీసాలతో పదిరకాల చాక్లెట్లు అమ్మే చిన్న కొట్టు. అంతే . కానీ ఇప్పుడు బడ్డీ కొట్లు కూడా మినీ పచారీ కొట్లు అయిపోయాయి. అర్ధరూపాయి కి రెండు చాక్లేట్ల దగ్గార నుంచీ సర్ఫు పౌడర్లు,బ్రెడ్,పావ్ ల వరకూ అందులో దొరకని వస్తువు ఉండట్లేదు. మా ఇంటెదురు ముసలమ్మ కూడా ఇవన్నీ అమ్ముతుంది. ఎవరు సాయానికి ఉండరు. ఒక్కర్తి ఉంటుంది రాత్రి పూటలు ఒక కిరోసిన్ దీపం పెట్టుకుని . ఆమెకు సాయం ఒక చిన్న ట్రాన్సిస్టర్. అటుగా వెళ్ళే వాళ్ళు సిగరెట్ల కోసం మో, మరేదైనా చిన్న వస్తువు కోసమో రాత్రిళ్ళు అక్కడ ఆగుతూ ఉంటారు. పాలు కూడా అమ్ముతుంది. ఒకరోజు పాలు ఉన్నాయా అంటే ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్లోంచి తెచ్చి ఇచ్చింది. షాంపు పేకెట్లు, చిన్న చిన్న సర్ఫ్ సేచేట్లు..ఇలా చాలా ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి. ముసలమ్మా ఎంత కష్టంలో ఉందో ఇలా కష్టపడుతోంది అనుకునేదాన్ని .

పక్క సందులోనే వాళ్ళ ఇల్లు. కొన్నాళ్ళకు అదే ఆమె సొంత ఇల్లు అని తెలిసి మరింత ఆశ్చర్యపోయాను. డాబా ఇల్లే.అద్దెకు కూడా ఇచ్చిందిట. ఇంతే కాకా సాయంత్రాలు కొట్టు ముందర కుర్చుని ప్లాస్టిక్ బుట్టలు, చాపలు అల్లుతూ ఉంటుంది. ఆమె ఓపికకు నిజంగా అబ్బురం కలుగుతుంది. లేక కాదు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక సంపాదన చెయ్యాలి అనే ఆలోచన అన్నమాట ఆమెది .

*** **** ****
మా పక్క సందులో ఒక చిన్న టిఫిన్ సెంటర్. భార్యాభర్తలిద్దరూ ఇద్దరే నడుపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక ముసలివాడు పని చేస్తూ ఉంటాడు. అతనికి అరవైఐదు పైనే ఉంటాయి. ముస్సలిగా కనబడుతు ఉంటాడు. అటుగా వీధిలో వెళ్తుంటే అక్కడ పని చేస్తూ కనిపిస్తాడు. కప్పులు,ప్లేట్లు కడుగుతాడు. అంట్లు తోముతాడు. వాకిలి చిమ్ముతాడు. ఆ చిన్నపాటి టిఫిన్ సెంటర్ కు అతడే సర్వరు,క్లినారు అన్నమాట. ఎండనక,వాననకా పని చేస్తూనే ఉంటాడు. మొన్నటి ఎండా కాలంలో మందుటెండలో బయట కుర్చుని అంట్లు తోముతున్న ఆ ముసలివాడిని చూస్తే బాధ కలిగేది. ఎంత అవసరం ఉంటే ఇలా కష్టపడతాడు అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడేమో వానల్లో పని చేస్తున్నాడు. అమ్మో ఇది చెయ్యలేనేమో...ఇలా వెళ్ళలేనేమో.. అనుకున్నప్పుడల్లా ఈ ముసలతనే గుర్తు వస్తాడు నాకు. అంత వయసుమీరినవాడు కష్టపడగా లేనిది నేను చెయ్యలేనా అనుకుంటాను మళ్లీ.

*** *** ***



వీళ్లిద్దరిని చూస్తే నాకు విజయవాడలో మా క్వార్టర్స్ లో ఆకుకూరలు అమ్మటానికి వచ్చే ముసలమ్మా గుర్తుకు వస్తుంది. చర్మం మడతలు పడిపోయి , నడుం వంగిపోయిన ఒక ముసలమ్మా తలపై వెదురుబుట్ట నిండా ఆకుకూరలు పెట్టుకుని వాటిపై తడిబట్ట కప్పి తెచ్చేది. 'నానా కాస్త చెయ్యి వెయ్యమ్మా..' అంటే బుట్ట దింపేదాన్ని నేను. ఫ్రెష్గా లేకపోయినా ఏదో ఒకటి కొనకుండా అమ్మ పంపేది కాదు ఆ ముసలమ్మని. ఎందుకే బాలేకపోయినా కొంటావు అంటే..'అంత కష్టపడి ఎండనకా వాననకా అమ్ముకుంటోంది...ఏదో ఓకటి తీసుకుంటే ఆమెకీ తృప్తి..' అనేది అమ్మ. కొన్ని రోజులు కనబడేది కాదు.ఏమయ్యావు అనడిగితే 'పానం బాలేదమ్మా..' అనేది పాపం.

వయసుమీరాకా ఇంత కష్టం పడాలంటే నిజంగా మనం పడగలమా అనిపిస్తుంది ఆలోచిస్తే.. జీవనభృతి కోసమో,అవసరార్ధమో ఇలా అమ్ముకునేవాళ్ళు కొందరైతే, వయసు మీరినా ఏదో ఒక సంపాదన ఉండాలనుకునే మా ఎదురుగా ఉండే బడ్డీకొట్టు ముసలమ్మలు కొందరు. కారణం ఏదైనా మనం ఇలాంటి వాళ్ళ నుండి పొందాల్సిన స్ఫూర్తి ఎంతో ఉంది అనిపిస్తుంది నాకు.

Wednesday, July 27, 2011

'కృష్ణ దర్శనం', 'కృష్ణ ప్రియ' ... 'మరల తెలుపనా ప్రియా'




ఇవాళ గాయని 'చిత్ర' పుట్టినరోజు. ఈ రోజున తను పాడిన మంచి ఆల్బమ్స్ రెండిటిని గుర్తు చేసుకుందామని..

కృష్ణుడిపై 'కృష్ణ దర్శనం' అనీ , 'కృష్ణ ప్రియ' అని రెండు భక్తి గీతాల ఆల్బమ్స్ చేసారు. రెండిటిలోనూ అన్నీ చిత్ర పాడినవే. రెండు ఆల్బమ్స్ కూడా చాలా బావుంటాయి .ముఖ్యంగా నాకు 'కృష్ణ దర్శనం' బాగా నచ్చుతుంది. క్లాసికల్ బేస్ తో సాగే భక్తీ గీతాలు. అందులో

* హే గోవింద హే గోపాల
* జగదోధ్ధారణ
* కల్యాణ గోపాలం
* కృష్ణా నీ బేగనే
* స్మరవారంవారం

మొదలైనవి చాలా బాగుంటాయి. చిత్ర పాడినవా అని ఆశ్చర్యం కలిగేలాగా. ఈ ఆల్బం లింక్ దొరకలేదు.

ఇక రెండవ ఆల్బం "కృష్ణ ప్రియ" లో కూడా మంచి పాటలు ఉన్నాయి.

* హరినారాయణ గోవింద
* పవనగురు
* కురయోన్రుం ఇల్లై
* కృష్ణా నీ బేగనే
* మాయా గోపబాలం
* నారాయణం భజే నారాయణంపవన గురు
* రాధికా కృష్ణా
* రతిసుఖసార

మొదలైనవి . చివరివి రెండు అష్టపదులు. ఈ ఆల్బం లింక్ దొరికింది. ఆసక్తి ఉన్నవాళ్ళు క్రింది లింక్ లో పాటలు వినవచ్చు..


***   ***   *** 

చిత్ర పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకు బాగా నచ్చేది 'స్వయంవరం' సినిమాలోని 'మరలా తెలుపనా ప్రియా' పాట. భువనచంద్ర సాహిత్యంలో వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చిన ఈ పాట లో సంగీత ,సాహిత్య,గాత్ర సౌరభాలు మూడు సమపాళ్ళలో కలిసిపోయి ఎన్నిసార్లు విన్నా మధురంగానే ఉంటుంది పాట.

Tuesday, July 26, 2011

ये आइने से ( Hariharan's ghazal)



song: ये आइने से
Singer: Hariharan
Album: Kaash

Lyrics:

ये आइने से अकेले मै गुफ्थ्गु  क्या हैं  
जो मै नही हू फिर तेरे रूबरू क्या हैं (ये आइने)

इसी उम्मीद पे काटी है ज़िंदगी मै ने(2)
वो काश पूछते मुझसे के आर्ज़ू क्या है(2)
जो मै नही हू ..फिर तेरे रूबरू क्या है


ये रंग गुल ये शफक और ये ताबिशे  अंजुम (2)
तेरे जमाल नही है तो चार्ज़ू क्या है(2)
जो मै नही हू फिर तेरे रूबरू क्या है(ये आइने)


क्यों  उनके  सामने तुम दिल कि बात करते  हो (2)
जो खुद समझ्ते नही दिल की आबुरू क्या है(2)
जो मै नही हू फिर तेरे रूबरू क्या है

ये आइने से अकेले मैन गुफ्थ्गू क्या है
गुफ्थ्गु क्या है ...गुफ्थ्गु  क्या है
ये आइने से अकेले मै गुफ्थ्गू क्या है ..

