సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 30, 2011

ధక్ ధక్...ధక్ ధక్

ధక్ ధక్...ధక్ ధక్.. అంటున్నాయి క్రికెట్ అభిమానుల గుండెలు !
బయట వాతావరణంతో పాటే మనుషులూ వేడిగా కనిపిస్తున్నారు...టెన్షన్ తో.
బయట ట్రాఫిక్ సర్దుమణిగిపోయింది.
రోడ్లన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి.
మొహాలీ స్టేడియం అంతా తళుకు తారలతో, హేమాహేమీలతో నిండిపోయింది.
అయితే నాకేం బాధ? మనకూ ఆట నాగలోకంతో సమానం కదా. ఎందుకంటే మనం క్రికెట్ చూట్టం మానేసి చాలా ఏళ్లైంది. (నా క్రికెట్ కథ ఆ మధ్యన ఐపిఎల్ టైంలో రాసిన టపా చూసినవాళ్ళెవరికైనా గుర్తుండే ఉండాలి.)
కథ అంతటితో ముగియలేదు. నా చూట్టూరా ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు..:)
world cup మొదలైన దగ్గర నుంచీ నిన్న రాత్రి శ్రీలంక నెగ్గేవరకూ..." ఫోర్...అబ్బా ఔట్...సిక్సర్...గుడ్ షాట్..." అనే అరుపులతో చెవులు హోరెత్తిపోతున్నాయ్ !
వద్దనుకున్నా స్కోరు,హోరు చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక ఎందుకైనా మంచిదని, నాకూ క్రికెట్ తెలుసు అని పాత స్మృతులు నెమరేసుకుంటూ ఓ కన్ను అటు వేసే ఉంచుతున్నా..!

*** *** ***
మొన్నటికి మొన్న ఆటోలో మేము ఆట గురించి మాట్లాడుకుంటూంటే ఆటోడ్రైవర్ కూడా మాట కలిపేసి మొత్తం టీములన్నీ ఎలా ఆడుతున్నారో ఓ చిన్న సమ్మరీ కూడా చెప్పేసాడు . " చూసావా అదీ స్పిరిట్ అంటే...ఈయన కూడా ఎంత బాగా ఫాలో అవుతున్నారో చూడు.." అని శ్రీవారంటే, "ఈ స్పిరిట్, ఎటేంటివ్ నెస్, యూనిటీ మిగిలిన అన్ని విషయాలలో కూడా ఉంటే బాగుండేది" అన్నాను నేను.

*** *** ***
టివీ ఛానల్స్ వాళ్ళకు మరో కొబ్బరికాయ దొరికింది. అన్నీటిలోనూ డిస్కషన్స్..కొన్నింటిలో జ్యోతిష్యులతో సైతం ప్రెడిక్షన్స్. ఇక గెలిస్తే మన ఇండియన్ టీమంత వారు లేరని ఎత్తేయటానికీ...ఓడితే, ఛీ.. వీళ్ళేప్పుడూ ఇంతే! అని తిట్టేసుకోవటానికీ మనం ఎప్పుడూ రెడీనే...

ఒక వేళ ఓడిపోతే... ఆటేమౌతుందోనన్న టెన్షన్ తో హర్ట్ ప్రాబ్లం వచ్చిన వీరాభిమానులకోసమో లేక స్టేడియంలో తొక్కిసలాటలో దెబ్బలు తగిలించుకున్న జనాలకోసమో క్రికెట్ టీంతో ఓదార్పు యత్ర చేయిస్తే బాగుంటుందేమో కదా..

గెలిస్తే...ఏ గొడవా లేదు. (పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఫైనల్స్ లో మనం గెలవకపోయినా పర్లేదు అనేకునేవాళ్ళు  బోల్డుమంది. )

సో,  ఆ సంగతి తేలేదాకా... క్రికెట్ అభిమానుల గుండెలు..
ధక్ ధక్...ధక్ ధక్ !!

Monday, March 28, 2011

విశ్వనటచక్రవర్తి


తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గొప్పనటుల్లో ఒకరు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. సామర్ల వెంకట రంగారావు. నాకెంతో నచ్చే అభిమాననటుల్లో ఒకరు. గంభీరమైన కంఠం, చక్కని ఒడ్డు పొడుగు, శాంతవదనం, అద్భుతమైన నటన అన్నీ ఆయన పట్ల మన అభిమానాన్ని పెంచేస్తాయి. రచయిత సంజయ్ కిషోర్ గారి మాటల్లో "రంగారావు గారు ధరించని పాత్ర లేదు. అభినయించని రసము లేదు. హాస్య, శృంగార, రౌద్ర, భీభత్స, భయానక, అద్భుత, శాంత , కరుణ రసాలన్నింటిని మనకు చూపించారు". కీచకుడు, రావణుడు,కంసుడు, మాంత్రికుడు మొదలైన పాత్రలైనా, సాంఘిక పాత్రలైనా.. వేసిన ప్రతి పాత్రలో ఒదిగిపోయిన మహా నటుడు ఆయన.


ఇరవై రెండేళ్ళ వయసులో అరవై అయిదేళ్ల వృధ్ధుని పాత్ర ధరించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచేసారుట రంగారావుగారు. నాటకాలలో నటించేప్పుడూ శ్రీ ఆదినారాయణారావు, శ్రీమతి అంజలీదేవి, శ్రీ రేలంగి వంటి వారి పరిచయ ప్రోత్సాహాలందాయి రంగారవుగారికి. ఇంగ్లీషులో కూడా మంచి ప్రవేశం ఉండటంతో షేక్స్పియర్ నాటకాలలోని ఎన్నో పాత్రలలో ఆయన నటించటం జరిగింది. వైవిధ్యమైన మానవ మనస్థత్వాలకు ప్రతీకలైన అటువంటి పాత్రలలో నటించటం వల్లనే ఎన్నో రకల హావభావాలను, మనస్థత్వాలనూ ఆయన అవగాహన చేస్కున్నారు.


మద్రాసులో స్కూలు చదువు, విశాఖలో ఇంటరు, కాకినాడలో బిఎస్సి పూర్తయ్యాకా ఎమ్మెస్సీ లో చేరాలనుకున్నారు రంగారవుగారు. ఒక నాటకంలో ఆయన విగ్రహం,ఒడ్డు పొడుగు అన్నీ చూసి ఒక ఫైర్ ఆఫీసరు గారు, ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేయాల్సిండిగా ఆయనకు సలహా ఇచ్చారు. అప్లై చేసాకా మద్రాసులో ఫైర్ ఆఫీసర్ శిక్షణ పొంది, బందర్లోనూ, విజయనగరం లోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ పహైర్ ఆఫీసర్ గా ఉద్యోగనిర్వహణ చేసారు రంగారావుగారు. తీరుబడి ఎక్కువ ఉండటంతో నాటకాలను మాత్రం వదలలేదు ఆయన. ఒక బంధువు సహయంతో 1947లో "వరూధిని" అనే సినిమాకు కధానాయకుడిగా నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత కొన్ని చిన్న పాటి వేషాలు వేసాకా "షావుకారు" సినిమాలో "సున్నపు రంగడి" పాత్ర లభించింది రంగారావుగారికి. ఆ తరువాత వచ్చిన "పాతాళభైరవి"లోని మాంత్రికుడి పాత్ర తో పెద్ద నటుల జాబితాలో చేరిపోయారు రంగారావు. హిందీలో కూడా ఆ పాత్రను వారే పోషించారు. తన పాత్రకు హిందీ డబ్బింగ్ తానే చెప్పుకుని హిందీ ప్రేక్షకులకూ చేరువయి మరికొన్ని హిందీ చిత్రాల్లో కూడా వేసారు. ఆ క్రమం లోనే కన్నడ, మళయాళ చిత్రాలో కూడా నటించారు ఆయన.


"పెళ్ళి చేసి చూడు" సినిమా తమిళ రీ-మేక్ విజయం సాధించటంతో కొన్ని తమిళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు ఆయన. తెలుగు,తమిళ సినిమాల్లో ఎంతో ప్రఖ్యాతిని పొందారు. ఆయన కదలికలు, హావభావ ప్రకటన, డైలాగ్ చెప్పే విధానమ్, గంభీరమైన గొంతు ఆయనను ఒక అరుదైన నటుడిగా నిలబెట్టాయి. "మాయాబజార్" సినిమాను ఆయన నటన కోసమే చూసినవారు కోకొల్లలు. "మాయాబజార్" లో ఘటోత్కచుడు, "భక్త ప్రహ్లాద" లో హిరణ్య కశిపుడు పాత్ర, "శ్రీ కృష్ణలీలలు" "యశోధ కృష్ణ" లో కంసుడు, "పాండవ వనవాసం"లో దుర్యోధనుడు, "నర్తనశాల" లో కీచకుడు, "మోహినీ భస్మాసుర" లో సొగసైన ఆయన నాట్యం, "హరిశ్చంద్ర"లో హరిశ్చంద్ర మొదలైన పౌరాణిక పాత్రలన్నింటిలో ఆయన నటన నభూతో న భవిష్యతి. ఆ అభినయంలోని స్పష్టత, ఉచ్ఛారణలో వైవిధ్యము మరెవరికీ సాధ్యం కాదేమో. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే "బంగారు పాప" ,""లక్ష్మీ నివాసం", "షావుకారు", కత్తుల రత్తయ్య", "తాతా మనవడు", "తోడి కోడళ్ళు", "గుండమ్మ కథ" మొదలైన ఎన్నో చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. మరో మాట ఉండదు. ఆయన నటనను ఎంత పొగిడినా సూర్యుని ముందు దివిటీయే అంటారు రచయిత ఈ పుస్తకంలో.

(ఈ క్రింది ఫోటోలో కుడివైపు చివరలో గాయని జానకి గారు) "నమ్మినబంటు" చిత్రం స్పెయిన్ లోని శాన్సెబాస్టియన్ పిల్మ్ ఫెస్టివల్ కు పంపబడింది. మిగిలిన యూనిట్ తో బాటూ రంగారావు గారు కూడా వెళ్ళారు. అక్కడనుంచి జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో పర్యటించారు వారు. తరువాత జకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో "నర్తనశాల" బృందం పాల్గొంది. ఆ చిత్రానికి గానూ అక్కడ "ఉత్తమ నటుడిగా" అవార్డ్ ను అంతవరకూ మరే భారతీయ నటుడికీ అందనిది. ఆంధ్రులకు ఆ గర్వాన్ని అందించిన ఘనత రంగారావు గారిదే.

ఇక స్వదేశంలో ఎన్నో ఊళ్ళలో రంగారావుగారికి ఘన సన్మానలు జరిగాయి. "విశ్వనట చక్రవర్తి", "నటసార్వభౌమ", "నటశేఖర", "నట సింహ" మొదలైన బిరుదులు ఆయన అందుకున్నారు. నర్తనశాలకూ, మరిన్ని తమిళ చిత్రాలలో నటనకు గానూ రాష్ట్రపతి పతకాలు కూడా లభించాయి. రంగారావుగారు దర్శకత్వం వహించిన "చదరంగం" చిత్రానికి 1967లో ఉత్తమ చిత్రంగా ద్వితీయ నంది, "బాంధవ్యాలు" చిత్రానికి 1968లో ప్రధమ నంది లభించాయి. ఇటువంటి ఉత్తమ నటుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీనో, పద్మ విభూషణ్ నో ఇవ్వక పోవటం ప్రశ్నర్ధకం అంటారు రచయిత.


అరుదైన ఎన్నో మంచి ఫోటోలతో, ఆ మహా నటుడి జీవిత విశేషాలతో ఎంతో చక్కగా రచింపబడినది "విశ్వనట చక్రవర్తి". ఈ వంద పేజీల పుస్తకం చివరలో ఆయన నటించిన సినీగీతాలు కూడా అచ్చువేసారు. రంగారావు గారికి సంబంధించిన వివరాలను సేకరించటానికి మూడేళ్లు పట్టిందనీ, వారి బంధుమిత్రులందరినీ కలిసి వివరలు, ఫోటోలు సేకరించినట్లు, సినీ అభిమానులందరూ అందరూ తేలికగా చదువుకోవటనికి వీలుగా చిన్న పుస్తకన్నే అచ్చువేసినట్లు గా రచయిత తనమాటలో చెప్తారు.


ఎస్.వీ.ఆర్ కు ముళ్ళపూడివారు వేసిన అక్షర మాల:

క్లిష్టమైన పాత్రలో చతురంగారావు
దుష్టపాత్రలో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సు లో (చేయిస్తే) పూలరంగారావు
అక్షరాలా 'మధు' రంగారావు
నిర్మాతల కొంగు బంగారావు
స్వభావానికి ఉంగా రంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలి ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు


ఈ పుస్తక ప్రచురణకు సినీనటి జయలలిత సహకారం అందించారుట. 1998 లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం అన్ని విశాలాంధ్ర బ్రాంచీలలోనూ, నవోదయా లోనూ దొరుకుతుంది.

మర్చిపోయా..