Monday, July 25, 2011

అవును నిజం -- 'ज़िन्दगी न मिलेगी दुबारा'


जब जब दर्द का बादल छाया ,
जब ग़म का साया लहराया ,
जब आंसू पलकों तक आया ,
जब यह तनहा दिल घबराया ,
हमने दिल को यह संजय ,
दिल आखिर तू क्यूँ रोता हैं ?
दुनिया में यूँ ही होता हैं .
यह जो गेहेरे(deep) सन्नाटे(silence ) हैं ,
वक़्त ने सबको ही बाटे हैं ,
थोडा ग़म हैं सबका पिस्सा(plenty ) ,
थोड़ी धूप हैं सबका हिस्सा(share),
आग तेरी बेकार ही नम हैं ,
हर पल एक नया मौसम हैं ,
क्यूँ तू ऐसे पल खोता हैं ?
दिल आखिर तू क्यूँ रोता हैं ?
(-- javed akhtar from 'ज़िन्दगी न मिलेगी दुबारा' )

ఎంత గొప్ప ఫిలాసఫి ఇది...మనసా ఎందుకు నువ్వు దు:ఖిస్తావు? జీవనవిధానం ఇంతే. కష్ట నష్టాలు అందరికి సమానంగానే పంచింది కాలం. ప్రతిక్షణం ఒక కొత్త ఋతువు అనుకుని ప్రతి క్షణాన్ని జీవించు . కష్టాన్ని చూస్తూ దు:ఖించకు అని పైన రాసిన కవితకు అర్ధం. నిన్న చూసిన ఈ సినిమా మైకం నుండి నేను ఇంకా తేరుకోలేదు...జగ్జీత్ సింగ్ లాగ में नशे में हूँ ...అని పాడాలని ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఇది ఒకటి అని గాట్టిగా చెప్పగలిగిన మరో సినిమా 'ज़िन्दगी न मिलेगी दुबारा'.

నేను ఈ సినిమా కోసం ఎదురు చూడటానికి , చూడటానికి కారణం మూడు కారణాలు - hrithik , hrithik , hrithik :))
కానీ సినిమా చూసాకా మొత్తం అందరు నటీనటుల పట్లా, మొత్తం సినిమా crew పట్ల అభిమానం పొంగి పొర్లింది. అంత బాగా చేసారు అందరూ. ముఖ్యంగా శంకర్-ఎహ్సాన్-లాయ్ చేసిన నేపథ్య సంగీతం సినిమా మూడ్ ను బాగా ప్రాజెక్ట్ చేసింది. ఇక ఫోటోగ్రఫి , లోకేషన్స్ అయితే సినిమాకే హైలైట్స్ అని చెప్పాలి. నేను గత ఏడాదిగా నేర్చుకుని ఆచరిస్తున్న జీవిత సత్యాన్ని ఈ సినిమా మరోసారి నాకు చూపెట్టింది. "ఈ రోజు మాత్రమే నీది..జీవితాన్ని ప్రతి క్షణం జీవించు..." ఇది ఈ సినిమాలో చూపెట్టిన ఫిలాసఫి. ముగ్గురు స్నేహితులు తమ తమ జీవితాలను కొత్తగా ఎలా చూడటం మొదలుపెడతారో, అతర్లీనo గా తమలో ఉన్న భయాలను ఎలా తొలగించుకుంటారో వైవిధ్యమైన కథనంతో గా చూపెట్టింది దర్శకురాలు జోయా అఖ్తర్ . కాలేజీ రోజుల్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం సాహసవంతమైన రోడ్ ట్రిప్ కు Spain బయల్దేరుతారు ముగ్గురు స్నేహితులు ఇర్ఫాన్,కబీర్,అర్జున్. ఈ సినిమాలో చూపెట్టిన Spain అందాలు Spain టూరిజంను పెంచుతాయనటం అతిశయోక్తి కాదు.




'నలభై తర్వాత రిటైరై జీవితాన్ని ఆస్వాదిస్తాను' అని అర్జున్ అన్నప్పుడు , 'నలభై తర్వాత నువ్వు జీవించే ఉంటావని నమ్మకం ఏమిటి? ఈ క్షణాన్ని జీవించటం నేర్చుకో ' అంటుంది లైలా. లైలా మాటల వల్ల,స్నేహం వల్ల జీవితాన్ని కొత్త కోణంలోంచి చూడటం మొదలు పెడతాడు అర్జున్. అనుకోకుండా జరిగిన నిశ్చితార్ధం వల్ల నటాషా తో పెళ్లి కుదుర్చుకున్న కబీర్ నెమ్మదిగా తమ ఇద్దరి మధ్యన ఉన్న వైరుధ్యాలను తెలుసుకుంటాడు. విభిన్న దృక్పదాల మధ్యన తమ వైవాహిక జీవితం సుఖమయంగా ఉండదన్న సత్యాన్ని గ్రహించి పెళ్లిని రద్దు చేసుకోవటానికి నిర్ణయింఛుకుంటాడు కబీర్. ఒక బంధం బలపడటానికి , జీవితాంతం నిలవటానికి ఇద్దరి మధ్యన "నమ్మకం" ఎంత ముఖ్యమైనదో చెప్తుంది వీరిద్దరి కథ. జీవితంలో ఒక్కసారన్నా తండ్రిని కలుసుకోవాలన్న ఆరాటాన్ని తీర్చుకుని, తల్లి ఎందుకు తనని తండ్రి నుంచి దూరంగా ఉంచిందో అర్ధం చేసుకుంటాడు ఇర్ఫాన్.


మొదటి సినిమా 'dil chahta hai' తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ "ఫరాన్ అఖ్తర్", తానూ మంచి నటుడిని కుడా అని "rock on " సినిమాలో నటన ద్వారా నిరూపించుకున్నాడు. తన మొదటి సినిమా "
सॊचा ना था" తో తన సత్తా చూపెట్టిన abhay Deol ,చెప్పుకోదగ్గ సినిమాల్లేకపోయినా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గని హ్రితిక్ రోషన్.... ఈ ముగ్గురి నటన సినిమాకు ఊపిరి. కత్రినా పాత్ర కూడా గుర్తుండిపోతుంది. కత్రినాలో కుడా ఒక మంచి నటిని మళ్లీ ఈ సినిమాలో చూస్తాము. దీప్తి నావెల్ ను చాలా రోజుల తరువాత స్క్రీన్ మీద చూశాకా 'కథ ' మొదలైన పాత సినిమాలు గుర్తుకొచ్చాయి. నసీరుద్దీన్ పాత్ర చిన్నదైనా కీలకమైనది. "మనస్ఫూర్తిగా మనసుతో చెప్పగలిగినప్పుడు మాత్రమే క్షమాపణ చెప్పు" అన్న అర్జున్ డైలాగ్ చాలా నచ్చింది నాకు. సినిమాలో వాడుకున్న జావేద్ అఖ్తర్ పొయిట్రీ నాకు భలే నచ్చేసింది.ముఖ్యంగా టపా మొదట్లో రాసినదీ,సినిమా ఆఖరులో వచ్చిన కవితా చాలా బాగున్నాయి.



'లా టమాటినా ఫెస్టివల్' సీన్ షూట్ చెయ్యటానికి కోసం బోలెడు టన్నుల టమాటాలు పోర్చుగల్ నుండి తెప్పించారుట.డీప్ సీ డైవింగ్, స్కై డైవింగ్, బుల్ రన్ మూడు కుడా చాలా సాహసోపేతంగా, ఉత్సాహభరితంగా ఉన్నాయి. సినిమా కొద్దిగా స్లోగా ఉన్న మాట వాస్తవమే కానీ కొత్తసినిమాల్లోని స్పీడ్ కి అలవాటు పడిపోయిన మనకి డిటైల్డ్ షాట్స్ బోర్ గా అనిపిస్తాయి అంతే. కొన్ని పాత సినిమాలు చూసేప్పుడు ఏమిటి వీళ్ళు డైలాగ్స్ ఇంత స్లోగా చెప్తున్నారు.షాట్స్ ఇంత స్లోగా ఉన్నాయి అనిపిస్తుంది. అది కొత్త సినిమాల్లో ఉన్న స్పీడ్ ప్రభావం. పాతలన్నిమ్తిలో నాకు "సెనోరిటా' పాట బాగా నచ్చింది . అ పాటని ముగ్గురు హీరోలు సొంత వాయిసెస్ లో పాట్టం స్పెషాలిటి. సినిమా మొత్తం ఆవరించి ఉన్న 'లైవ్లీనెస్ ' నాకు బాగా నచ్చింది. సినిమా చివరలో దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ గురించిన సీన్ చాలా బాగుంది. కబీర్ ప్రాక్టికల్ జోక్స్, ఇర్ఫాన్ డైలాగ్స్ అన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

సినిమాలో వెస్ట్రన్ ప్రభావం మాత్రం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. సినిమాను ఫారినర్స్ కోసం తీశారా అన్నట్లు భారతీయ విలువలను అతిక్రమించిన సన్నివేశాలను నా సాంప్రదాయపు మనసు ఒప్పలేదు. ప్రస్తుత ప్రపంచం , జీవన విధానం అలానే ఉన్నాయేమో..కానీ సున్నితమయిన మానవ సంబంధాలను ప్రభావవంతంగా తెరకెక్కించిన తరువాత ఇలాంటి సన్నివేశాలు అవసరమా అనిపించాయి. ఏదేమైనా మొత్తం మీద నన్ను ఎ మాత్రం నిరాశపరచలేదు సినిమా. చూసి ఇరవై నాలుగ్గంటలైనా ఇంకా సినిమా మత్తులోనే ఊగిసలాడుతున్న..!! ఔను నిజం..జీవితం మళ్ళీ దొరకదు.. !