మైల్స్ చెక్ చేస్తూంటే ఇవాళ 28th అని గమనించా...ఎంత విచిత్రం? జీవితంలో మొదటిసారి నేను నా స్నేహితురాలి పుట్టినరోజు మర్చిపోయా. నిన్న27th న. ఏడెనిమిదేళ్ళ పాటు నా ప్రాణంలో ప్రాణం తను.తన పుట్టినరోజుకీ, తన పెళ్ళిరోజుకీ, ఫ్రెండ్షిప్ డేకీ ఎప్పుడు మర్చిపోకుండా గ్రీటింగ్స్ పంపుతాను. వారం క్రితం కూడా అనుకున్నా పోనీలే గ్రీటింగ్సే కదా మానేయటం ఎందుకు పంపిద్దామని.తను పలకరించినా పలకరించకపోయినా ఇన్నేళ్లలో ఎప్పుడు మర్చిపోలేదు. విడువకుండా ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నాను. నా ప్రయత్నలోపమేమీ లేదు అని నా అంతరాత్మకు నేను ధైర్యంగా చెప్పుకోగలగాలి కదా. తనూ రాసేది అప్పుడప్పుడు కుదిరినప్పుడు. టూర్స్ లో లేనప్పుడు..దేశంలో ఉన్నప్పుడు. చాలా పెద్ద ఉద్యోగభారం తనది మరి.


ఎందుకు తనని అనుకోవటం... ఈసారి తన పుట్టినరోజు మర్చిపోయి నేను కూడా పొరపాటు చేసాను కదా. ఏదన్నా మర్చిపోతే ఆ రోజంతా ఇవాళేదో ఉంది..ఉంది...అని గుర్తొస్తూ ఉంటుంది...అలాంటిది నిన్న అస్సలు గుర్తు రాలేదు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఆంటీని(వాళ్ళ అమ్మగారిని) చూడాలని ఎంత తహతహలాడానో..ఎన్నిసార్లు తనతో అన్నానో వాళ్ళింటికి వెళ్దాం వెళ్దాం అని. సమయాభావం వల్ల కుదరనే లేదు. నాకు ఆంటీ ఎంత ఇష్టమో.


అమ్మ అంటూనే ఉండేది "ఇప్పుడిలా ఊరేగుతున్నావు. రేపొద్దున్న పెళ్ళిళ్ళయి సంసారాలొచ్చాకా ఎవరికి వారేనే.." అని. అప్పుడు అమ్మ మీద బోలెడు కోపం వచ్చి దెబ్బలాడేసేదాన్ని. ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తోంది. కానీ.. బోలెడు మంది ఉన్నారు కదా జీవితాంతం కలిసుండే మిత్రులు. నాన్నకు కూడా ఉన్నారు. 45ఏళ్ల నాటి మిత్రులు. ఇప్పటికీ మాట్లాడతారు, వస్తారు. నాకూ ఉన్నారు ఎప్పటి స్నేహితులో.. రూప, మాధవీ, శారద, అపర్ణ, సుధ...అందరూ ఉద్యోగస్తులే. వీళ్ళెవరూ నన్ను వదిలెయ్యలేదే...నేను బధ్ధకించినా ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఉద్యోగభారం వల్ల తనొక్కర్తే నెమ్మదిగా దూరమైపోయింది..


ఈ మధ్యన ఏదో కొత్త పాటలో విన్నా "నీతో స్నేహం నాకేంటి లాభం అనేంతలాగ మారింది లోకం... నువ్వూ మౌనం నేనూ మౌనం, మనసూ మనసూ మరింత దూరం.." అని. అలాగ లోకమే మారింది, తను కూడా మారింది. అంతే ! ఇక నేనే మారాలి.

sorry message రాద్దాం అనుకున్నా.. మళ్ళీ ఊరుకున్నా. కానీ.. ఇప్పుడే ఇక మనసాగలేదు. వెంఠనే లాగిన్ అయ్యి తనకి మైల్ రాసేసా. "సారీ మర్చిపోయాను. పు.రోజు బాగా జరిగిందని తలుస్తాను" అని.


ఎవరెలా మారినా నాకనవసరం. తను మారిపోయిందని నేనూ తనలానే ప్రవర్తిస్తే ఇక నాకూ తనకీ తేడా ఏం ఉంటుంది? నేనింతే. she is my friend for life. నా మనస్సాక్షికి నేను లోకువవ్వను. ఇప్పుడు హాయిగా ఉంది. ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది.

Sunday, March 27, 2011

నచ్చిన రచయితలు: కోడూరి కౌసల్యాదేవి

తెలుగు సరిగ్గా చదవటం రాని మా తమ్ముడు ఒకసారి హాస్టల్ నుంచి రాసిన ఓ ఉత్తరంలో అక్కడి లైబ్రరీలో తను ఏకబిగిన చదివిన తెలుగు నవల గురించి గొప్పగా రాసాడు. ఉలుకూ పలుకూ లేకుండా నేను పుస్తకాలు చదువుతూంటే నన్ను ఆటపట్టించే పిల్లాడు ఒక నవలనీ, అందులోనూ తెలుగు నవలనీ చదివాడా అని ఆశ్చర్యం వేసింది. పైగా చాలా బాగుంది, ఇదివరకు చదవకపోతే చదువు అని. మా పిన్ని ఇంట్లో ఉందంటే తెచ్చుకుని చదివానా పుస్తకం. అదే కోడూరి కౌసల్యాదేవి రాసిన "శంకుతీర్థం". ఆ తర్వాతెప్పుడో కొనుక్కున్నా. తెలుగు నవలా సాహిత్యంతో పరిచయమున్నవారిలో "కోడూరి కౌసల్యాదేవి" పేరు తెలియని పాత తరం పాఠకులు అరుదుగా కనిపిస్తారు. "కోడూరి" ఇంటిపేరు "అరికెపూడి" అయ్యాకా రచనలపై అరికెపూడి(కోడూరి) కౌసల్యాదేవి అని వచ్చేది. అయినా "కోడూరి" పేరుతోనే పిలవటం అలవాటు మా ఇంట్లో. కోడూరి గారి నవలల్లో ముఖ్యంగా కనబడేవి బలమైన స్త్రీ పాత్రలు, వ్యక్తులను అధిగమించి జీవితాల్ని మార్చివేసే విధి విలాసాలు. చిత్రమైన విధి మనుషుల జీవితాల్ని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లగలదు, ఎన్ని మలుపులు తిప్పగలదు అనే సత్యమే కోడూరి నవలల్లో అంతర్లీనంగా కనబడే నేపథ్యం.


కోడూరి కౌసల్యాదేవి నవలల్లో నేను చదివినవాటిల్లో మొదటిది "శాంతినికేతన్". నాకూ, మా సమస్తబంధువర్గానికీ ఫేవొరేట్ నవలల్లో ఒకటి. పత్రికలో సీరియల్ గా పడినప్పుడు కట్ చేసి బైండ్ చేయించింది అమ్మ. నేను మళ్ళి మళ్ళీ చదివే పుస్తకాల్లో ఇదీ ఒకటి. అసలీ నవల చదివాకే రవీంద్రుని శాంతినికేతన్ చూడాలని బలమైన కోరిక. నవలలో వర్ణించిన కలకత్తాలోని ప్రదేశాలు అవీ మేము కలకత్తా వెళ్ళినప్పుడు చూస్తూంటే ఒక అవ్యక్తానందం. దక్షిణేశ్వర్లో అయితే ఇక్కడే కదా 'రాజా' మొదటిసారి 'శాంతిని చూసింది అనుకుంటూ...చూసాను. ఈ కథను సినిమాగా తియ్యాలని అనుకున్నారుట కానీ ఎందువల్లో కుదరలేదు. అదే మంచిదయ్యింది అనిపిస్తుంది నాకు. వచ్చి ఉంటే పూర్తిగా ఖూనీ అయ్యుండేది. కథలోని పాత్రలకు సినిమాలో సరిపోయే హీరోయిన్, హీరో అప్పట్లో దొరికేవారేమో కానీ ఇప్పుడిక అసాధ్యం. అందులో ఐడియల్ మాన్ అనిపించే "రాజా" పాత్రకు ఇప్పుడు సరిపోయే హీరోలెవరూ లేరు. నాకు చాలా చాలా ఇష్టమైన పాత్ర. అసలలాటి ఉత్తమ వ్యక్తులు నవలల్లోనే ఎందుకు ఉంటారు అనుకునేదాన్ని.


ఈ కథను "టివీ సీరియల్ "గా చేసే సాహసం చేసారు. కానీ నవల బాగా నెమరేసేసుకున్న మా సమస్తబంధువర్గానికీ అది అస్సలు నచ్చలేదు. ఒకటి రెండు ఎపిసోడ్స్ తరువాత చూడటం మానేసాము. పూర్తిగా టివీలో వచ్చిందో లేదో తెలియదు. అసలు ఊహల్లో ఉన్న పాత్రలలో తెరపై మరో వ్యక్తులను చూడటానికి మనసు అంగీకరించదు ఎందువల్లో. నాయికానాయకులు "అలా మొదలైంది" సినిమాలోలాగ చివరిదాకా కలవలేరు పాపం. వారిద్దరు ఒకరికోసం ఒకరు అన్న సంగతి అర్ధమయ్యాకా కూడా పరిస్థితులు ఇద్దరినీ విడదీసేస్తాయి. ముఖ్యంగా శాంతి పాత్ర స్వభావంలో వచ్చే పరిపక్వత ఎంతో హృద్యంగా ఉంటుంది. శాంతిని కానీ, రాజాని కాని, పద్మ-శ్రీధర్ లను కానీ ప్రేమించకుండా మనం అసలు ఉండలేము. ఉమ్మడికుటుంబం లోని అనురాగాల్ని, మనుషుల్లోని ప్రేమతత్వాన్నీ ప్రతిబింబించే ఈ నవలలోని ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది.


కోడూరి గారి నవలలు "చక్రభ్రమణం", "శంఖుతీర్థం", "ప్రేమ్ నగర్" మూడూ సినిమాలుగా వచ్చాయి. చాలా వరకు సినిమాలుగా మారిన నవలలన్నీ పుస్తకరూపంలోనే మనల్ని ఎక్కువగా అలరిస్తాయి. "చక్రభ్రమణం" "డాక్టర్ చక్రవర్తి" పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అన్యోన్యత, అనుబంధం, అనుమానాలు, అపార్ధాలు, స్నేహం మొదలైన విషయాల చుట్టు ఈ కథ తిరుగుతుంది. సినిమా కథలో కొన్ని మార్పులు చేసారు. ఈ సినిమాలోని "మనసున మనసై" "నీవు లేక వీణ" "పాడమని నన్నడగవలెనా" పాటలు ఎంత హిట్టో. ఎందుకో సినిమా కన్నా నవలే బాగుందని నాకనిపిస్తుంది.


"ప్రేమ్ నగర్" సినిమా కూడా హిట్టాయి ఏ.ఎన్.ఆర్ కి పేరు తెస్తే, రామానాయుడుగారికి కూడా ఎన్నో ఇబ్బందులు తీర్చింది. ఆయన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. నవల విషాదాంతం. కథ రైట్స్ కొనుక్కుని ఇందులోనూ కొన్ని మార్పులు చేసారని అంటారు. సినిమా సుఖాంతమనుకుంటా. నేనీ సినిమా చూడలేదు. విషాదాంతం అని కొనుక్కోలేదు . "శంఖుతీర్థం" సినిమాను కృష్ణ, జయప్రదలతో విజయ నిర్మలగారు డైరెక్ట్ చేసారు. ఈ సినిమా కూడా నేను చూడలేదు. కాబట్టి ఎలా తీసారో తెలియదు. పెద్దగా ఆడలేదనుకుంటా. నవల మాత్రం చాలా బాగుంటుంది. చివరలో వరద రావటం అదీ మరీ సినిమాలాగ అనిపించినా మొదటినుంచీ పాత్రలు,కథనం అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వందన పాత్ర గుర్తుండిపోతుంది. ఓ కుటుంబం తాలూకూ జీవితం, అన్నాచెల్లెళ్ళ తాలూకు వారసులు, వారి చూట్టూ గ్రామీణ వాతావరణం, వారి జీవన విధానంతో నిండిన కథ ఇది. వల్లమాలిన స్వార్ధం ఎప్పుడూ మనిషి పతనానికే దారి తీస్తుంది్; నిస్వార్ధం మంచిని, మంచితనం విచక్షణను పెంచుతాయి అన్నది నవల మనకిచ్చే సందేశం. చదివిన చాలా రోజులవరకూ వెంటాడే శక్తివంతమైన కథ ఇది.


"చక్రభ్రమణం" నవల చాలా బావుంటుంది. కానీ కొంతవరకే నాకు నచ్చుతుంది. అత్యంత ప్రేమగా ఉండే ఓ భర్త ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం వల్లో, మరో కారణం వల్లో భార్యను అనుమానించటం అనేది నాకు అస్సలు మింగుడుపడదు. నమ్మకం ఉన్న చోట అనుమానం రానే కూడదు. అనుమానం మొదలైతే అది ప్రేమే కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల ఆ నవల కొనుక్కోలేదు. మా పిన్ని కూడా ఇటీవలే నా దగ్గర లేని మరికొన్ని కోడూరి నవలలు కొన్నానని చెప్పింది. ఎలా ఉన్నాయో చదివాలి. ఆమధ్యన "నెమలికనులు", "శిలలు-శిల్పాలు", ఇంకా కోడూరి గారి "కథల పుస్తకం" కొన్నాను. "నెమలుకనులు" నవలలో నాయిక దీప తన ఆదర్శాలను వివాహం తరువాత కూడా ఎలా కాపాడుకోగలిగింది అన్నది ఆసక్తికరంగా రచించారు కౌసల్యాదేవి గారు.


"శిలలు-శిల్పాలు" నవల చాలా నచ్చింది నాకు. ఒక పురుషుడు ఉన్నతుడుగా మారాలన్నా, అధముడు కావాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంటుంది. శిల్పి శిల్పాలను మలిచినట్లు పురుషుడి వ్యక్తిత్వాన్ని మలిచే శక్తి స్త్రీ పెంపకానికి ఉంది అనే నేపథ్యం ఈ నవలది.