Saturday, July 23, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం -3 (last part)



పై ఫోటో లోది గుడి వెనుక ఉన్న గోదావరి పాయ.ప్రస్తుతం ఇందులో నీళ్ళు లేవు.అక్కడ గుడి వెనుక వైపు ఒక పెద్ద పొగడ పూల చెట్టు ఉంది. భలే చక్కటి సువాసన వస్తుంది చెట్టు దగ్గరగా వెళ్తే. చిన్నప్పుడు పొగడపూలతో దండ కట్టడం గుర్తు వచ్చింది.
  
జ్యోతిర్లింగ దర్శనం అయ్యి బయటకు వచ్చాకా ఆదివారం రాత్రికి ఉన్న టికెట్ల స్టేటస్ కనుక్కుంటే కంఫర్మ్ అవ్వలేదని తెలిసింది. ఇక అవి కాన్సిల్ చేయించేసాం.శిరిడి వెనక్కు వెళ్ళిపోయి రాత్రికి ఏదైనా బస్సు ఎక్కేయాలని శ్రీవారి ఆలోచన. నాకేమో బ్రహ్మగిరి ఎక్కి గోడావరి జన్మస్థలాన్ని చూడాలని కోరిక. ఎలానూ టికెట్లు కాన్సిల్ చేయించాం కదా రేపటికి రైలుకు తికెట్లు కొనుక్కుందాం.గోదావరి ఒడ్డున పుట్టినదాన్ని, ఇంత దూరం వచ్చి గోదావరి జన్మస్థలం చూడకపోతే ఎలా?ఇవాళ ఇక్కడ,నాసిక్ చూసుకుని వెళ్దాం అని నేను జోరిగలా పోరేసాను.  నా పోరు పడలేక సరే అనేసారు తను.కానీ 750 మెట్లుట...పాపతో 'బ్రహ్మగిరి ' ఎక్కడం కుదరదు.వేరే దారేదన్నా ఉంటే వెళ్దాం అన్నారు. కనుక్కుంటే ఆటోలు వెళ్తాయని చెప్పారు.  ఒక ఆటోఅబ్బాయి కుదిరాడు వెంఠనే.గంటలో వెళ్ళొచ్చేయచ్చు అన్నాడు. అదృష్టవశాత్తూ  మేం ఆటో ఎక్కాకా వాన మొదలైంది. అదిగో అదే మీరు చేరాల్సిన కొండ అని దూరంగా ఒక కొండ చూపెట్టాడు.
బ్రహ్మగిరి కొండ
ఆటోకు రెండువైపులా తలుపులు ఉన్నాయి వాన పడకుండా. జోరుగా వర్షం కురుస్తుంటే జల్లులు ఆటో లోపలికి వస్తుంటే సగం సగం తడుస్తూ ఆటోలో కొండ మీదకు వెళ్ళటం ఒక ఆనందకరమైన అనుభవం. అప్పటికీ మా గొడుగును తెరిచి వానజల్లుకి అడ్డంగా పెట్టుకున్నాం కూడా. సగం దూరం వెళ్ళాకా ఇక వెళ్లదని ఆటో ఆపేసాడు.
కచ్చా రోడ్డు మీడ ఐదు నిమిషాలు నడిచాకా మెట్లదారి వచ్చింది. అక్కడ నుంచి ఓ ఏభై మెట్లు ఉంటాయి పైకి.మెట్ల దాకా వెళ్ళే కాలిబాట ఎంత బాగుందంటే చెప్పలేను. ఆ ప్రకృతి అందాలు చూసి తీరవలసిందే. అక్కడ ఓ పాడుబడ్డ ఇల్లు ఉంది.ఎవరుండేవారో అందులో..పక్కగా క్రిందుగా ఒక చిన్న కొలను ఉంది.లోపలి నీళ్ళు చాలా క్లియర్గా...ఎంత బాగుందో  కొలను. క్రిందకు దిగుదాం అనుకున్నాం కానీ మాతో వచ్చిన ఆటోవాలా పాకుడు ఉంటుంది మెట్ల మీద జారతారు..దిగవద్దన్నాడు. చాలా స్టీప్ గా ఉన్నసుమారు ఓ ఏభైమెట్లు ఎక్కాకా ఉండి గోదావరి నది జన్మస్థలం. ఎన్నాళ్ళ కోరికో...అసలు చూస్తానని అనుకోలేదు ఎప్పుడూ..!ఒక అలౌకిక ఆనందం...మనసులో ఉప్పొంగింది.చిన్నప్పటి నుండీ గోదావరి అంటే ఎంతో ప్రేమ.ఇవాళ ఈ జన్మస్థలాన్ని చూస్తూంటే ఏదో చెప్పలేని పులకింత.గోదావరి ఒడ్డున పుట్టినందుకేనేమో మరి..!!   
ఒక రాతిగోముఖం నుండి సన్నగా జారుతోంది నీరు.అదే గోదావరి జన్మస్థలంట.ఇలాంటిదే మరో ద్వారం ఉందిట మరో వైపు. కొండపై రెండు ద్వారాలన్నమాట గోదారికి.
ఈ గోముఖంలోంచే గోదావరి ప్రవహించేది..
 దారిలో రాళ్లపైనుండి జల్లులు జల్లులుగా నీరు పడుతూనే ఉంది. అక్కడ ఉన్న పూజారి మాతో చిన్నపాటి పూజ చేయించి దక్షిణా అడిగాడు. ఏదో నామకహా చేయించినా ఆ పూజ నాకు నచ్చింది.గోదారితల్లికి ఓ నమస్కారం.అంటే.కానీ పూజారి ఇంత ఇవ్వండీ అని ఫిక్స్డ్ దక్షిణ అడగటం నచ్చలేదు నాకు.. మరి వాళ్ళ భుక్తి వాళ్ళది అని సరెపెట్టుకోవాలంటే. మళ్ళీ తిరిగి అదే దారిలో కొండ క్రిండకి వచ్చేసాం.నాలుగేళ్ల క్రితం వరకూవరకూ ఈ రోడ్డుదారి ఉండేది కాదుట. అప్పుడూ పైకి ఎక్కలేనివాళ్ళు పల్లకీలాంటి ఉట్టె బుట్టలలో కూర్చుని మనుషులతో మొయ్యించుకుంటూ పైకి వెళ్ళేవారుట.క్రింద ఫోటోలో ఆ పల్లకీలాంటిది ..
కొండపైకి ఎక్కలేని మనుషులను తీసుకువెళ్ళేండుకు వాడే పల్లకీ బుట్ట

మేము పైకెళ్ళి దిగేదాకా వర్షం మొదలౌతూ,ఆగుతూ,పడుతూ మమ్మల్ని అల్లరిపెట్టింది. ఆటో అబ్బాయి కూడా మంచివాడు. మాతో పైకెక్కి దిగేదాకా తోడు వచ్చాడు. ఈ ట్రిప్ మొత్తానికి బ్రహ్మగిరి కొండ ఎక్కిదిగటం మా ఇద్దరికీ కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.నే పోరకపోయి ఉంటే ఇంత ఆనందం మిస్సయ్యేవాళ్లం కదా అని నేను కాస్త ఫోజ్ కొట్టేసా.
కొండ దిగాకా షేరింగ్ వ్యాన్ లో నాసిక్ వెనక్కు వచ్చేశాము.అక్కడ వేరే ఏమి చూట్టం కుదరకపోయినా  "పంచవటి" చూడాలని,అక్కడ గోదావరిలో ఓ మునక వేయ్యాలని నా కోరిక.అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడుట. వనవాస సమయంలో కశ్యప మహర్షి ఆదేశానుసారం నాసిక్ లోని గోదావరీ తీరంలోనే దశరథుని శ్రార్ధ కర్మలు నిర్వహించాడనీ, అందుకే ఈ గొదావరీ తీరానికి అంత గౌరవం అనీ పెద్దలు చెబుతారు. ఈ పంచవటి ప్రాంతంలోనే రామకుండ్ ఘాట్ నిర్మాణం జరుగింది.గోదావరి లోతు మొదలయ్యేది కూడా నాసిక్ నుండే.
పంచవటిలో రామకుండ్ ఘాట్
పంచవటిలోని ఆ రామకుండ్ తీర్థంలో గోదావరీ స్నానం చేసాను.మా పాప కూడా  మారాం చేసి నాతో పాటూ నదీ స్నానం చేసింది. రామకుండ్ ఘాట్ ఎదురుగా కాస్త ఎత్తు మీద కపాలేశ్వర మండిరం ఉంది. మరోసారి శివ దర్శనం చేసేసుకున్నాం.అక్కడ పూజారికి బదులు ఒక ముసలావిడ,ఆవిడ కోడలు తీర్థ ప్రసాదాలు ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ల మాటలవల్ల వాళ్ళు తెలుగువాళ్ళనీ,అత్తాకోడళ్ళనీ అర్ధమయ్యింది. ఉన్న సమయంలో ఈమాత్రమన్నా చూసామన్న తృప్తితో ఆదివారం రాత్రికల్లా శిరిడి తిరిగి వచ్చేసాము.
బడలిక వల్ల ఆదివారం రాత్రి ఇక బాబా దర్శనానికి నేను వెళ్ళలేకపోయాను. శ్రీవారు మాత్రం వెంఠవెంఠనే రెండు మంచి మంచి దర్శనాలు చేసుకుని రాత్రి హారతి అనంతరం వచ్చారు. ఇక నేను సోమవారం పొద్దున్నే లేచి ఆరింటికల్లా దర్శనం క్యూలోకి  వెళ్ళాను.ఆషాఢ ఏకాదశి అని ఆ రోజు కాస్త జనం ఉన్నరు..అయినా అరగంటలో బాబా ముందరికి చేరాను. ప్రత్యేకంగా బాబాను అలంకరించారు.పేద్ద బంగారు నెక్లేస్ వేసారు.కిరీటం పెట్టారు.నిశ్చల భక్తిని తప్ప ఈ అలంకారాలు బాబా ఎన్నడు కోరారనీ? అని నవ్వు వచ్చింది.  కుడివైపు లైనులో ఉండటం వల్ల విగ్రహం ముందర ఉండే స్థలంలోంచి బయటకు వెళ్ళే అవకాశం వచ్చింది. బాబాను చూసుకుంటూ వెనక్కు అడుగు వేసుకుంటూ వెళ్లటం వల్ల ఎక్కువ సేపు జరిగిన దర్సనం నాకు ఎంతో తృప్తినీ,ఆనందాన్ని ఇచ్చింది. ఆరున్నరకల్లా రూముకి చేరిన నన్ను చూసి తను,పాప ఆశ్చర్యపోయారు. మళ్ళీ అందరం కలిసి మరో దర్శనానికి వెళ్ళాం. అది కూడా చాలా బాగా జరిగింది.మొదటి రోజు సరిగ్గా దర్శనం జరగలేదని పడ్డ బాధను ఇవాళ తీర్చేసారు బాబా అనుకున్నాను.
సోమవారం రాత్రికి వైటింగ్ లిస్ట్ లో ఉన్నటికెట్లు కూడా సాయంత్రానికి కంఫర్మ్ అయిపోయాయి. ఆ విధంగా అనుకోని మా శిరిడి,త్రయంబకం ప్రయాణం సుఖాంతంగా మిగిసింది. కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అప్పుడప్పుడు ఇలాంటి అనుకోని ప్రయాణాలకు వెళ్తేనే జీవితంలో కరువైపోతోందనిపించే ఉత్సాహం మళ్ళీ మనసొంతమౌతూ ఉంటుంది అనిపించింది నాకు.
 
సర్వేజనా: సుఖినోభవంతు..!

***   ****   ***

బ్రహ్మగిరి అందాలు క్రింద లింక్ లో  చూడండి:



Thursday, July 21, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం - 2




(బస్ లో కనబడ్డ పాప..బావుందని ఫోటో తీసా)

(శిరిడి - నాసిక్ - త్రయంబకం -1 )

శిరిడి - నాసిక్ - త్రయంబకం - 2 :

హఠాత్తుగా మంచి ఐడియా వచ్చింది..నా ఫోన్ లేకపోతేనేం, రూపాయి ఫోన్ చేయొచ్చు కదా..అని. పక్కనే ఉన్న పాకలాంటి బడ్డి కొట్లో ఉన్న ఫోన్ లో రూపాయి వేసి తనకి రింగ్ ఇచ్చాను. పలికారు.'ఎక్కడున్నారు?ఇంతసేపేమిటి?' అనడిగా ఆదుర్దాగా. 'పాప బట్టలు తడిసాయి కదా..ఇక్కడ బట్టల షాపులు ఉంటే దానికి బట్టలు కొంటున్నా.పదినిమిషాల్లో వస్తాను'అన్నారు. మనసు నెమ్మదించిండి. వెనక్కు వచ్చి నించున్నా. ఎదురుగుండా రోడ్డుకి అవతల త్రయంబకం వెళ్ళే వ్యానులు ఆగుతాయన్నారు ఇందాకా ఎవరో. ఇందాకా మేము దిగేసరికీ ఒక వ్యాను కూడా ఉంది కానీ డ్రైవర్ లేడు. నేను ఫోన్ చేసి వచ్చేసరికీ ఆ వ్యాన్ లేదు. వెళ్ళిపోయినట్లుంది. మళ్ళీ ఇంకో వ్యాన్ వస్తుందో రాదో..


కాసేపటికి వానలో గొడుగు పట్టుకుని తను వచ్చారు. ఇదెక్కడిది? అన్నాను.'కొంటే వస్తుంది ' అన్నారు నవ్వుతూ. నా భయం, కోపం అంతా మాయమైపోయాయి.ఇప్పుడీ వర్షంలో త్రయంబకం వెళ్ళగలమా? అన్నాను దిగులుగా. 'ఏదో మార్గం దొరుకుతుదిలే.కంగారెందుకు ' అన్నారు తను. ఈలోపూ 'త్రయంబక్ త్రయంబక్..' అంటూ ఒక మనిషీ పిలుస్తూ మా వైపు వచ్చాడు. వ్యానా అని మేము అడిగే లోపూ ఒకాయన వచ్చి మేము ఆరుగురం ఉన్నాం పడతామా? అన్నాడు. రండి రండి అని అతను రోడ్డుకి అవతలవైపు ఉన్న వ్యాను వైపు నడిచాడు. అందరం వ్యాను ఎక్కేసాం. అప్పుడే టాక్సీలో శిరిడి నుంచి వచ్చారుట వాళ్ళు. ఇదివరకు త్రయంబకం వెళ్ళాం అంటూ వివరాలు చెప్పాడు ఆయన. కొంచెం ఇరుగ్గా ఉన్నా..ఏదో ఒకటి వెళ్ళటానికి దొరికిందన్న ఆనందం మాకు కలిగింది. ఆ మసక వెలుతురు లోనే ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న ఆంటీ మొహం చూశాను.ఎంత బాగుందో ఆవిడ. అచ్చం 'సినీనటి గీత ' లాగ. మళ్ళీ మళ్ళీ చూస్తే బాగోదని ఇంక చూడలేదు కానీ..నాకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఆ ఆంటీని. రాత్రి పదిన్నరకు త్రయంబకం చేరాము. నాసిక్ లో స్టే చెయ్యకుండా రాత్రికి త్రయంబకం చేరిపోతే, పొద్దునే దైవ దర్శనం సులువౌతుందని మా ఉద్దేశం.


కానీ అదేం చిత్రమో అన్ని హోటల్స్ లోనూ రూములు నిండిపోయాయిట.ఎక్కడా రూంస్ లేవన్నారు. కొందరు బయట రోడ్డు మీదే వ్యానుల్లో,జీపుల్లో కాలక్షేపం చేసేస్తున్నారు.అక్కడ ఎప్పుడూ అంతేనో, మరి వీకెండ్ అవటం వల్ల రద్దీనో తెలీలేదు. ఆఖరికి ఒక రూం దొరికింది. వేణ్ణీళ్ళు ఉండవన్నాడు. తలదాచుకోవటానికి ఏదో ఒకటి అని తీసేసుకున్నాం. కానీ లోపలికి వెళ్ళి గది చూస్తే భయమేసింది. అమ్మో ఈ గదిలో ఉండాలా అన్నంతా భయంకరంగా ఉంది. కానీ తప్పదు మరో ఆప్షన్ లేదు.'అమ్మా,రేపొద్దున్న నేనిక్కడ నీళ్ళు పోసుకోను" అని వెంఠనే పాప చెప్పేసింది. నాసిక్ లో కొన్న తిఫిన్ తినేసి అలిసిపోయి ఉన్నామేమో మరో మాట లేకుండా నిద్రోయాం. నిద్ర సుఖమెరగదని ఇందుకే అన్నారేమో అని పొద్దుట లేచాకా అనిపించింది.

మెలుకువ రాగానే టైం చూస్తే ఐదయ్యింది. బయట ఎటువంటి సందడి వినబడటం లేదు. త్వరగా తెమిలి వెళ్తే దర్శనం అయిపోతుంది.మళ్ళీ జనాలు ఎక్కువైతే లేటౌతుంది అని తనని లేపాను. హర హర మహాదేవ అని ఆ చన్నీళ్ళే ఎలాగో పోసేసుకుని తయారైపోయి బయటపడ్డాం. బయటకు వస్తునే ఎదురుగుండా ఉన్న సుందరదృశ్యం చూసేసరికీ నాకు అమితోత్సాహం వచ్చేసింది. తెలతెలవాతోంది..ఎదురుగా కొండలు.. వాటిపై తెల్లని మబ్బులు...అత్యంత రమణీయంగా ఉందా దృశ్యం.

బయల్దేరిన ఉద్దేశానికి అర్ధం దొరికినట్లయింది.రకరకాల చికాకులతో విసిగిపోయి ఎక్కడికో అక్కడికి వెళ్దాం అంతే! అనుకుని బయల్దేరాం. శిరిడి లో అప్పటికప్పుడూ ఈ నాసిక్ ప్రయాణం చెయ్యాలనిపించటం దైవికమేనేమో.


చేతిలో ఉన్నది డిజిటల్ కెమేరా. ఇంక కనబడ్డ చెట్టూ చేమాకూ ఫోటోలు తీస్తూ, చల్లని వాతావారణాన్ని ఆస్వాదిస్తూ నడవటం మొదలెట్టా. దూరంగా ఒక కొండ మీద నుంచి జారుతున్న జలపాతం కనబడింది. నా జూం సరిపోవట్లా..అయినా ఫోటొ తీసేసా.