కౌసల్యాదేవి కథల పుస్తకం సగమే చదివాను. ఇంకా కొన్ని కథలు చదవాల్సి ఉంది..:)

కోడూరి కౌసల్యాదేవి ఇతర రచనల జాబితా:

Saturday, March 26, 2011

పొద్దుటి వర్షం...వాకింగ్ కబుర్లు

(వర్షంలో తడిసిన మా గులాబి. )

ఇవాళ పొద్దున్నుంచీ వాతావరణం ఎంత బావుందో. మబ్బుల చాటున దాక్కుని సూరీడసలు బయటకు రానేలేదు. "వాకింగ్ నుంచి వచ్చావా లేదా? ఇక్కడ పెద్దవాన పడుతోంది...మీకూ పడుతోందా? ఇల్లు చేరావో లేదో.. తడుస్తున్నావేమో అని..." అంటూ అమ్మ ఫోన్ చేసింది కూడా. అప్పటికింకా మా ఇంటి దగ్గర వాన లేదు. ఈ వాతావరణంలో లాంగ్ రైడ్ కి వెళ్తే భలే ఉంటుంది అనుకుంటూండగానే పెద్ద పెట్టున వర్షం. ఎండాకాలంలో ఈ వానలేంటో. సుమారు రెండు మూడు వారాలక్రితం పొద్దున్నే ఇంతకంటే పేద్ద వాన చాలాసేపు పడింది. మావిడి పూత చాలావరకూ అప్పుడే రాలిపోయింది. ఈసారి రేట్లు ఆకాశానికి అంటుతాయి అనుకున్నాం. ఇక్కడింకా మావిడికాయ కనపడ్డంలేదు. మొన్న గుడివాడ పెళ్ళిలో పెళ్ళివారు కొత్తావకాయ కూడా తినిపించేసారు. ఎంత బావుందో...

కురుస్తున్న వర్షం..కనిపిస్తోందా?

వర్షంతో తడిసిన రోడ్డు..
*** *** ***


రోజూ వాకింక్ కు వెళ్తూ అనుకుంటాను ఈ వాతావరణం గురించి రాయాలి అని. దాదాపు కొన్ని నెలల తరువాత ఈ ఇల్లు మారాకా వాకింగ్ మొదలెట్టాను. అసలు మొదలుపెట్టింది పదిహేనేళ్ల క్రితమే. కానీ వరుసగా ఎప్పుడూ కొనసాగించలేదు. ఆర్నెల్లు నడిస్తే ఎనిమిది నెలలు అటకెక్కించేస్తూ ఉంటాను వాకింగ్ ని. కాస్త శరీరం కంట్రోల్లోకి వచ్చేసి, అందరూ మన వాకింగ్ ఎఫెక్ట్ ని గుర్తించేస్తూండేసరికీ బధ్ధకం వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది కాబట్టి ఈసారి ఎక్కువ రోజులే నడక కొనసాగవచ్చు.

రోజూ నే వాకింగ్ కి వెళ్ళే సమయానికి ఇంకా సూరీడు రాడు. వెనక్కి వచ్చే సమయానికి గుండ్రని లేత ఆరెంజ్ బంతిలా, పొడుగాటి వీధి చివ్వరికి, కుడి ఎడమల ఇళ్ళు కలుస్తున్నట్లుండే చోట, మధ్యనుంచి బొట్టులా పైకి వస్తూ ఉంటాడు. రోజూ అదే దృశ్యం. పొడుగాటి వీధి కూడా ప్రశాంతంగా విశాలమైన మంచి రోడ్డుతో(ఈకాలంలో గతుకులు లేని మంచి రోడ్లు చాలా అరుదుగా ఉన్నాయి కదా) నడవటానికి అనువుగా ఉంటుంది. పైగా ఇక్కడ అన్ని ఇళ్ళలో పెద్ద పెద్ద చెట్లు ఆకుపచ్చటి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. దారి పొడుగునా అన్ని అపార్ట్మెంట్ల ముందర, ఇళ్ళ ముందర ఫెన్సింగ్ ఉండి, అందులో మొక్కలు పెంచారు. ఇక సొంత ఇళ్ళ వాళ్ళైతే మరీ చూసే కళ్ళు కుళ్ళుకునేలా మొక్కలు పెంచేసుకున్నారు. అవును మరి. నేల మీద సొంత ఇల్లు.. ఇంటి పెరడులో కావాల్సినన్ని మొక్కలు పెంచుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఎంత పెద్ద సొంత అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఇలాటి ఒక బుల్లి ఇల్లుకి సాటి రాదు కదా.

ఇక దారి పొడుగునా కనబడే ఇళ్ళలోని చెట్లు, మొక్కల గురించి అందరికీ చెప్పాలని ఎంత ఆరాటమో నాకు. ఒక ఇంట్లో ఆకు సంపెంగ చెట్టు. ఏమిటో రోజూ పూలు పండిపోయి కనిపిస్తాయి. వాళ్ళకు ఈ పూలు పెట్టుకుంటారని తెలీదో ఏమో. ఒక ఇంటి ముందర కాస్త జాగా ఉంచి, లాన్ అంచున, పొడుగ్గా సిమెంట్ తొట్టేలాగ కట్టేసారు. అందులో తెలుపు,లేవెండర్ కలర్స్ లో చిన్న చిన్న పూలు. అక్కడక్కడా ఎర్రవి కూడా. ఆ ఇల్లు భలే ఉంటుంది. వీధి చివరికి ఉండే మరో ఇల్లు నా ఫేవొరేట్ ఇల్లు. కానీ అందులో ఒక ఐస్క్రీమ్ తయారు చేసే కంపెనీ ఉంది ఇప్పుడు. చిన్న పెంకుటిల్లు ఓ పక్కగా ఉంటుంది. ఎల్ షేప్ లో పెరడు. చుట్టూ చిన్న పిట్టగోడ. దానికి అల్లుకుని ఉన్న ఆరెంజ్, లేవెండర్,యెల్లో కలర్స్లో పువ్వులున్న క్రీపర్స్. గోడ మీంచి లోపలి చెట్లన్నీ కనబడుతూ ఉంటాయి. అందులో ఐదు కొబ్బరి చెట్లు, ఒక బాదం చెట్టు, మావిడి, అరటి, నిమ్మ, వేప, కర్వేప చెట్లు, మల్లె పొదలు, గులాబీ వృక్షాలు(మొక్క కంటే చాలా పెద్దవి మరి), గేట్ కి అటు పక్కన సన్నజాజి పందిరి, ఇంకా ఏవో పూల క్రీపర్స్ ఉంటాయి. పెరట్లోనే ఓ పక్కకి రెండు మూడు గదులు ఉన్నాయి. షెడ్డుల్లాగ. ఎవరిదో.. అమ్మేసారో, అద్దెకు ఇచ్చారో తెలీదు కానీ భలే అందంగా ఉంటుంది. ఆ ఇల్లు చూడ్డం కోసమన్నా వాకింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది.

మరో ఇంట్లో నేరేడు చెట్టు. ఇది నన్ను బోలెడు జ్ఞాపకాల్లోకి తీసుకుపోతుంది. రాజమండ్రిలో మా తాతగారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేది ఒక పేద్ద నేరేడు చెట్టు. వెళ్ళినప్పుడల్లా మా పిల్లల పటాలమంతా ఆ కాయలు కొట్టే పనిమీదే ఉండేవాళ్ళం. ఆ ఇంటివాళ్ళు బయటకు రాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయిపోయేవాళ్ళం. ఇక నే నడిచే దారి పొడుగునా నాలుగైదు పెద్ద పేద్ద వేప వృక్షాలు. వాటి నిండా వేప పూత. పక్కగా రాగానే కమ్మని పూల వాసన మనసంతా కమ్మేస్తుంది. గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని మళ్ళీ నాలుగడుగులు వేసేసరికీ మరో వేప చెట్టు. అప్పుడప్పుడు కోయిల కూత కూడా పలకరిస్తూంటుంది. ఎలాగూ చెవిలో ఇయర్ ఫోన్స్ కమ్మని పాటలు వినిపిస్తూనే ఉంటాయి నడుస్తున్నంత సేపూ. ఇయర్ ఫోన్స్ చెవిలో ఉంటే ఎంత దూరమైనా అలుపు తెలియదు నాకు.

ఇక కొన్ని సందు మొదలలో పిల్లలతో పాటూ స్కూల్ బస్ కోసం నిలబడే తల్లులు, పేపరు,పాల సైకిళ్ళవాళ్ళు, నాలానే వాకింగ్ కి వచ్చే చిన్నా పెద్దా...రోజూ చూస్తూంటాం కాబట్టి పలకరించకపోయిన పరిచయమైపొయిన పరిచయాలు ఇవన్నీ. హ్మ్...ఇలా చెప్పుకుంటూ పోతే రెండు టపాలు రాసినా నా వర్ణన అవ్వదు. కాబట్టి ఈ టపాని ఇంతటితో ఆపేస్తా. క్లుప్తంగా ఇవీ ఈ మధ్యన నేను ఆస్వాదిస్తున్న మార్నింగ్ వాక్ అందాలు..ఆనందాలు.

Friday, March 25, 2011

మరువం పూలు + పేరు తెలీని మొక్క ?


కదంబం లో ఒదిగే మరువం సువాసన మాత్రమే తెలుసిన్నాళ్ళూ. మరువానికి కూడా పూలు పూస్తాయని ఊహన్నా లేదేమిటో. అదివరకూ కూడా కొంత కాలం పెంచాను ఈ మొక్కను. కానీ పూలెప్పుడూ పూయలేదు. ఇదే మొదటిసారి నేను మరువం పూలు చూడటం. నాకులా ఇప్పటిదాకా చూడనివాళ్ళుంటే ఓసారి ఈ ఫోటోలు చూసేయండి.



**** ***** ****

ఈ క్రింది ఫోటోలోని మొక్కలు మా సందులో గోడవారగా మొలకెత్తాయి. ఏం మొక్కలో తెలీక పెరిగేదాకా ఉంచాను. ఇప్పుడు ఇలా తెల్లని పూలు పూస్తున్నాయి. ఆకులకు గానీ, పువ్వులకు గానీ ఏ వాసనా లేవు. వఠ్ఠి గడ్డి మొక్కలేమో కూడా. ఇవేం మొక్కలో ఎవరికన్నా తెలుసా?



Wednesday, March 23, 2011

బదులు తోచని ప్రశ్నల తాకిడి

పొద్దున్నే ఎఫ్.ఎం వింటూ పనులు చేస్కుంటూంటే ఒక వింత పాట వినిపించింది. ఈ మధ్యన పెద్ద పెద్ద పేరాగ్రాఫులను పాటలుగా మార్చేస్తున్నారు. అలానే ఉంది. కానీ సాహిత్యం చాలా బాగుంది. తీరుబడి అయ్యాకా నెట్లో వెతకటం మొదలెట్టా. కానీ వాక్యాలు మర్చిపోయా. చాలా సేపు వెతికి దొరక్కపోయే సరికీ ఒక ఐడియా వచ్చింది. కొత్త సినిమా పాటలు అని టైప్ చేసి వచ్చిన సినిమాల పాటలలిస్ట్ లు అన్నీ వెతకటం మొదలెట్టా. ఒకచోట హుర్రే...!! అనేసా.

పాట.. "Mr.Perfect" సినిమా లోదిట. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్. సాహిత్యం - సిరివెన్నెల. అదీ.. అందుకే అంత బాగుంది. ఏమైనా ఆయనకాయనే సాటి. కార్తీక్, మల్లికార్జున్ పాడారుట. చిన్నవయసులోనే ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కార్తీక్. మంచి పాటలు ఉన్నాయి అతని జాబితాలో.

ఇంతకీ నాకు అంత విపరీతంగా నచ్చేసిన పాట సాహిత్యం చూడండి...కష్టపడి మొత్తం రాసేసా...:)

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికి తన గుట్టుని చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారినిఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నీ లోపలా
కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా?
(ఎప్పటికీ..)

ఏదోలా చూస్తారే నిన్నో వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా?
సంబరపడి నిను చూపిస్తూ
కొందరు అభినందిస్తూంటే
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా?
(బదులు తోచని)

నీతీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికీ
మార్పేదైనా వస్తుంటే
నువ్వది గుర్తించకముందే
ఎవరెవరో చెబుతూఉంటే నమ్మేదెలా?
వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా?
(బదులు తోచని)

చదివితే ఏదో పాఠం తాలూకూ ఎస్సే ఆన్సర్ లా ఉండి కదా. పాట చరణాలు ఎలా ఉన్నా, నాకైతే మొదట్లో హమ్మింగ్ వాక్యాలు, పల్లవి చాలా నచ్చేసాయి. మ్యూజిక్ తో పాటూ వింటే బాగుంది. మీరూ వినేయండి మరి..