ఇక త్రయంబకేశ్వరాలయం దగ్గరికి వచ్చేసరికీ వర్షం మొదలైంది. నాసిక్ లో శ్రీవారు కొన్న గొడుగు చాలా ఉపయోగపడింది. గుడీ పురాతన కట్టడం.. గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసేసరికీ మతి పోయింది..అంత అందంగా కనబడింది ఆలయం.అందమైన, పరిశుభ్రమైన పరిసరాలు,వాతావరణం నన్నెంతో ముగ్ధురాలిని చేసాయి. ఇదివరకెక్కడా ఫోటొల్లో కుడా చూడలేదు నేను. క్యూ తక్కువగా ఉంది..క్యూలో నాన్నొక విషయం ఆశ్చర్యపెట్టింది. కొన్ని జంటల్లో సాంప్రదాయబధ్ధంగా తెల్లటి పంచె,చొక్కా లేకుండా కండువాలతో మగవారు, తెల్లటి చీరల్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలా పాటించేవారున్నారా అనిపించింది. తమిళ్నాడులో గుళ్ళలో ఎక్కువగా ఇలా చూశా .

దర్శనానికి త్వరగానే వెళ్లగలిగాము. గుడి మండిరంలోకి అడుగు పెట్టేసరికీ మనసు ప్రశాంతంగా మారిపోయింది. వేదమంత్రాలు చదువుతూన్న బ్రాహ్మలు, ఏవో పూజలు చేసుకుంటున్న కొందరు అక్కడ లోపల కూర్చుని ఉన్నారు. విశాలంగా ఉన్న గర్బగుడి, ఎత్తుగా ఉన్న గోపురం,వినబడుతున్న వేదమంత్రాలు ఏదో పవిత్రభావాన్ని కలగజేసాయి. ఇక లోపల ఉన్న జ్యోతిర్లింగం పైన అమర్చబడిన అద్దంలో మాత్రమే కనబడుతోంది. శివలింగం ఉండాల్సిన ప్రదేశంలో నీరు కనబడింది. ఆ నీటిలోన మూడు చిన్న చిన్న లింగాకారాలు కనబడ్డాయి. "లింగం" కనబడటంలేదేమి అనడిగాము. ఇక్కడ లింగం ఉండదు. అవి బ్రహ్మ ,విష్ణు,మహేశ్వర స్వరూపాలు. ఇదే ఇక్కడి జ్యోతిర్లింగ విశేషం అని చెప్పారు ఒకాయన. దర్శనం అయ్యాకా మండపంలో కూర్చోనిస్తున్నారు. వెళ్ళండి వెళ్లండి అని బయటకు తోసేయ్యకపోవటం నాకు బాగా నచ్చింది.

నందీశ్వరుడుది మందిరం బయటనే పెద్ద విగ్రహం ఉంది.మందిరం లోపల మన గుడులలో నందీశ్వరుడు ఉండే ప్రదేశంలో తాబేలు బొమ్మ ఉండటం చాలా ఉత్తరాది గుళ్ళలో చూశాము. ఇక్కడా అలానే పేద్ద పాలరాతి తాబేలు బొమ్మ ఉంది. దర్శనానంతరం ప్రశాంతత నిండిన మనసుతో అక్కడే ఓ పక్కగా కూర్చున్నాము. వినబడుతున్న ఈశ్వర స్తుతి,వేద మంత్ర పఠనం ఎంతో హాయినిస్తుండగా కళ్ళు మూసుకున్నాను. ఆ భగవద్సన్నిధిలో విన్నవించాలనిపించినదంతా విన్నవించేసా మౌనంగా.. ఇక చెప్పాల్సినది ఏదీ లేదనిపించింది.కళ్ళు తెరిచేసరికీ ఒక అలౌకిక ఆనందంతో మనసంతా నిండిపోయింది. మనసులో భారమంతా దిగిపోయిన భావన..నెమ్మదిగా లేచి గుడి బయటకు వచ్చాను. మళ్ళీ సన్నని వర్షం మొదలైంది. ఈసారి గొడుగులో నిలబడాలనిపించలేదు..ఆ జల్లు నన్నూ,నా మనసును ఉత్తేజపరుస్తున్న భావన..పవిత్రమైన ఆ ప్రదేశంలో ఏదో మహిమ తప్పక ఉందనిపించింది.



*** *** ****
(నాసిక్ లో చూసినవి చివరి భాగంలో..)

Saturday, July 16, 2011

నా బ్లాగ్ చదివే బ్లాగ్మిత్రులకు:

శిరిడి,నాసిక్ ప్రయాణం సిరీస్ చదువుతున్న బ్లాగ్మిత్రులకు:

జ్వర తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల తదుపరి భాగం రాయలేకపొతున్నాను. జ్వరం తగ్గాకా తరువాతి భాగం రాస్తానని మనవి.

Thursday, July 14, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం -1


మావి చాలా మటుకు అనుకోని ప్రయాణాలే. ఆ పైవాడి దయవలన పెద్ద ఇబ్బందులు లేకుండా ఇలాంటి అనుకోని ప్రయాణాలు గడుపుకొచ్చేస్తూ ఉంటాం. గత నాలుగురోజుల పాటు మేము చేసిన అనుకోని ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మాకు అందించింది. వర్షాకాలం పచ్చదనం ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. దినపత్రికలు, టివీ ఛానల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ ఏవీ లేకపొతే ఎంతైనా హాయే అని మళ్ళీ అనిపించింది.


మొన్న గురువారం శిరిడి వెళ్దాలని అప్పటికప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఇలా రాయటానికి బాగుంది కానీ ఒక ఎడ్వంచర్ చేసామనే చెప్పాలి. ప్రయాణాల్లో తనకు ఇబ్బందని ప్రతీసారీ మా పాపను అమ్మ దగ్గర ఉంచేస్తాము. కానీ ఈసారి పాపను కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాం. అనుకున్నట్లే రిజర్వేషన్ దొరకలేదు. శుక్రవారం సాయంత్రానికి వైటింగ్ లిస్ట్ లో ఉన్నా ఏమయితే ఆయిందని టికెట్స్ తీసేసుకున్నాం. శుక్రవారం పొద్దున్నకి వైటింగ్ లోంచి RACలోకి వచ్చి, రైలెక్కే టైమ్ కి కన్ఫర్మ్ అయిపోయాయి. హమ్మయ్య అనేసుకుని రైలెక్కేసాం. దారిలో వాన వెలిసిన తరువాత విరిసిన "వానవిల్లు" నా కెమేరాలో చిక్కింది. పాప కూడా మొదటిసారి నిజం రైన్బోను చూసి చాలా సరదా పడింది.





సారవంతమైన మహరాష్ట్రా నల్లమట్టి


రైలు శిరిడి దాకా వెళ్తుంది కానీ మేము దర్శనానికి త్వరగా వెళ్ళచ్చని శనివారం పొద్దున్నే నాగర్సోల్ లో ఏడింటికి దిగిపోయాం. అక్కడ నుంచి గంటలో శిరిడి చేరిపోయాం. ఊరు ఏడాదిన్నర క్రితం మేము వెళ్ళినప్పటికన్నా బాగా మారిపోయింది. ఎప్పుడు కట్టారో కానీ గుడీ గేట్లో "సాయి కాంప్లెక్స్" అని ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ! బోలెడు షాపులు హంగామా.





వీకెండ్ కదా ఎప్పటిలానే దర్శనానికి చాలా జనం ఉన్నారు. భక్తులు పెరిగే కొద్దీ భగవంతుడు మరీ దూరమైపోతున్నాడు అనిపించింది క్యూలూ జనాల్ని చూస్తే. తొమ్మిదిన్నరకి క్యూ లో అడుగుపెట్టాం. క్యూ త్వరగానే కదిలింది కానీ సరిగ్గా హారతి టైంకి లైన్ ఆపేసారు. అప్పటికి విగ్రహం ఎదురుగా ఉండే హాల్లోకి చేరుకున్నాం. అందర్నీ కూచోపెట్టేసారు. అంతవరకూ బానే ఉంది కానీ హారతి అవ్వగానే జనమంతా ఉన్మాదుల్లాగ తోసేసుకుంటూ దర్శనానికి ఎగబడ్డారు. ఎందుకో తొందర అర్ధం కాలేదు. హాలు దాకా చేరినవాళ్ళు దర్శనానికి వెళ్ళలేకపోతారా? ఎగబడి ఒకర్ని ఒకరు తోసుకోవటం వల్ల మరింత ఆలస్యం, తోపులాట, చికాకులు తప్ప భగవంతుడి దగ్గర ప్రశాంతత ఎక్కడుంటుంది? ఒకోసారి చదువుకున్నవాళ్ళు కూడా నిరక్ష్యరాసుల్లా ప్రవర్తిస్తారెందుకో..!


హారతి తర్వాత జరిగిన తోపులాటలో నా ప్రయేమం లేకుండానే నేను ఎక్కడికో తోయబడ్డాను. తనూ,పాప ఎక్కడున్నారో తెలీలేదు. దర్శనం అయ్యాకా ఎంతసేపు నిలబడ్డా తనూ,పాప బయటకు రాలేదు. నాకు కంగారు మొదలైంది. ఈలోపు అవతలివైపు నుంచి శ్రీవారు,అమ్మాయి కనబడ్డారు. వాళ్ళు కుడివైపు క్యూలోకి తోయడి,వేరే గుమ్మంలోంచి బయతకు వచ్చారుట. వాళ్లకు దర్శనం బాగా అయ్యిందన్నారు. ఇక నాకు బాధ మొదలైంది. అనుమతి లేనిదే రాలేమంటారు. ఈ వచ్చాకా ఈ తోపులాట దర్శనం ఏమిటి బాబా..అని ప్రశ్నించటం మొదలెట్టాను. రెండు రోజుల తరువాత నా వేదన తీరింది..అదే బాబా సమాధానం అనుకున్నా. చివరిరోజు ప్రయాణంలో దాని గురించి..!