Tuesday, March 22, 2011

నీళ్లు



మూడురోజులనించీ నీళ్ళు రాలేదు. పైనవాళ్ల ఇంట్లో చుట్టాలు కూడా వచ్చారు. వాళ్ళు మోటారు వేసినప్పుడల్లా గుండెల్లో రైళ్ళు. ఉన్న ఒక్క బిందె నీళ్ళు ఇవాళ అయిపోతే ఎలాగో అని బెంగపడిపోయాను. అదృష్టం బాగుండి ఇవాళ పొద్దున్నే ఆరింటికే నీళ్ళు వచ్చాయి. ఆనందమే ఆనందం. గంగాళం, స్టీలు బకెట్టు, బిందెలు, చిన్నాపెద్దా గిన్నెలు అన్నీ నింపేసా. మొన్నటి దాకా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఇబ్బంది తెలీదు. నీళ్ళు రాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు టాంకర్ తెప్పించేవారు. అడిగిన డబ్బులు ఇస్తే సరిపోయేది. ఏ తలనెప్పి లేదు. తెలీదు. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అవటం వల్ల రోజు విడిచి రోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూపులే . అసలు ఓ టైమూ పాడూ లేదు. ఒకోసారి అవీ రావు. రెండ్రోజులకోసారి వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడే ఎక్కువ పట్టేసి ఉంచుతాం. మళ్ళీ ఎల్లుండీ రాకపోతేనో...అనుకుని. ఇక వేసం కాలం ఎలా ఏడ్పిస్తాడో మరి.

బొంబాయిలో రోజు విడిచి రోజు ఇచ్చినా ఒక టైం ప్రకారం వదిలేవాడు నీళ్ళు. ఏమాటకామాటే చెప్పాలి వాళ్ల పధ్ధతుల్ని మెచ్చుకుని తీరాలి. అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. ఆఖరికి బస్సులు కూడా అందరు లైన్లలోనే ఎక్కుతారు. ఇక్కడిలా పొలోమని తోసుకుపోరు. మేం ఉన్నన్నాళ్ళు ఏనాడూ నీళ్ళకు ఇబ్బంది పడలేదు. ఇక విజయవాడ సంగతి చెప్పనక్కర్లేదు. కృష్ణమ్మ ఉండగా నీళ్లకు ఇబ్బందేమిటీ? అసలు ఆ మాటే తెలీదు. మా పనమ్మాయి అంట్లు తోముతున్నంత సేపు పంపు వదిలేసి ఉంచేది రోజూ. నేను దాన్ని కేకలేస్తూ ఉండేదాన్ని. ఆఖరికి అది మాట వినట్లేదని ఆ నీళ్ళు వేస్టవకుండా మొక్కల్లోకి వెళ్ళేలా పంపు దగ్గర నుంచి ఒక చిన్న కాలవ కూడా నేనే తవ్వాను.

ఇక విజయవాడ వదిలేప్పుడు ఎంత తగ్గించినా నా మొక్కలు కూండిలు ఒక ఏభై అయ్యాయి. సామాన్ల లారీలో అవి పట్టలేదని కేవలం వాటి కోసం నాన్న ఒక వేరే లారీ కూడా మాట్లాడారు. అలా ఒక ఏభై మొక్కలు తెచ్చాను. ఇక్కడి నీళ్ళ బెడదతో కాసిని మొక్కలు, నే పెళ్లయివెళ్ళాకా అమ్మకి ఓపిక లేక కాస్త.. మొత్తానికి ఇప్పుడు ఒక్క మొక్క కూడా మిగల్లేదు. అద్దింట్లో ఉన్నన్నాళ్ళూ వాళ్ల ఇంటాయన వాడుకోవటానికి కూడా నీళ్ళు జగ్గులతో లెఖ్ఖ కట్టి ఇచ్చేవాడు. ఇక మొక్కలకేం పోస్తారు? ఇప్పుడిక సొంతిల్లు కాబట్టి ఓపిక ఉన్నమటుక్కు కాసిని మొక్కలు కొని పెంచితోంది అమ్మ. మొన్నటిదాకా మాకూ ఇల్లు పెద్దదైనా అపార్ట్మెంట్లో బాల్కనీ లేక ఏ మొక్కా పెంచలేకపోయా. ఇదిగో ఈ ఇల్లుకి మారాకానే మొక్కల సరదా తీర్చుకుంటున్నా. ఇక్కడా క్రింద మట్టి లేదు కనుక కుండీల్లోనే.

ఇక నీళ్ల వాడకం గురించి ఎన్ని తెల్సుకున్నాననీ? బట్టలుతికిన నీళ్ళు సందు కడగటానికి, ఆకు కూరలు, కూరలు కడిగిన నీరు మొక్కలకి పొయ్యటానికీ వాడతాను. వంటింట్లో సింక్ లో ఒక పెద్ద గిన్నె పెట్టుకుని చేతులు కడగటానికీ దానికీ దాన్నే వాడి, ఆ నీటిని మళ్ళీ మొక్కల్లో పోస్తాను.(అంటే జిడ్డు చేతులు కాదు. వంటింట్లో చాలా సార్లు చేతులు కడగటం ఒక అలవాటు నాకు..:)) ఇంకా పొద్దున్నే మొహం కడిగేప్పుడు చిన్నప్పుడైతే(పెద్దప్పుడు కూడా) బ్రష్ తో తోముతున్నంతసేపూ నీళ్ళు వదిలేసేదాన్ని. ఇప్పుడు ఒక మగ్ తో వాటర్ పెట్టుకుని వాటితో మొహం కడుగుతాను. అయిపోతే మళ్ళీ పట్టుకుంటా తప్ప టాప్ తిప్పి వదిలెయ్యను. పాపకు టబ్లో స్నానం చేయించి ఆ నీటిని బాత్రూమ్ కడగటానికి వాడతాను. ఇంకా చెప్పాలంటే జంధ్యాల సినిమాలో పిసినారి కోటా టైపులో నీళ్ళు వాడటం నేర్చుకున్నాను. రెండ్రోజులు ఉండటానికి వచ్చిన అమ్మానాన్న కూడా నా నీళ్ళ వాడకం చూసి మరీనూ... విడ్డూరం...ఓవర్ చేస్తున్నావ్..అంతొద్దు...అని వేళాకోళం మొదలెట్టారు. అయినా నే మారనుగా. మరి రెండు మూడు రోజులు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది వాటి విలువ. ఏదైనా అంతే మరి. మనుషులైనా, వస్తువులైనా ఉన్నన్నాళ్ళు విలువ తెలీదు !!

నీళ్ల గురించి కరువు పడ్డప్పుడల్లా నాకు చిన్నప్పుడు డిడి లో ఓ మధ్యాహ్నం చూసిన ప్రాంతీయ భాషా చిత్రం "తన్నీర్ తన్నీర్" గుర్తొస్తుంది. సరిత ఎంత బాగా చేస్తుందో. బాలచందర్ డైరెక్టర్ ఈ మూవీకి. ఒక మారుమూల పల్లెలో ప్రజలు నీటి కోసం పడే తాపత్రయం, ఇబ్బందులు, ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రమాణాలూ...బావుంటుంది సినిమా. దీనినే "దాహం దాహం" అని తెలుగులో డబ్ చేసిన గుర్తు. ఇందాకా వెతికితే యూ ట్యూబ్ లో మూవీ లింక్స్ దొరికాయి. ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి. చిన్నప్పుడెప్పుడో చూసింది కదా మళ్ళీ నేనూ చూస్తా.
మొదటిభాగం:

http://www.youtube.com/watch?v=XtDMmQHOGBs&feature=రెలతెద్

రెండవభాగం:

http://www.youtube.com/watch?v=Xqf6s_bFU8A&feature=రెలతెద్


ఎవరికైనా బ్రష్ చేసుకునేప్పుడు సింక్లో నీళ్ళు వదిలే అలవాటు ఉంటే మానేయండి మరి. నీళ్లను జాగ్రత్తగా వాడండి. ఆదా చేయండి. ఇంతకీ ఇవాళ తృష్ణ కన్ను నీళ్ళ మీద పడిందేంటబ్బా అనుకుంటున్నారా? ఇవాళ march 22nd - World water day !!


---------------
note: నే నిచ్చిన యూట్యూబ్ లింక్స్ లో "తన్నీర్ తన్నీర్" సినిమా కొంత భాగమే ఉంది.

Monday, March 21, 2011

Dr.Balamuralikrishna - Pandit Ajoy Chakraborthi గార్ల జుగల్బందీ VCD


ఈ VCD చూస్తే మిడిమిడి సంగీత జ్ఞానం ఉన్న నాకే ఇంత ఆనందం కలిగితే నిజంగా శాస్త్రీయ సంగీతజ్ఞానం బాగా ఉన్నవారికి ఎంత ఆనందం కలుగుతుందో కదా...అన్నది ఈ VCD చూడగానే నాకు కలిగిన భావన. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ VCDలో కర్ణాటక సంగీత విద్వాంసులు డా.బాలమురళీకృష్ణ + హిందుస్తానీ సంగీత విద్వాంసులు పండిట్ అజయ్ చక్రవర్తి గార్ల జుగల్బంది ఉంది. హైదరాబాద్ లోని Chowmahalla Palace లో జరిగిన live concert రికార్డింగ్ ఇది.

నెట్లో వెతికితే యూట్యూబ్లో వీరిద్దరి జుగల్బందీ లింక్స్ కొన్ని దొరికాయి. సంగీతప్రియులు చూసి, విని ఆనందించండి.

http://www.youtube.com/watch?v=HEG7rIxOhgE&feature=related
http://www.youtube.com/watch?v=ER-f3fE7t30&feature=related

http://www.youtube.com/watch?v=rKviFaBPacM&feature=related
http://www.youtube.com/watch?v=TdncV2kOp-c&feature=related




ఇద్దరూ పాడిన వాతాపిగణపతిం భజే మొదటిభాగం:



రెండవభాగం:


Sunday, March 20, 2011

దెబ్బకు ఠా...


నిన్న ఒకచోటకు వెళ్ళాం. అనివార్య కారణాలవల్ల అక్కడ్నుండి morning showకు వెళ్ళాలని నిర్ణయించటం అయ్యింది. అయితే ఏ సినిమా? ఏ హాలు? అని ఆలోచిస్తే మేం వెళ్ళిన చోటుకు దగ్గరలో ఉన్న రెండు మూడు హాల్స్ లో అని డిసైడైయ్యింది. మూడింటిలోనూ "దొంగల ముఠా" అని ఉంది. ఇదేం సినిమా? ఊరూ పేరూ వినలేదే? పబ్లిసిటీ ఏం ఇవ్వలేదా? ఎప్పుడు రిలీజైంది? అన్నాను పొరపాటున. 'ఏం తల్లి ఏ లోకంలో ఉన్నావు? ఐదురోజుల సినిమా, ఐదురోజుల సినిమా అని డప్పు మోగుతూంటే? పైగా నిన్ననే రిలీజ్..' అన్నారు. "విన్నాను కానీ అయిపోయిందనీ,రిలీజ్ కూడా అయ్యిందని తెలీదు.." అన్నా. అయినా నిన్నే రిలీజ్ అయితే టికెట్లేం దొరుకుతాయి? పైగా ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వెళ్తే ఏమౌతుందో ఈ మధ్యన బాగా అర్ధం అయ్యాకా అంత సాహసం తగునా? అనిపించింది. కానీ మనసు పీకింది.. వద్దంటే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో.. ఏదో ఒకటి చూసేస్తే పోలా అనేస్కుని సరేననేసా. మనకో దుర్వ్యసనం ఉంది. తను నా కూడా వస్తే చాలు ఏ డొక్కు సినిమా అయినా చూసెయ్యబుధ్ధేస్తుంది. టిపికల్ భార్య మెంటాలిటీ. కాన్ట్ గెట్ డీవియేటెడ్ !

ఇరవై నిమిషాలు ఉంది సినిమా మొదలవటానికీ. ఎందుకైనా మంచిదని వెళ్ళినచోటే ఓసారి "దీప రివ్యూ" కోసం నెట్లో వెతికా. ఎవరీ దీప? అంటే ఫుల్ హైదరాబాద్.కామ్ లో రివ్యూలు రాస్తుందీవిడ. రివ్యులు చూసి వెళ్ళినా కొత్త సినిమాకి వెళ్ళి బుక్కయిపోతున్నామని గగ్గోలు పెడితే అన్నయ్య చెప్పాడీమధ్యనే. ఈ సైట్లో రివ్యూ చూడు. అదీ "దీప" రివ్యూ చూడు. ఆవిడ బాగా రాస్తే మనకీ నచ్చుతుంది. కనీసం రేటింగ్ అయినా సరిగ్గా వేస్తుంది. మన views తో match అవుతుందావిడ రివ్యూ అని. అప్పటి నుంచీ ఏదన్నా తెలీని సినిమాకు వెళ్ళే ముందు దీప ఎంత రేటింగ్ ఇచ్చింది అని చూసి మరీ వెళ్లటం అలవాటైపోయింది. ఇక అదివరకూలాగ నిరాశపడట్లేదు. నిన్న ఏం రాసిందో చదివే టైం లేదు కానీ రేటింగ్ 5.5 అని చూసి పర్వాలేదు అనుకుని బయల్దేరా.


ఐదు నిమిషాల్లో హాల్ చేరాం. టికెట్లు ఈజీగానే దొరికేసాయి. మా పక్కకి ఒక ముదుసలి జంట(ఇద్దరికీ 65ఏళ్ళు పైనే ఉంటాయి) వచ్చి కూర్చున్నారు. అమ్మో వీళ్ళకెంత ఓపికో ఈ ఎక్స్పరిమెంటల్ సినిమాకు వచ్చారు అని హాచ్చర్యపడిపోయేసాము. ఆ మధ్యన వర్మగారు "అడవి"లోకి తీసుకెళ్ళి భయపెట్టేసాకా మళ్ళీ వర్మ సినిమాలేం చూడలేదిక. సినిమా మొదలైంది. కెమేరా తెగ కదుల్తోంది. ఒక చోట నిలవట్లేదు. కుంచెం భయమేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తోంది. కొంపతీసి ఇది దెయ్యాల సినిమా కాదుకదా అన్నా. అయితే దెయ్యాలు లేకపోతే అండర్ వరల్డ్. రెండే కదా ఈయన థీములు.