ఆదివారం రాత్రికి రైలు టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈలోపు శనివారం సాయంత్రం దగ్గరలో మరెక్కడికైనా వెళ్ళివద్దాం అని చూస్తే "నాసిక్" అక్కడికి రెండు గంటలే అని చెప్పారు. త్రయంబకం అక్కడ నుంచి మరో అరగంటేట. గోదావరి జన్మించిన ప్రదేశానికి వెళ్ళాల్సిందే అని నేను...సరే 'పద'మనుకుని బస్సెక్కేసాము. బస్సుని ఆటోలా తోలుకుంటూ బస్సు డ్రైవరు ఎనిమిదిన్నరకు నాసిక్ లో దించాడు. అంతకు ముందు ఎప్పుడూ మాకు నాసిక్ గురించి తెలీదు. అసలంత దూరం వెళ్తామని అనుకోలేదు కూడా. ఇంతలో భోరున వర్షం మొదలైంది. పిల్లకు ఆకలౌతుంది టిఫిన్ తెస్తాను, వచ్చాకా ఎలా వెళ్ళాలో చూద్దాం అని వెళ్ళారు శ్రీవారు. ఆ చీకట్లో ఓ బస్సు షెల్టర్ క్రింద పాపతో నిలబడ్డా. అరగంటైంది మనిషి రాలేదు. నాకు మళ్ళీ కంగారు మొదలైంది. నా ఫోనుంది కదా నీదెందుకు అన్నారని నా ఫోన్ కూడా తేలేదు. అసలే పొద్దుటి తోపులాట, ఇప్పుడిలా చీకట్లో..భయం...! ఎందుకు బయల్దేరామా..తనింకా రాలేదేంటి.. అని బుర్రలో రకరకాల ఆలోచనలు...


(మిగిలింది రేపు..)

Wednesday, July 6, 2011

భాస్కరమ్మగారి ఇల్లు








నివాసానికి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేదాకా పదిహేనేళ్ళ పాటు విజయవాడ సూర్యారావుపేటలోనే ఉన్నాం మేము. విజయటాకీస్ ఎదురుగుండా రోడ్డులో ఎడమవైపు ఉండేది భాస్కరమ్మగారి ఇల్లు. ఇప్పుడు భాస్కరమ్మగారు లేరు. ప్రస్తుతం ఆ ఇల్లు కూడా ఏవో కోర్టు తగాదాల్లో ఉందని విన్నాను. అన్నయ్య పుట్టక ముందు అమ్మావాళ్ళు దిగిన ఆ ఇంట్లో నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా ఉన్నాం. ఆ ఇంటితో పెనవేసుకునున్న ఎన్నో జ్ఞాపకాలు ఈనాటికీ తాజాగా మనసును ఉత్తేజపరుస్తూ ఉంటాయి. మేం ఉన్నప్పుడు లైట్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆ డాబా ఇంట్లో వీధివైపు రెండు పెద్ద వాటాలు, వెనుక పెరటివైపు రెండు చిన్న వాటాలు ఉండేవి. పైన అంతా భాస్కరమ్మగారు ఒక్కరే ఉండేవారు. పిల్లలు దూరాల్లో ఉండేవారు. తెల్లటి పంచె ముసుగేసుకుని కట్టుకుని ఉండే ఒక ముసలి మామ్మగారు పొద్దుటే వచ్చి భాస్కరమ్మగారికి వంట చేసి సాయంత్రాలు వేళ్పోతూ ఉండేవారు. అంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒక్కరు భయం లేకుండా ఎలా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసేది.

మా వాటా వైపు పొడువాటి సందు ఉండేది. రెండు కొబ్బరి చెట్లు, ఒక పెద్ద రేక నందివర్ధనం చెట్టు ఉండేవి. నందివర్ధనం చెట్టు ఎక్కటానికి వీలుగా ఉండేది. రోజూ పొద్దున్నే నేనో తమ్ముడో చెట్టేక్కి గోడ మీద కూచుని సజ్జ నిండా పూలు అమ్మకి కోసి ఇచ్చేవాళ్లం. మిగతా మట్టి ప్రదేశంలో అమ్మ కనకాంబరాలు, డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు, మెట్ట తామర.. మొదలైన పూలమొక్కలు, ఆకుకూరలు మొదలైనవి పెంచేది. మా ఇంటి గోడకూ, ఎదురుగుండా ఇంటికి మధ్య నాలుగైదు అడుగుల ఖాళీ స్థలం ఉండేది. అక్కడ పిచ్చి మొక్కలు, బోలెడు ఆముదం మొక్కలు, బొప్పాయి మొక్కలు ఉండేవి. పిచ్చుకలు, గోరింకలూ, అప్పుడప్పుడు కోయిలలు వచ్చి ఆ చెట్లపై వాలుతూ ఉండేవి. ఆముదం మొక్కల వల్ల ఎప్పుడూ నల్లని గొంగళీ పురుగులే. కొన్ని ఇంటి గోడమూలల్లో గూళ్ళు కట్టేసుకుని ఉండేవి. అవి సీతాకొకచిలుకలు అవుతాయని నాన్న చెప్తే ఆశ్చర్యం వేసేది. గొంగళీలతో పాటూ వర్షాకాలంలో గుంపులు గుంపులుగా ఎర్రని రోకలిబండలు తిరుగుతు ఉండేవి. పుట్టలు పుట్టలుగా ఎన్ని పుట్టేసేవో అవి. ఇక వర్షం వస్తే వీధి గుమ్మం దాకా మా వాటా వైపంతా నీళ్ళతో నిండిపోయేది కాలువలాగ. ఇంక ఆ బురదనీళ్ల కాలవ నీండా మేంవేసిన కాయితం పడవలే ఉండేవి. మా ఇంట్లోని చిన్నగదిలో ఎత్తుగా ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ గూట్లోకి ఎక్కితే కాళ్లు తన్నిపెట్టుకుని కూర్చోటానికి కుదిరేది. వాన వస్తూంటే సన్న తుంపరలు మీద పడేలా ఆ కిటికీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉండేది.

ఇంటి వెనుక వైపు చాలా పెద్ద పెరడు ఉండేది. అందులో ఓ పక్కగా పెద్ద సపోటా వృక్షం, దానికి చుట్టుకుని గురువింద గింజల తీగ ఉండేవి. ఎరుపు నలుపుల్లో ఉండే గురువింద గింజలు కోసుకుని దాచటం నా ముఖ్యమైన పనుల జాబితాలో ఉండేది. పెరటిలో సపోటా చెట్టునానుకుని డా.జంధ్యాల శంకర్ గారి ఇల్లు ఉండేది. అప్పుడప్పుడు పేరంటాలకు పిలిచేవాళ్ళు వాళ్ళు. వాళ్ళింట్లో పొడుగ్గా రెండు యూకలిప్టస్ చెట్లు ఉండేవి. ఒకటో రెండో ఆకులు అందుకుని వాసన చూస్తే భలేగా ఉండేది. (ఆ తర్వాత డా.శంకర్ గారు విజయవాడ మేయర్ గా కూడా చేసారు) మా వెనుక పెరడులో ఇంకా పారిజాతం, కర్వేపాకు, గోరింటాకు, రెండు మూడు గులాబీ చెట్లు ఉండేవి. అవికాక ఒక పక్క విరజాజి పందిరి, మరో పక్క సన్నజాజి పందిరి, వాటి మధ్యన రెండు మూడు మల్లె పొదలు(కోలవి, గుండ్రంటివి ఇలా మల్లెల్లో రకాలన్నమాట), ఒక కాగడా మల్లె పొద కూడా ఉండేవి. ఇవి కాక అద్దెకున్నవాళ్ళు పెంచుకునే మొక్కలు. ఇలాగ వెనుకవైపు పెరడులోకి వెళ్ళాడానికి చాలా ఆసక్తికరమైన సంగతులన్నీ ఉండేవి. అమ్మ ఎప్పుడు బయటకు వదులుతుందా అని మా వరండాలోని కటకటాలతలుపులు పట్టుకుని జైల్లో ఖైదీల్లాగ ఎదురు చూసేవాళ్ళం. అమ్మ తాళం తియ్యగానే పరుగున వెనుకవైపుకు వెళ్పోయి చీకటి పడేదాకా అక్కడే అడుకుంటూ గడిపేవాళ్లం.

పొరపాటున ఎవరి చెయ్యైనా చెట్ల మీద, పువ్వుల మీదా పడిందో పై నుండి ఎప్పుడు చూసేదో భాస్కరమ్మగారు ఒక్క కేక పెట్టేది..ఎవరదీ అని..! అన్ని పూలు పూసినా ఒక్క పువ్వు కూడా మా ఎవ్వరికీ ఇచ్చేది కాదు ఆవిడ. పొద్దుటే ఆవిడ పనిమనిషి వచ్చి అన్ని పువ్వులు కోసుకుని వెళ్ళిపోయేది. దేవుడికి పెట్టుకునేదో ఏమో...! నేను కొత్తిమీర వేస్తే మాత్రం కాస్త కొత్తిమీర కోసివ్వవే అని జబర్దస్తీ గా కోసేసుకునేది. నాకు ఒళ్ళు మండిపోయేది. పువ్వులు కోసుకోనివ్వకపోయినా నేనైతే ఎప్పుడూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఆ పచ్చదనం నన్నెంతో ముగ్ధురాలిని చేసేది. మొక్కలన్నింటి మధ్యనా ఉండే మెత్తటి ఆకుపచ్చటి గడ్డి మొక్కలు కూడా నాకు అందంగా కనబడిపోయేవి. అలా మొక్కలతో నా సావాసం ఊహ తెలిసినప్పటి నుండీ ఏర్పడిపోయింది.