రవితేజ గెటప్ బానే ఉంది. హీరోలా కాకుండా ఇలా ఒక మర్యాదైన భర్త పాత్ర ఏదైనా వెయ్యచ్చు అనిపించింది. అదేమిటో చార్మీ అలా మాట్లాడుతోంది? నట్టుతోందా? భర్తని దెప్పుతోందా? అర్ధం కాలే. సరే ఇద్దరు ముగ్గురు పాత్రలు బయటకు వచ్చారు. నయం ఈ ఇద్దరితోనే సినిమా లాగించేస్తాడేమో అని భయపడ్డా. కానీ ఎంతసేపటికీ కథ ముందుకి జరగదే? తొసేవాళ్ళెవరూ లేకపోయారో ఏమో. మంచు లక్షిగారు జీన్సే వేసుకుని ఓ పైపుచ్చుకుని పైకి పాకుతున్నారు. సారీ ఎక్కుతున్నారు. ఆ తర్వాత కూడా కెమేరా ఛార్మీ జీన్స్ దాటి ముందుక్కానీ వెనక్కిగానీ వెళ్లటం లేదు. నాకు "క్షణ క్షణం"లో శ్రీదేవి జీన్స్ వేసుకుని పైకెక్కటం గుర్తు వచ్చింది. పాపం జీన్స్ కీ - డైరెక్టర్ కీ ఏదో అవినాభావసంబంధం ఉండి ఉంటుంది అనుకున్నా.

సినిమా సస్పెన్సా? కామిడీనా? డైరెక్టర్ ఇంటర్వెల్ దాకా డిసైడ్ చేసుకోలేకపోయాడు పాపం. ఇంటర్వెల్లో పక్కన కూర్చున్న తాతగారు బయటకు వెళ్ళివచ్చారు ఓపిగ్గా. మంచు లక్ష్మి ని చూస్తూంటే నాకు పాత సినిమాల్లోని విజయలలిత గుర్తుకు వస్తోంది. "అనగనగా.. " సినిమాలో కూడా ఆ నటన అదీ చూస్తూంటే విజయలలితే గుర్తు వచ్చింది. సరిగ్గా వాడుకోవాలి కానీ తెలుగు తెరకు ఒక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ దొరికింది అనిపించింది నాకు. లేడి విలన్ గా ఎస్టాబ్లిష్ అవటం ఇష్టం లేకనేమో ఈ సినిమా కథ మధ్యలో అర్జెంట్గా పోలీస్ఆఫీసర్ అయిపోతుందీవిడ. ఏదో ఒకటి తెలుగు కాస్త సరిగ్గా పలికితే బాగుండు...ఆ డైలాగులు వింటూంటే రెండు మూడు రోజుల క్రితం ఏదో బ్లాగ్లో ఈవిడ తెలుగు ఏక్సెంట్ మీద చదివిన టపా గుర్తుకొచ్చింది.(తన పక్కన కూర్చుని, సినిమాహాల్లో కూడా బ్లాగు ని మర్చిపోని వీర బ్లాగర్ని..హా..హా..హా)

రెండవ భాగం సినిమాలో కాస్త కామెడీ కనబడింది. సినిమాను ఏ జానర్ లోకి తొయ్యాలో అప్పటికి డిసైడ్ అయ్యిందన్నమాట. బ్రహ్మాజీకి పాత్ర, డైలాగులు లేకపోయినా అతని మేనరిజం నాకు భలే నచ్చేసింది. ముగ్గురు దొంగలతో రవితేజ డైలాగులు చెప్తున్నప్పుడు, తలొకరి వైపూ చూసి తలాడించటం విసుగనిపించినా నవ్వు తెప్పించింది. బ్రహ్మానందానికి బొత్తిగా చెయ్యటానికి ఏం లేదు. ప్రకాష్ రాజ్ కూడా అనవసరమ్ అనిపించింది. కానీ కథనంలో బలం లేక ఈ నటులవాల్లనైనా చివర్దాకా చూడగలిగాం. కొత్త ఎక్స్పరిమెంట్ చెయ్యాలన్నా శ్రధ్ధ కథనం పట్ల కూడా ఉండి ఉంటే మంచి సినిమాగా మిగిలిపోయేదేమో. చివరలో ఆ పాట ఎందుకో తెలీలేదు. ప్రేక్షకుడిలో ఇంకా ఏ మాత్రమైనా సహనం మిగిలి ఉందా అని పరీక్షించడానికేమో.

ఇహ సినిమాకు వాడిన కెమేరా, లైటింగ్ గట్రాల గురించి చాలామంది చాలా చోట్ల రాసేసారు. గంటన్నర లో సినిమా అయిపోవటం మాత్రం తెగ నచ్చేసింది.ఇంతకీ సినిమా ఎలా ఉందీ అని మేం వెళ్ళమని తెలిసిన అందరూ అడగటమే. "అదే..సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాకుండా ఉంది..."అని చెప్పా. ఇంతవరకూ డిసైడ్ చేస్కోలేకపోయా. అద్ది రాం గోపాల్ వర్మ టాలెంట్ అంటే. ఈ డెసిషన్ మేకింగ్ లో కాస్త మీరు హెల్ప్ చేయ్యరూ..?

Saturday, March 19, 2011

నిరీక్షణ..


నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

చిరుగాలి సవ్వడికి తల ఊపే
ప్రతి పువ్వు కదలికకి
ఆకురాలు నిశ్శబ్దంలోకి
తొంగి తొంగి చూసాను..
దారి పొడుగునా..అడుగడుగునా
పరీక్షించి...ప్రతీక్షించి
వేచి వేచి చూసాను..
ఎక్కడా నీ పాదాల జాడే లేదు.
ఏ చోటా నీ ఆచూకీ దొరకనేలేదు.
ఏమయ్యావు నువ్వు?

క్రితం జన్మలో ఎప్పుడు విడిచావో
ఈ చేతిని...
ఇంతదాకా మళ్ళీ అందుకోనేలేదు..
ఎక్కడని వెతకేది నీ కోసం?
నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను..

చినుకురాలినప్పుడు..
కమ్మని మట్టివాసన
గుండెనిండా నిండినప్పుడు..
దూరాన గుడిగంటలు
హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు..
చల్లని వెన్నెల కిరణాలు
చెట్లమాటు నుంచి
నావైపు తొంగిచూసినప్పుడూ..
మధురమైన రాగానికి పరవశించి
నా గొంతు శృతికలిపినప్పుడూ..
ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఈ నిరీక్షణకూ..ఈ అన్వేషణకూ అంతం ఎప్పుడు?
ఏ నాటికి నీ చేయి
నాకు తోడునిచ్చి అందుకునేది?
నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

*** *** *** *** ***

పైన రాసినది ఇప్పుడు రాసినది కాదు...:) 12ఏళ్ళ క్రితం రాసిన ముచ్చట. ఆ తరువాత నాలుగేళ్ళకు మా పెళ్ళి అయ్యింది. అప్పుడిక గట్టిగా చేయిపట్టేసుకుని ఈ కవితను అంకితమిచ్చేసాను...:) "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని బలంగా నమ్మే మనిషిని నేను. మధ్యాహ్నం "మాల గారి బ్లాగ్" లో పైన చిత్రాన్ని, ఆ తరువాత మాల గారి ఆహ్వానంపై ఈ రాజా రవివర్మగారి చిత్రానికి కవితలు రాసిన బ్లాగ్మిత్రుల ఇతర కవితలు చదివాకా వెంఠనే నాకు ఈ పాత కవిత గుర్తుకు వచ్చింది. మాల గారికి 'నేను రాస్తానని' పర్మిషన్ అడిగేసి, ఇంటికి వచ్చి పాత పుస్తకాలన్నీ తిరగేస్తే దొరికేసిది - కవిత రాసిన చిన్న స్పైరల్ నోట్ పాడ్. కానీ పనులన్నీ అయ్యేసరికీ ఇంత సమయమైంది. సరేలే ఇవాళ్టి వెన్నెల తోడుంది కదా అనేస్కుని టపా రాసేస్తున్నా.

పైన ఫోటో నాకు నెట్లో దొరికిన మరో ఇమేజ్.

Thursday, March 17, 2011

త్రిశతం


ఈ మెట్టు మొత్తానికి ఎక్కేసాను. మధ్య మధ్య ఆగిపోతూ ...పడుతూ..లేస్తూ..వగరుస్తూ...ఒకోసారి నెమ్మదిగా పాకుతూ.. మొత్తానికి ఇలా మూడొండలవ టపా పూర్తి చేస్తున్నాను. రెండో మూడో టపాలు తీసేసాకా, కొన్ని డ్రాఫ్ట్ లోకి తోసేసాకా, మరికొన్ని నా ఇతర బ్లాగ్విభజన్లోకి వెళ్పోయాకా ఇదిగో ఇప్పటికి మూడొందలకి చేరాను. మొదట్లో ఉన్న మామూలు స్పీడ్లో వెళ్లి ఉంటే కనీసం ఐదొందలు దాకా చేరేదాన్ని. కానీ నిజ జీవితం లాగే ఈ బ్లాగ్ జీవనం కూడా ఒక roller coaster రైడ్ లాంటిదే. కాబట్టి సీదాగా ప్రయాణం సాగించలేకపోయాను. ఈ మెట్టును చేరటం సులభమైతే కాలేదు. మొదట్లో కొన్ని బ్లాగుల్లో లకారం పైనే ఉన్న విజిటర్స్ నంబర్ చూసి అమ్మో అనుకునేదాన్ని. అలాంటిది క్రితం నెల్లోనే నా అతిధుల జాబితా కూడా లక్ష దాటింది. నామటుకు నాకు అది చాలా ఆనందకరమైన విషయం. ఎక్కువ వ్యాఖ్యలు రావటం వేరు, ఎక్కువమంది బ్లాగును చదవటం వేరు.

దాదాపు ఏడాది పూర్తయ్యేవరకూ వ్యాఖ్యలు వ్యాఖ్యలు అని కలవరించేదాన్ని. ఇప్పుడు కూడా ఎక్కువ వ్యాఖ్యలు వస్తే ఆ రోజంతా సంబరమే. ఎందుకంటే ఏ రచయితకయినా చదివేవారి స్పందనే ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా బాగా రాయాలన్న ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి వ్యాఖ్యలు తగ్గిపోయినప్పుడు కృంగిపోయేదాన్ని. ప్రముఖ బ్లాగర్లు ఏం రాసినా ఆహా ఓహో అంటారు, సామాన్య బ్లాగర్ మంచి విషయాలు రాసినా ఒక్క వ్యాఖ్యా రాయరు అని తిట్టుకునేదాన్ని. కాబట్టి నాకున్న సమయంలో నేను కొత్త బ్లాగ్ ఏదైనా చదివితే మాత్రం నచ్చిన చోట తప్పక వ్యాఖ్య రాస్తూంటాను. కానీ మెల్లగా నాకు అర్ధమైన సంగతి ఏంటంటే నా బ్లాగ్లో వ్యాఖ్యల కన్నా రీడర్స్ సంఖ్య పెరుగుతోందని. ఒకప్పుడు వందమంది మాత్రమే చదివే ఈ బ్లాగ్ ను రోజుకు మూడొందలు తక్కువ కాకుండా చదువుతున్నారు. అది నాకు విజయమనే చెప్పాలి.

వ్యాఖ్యలు రాయకపోయినా రెగులర్గా నా బ్లాగ్ చదివే నా మిత్రులు, బంధువులు ఎంతో మంది ఉన్నారని ఈ మధ్యనే తెలిసింది. "పొద్దుటే ఆఫీసుకి రాగానే ఇవాళేం రాసావో అని చూడటం అలవాటయిపోయింది...నువ్వు రాయటం మానేస్తే మళ్ళీ ఎప్పుడు రాస్తావు అని చూస్తుంటాను..." అని కొందరు ఇటీవలే చెప్పటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి అప్పుడప్పుడు వ్యాఖ్య రాయచ్చుకదా అంటే "ఆఫీసులో ఉంటాకదా కుదరదు..ఒకోసారి బధ్ధకం" అని సమాధానం. ఇలా నాతో చెప్పకపోయినా చదివేవాళ్లు ఇంకా ఉన్నారన్న ఆలోచన రాయాలన్న సంకల్పాన్ని దృఢం చేస్తుంది.

ఇక భాస్కరన్నగారు తన 400వ టపాలో రాసినట్లుగానే ఉంటుంది బ్లాగ్లోకంలో ఈక్వేషన్..
యు రీడ్ మై బ్లాగ్
ఐ రీడ్ యువర్ బ్లాగ్
యు కామెంట్
ఐ కామెంట్
యు నో రిప్లై
ఐ నో కామెంట్
యు నో రీడ్ మైన్
ఐ నో రీడ్ యువర్స్
ఖేల్ ఖతం
దుకాణ్ బంద్
(ఇది భాస్కరన్నగారు రాసిన ఈక్వేషనే)

నేనూ అలా చాలామంది రీడర్స్ ను దూరం చేసుకున్నాను. కామెంట్స్ తగ్గిపోయాయి. కానీ ఇంకా కొందరున్నారు. నేనెప్పుడూ వాళ్ల బ్లాగ్ జోలికన్నా వెళ్ళకపోయినా వ్యాఖ్యలు రాస్తారు. వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. ఏమాటకామాటే.. నేనంత మంచిదాన్ని కాదు మరి. కొంచెం చెడ్డదాన్నే...:) కొత్తల్లో బ్లాగ్లోకం చాలా బాగుండేది. ఈమధ్యన పాతమిత్రులందరూ నెమ్మదిగా ఒక్కొక్కరే రాయటం మానేస్తున్నారు. ఎంతో దిగులుగా ఉంటుంది. ముఖ పరిచయం లేకపోయినా అల్లుకుపోయిన స్నేహాలను మరిచిపోవటం సాధ్యమా? అలాఅని రాస్తూ ఉండమని ఎంతమందినని అడిగేది? ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఎవరికి ఎరుక? నాకూ కుదరటం లేదు. కానీ ఛీ పొమ్మన్నా చూరుపట్టుకుని వేళ్ళాడే దశమగ్రహం లాగ ఎన్ని అడ్డంకులొచ్చినా బ్లాగ్లోకపు చూరును వదలలేదు. ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసిన నాకు బ్లాగింగ్ వదిలేయటం కష్టమైన పని కాదు. ఇదొక వ్యసనమని కాదు.... ఒడిదొడుకుల జీవితానికి బ్లాగింగ్ ఒక ఆటవిడుపు అని.

ఇంకో కొత్త విషయం ఈ మధ్యన బోధపడింది. నా బ్లాగ్ నచ్చనివాళ్ళు, నా రాతల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా ఉన్నారని. అవును మరి నాణానికి రెండో వైపు కూడా చూడాలికదా. నా బ్లాగ్ నచ్చనివారికీ, నా రాతలు వేళాకోళంగా అనిపించేవారికీ ఒక్కటే మాట చెప్తాను...దయచేసి నా బ్లాగ్ చదవకండి. నచ్చనివి చదవటం ఎందుకు? మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? నా రాతలు నచ్చేవారే నా బ్లాగ్ చదువుతారు. నా సొంత బ్లాగ్లో నాకు తోచిన రాతలు రాసుకునే హక్కునీ, అవకాశాన్ని, నాకు తోచిన విషయాలు రాసుకునే స్వేచ్ఛనీ నాకు బ్లాగ్ స్పాట్ వాళ్లు ఇచ్చారు. నే రాసినది మరో పదిమంది చదవాలన్నది నా అభిలాష కాబట్టి అగ్రిగేటర్లలో నా బ్లాగ్ ఏడ్ చేసుకున్నాను. కాబట్టి నా రాతలు నచ్చనివాళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని, మేధస్సునీ ఈ బ్లాగ్ చదవటానికి కాకుండా మరో మంచి పనికి వినియోగించుకోవలసినదని సవినయమైన మనవి.

దాదాపు ఇరవై నెలల బ్లాగింగ్ అనుభవంలో చివరిగా నేను చేసుకున్న నిర్ణయం ఒక్కటే. రాయాలని తోచినన్నాళ్ళు, కుదిరినన్నాళ్ళు రాస్తాను. చదివేవాళ్ళు చదువుతారు. అంతే. వ్యాఖ్యలకై ఎదురుచూపులు, చింతించటాలు ఎప్పుడో పోయాయి. ఈ బ్లాగ్ ఒక సామాన్య మధ్యతరగతి స్త్రీ మనోభావాల సమాహరం. నిరంతరం ఘోషించే కెరటాల మాదిరి ఈ ఆలోచనలు విశ్రాంతి నెరుగవు. "బ్లాగనందం" అనే టపాలో చెప్పిన పాటనే ఇప్పుడు కూడా నా బ్లాగ్ కు డెడికేట్ చేస్తున్నాను..

"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటో
పొల్చుకో హృదయమా.. ఎందుకీ అలజడి
దాహానిదా.. స్నేహానిదా.. ఈ సుచన ఏమిటో
తేల్చుకో నయనమా.. ఎవరిదీ తొలి తడి
పట్టుకో పట్టుకో చేయ్యిజారనివ్వక ఇకనైనా..
స్వప్నమే సత్యమై రెప్పదాటిపోయే సమయానా..
కంటికే దూరమై గుండేకే ఇంతగా చేరువైనా ....
...నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా ...."


మరోసారి.. మరోసారి.. మరోసారి.. నా బ్లాగ్ చదివే పాఠకులకూ, వ్యాఖ్యలు రాసి ప్రోత్సహించే అభిమానులకూ శతకోటి వందనాలు.

Wednesday, March 16, 2011

మల్లాది సూరిబాబుగారి గాత్రం


"మల్లాది సోదరులు"గా పేరుగాంచిన కర్ణాటక సంగీతకళాకారులు మల్లది శ్రీరామ్ ప్రసాద్, మల్లది రవి కుమార్ సోదరుల తండ్రిగారు శ్రీ మల్లది సూరిబాబుగారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సీనియర్ అనౌన్సర్ గా రిటైరయ్యారు. నాన్నగారి కొలీగ్ కావటంతో చిన్నప్పటి నుంచీ పరిచయం. సూరిబాబు మావయ్యగారు అనే ఇప్పటికీ పిలుస్తాను. ఇటీవలే ఇంటికి వెళ్ళినప్పుడు మావయ్యగారిని చాలా ఏళ్ళతరువాత కలవటం కూడా జరిగింది. మావయ్యగారు చాలా బాగా పాడతారు. మా చిన్నప్పుడు ఎప్పుడటువైపు వెళ్ళినా శిష్యులతో వాళ్ళ ఇల్లంతా నిండిపోయి ఉండేది. లలిత, శాస్త్రీయ సంగీతాలను ఆయనవద్ద నేర్చుకోవటానికి ఎంతో మంది పొరుగూళ్ల నుంచి కూడా వస్తూండటం నాకు తెలుసు. నాకెంతో ఇష్టమైన ఆయన గాత్రంలో ఒక భక్తి గీతం ఇక్కడ వినండి. రొటీన్ గా కాకుండా ఒక విశిష్ఠతతో వినేకొద్దీ వినాలనిపించే ఆయన గాత్రం చాలా బావుంటుంది.

రచన: ఆదూరి శ్రీనివాసరావు
గానం: మల్లది సూరిబాబు
ఆల్బం: సాయినాదఝరి




వీడకుమా విడనాడకుమా (2)
ఎదనుండి ఎడబాయకుమా(2) llవీడకుమాll

కనులలో దాగిన కాంతివి నీవు
చెవులకు వినికిడి శక్తివి నీవు
దేహము లోని దేహివి నీవు(2)
ఆకృతిలేని ఆత్మవు నీవు llవీడకుమాll

సత్యము తెలిపిన సద్గురు స్వామివి
అందరిలోనీ అంతర్యామివి
శ్రీశైలములో సుందర శివుడవు
పళనిలో వెలసిన శరవణభవుడవు llవీడకుమాll

ఏమరుపాటుతో మిడిసిపాటుతో
ఎపుడైనా నే తలచకున్నను
కంటికి రెప్పగా కాయుము దేవా
తీరుగా నడుపుము జీవన నావ llవీడకుమాll

*******************

ఇది మరో చిన్న ఆలాపన. "నిశ్శబ్దం-గమ్యం" అనే నాన్నగారి అవార్డ్ ప్రోగ్రాం లోది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రాసిన ఈ వాక్యాలు ఎంత సత్యమో కదా అనిపిస్తాయి.


ఇక్కడని అక్కడని ఎక్కడ ఎన్ని శిఖరాలెక్కినా
ఒక్కనాడూ...
ఒక్కనాడూ మనిషి లోపలి లోభము ఎక్కడ తీరదూ
మనిషి లోపలి లోభమెక్కడ తీరదూ...




Tuesday, March 15, 2011

ఏళ్ళు మారినా రైళ్ళలో ఇదే ఇబ్బంది !


రైళ్ళతో నా అనుబంధం చాలా ఎక్కువనే చెప్పాలి. దాదాపు ఇరవైఏళ్ళపాటు పొద్దున్నే లేచి విజయవాడలో సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి మధ్యాహ్ననికి కాకినాడ చేరేవాళ్ళం. వెళ్ళేప్పుడు ఇదే రైలు. తిరిగివచ్చేప్పుడూ అదే రైలు. మధ్యాహ్నం ఎక్కితే రాత్రికి చేరేవాళ్ళం. రత్నాచల్ వచ్చాకా దానికి మారిపోయాం. కానీ దానిలో ఓ నాలుగైదేళ్ళకన్నా ఎక్కువ ప్రయాణించలేదు. ఎక్కువ సర్కారే మా ఆస్థాన రైలు. రెండు మూడు నెలలకోసారి తప్పక ప్రయాణాం ఉండేది. మరి మా అన్నయ్య అక్కడే ఉండేవాడు కనుక కాలేజీకొచ్చేదాకా ఏ శలవులొచ్చినా మాకు తెలిసినది కాకినాడ ప్రయాణమే . కాలేజీలోకి వచ్చాకా పెద్దమ్మావాళ్ళ ఊరు భీమవరం, పిన్నీ వాళ్ళ ఊరు నర్సాపురం అనీ శలవుల్లో బంధువుల ఇళ్ళకు వెళ్ళటానికి పర్మిషన్ దొరికేది. ఆ ఊళ్ళకి ఆయా పాసింజర్లు ఎక్కేవాళ్లం. చాలా చిన్న దూరాలకు బస్సు తప్ప ఎప్పుడూ రైళ్ళే ఎక్కేవాళ్ళం.

ఇంతకూ సర్కార్ ఎక్స్ ప్రెస్ లో మాది సిట్టింగ్ జర్నీ అయినా రిజర్వేషన్ ఉండేది. వారం ముందో, శలవు దినాలైతే ఇంకా ముందో రిజర్వేషన్ చేయించేసేవారు నాన్న. వెళ్ళేప్పుడు తక్కువ సామాను ఉన్నా వచ్చేప్పుడు మాత్రం చాలా సామాను ఉండేది. విజయవాడ, కాకినాడ రెండూ స్టార్టింగ్ స్టేషన్సే కాబట్టి రద్ది ఉండేది కాదు. ఎక్కటానికీ దిగటానికీ వీలుగానే ఉండేది. ఎప్పుడూ కూడా మధ్యలో మాత్రం విపరీతమైన రద్దీ ఉండేది. డైలీ అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగస్తులూ, కాలేజీ పిల్లలతో కిటకిటలాడుతూ ఉండేది రైలంతా. రాజమండ్రి అమ్మావాళ్ల ఊరవటంతో అక్కడ ఎవరో ఒకళ్ళు, భీమవరంలో పెద్దమ్మావాళ్ళు స్టేషన్కు వచ్చేవారు. వాళ్ళు ఎక్కి కాసేపు కూర్చునేవాళ్ళు. ఒకోసారి అలా కుదిరేది కాదు జనం వల్ల. బయట నించునే మాట్లాడేసి వెళ్పోయేవారు. అసలు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలోకి మామూలు జనం ఎందుకు ఎక్కుతారో , ఎందుకు ఎక్కనిస్తారో ఇప్పటికీ నాకు అర్ధం కాని ప్రశ్న. డైలీ ట్రావెల్ చేసేవాళ్లకి వేరే కంపార్ట్మెంట్లు ఇవ్వచ్చు కదా? రిజర్వేషన్ దాంట్లో కి ఎందుకు ఎక్కనివ్వాలి? పైగా ఎక్కి ఊరుకోరు కూచోనిమ్మని గొడవ పెడతారు. జరగకపోతే తిట్టుకోవటం. క్యూల్లో నించుని రిజర్వేషన్ చేసుకుని మేము ఎక్కితే, అప్పటికప్పుడు రిజర్వ్డ్ బోగీలోకి రాజాలా ఎక్కేసి సీట్ల కోసం దెబ్బలాడటం ఏమిటో అర్ధమయ్యేది కాదు నాకు చిన్నప్పుడు.

ముగ్గురు కూచోవాల్సిన సీట్లలో మినిమం ఏడుగురు ఇరుక్కుని కూర్చునేవారు. మాకు రిజర్వేషన్ ఉంది మొర్రో అన్నా వినిపించుకోకుండా జరగండి జరగండి అని డిమాండ్ చేసి కూర్చునేసేవారు జనాలు. పోనీ కూర్చుని ఊరుకుంటారా అంటే అదీ లేదు. మన చేతిలోని పుస్తకమో పేపరో, విక్లీనో కబ్జా చేసేసి మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అని భయపడేట్టు చేయటం. లేకపోతే అది అలా అలా చేతులు మారుతూ పోయి మనం దిగే టైంకి ఎక్కడికి చేరిందో కూడా తెలీని పరిస్థితి వచ్చేది.వచ్చినా రూపురేఖలు కోల్పోయి వెనక్కు వచ్చేది. ఇక కంపార్ట్మెంట్ అయితే జనాలకు డస్ట్ బిన్ తో సమానం. కూర్చున్నచోటే వేరుశనగ తొక్కలు, నలిపేసిన కాయితం ముక్కలు, సీట్ల మీద అడ్డమైన రాతలు ఒకటేమిటి ? ఎక్కేప్పుడు అప్పుడే బీరువాలోంచి తీసిన ఇస్త్రీ చొక్కాలాగ నీట్ గా ఉన్న కంపార్ట్మెంట్ దిగే సమయానికి డస్ట్ బిన్లా మారిపోయేది. ఇక రైల్లో టాయిలెట్స్ అయితే డోకొక్కటే తక్కువ. గంతలు గంటలు వెళ్లకుండా ఉండలేము వెళ్ళి డోక్కోకుండా బయటకు రాలేము. నాకు తెలిసి ఓ ఇరవై పాతికేళ్లపాటు అంత భీభత్సంగా ఉండేది సర్కార్ ఎక్స్ ప్రెస్.