వీధివైపు ఉన్న రెండిటిలో ఒక వాటాలో మేము ఉండేవాళ్ళం. రెండోదాన్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అవివాహితుడైన ఆయనతో ఆయన చెల్లెలు, ఆవిడ ముగ్గురు పిల్లలు ఉండేవారు. వారితో నామమాత్రపు పరిచయమే తప్ప మిగిలిన సంగతులు ఎక్కువ ఎవరికీ తెలియవు. మా వాటాలో వరండా, చిన్నగది, వంటిల్లు, హాలు,బెడ్రూము ఉండేవి. ఇంకా ఓ రెండు గదులు ఉంటే, అవి మాకు అనవసరం అని అద్దెకు ఇచ్చారు నాన్న. దాన్లో కొన్నేళ్ళు భట్టుమావయ్యగారు(పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు) ఉన్నారు. తరువాత మేమున్నన్నాళ్ళు సూరిసేన్ మావయ్యగారు, వాళ్ళ తమ్ముడు శంకర్ గారు ఉండేవారు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదెందుకో మరి. సూరిసేన్ మావయ్యగారికీ నాకూ భలే స్నేహం ఉండేది. ఆయన రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూంటే కావాలని కదిలిస్తూ, ఆయనతో ఆడుతూ..కబుర్లు చెప్తూ ఎప్పుడూ వాళ్ల రూంలోనే ఎక్కువ ఉండేదాన్ని. వీళ్ల రూంకే తరచూ సాయంత్రాలు ఉషశ్రీతాతగారు పలు మిత్రులను కలవటానికి వస్తూండేవారు.

మా వాటాసందు చివరగా చిన్న వీధి గుమ్మం ఉండేది. గుమ్మానికి పక్కగా రాధామనోహరలు తీగ అల్లుకుని ఉండేది. రాత్రయ్యేసరికీ లేత గులాబి,తెలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా రాధామనోహరాలు విచ్చేవి. ఆ పరిమళం ఇంకా తలపుల్లో నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఒకే తీగకు రెండు రంగుల్లో పులెలా పూస్తాయీ అని ఇప్పటికీ సందేహమే నాకు. సాయంత్రం ఆ పూలు విచ్చే సమయానికీ, పొద్దున్నే లేవగానే కాసేపు ఆ వీధి గుమ్మంలో కూచోపోతే నాకు తోచేది కాదు. పొద్దున్నే వీధి తుడిచేవాళ్ళు, అటువెళ్ళే బళ్లవాళ్ళు అందరూ ఓ చిరునవ్వుతో పలకరించేసేవారు. నిర్మలా కాన్వెంటు స్కూలు బస్సు మా ఇంటి ఎదురుగా ఆగేది. సూరిబాబుమావయ్యగారి పిల్లలు ఆ బస్సు ఎక్కటానికి రోజూ వచ్చి అక్కడ నిలబడేవారు. ఇప్పుడు వాళ్ళు సంగీత విద్వాంసులు "మల్లది బ్రదర్స్" గా మంచి పేరు తెచ్చుకున్నారు.

మా వెనుకవైపు రెండువాటాల్లో ఒకదాన్లో తాతగారు, అమ్మమ్మగారు, శ్రీనుమావయ్య, నాగమణక్క ఉండేవారు. తాతగారు నాకూ, మా తమ్ముడికీ కొబ్బరి ఆకులతో, తాటాకులతో బుట్టలు అవీ అల్లి ఇస్తూండేవారు. కొత్త కొత్త కబుర్లు ఎన్నో చెప్పేవారో. వాళ్ళబ్బాయి శ్రీనుమావయ్య మృదంగం నేర్చుకునేవాడు. రోజూ పొద్దుట సాయంత్రం సాధన చేస్తూండేవాడు. మేము కిటికీ ఎక్కి అబ్బురంగా చూస్తూండేవాళ్లం. నాగమణక్క కాలేజీలో చదువుతూ ఉండేది. అమ్మమ్మగారికి వినబడేది కాదు. చెవికి మిషన్ పెట్టుకునేవారు. కాలేజీ నుంచి రాగానే ఆ రోజు జరిగిన విశేషాలన్నీ గట్టిగా అమ్మమ్మగారికి చెబుతూ ఉండేది అక్క. అన్ని వాటాలవాళ్ళకీ వినబడేవి ఆ కబుర్లు. ఇక వెనుకవైపు మరోవాటాలో ఇంకో తాతగారు, అమ్మమ్మగారు వారి ఆరుగురు సంతానం ఉండేవారు. తాతగారికి నేనంటే వల్లమాలిన అభిమానం. ఆఫీసు నుండి రాగానే ఎంత రాత్రయినా నన్ను తీసుకురమ్మని బొజ్జపై పడుకోబెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పేవారు. తెలుగు తిథులు,నెలలు, పద్యాలు,పాటలూ ఎన్నో నేర్పించేవారు. నా ఊహ తెలిసేసరికీ ఇరువైపుల తాతగార్లు లేకపోవటంతో ఈ తాతగారు బాగా దగ్గరైపోయారు. అమ్మ కూడా పిన్నిగారు,బాబయ్యగారు అని పిలిచేది వాళ్ళిద్దరినీ. ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలవాళ్ళమూ. కొన్నేళ్ళకు సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళు వెళ్పోయారు వాళ్ళు. ఊళ్ళు మారినా, దూరాలు పెరిగినా ఇప్పటికీ ఆ అనుబంధం అలానే ఉంది. మా పాప పుట్టాకా తాతగారికి విజయవాడ తీసుకువెళ్ళి చూపించి వచ్చాను. తాతగారు కాలం చేసి ఏడాదిన్నర అయిపోతోంది అప్పుడే !!

తాతగారూవాళ్ళు ఖాళీ చేసాకా ఆ ఇంట్లోకి ఉషశ్రీగారి సహోదరులు పురాణపండ రంగనాథ్ గారు వచ్చారు. పిల్లలందరం కల్సి గోడలెక్కి దూకి..రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. శెలవుల్లో ఎండిన కొమ్మలు విరిచి బాణాలు చేసుకునేవాళ్ళం. రంగనాథ్ మావయ్యగారు అమ్మవారి ఉపాసకులు. దసరా పూజలు ఎంతబాగా చేసేవారో. విజయవాడలో ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా నవరాత్రుల్లో వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. భాస్కరమ్మగారు "ఇల్లు బాగుచేయించాలి.." ఖాళీ చెయ్యమంటే అన్ని వాటాలవాళ్ళమూ ఒకేసారి ఆ ఇంట్లోంచి కదిలాము. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ప్రపంచం తెలీని బాల్యపు అమాయకత్వం, చలాకీతనం, అరమరికలు లేని స్నేహాలు, పచ్చదనంతో సావాసం...మరువలేనివి. ఆ రోజులు గుర్తుకు వస్తే...ఒక అద్భుతలోకంతో బాంధవ్యం అప్పటితో తెగిపోయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మధురస్మృతులన్నింటినీ ఒకచోట పోగేసి దాచుకోవాలన్న ఆలోచనే ఈ టపా.


Tuesday, July 5, 2011

मिलेगी मिलेगी.. मंज़िल


కాలేజీ రోజుల్లో లక్కీ అలీ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో... బేస్ వాయిస్ కాకపోవటం వల్ల మరీ ప్రఖ్యాతి రాలేదేమో అనిపిస్తుంది నాకు.హాస్య నటుడు మెహ్మూద్ కుమారుడైన ఇతను నటించిన "సుర్" సినిమాలో పాటలు చాలా బావుంటాయి.

"సునో" ఆల్బం లోని ఈ పాట,సాహిత్యం నాకు భలే నచ్చుతాయి..పాట మధ్య మధ్యలో వచ్చే ఆ గిటార్ భలే బావుంటుంది. ఇలాంటి హస్కీ వాయిసెస్ కూడా కొన్ని పాటలకు అందాన్ని ఇస్తాయి.