ఆ తరువాత "రత్నాచల్" చాలా నయం అనే చెప్పాలి. ఇక విజయవాడ వదిలాకా డే టైం జర్నీ చేయాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నైట్ జర్నీలే. పడుకోవటం పొద్దున్నే లేవటం. దానితో ఈ డే జర్నీలు ప్రస్తుతం ఎలా ఉన్నయో తెలీదు నాకు. మళ్ళీ దాదాపు పదేళ్ల తరువాత మొన్న ఒక పెళ్ళికి వెళ్లటానికి sitting జర్నీ చేయాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడూ కూడా. రిజర్వేషన్ వారం ముందే చేసారు తను. ఇక ఆరేళ్ళు నిండాయి కాబట్టి పాపకు కూడా టికెట్ కొన్నారు. వెళ్ళేప్పుడు రైల్లో బానే వెళ్ళిపోయాం. సీటింగ్ బాగుంది. ఆ రైలు అదే ఎక్కటం నేను. వచ్చేప్పుడు మాత్రం మళ్ళీ ఓసారి ఇరవై, పదేళ్ళ వెనుకటి ప్రయాణాలు గుర్తుకు వచ్చింది. రైలుపై అవే రాతలు, బోగీల్లో నానా తుక్కూ, రిజర్వేషన్ లేకుండా ఎక్కేసే జనం. జరగమన్నామని తిట్టుకోవటాలు, కంపుకొట్టే చెత్త టాయిలెట్లు.

వచ్చేప్పుడూ రైల్లో మధ్యలో ఓ చోట ముగ్గురు ఎక్కారు. "రిజర్వేషన్ చేయించుకున్నాం. పాపకు ఇబ్బందిలేకుండా దానికీ టికెట్ కొన్నాము. మేం జరగము." అని చెప్పము. అయినా అక్కడే నిలబడి దిగేదాకా మరో నాలుగైదు సార్లయినా జరగమని, చోటిమ్మని అడిగారు. పాపని ఒళ్ళో కూచోపెట్టుకోమంటారు. వారం క్రితం రిజర్వ్ చేయించుకున్నాం మొర్రో అన్నా వినరే. పెళ్ళిలో ఆడి ఆడి అలసిపోయి పాప నిద్రోయింది చాలా సేపు. పడుకుని లేవటంలేదని "పిల్ల కాదు పిశాచం" అన్నాడు నించున్న వాడు పక్కనమ్మాయితో. నాకు వినబడింది, ఒళ్ళు మండిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉందా? అని గట్టిగా అరిచేసాను రైల్లో.(వాడన్న మాటకు నాకు గౌరవమివ్వాలని కూడా అనిపించలేదు. ఏకవచనం వాడేసా) గొడవెందుకని తను ఆపేసారు. అటు తిరిగిపోయి నించున్నాడింకతను మొహం చెల్లక. ఓ పక్కన విపరీతమైన ఎండ భరించటం కాక మా సీట్లో మేము కూచుంటే కూడా ఇలా మాటలు పడాల్సిరావటం చాలా చికాకు తెప్పించింది. బస్సులో అయినా వెళ్దాం కానీ ఇంకెప్పుడూ సిట్టింగ్ జర్నీలొద్దు బాబోయ్ అని శ్రీవారితో మొరపెట్టుకున్నాను. ఏళ్ళు మారినా రైళ్ళలో ఇబ్బందులు, పరిస్థితులు ఇలానే ఉన్నాయే అని ఆశ్చర్యం,అసహ్యం కలిగాయి.


*************************
"రైలు ప్రయాణం "గురించి నేను రాసిన పాత టపా ఇక్కడ.

Monday, March 14, 2011

ప్రకృతి వైపరీత్యాలు

నాల్రోజులు పాటు టివీ, న్యుపేపర్లు చదవలే. ఊరెళ్ళి వచ్చి టివీ పెట్టగానే కనబడ్డా వార్తలు కలవరపెట్టాయి. రాష్ట్ర రాజధానిలో విగ్రహాల కూల్చివేత, జపాన్లో భయంకర సునామీ..భూకంపం....ఇవాళ పొద్దున్నేనేమో రేడియేషన్ భయం..అంటూ వార్తలు..! రాష్ట్రంలో సంగతి గురించి విచారించటం తప్ప ఏమీ చెయ్యలేం. పాపం విగ్రహాలేం చేసాయి...వాటి తాలూకు మనుషులకు కాదు ఇది తెలుగు జాతికి జరిగిన అవమానం అనిపించింది నాకు. రాష్ట్ర భవిష్యత్తు కాలానికే తెలుసు కదా అనుకున్నా..

సూర్యుని కిరణాలు మొదట తాకే నేల కాబట్టి "Land of Rising sun" అని చిన్నప్పుడు చదువుకున్న పాఠo. ప్రపంచయుధ్ధంలో పెద్దఎత్తున నష్టపోయాకా, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చవి చూశాకా కూడా మళ్ళీ నిలదొక్కుకుని ఆ దేశం సాధించిన ప్రగతి నన్ను అబ్బురపరుస్తాయి. ఇవాళ మరోసారి జపాన్ దేశం లో జరిగిన భీభత్సాన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. రైల్లో వస్తూంటే "పేపరే చూడలేదు ఈ నాలుగురోజులు. ప్రపంచం ఏమౌతోందో.." అన్నాను. నిజంగానే నాలుగురోజుల్లో ఎన్ని దుర్ఘటనలు జరిగిపోయాయో..

What are natural calamities and how does they occur? అని చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో ప్రశ్న ఉండేది. అది గుర్తొచ్చింది ఇవాళ న్యూస్ చూడగానే.. ప్రపంచంలో ఏదో ఒక చోట మానవుడి ప్రమేయం లేకుండా ప్రకృతి చేసే విలయతాండవ రూపమే ఈ వైపరీత్యాలు... మరి అవి ఎందుకు వస్తాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటూ పెద్ద జవాబే ఉండేది స్కూలు పుస్తకాల్లో. కానీ వేదాంతధోరణిలో చెప్పాలంటే భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు భూమి భారాన్ని దించటానికి దేవుడు ఇలాంటి వైపరీత్యాలు సృష్టిస్తూ ఉంటాడు అని ఎక్కడో చదివిన గుర్తు.

ప్రపంచం ఎంత అభివృధ్ధి చెందినా, అధునాతన సాంకేతికపరిజ్ఞానాన్ని సంపాదించినా ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆ పరిజ్ఞానానం అంతా మూగపోతుంది. చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయతలో మిగిలిపోతుంది. అంతా ప్రకృతి మాయ. జపాన్ లో ఈ వైపరీత్యం వాల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని, నష్టపోయిన కుటుంబాలు కొంతమేరకైన బాగుపడాలనీ, కనబడకుండా పోయిన కుటుంబసభ్యులు వారి వారి కుటుంబాలను మళ్ళీ చేరుకోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మీరూ ప్రార్ధించండి.

'Japan Earthquake: before and ఆఫ్టర్' అని ఒకచోట దొరికిన ఫోటోలు నేను ఇప్పుడే చూసాను. క్రింద లింక్ లో చూడండి...
http://www.abc.net.au/news/events/japan-quake-2011/beforeafter.htm

Tuesday, March 8, 2011

అభివందనం..



అన్నివేళలా పక్కనుండగల శక్తి
ఏది, ఏంత చెప్పినా వినే ఓరిమి
అర్ధం చేసుకునే సహనం
శ్రధ్ధ తీసుకోగల అభిమానం
అనురాగం ఆత్మీయత నిండిన
నవనీత హృదయ మగువ.

అన్నదమ్ములకు అనురాగం అందించినా
తల్లిదండ్రులకు అభిమానం పంచినా
స్నేహసౌరభాలు పంచిఇచ్చినా
భార్యగా బంధాలు పెనవేసినా
మాతృత్వపు మమకారాలు చూపినా
అత్తింట బాధ్యతలు తనవి చేసుకున్నా
ఉద్యోగభారాన్ని సమర్ధంగా మోసినా
ఎక్కడ ఎన్ని అవతారాలెత్తినా
తన స్త్రీత్వమనే అస్థిత్వాన్ని పదిలపరుచుకుంటుంది అతివ.


అపురూపమైన ఈ అస్థిత్వాన్ని గుర్తించలేని నిర్భాగ్యులు కొందరైతే
అదే అస్త్రంగా తమ స్త్రీత్వాన్ని ప్రజ్వలించుకునేవారు కోకొల్లలు.
పరిపూర్ణమైన ఆ స్త్రీత్వానికి వందనం.
ప్రతి బంధంలో ప్రాణం నింపే ప్రతి అతివకూ అభివందనం.




Sunday, March 6, 2011

ఒళ్ళు మండుతోంది..

ఆ దృశ్యం చూసినప్పటి నుంచీ.
నిన్న పొద్దున్నుంచీ.
ఒళ్ళు మండుతోంది.
బుడుగు భాషలో చెప్పాలంటే నడ్డి మీద చంపెయ్యాలన్నంత ఖోపం. ప్రతి పనికీ ఆ వీధిలోంచి వెళ్ళక తప్పదు. నిన్న కూడా ఆ ఇంటి మీదుగా నాలుగైదుసార్లు వెళ్ళాల్సివచ్చింది. అలా వెళ్ళినప్పుడల్లా మనసు రగిలిపోయింది. ఇవాళ పొద్దున్న కూడా పాల కోసం వెళ్తూంటే మళ్ళీ అల్లంత దూరంలో ఆ ఇల్లు కనబడగానే నిన్నటి విషయం గుర్తుకొచ్చి భలే కోపం వచ్చింది. అసలు మొదటి నుంచీ అతనిది ఏదో తేడా బొమ్మ అనే అనుకుంటూ వస్తున్నా. ఇప్పుడిక కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పటిదాకా అతనిపై ఉన్న కాస్త జాలీ కూడా ఎగిరిపోయింది. దగ్గరకు వెళ్ళీ, ఏమయ్యా ! నీకసలు మనసుందా? మనిషివేనా? అని కడిగెయ్యాలని. బాగా మనసారా తిట్టాలని...అనిపించింది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. నాకేం హక్కుంది? అతని ఇల్లు అతని ఇష్టం.

మేం ఈ ఏరియాలోకి వచ్చాకా ఏదన్నా పని మీద వెళ్లాలంటే ఆ వీధి లోంచే వెళ్ళాలి. బస్టాప్ దాకా వెళ్ళాలంటే ఐదు నిమిషాల నడక. దారిలో చాలా ఇళ్ళున్నా నా దృష్టి వీధికి ఎడమవైపున్న ఆ ఇంటి మీద పడటానికి ఒక బలమైన కారణం ఉంది. సన్నజాజి తీగ. నాకెంతో ప్రీతిపాత్రమైన పూలు. కాస్తా కూస్తా కాక ఇంత లావు మొదలుతో ఖాళీగా ఉన్న డాబా పైకి పాకిన పెద్ద తుప్పులా ఉన్న సన్నజాజితీగను చూసి రోజూ ఆనందిస్తూ ఉండేదాన్ని. ఇంకెంత మరో నెలారెంణెళ్ళు ఆగితే చెట్టంతా పువ్వులే అన్న ఊహ నన్ను చాలా సంబరపెట్టేది. ఆ తరువాత,ఆ ఇంటి గేటు దగ్గరే ఎప్పుడూ కనబడుతూ ఉండే సర్దార్జీ ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగేది. ఏభై యేళ్ళకు ఏ మాత్రం తక్కువ ఉండదు అతని వయసు. అంత పెద్ద ఇంట్లో అతను కాక ఒక ముసలి తల్లి మాత్రం కనబడుతూ ఉంటూంది. మరెవరూ కనబడేవారు కాదు. పైగా రోజూ ఏ వేళలో అటువైపు వెళ్ళినా ఆ గేటు దగ్గరే కుర్చీలో నిద్రోతూనో, నించునో కనబడతాడు ఆయన. రోజూ అదే దారి కావటంతో కొన్నాళ్ళకు గేట్లో ఆయన కనబడకపోతే ఆశ్చర్యం వేసేది. ఇవాళేంటి లేడు అని. ఆయన గురించి బస్టాప్ వచ్చేదాకా మాకు డిస్కషను. "ఎందుకండీ ఆయన అక్కడే నిలబడతాడు? ఏం పని లేదా? ఆ ఇంట్లో ఇంకెవరూ లేరేంటి? పెళ్ళవలేదంటారా? " అని తనని ప్రశ్నలతో వేధించేదాన్ని. "మనకెందుకు? అతని ఇల్లు అతని ఇష్టం. నించుంటాడో కూచుంటాడో." అనేవారు తను. "అలాక్కాదండీ, అలా వీధిలో నించునే ఉంటాడెందుకు? వేరే పనేం లేదా? అదేం టైం పాస్? ఏ పుస్తకమో చదువుకోవచ్చు కదా? కంప్యూటర్ లేదంటారా? లేదా టివీ చూడొచ్చు కదా? ముప్పొద్దులా అలా గేట్లోనే ఉంటాడేం? వాళ్ళీంట్లో ఏవైనా విలువైన వస్తువులున్నాయేమో? వాటికి కాపలాగా అలా నింఛుంటాడేమో?" అని అనేదాన్ని.
ఓ రోజలాగే ఏదో అనబోయాను. "అతని కాలు వైపు చూడు" అన్నారు తను. అప్పుడు చూశాను అతని ఒక కాలు బాగా లావుగా వాచి ఉంది. ఏదో కట్టు కూడా ఉంది. చూట్టానికి భయం వేసింది. "ఓహో అదన్నమాట సంగతి. ఏదో దెబ్బ తగిలి ఇలా ఇంట్లో ఉండిపోతున్నాడన్న మాట" అన్న సమాధానం దొరికింది. కానీ దెబ్బ తగిలితే ఇంట్లోనే ఉండచ్చు కదా. ఇలా వీధిలో నిలబడటం ఎందుకు? పైగా ఓ కుర్చీ కూడా వేసుకుని రాత్రిళ్ళు కూడా అక్కడే కూచుని కనిపిస్తాడు. కాలక్షేపానికి ఏం చేయాలో తెలియదా ఈయనకి?" అని బోలెడు ప్రశ్నలు నాకు. మరో రోజు వాళ్ళింటి గోడ దగ్గర ఏదో తుక్కు పోతున్నారని ఎవరినో తిడుతున్నాడు. ఆ తరువాత సంత రోజున కూరలవాళ్ళు ఆ ఇంటి ముందు కూరలు పరచబోతే ఒప్పుకోలేదు. ఇంతోటి ఇంద్ర భవనానికీ అడ్డామా అని నవ్వుకున్నాం. కూరలవాళ్ళు సణూక్కుంటూంటే మేమూ నవ్వుకున్నాం. కిరికిరీ మనిషన్న మాట. అనుకున్నాం.