मिलेगी मिलेगी ..मंज़िल
चलके कही दूर
अ‍ॅये है चले जाने कॉ
अ‍ॅये है चले जायेंगे
दूर मजबूर..
मिलेगी मिलेगी

कैसी है ये दुनियां
प्यार का नम-ओ-निशा नहीं
नदा दुनियां वलें देखॊ
यहा पे कोई ईमान नहीं
अ‍ॅकेले ढूंढ्तॆ
सवेरा सवेरा
सवेरा सवेरा आयेगा चल के दो कदम
फ़ास्ले घट जायेंगे होसलॆं बढं जायेंगे
चल के दो कदम..
मिलेगी मिलेगी

चलतॆ दुनियां वलें सारे
राह मगर अंजान कही
मैं तो हूँ दीवना मेरी दीवान्गी बेनाम सही
अ‍ॅकेले ढूंढ्तॆ
मोहब्बत मोहब्बत
मोहब्बत मोहब्बत मिलॆगी चल के दो कदम
साथी से मिल जायेंगे
बहारॆं फिर खिल जायेंगे
चल के दो कदम..
मिलेगी मिलेगी

Monday, July 4, 2011

'మధుర గాయకి' శ్రీరంగం గోపాలరత్నం



చూడచక్కని రూపం, నుదుటన శ్రీ చూర్ణంతో కనబడే ఆమె మృదుభాషిణి. చరగని చిరునవ్వు ఆవిడ సొంతం. ఆవిడే నాటి సంగీత విద్వాంసురాలు, 'మధుర గాయకి' బిరుదాంకితురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఒక తెలుగు శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా శ్రీరంగం గోపాలరత్నం గారు గుర్తుంచుకోదగ్గ గాయనీమణి. విజయవాడ స్టాఫార్టిస్ట్ గా పనిచేసి, తరువాత హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశల ప్రధానోపాధ్యాయినిగా, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా, టిటీడి ఆస్థానవిద్వాంసురాలిగా కూడా నియమితులయ్యారు. 'పద్మశ్రీ' గౌరవాన్ని పొందిన గోపాలరత్నంగారు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగానే కాక లలిత సంగీత గాయనిగా కూడా అమె ఎంతో ప్రఖ్యాతి పొందారు. ఆమె గాత్రంలో వైవిధ్యంగా పలికే గమకాలు, పలికేప్పుడు భావానుగుణంగా ప్రత్యేకత సంతరించుకునే పదాలు అమె ప్రత్యేకతలు. శ్రీరంగం గారిది తంజావూరు బాణీ అని అంటూంటారు.

పలు సంగీత నాటికల్లో కూడా ఆమె నటించారు. సతీసక్కుబాయి నాటికలో సక్కుబాయి, మీరా నాటకంలో మీరా పాత్రలు ఆమెకు పేరు తెచ్చాయి. మీరా నాటకంలో శ్రీకాంతశర్మగరు రాసిన అన్ని మీరా పాటలు గోపాలరత్నం గారే పాడారు. "ఎవరు నాకు లేరు", "గిరిధర గొపాలుడు కాకెవరు", సఖియా నిదురన్నది లేదు" మొదలైనవి చాలా బావుంటాయి. బాలమురళిగారి రచన "కనిపించు నా గతము", ఆయనతో కలిసి పాడిన రజని గారి "మన ప్రేమ", కృష్ణశాస్త్రి గారి ""శివ శివయనరాదా", "గట్టుకాడ ఎవరో, సెట్టు నీడ ఎవరో" మొదలైన పాటలు ఎంతో ప్రశంసలు పొందాయి. మంచాల జగన్నాధరావుగారు ట్యూన్ చేసిన (ఆకాశవాణిలో ఉన్న) గోపాలరత్నం గారు బాలమురళి గారితో యుగళంగా కొన్ని, కొన్ని విడిగానూ(సోలోస్) కమ్మగా పాడిన "ఎంకి పాటలు" నాకైతే చాలా ఇష్టం. ముఖ్యంగా గోపాలరత్నం గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆసక్తి ఉన్నవారు క్రింద లింక్లో వాటిని ఇడౌలోడ్ చేసుకోవచ్చు:
http://www.yadlapati.com/sri-thallapaka-annamacharya-kirthans-by-srirangam-gopala-ratnam-devotional-mp3-songs/

పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారి "అనుభవ దీపం" రూపకానికి శ్రీకాంతశర్మ గారు "ఇంత వింత వెలుగంతా సుంత నాకు మిగెలేనా
" అని ఒక పాట రాసారు. ఆవిడ పాటల్లో నాకు బాగా నచ్చే "తిరునాళ్ళకు తరలొచ్చే"పాటను మొన్న టపాలో పెట్టాను కదా,  గోపాలరత్నంగారు మధురంగా మోహన రాగంలో పాడిన "ఎవ్వడెరుగును నీ ఎత్తులు" అన్న అన్నమాచార్య కీర్తన  క్రింద లింక్లో వినవచ్చు:

Sunday, July 3, 2011

ప్రియమణి ఇంటర్వ్యూ లింక్ :



"Attitude". ఒక మనిషిని ప్రపంచం చూసేది, కొలిచేదీ మనిషి ఒక్క యాటిట్యూడ్ తోనే అని అంతా అంటారు. తమ వైఖరిని బాగా చూపెట్టగలిగినవారు ముందుకు పోతారు. ఇవాళ "సాక్షి" న్యూస్ పేపర్ లో "రీఛార్జ్" పేరుతో నటి ప్రియమణి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఇంటర్వ్యూ, కథారూపం "ఖదీర్" అని ఉంది. "దర్గామిట్ట కతలు" రచయిత ఖదీర్ బాబు అయ్యుంటారనుకున్నాను. చాలా బావుంది ఇంటర్వ్యూ.. ఒక కథ లాగ.
రాసే రచయితని బట్టి కూడా వ్యాసానికి ఒక కొత్త శక్తి వస్తుందేమో !

క్రింద లింక్స్ లో ఆ ఆర్టికల్ చదవచ్చు:
1) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03072011/details.aspx?id=954031&boxid=26356068&eddate=03/07/౨౦౧౧

2) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03072011/Details.aspx?id=954032&boxid=26372504

Friday, July 1, 2011

ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా.."


వర్షంలో ఇంటికి నడిచి వస్తూంటే శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే.." పాట గుర్తుకు వచ్చింది. ఎంతో అందమైన సరళ పదాలతో పాట చదువుతుంటేనే ఒక అందమైన చిత్రం కళ్లకు కనబడేలా రాయటం శర్మగారి ప్రత్యేకత. నాన్నకు మంచి మిత్రులుగా కన్నా ఒక కవిగానే నాకు ఆయన పట్ల చాలా అభిమానం. ఈ పాటలో శర్మగారు ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాన్ని తిరునాళ్ళకు వెళ్ళే కన్నెపిల్లతో పోలుస్తూ రాసిన ఈ పాట చాలా బావుంటుంది.

ఈ పాటను ఇక్కడ వినచ్చు:






రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
సంగీతం: శ్రీ విజయరాఘవరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం గారు

తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా(౨)
మెరుపులతో మెరిసింది వానకారు

నీలి మొయిలు వాలు జడకు చినుకే చేమంతి(౨)
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ..
((తిరునాళ్లకు))


తెలివెన్నెల వేకువలో తానమాడి
అడవిదారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడి(౨)
తరగల మువ్వల గలగల నాట్యమాడి..
((తిరునాళ్లకు))


చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగిపోతే
చిలిపిగ జడివాన వేళ చక్కిలిగిలి పెట్టి
పకపక పువ్వుల నవ్వుల నవ్విస్తూ వస్తూ(౨)
బాటవెంట సంబరాలు వంచి పంచిపెడుతూ..
((తిరునాళ్లకు))


కొంటెకుర్రకారు వెనక జంట నడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచి
అంతలోన మంచి కలలు కనుల చిలకరించి
జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి - నిలిచి..
((తిరునాళ్లకు))




ఈ పాటను పాడినది ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. సంగీతం సమకూర్చినది అప్పట్లో బొంబాయిలో ఫిలిం డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మన తెలుగువారైన విజయరాఘవరావు గారు. ఈ పాట గురించిన చిన్న కథ శ్రీకాంతశర్మగారి మాటల్లో:
"సుప్రసిధ్ధ వేణు విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావుగారు ఒక కచేరీ కోసం విజయవాడ వస్తున్నారని తెలిసీ, నన్ను పిలిచి ఒక పాట రాయించి బొంబాయిలో ఉన్న వారికి పంపారు మా డైరెక్టర్ శ్రీనివాసన్ గారు. దానికి బాణీ ఏర్పరిచి విజయరాఘవరావు గారు ఈ మాసపుపాట కార్యక్రమం కోసం విజయవాడలో మా స్టూడియో లోనే రికార్డ్ చేసారు. దీని కోసం ప్రత్యేకంగా గోపాలరత్నం గారిని హైదరాబాదు నుంచి పిలిపించి శ్రీనివాసన్ గారు పాడించారు. ఈపాట రాయటం మొదలు చివరి రికార్డింగ్ వరకూ నడిచిన అన్ని దశలనూ రికార్డ్ చేసిన శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తి అనే మా సహచర రేడియో ప్రయోక్త 'ఒక పాట పుట్టింది' అనే రేడియో డాక్యుమెంటరీ తయారు చేసారు. ఆ రోజుల్లో ఈ పాట రేడియో ద్వారా బాగా ప్రచారం పొందింది." ("పరిపరి పరిచయాలు" పుస్తకం నుండి).

పది గంటలకు మొదలై రాత్రి ఎనిమిదింటిదాకా నడిచిన ఈ పాట తాలూకు సుదీర్ఘమైన రికార్డింగ్ ను నలభై ఐదు నిమిషాల "ఒక పాట పుట్టింది" అనే కార్యక్రమంగా రూపొందించారు నాన్న. సామన్య శ్రోతకు కూడా ఒకపాట తయారీ ఎలా ఉంటుందో సులువుగా అర్ధమయ్యేలా రుపొందించిన ఈ కార్యక్రమం చాలా మన్ననలు పొందింది. ఆ రికార్డింగ్ ను బొంబాయిలో ఉన్న విజయరాఘవరావు పంపిస్తే, విని "out of a labourious process of 10hrs recording, i wonder how you could produce this programme..' అని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రెండు పేజీల ఉత్తరం . అది అవార్డులు రావటం కన్నా గొప్ప ప్రశంస అని నాన్న అనుకుంటూ ఉంటారు.