ఇక నిన్న పొద్దున్నే వెళ్తూంటే ఆ ఇంటివైపు చూసి అవాక్కయ్యాను. తరువాత బోలెడు ఖోపం వచ్చేసింది. ఓళ్ళు మండిపోయింది. ఇంతకీ ఏం చేసాడో తెలుసా? అంత లావు మొదలుతో మరో నెల్లో పూయబోయే సన్నజాజి తీగ మొదలంటా నరికించేసాడు. అదేం పాపం చేసింది పాపం? నోరు లేని జీవం. పచ్చగా ఉన్న తీగను ఎలా నరకాలనిపించిందో. పరీక్షగా చూస్తే ఇంటికి రంగులేస్తున్న పనివాళ్ళు కనబడ్డారు. ఇంటికి రంగు వెయ్యటానికి అడ్డం వస్తోండని కొట్టించేసాడన్న మాట. కాసిని కొమ్మలు కొట్టించి మిగతాది ఉంచచ్చు కదా. ఇప్పుడా ఇంటి అందానికి ఇదేం అడ్డం వచ్చింది? ఉండేది ఇద్దరే కదా. ఎలాగోఅలా ఈ కిరికిరీ అంకుల్ ను మంచి చేసుకుని వేసం కాలంలో ఆ సన్నజాజి పూలూ రోజూ కోసుకోవచ్చని ఎన్ని కలలు కన్నాను..? ఒప్పుకోకపోతారా? అనుకున్నా. అంత పెద్ద తీగెకు ఎన్ని పూవులు పూస్తాయో కదా...కోసుకున్నా కోసుకోకపోయినా చూసి ఆనందించచ్చు. అటు వెళ్ళినప్పుడల్లా గుప్పుమనే వాసన ఆస్వాదించచ్చు అని ఆశపడ్డాను...

అసలు నా ఆశల సంగతి వదిలేస్తే పచ్చని చెట్టు నరకాలన్న ఆలోచన ఎంత భయంకరమైనది? మనసున్న మనిషెవ్వడూ అలా చెయ్యడసలు. మనుషులను హింసిస్తే శిక్షిస్తారు. జంతువులను హింసిస్తే కూడా శిక్షిస్తారు. కానీ పచ్చని ప్రాణమున్న చెట్టుని కొట్టేస్తే ఏ శిక్షా లేదేం? అలాంటి చట్టం కూడా ఎవరన్నా చెయ్యకూడదూ? మొక్కలకు మాత్రం ప్రాణాం ఉండదా? పొద్దున్నే లేవగానే చల్లని గాలితో ఎంత అందంగా పలకరిస్తాయి? ఆ పలకరింపులోని చల్లదన్నన్ని ఎవరూ గమనించరా? అందమైన పువ్వులతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మొక్కల మధ్యన కూచుంటే చిన్నగా తలలూపుతూ ఎన్ని కబుర్లు చెప్తాయో...అవి ఎవరికీ వినిపించవా? ఏమిటో మొక్కలంటే మనుషులకి అంత అలుసు. జంతువులు ఇంకా కుయ్యో మొయ్యో అని అరుస్తాయి. పాపం మొక్కలకు, చెట్లకు అలా అరవటం కూడా రాదు. వాటిని నరుకుతుంటే బాధ ఎవరితో చెప్పుకుంటాయి? చిరంజీవి లెవెల్లో " మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా.." అని భారీ డైలాగు వాటి తరఫున చెప్పే నాధుడు లేడనే కదా మొక్కలంటే మనుషులకు అలుసు. అందుకే ఒళ్ళు మండుతోంది...

***** ****
పూయలేకపోయిన నా ప్రియమైన సన్నజాజులు...

Saturday, March 5, 2011

ఇవేం పూలు?


ఏమిటీ కాగితం పూలు అనేద్దామనుకుంటున్నారా? అదేం కదు. ఇవి "చుక్కాకు పులు". ఆకుకూరల్లో ఒకటైన చుక్కాకుకు ఈ పూలు పూసాయి.నేనూ ఇదే చూడటం.కుండీలో పెంచిన చుక్కాకు పప్పులోకి రెండు కోతలు అయిపోయాకా ఇలా పూలు వస్తూంటే బాగున్నాయని ఉంచేసాను. కుండీ నిండుగా ఇలా పూసేసాయి. కాగితo పూల్లాగా ఉన్న ఈ పూలు చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇలా ఉంచేస్తే ఎండిపోయి విత్తనాలయిపోతాయని ఉంచేసాను. బాగున్నాయి కదా.




Thursday, March 3, 2011

ఇవాళేం చేసానంటే..


ఆయ్యో ఇవాళ బ్లాగనేలేదు... అసలు రోజూ రాయాలా? రూలేమీ లేదు. కానీ వీలైనంతవరకూ నాకోసం నేను ఈ ఈ-కబుర్లు రాస్కుంటూనే ఉంటాను. ఇంతకీ టపా రాయకుండా ఇవాళ ఏం చేసినట్లు? నిన్న చాంతాడంత క్యూ ఉందని సాములారి దర్శనం చేసుకోకుండా వచ్చేసాం కదా. అందుకని పొద్దున్న పనులయ్యాకా మళ్ళీ గుడికి వెళ్ళి ఓసారాసాములారిని పలకరించి, కాసిన్ని పాలు అభిషేకించి, ఓ దణ్ణమెట్టేసుకుని వచ్చేసామన్నమాట. ఇప్పుడొచ్చావ్... అప్పుడొచ్చావ్...అని కోప్పడడు కదా పెద్దాయన. మనుషులకైతేనే భయపడాలి. దేవుళ్ళకు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనమేంటో ఎదుటోళ్ళకన్నా, మనకన్నా, బాగా తెలిసినది దేవుళ్ళకే కాబట్టి.

ఇంకా ఏవేవో పనులు...ఇప్పుడేమో మరి రాత్రయిపోయింది కదా ఇంకేం కబుర్లాడతాను? టయిం లేదు...ప్చ్! అంద్కని ఇప్పుడే చేసిన "stuffed capsicum" కూర ఫోటో పెట్టేస్తాను చూసేయండి...ఈసరి గ్రేటెడ్ పనీర్ అదీ వేయకుండా సాత్వికమైన కర్రీలా వండేసాను. టేస్ట్ కూడా బానే ఉంది. మీకు నచ్చిందనుకోండి, "రుచి..." బ్లాగ్ లో మళ్ళీ చేసేస్కుందాం. ఎల్లెల్లవమ్మా. నువ్వు చెప్పేదేమిటి? గూగులమ్మ నడిగితే రెసిపీ చెప్పేస్తుంది అంటారా? అయితే నేనే తినేసి హాయిగా బజ్జుంటాను.


అదిగో బొమ్మ బాగుంది కదా...అడిగేయండి...అడిగేయండి..ఎలా చేసానో చెప్పేస్తాను..!!

Wednesday, March 2, 2011

మహా దేవ శంభో ...



(బిక్కవోలు గుడిలో ఫోటో)

శివరాత్రి సందర్భంగా శివునిపై కొన్ని ఓల్డ్ గోల్డీస్...

మహా దేవ శంభో (భీష్మ)

హర హర మహాదేవ(దక్ష యజ్ఞం)

దేవ దేవ ధవళాచలమందిర(భూకైలాస్)


నీలకంధరా దేవా(భూకైలాస్)

శైలసుత హృదయేశా(వినాయక చవితి)


------------------------

అదివరకూ నేను టపాయించిన తనికెళ్ల భరణిగారి రచించి, పాడిన "నాలోన శివుడు కలడు" పాటలు:
http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_16.హ్త్మ్ల్

ఆదిశంకరాచార్య విరచిత "నిర్వాణ షట్కం" :
http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_18.హ్త్మ్ల్

Tuesday, March 1, 2011

జ్ఞాపకాల పూలు



పొద్దున్నే మెలుకువ వచ్చి లేచి కళ్ళు నులుముకుంటూ లైటు కనబడుతున్న వంటింటి వైపు వెళ్తే, అక్కడ రేడియో లోంచి వినబడుతున్న ప్రసార విశేషాలు, అప్పుడే తీసిన కాఫీ డికాషన్ తాలుకూ ఫ్రెష్ సువాసన, పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉన్న ఇడ్లీ ప్లేట్లు, చెమట ఇంకటానికి మెడ చుట్టు చుట్టుకున్న పల్చటి తెల్లటి తువ్వాలుతో మామ్మయ్య దర్శనం అయ్యేది.(మా నాన్నమ్మను మేము "మామ్మయ్య" అని పిలిచేవాళ్లం). సెలవుల్లో ఊరు వెళ్లినన్నాళ్ళూ రోజూ అదే దృశ్యం. ఇంకా ముందర లేస్తే వంటింటి బదులు దొడ్లో లైటు, అక్కడ వారగా ఉండే సిమెంట్ గోలెం మందారాలు పుసిందా? అన్నట్లు గోలెం నిండుగా పరుచుకుని ఉన్న ఎర్రటి రేకమందారాలు(ముందు రోజు సాయంత్రమే ఎవరో ఒకరు మొగ్గలు కోసి అందులో వేసేవారు)...తులసి కోట దాటి తలుపు తీస్తే దొడ్లో ఏవో పనులు చేస్తూనో, మొక్కలకి నీళ్లు పోస్తూనో కనబడేది మామ్మయ్య. చీకట్లు తొలగుతూ తెల్లవారేవేళ అలా లేచి మామ్మయ్యను చూడటం ఒక అపురూపంగా తోచేది మాకు. ఆ దృశ్యం చూడటానికి వీలైనన్నిసార్లు పొద్దున్నే లేవటానికి ప్రయత్నించేవాళ్ళం నేనూ, మా తమ్ముడూ.

అదే వర్షాకాలమైతే దొడ్లో నూతి నిండా నీళ్ళు ఉండేవి. చేద వేయనక్కర్లేకుండా చెంబుతో ముంచితే నీళ్ళు అందేంత పైకి నీళ్ళు ఉండేవి. క్రితం రోజు సాయంకాలం మందార మొగ్గలు కోసి నూతిలో వెసేసేవారు. అప్పుడు పొద్దున్నే లేవగానే నూతి గోడల అంచుదాకా పైకి ఉన్న నీటిలో విచ్చుకున్న ఎర్రటి రేకమందారాలు ఎంత అందంగా ఉండేవో మాటల్లో చెప్పటం కష్టం. అప్పట్లో డిజిటల్ కెమేరాలు, మొబైల్ కెమేరాలు లేవు. లేకపోతే ఎన్ని ఫోటోలు తీసిఉందునో అనుకుంటూ ఉంటాను. దాదాపు పదమూడు రకాల మందారాలు పెంచేది మామ్మయ్య. అన్నీ పెద్ద పెద్ద వృక్షాలయి బోలెడు పూలు పూసేవి. పారిజాతాలు, కాసిని మల్లెలు, సంపెంగలు, నిత్యమల్లి, చామంతులు, దేవకాంచనాలు మొదలైన మిగిలిన పూలు కూడా పూసేవి. పాండ్స్ టాల్కం పౌడర్ ఏడ్ లో కనబడే ఫ్లవర్స్ లాగ ఉండేవి దేవకాంచనాలు. (అవి తెలుపు, లేవెండర్, గోధుమ రంగుల్లో ఉన్న చెట్లు చూసాను నేను. ఇంకా రంగులు ఉన్నాయేమో తెలీదు.) మా ఇంట్లోని దేవకాంచన వృక్షం తెల్లటి తెలుపు పులు పూసేవి. అందుకని మేము వాటిని "డ్రీమ్ ఫ్లవర్స్" అనేవాళ్లం. ఇక పనిమనిషి లక్ష్మి వస్తునే మిగిలిన పువ్వులన్నీ పూజకు కోసి తెచ్చాకా, అవి ఇంట్లోని నాలుగు వాటాలవాళ్లకు పంచబడేవి. సన్నజాజులు మాత్రం నేనక్కడ ఉన్నన్ని సాయంత్రాలు నా జడల్లోకే. మంచినీళ్లకు ఎవరొస్తేవాళ్ళు వాళ్ల వాటా తాలుకు పూలు పట్టుకెళ్ళేవారు. ఇంటివాళ్లం మనమే కదా అన్ని పూలూ మనమే వాడుకోవచ్చు కదా అనడిగేదాన్ని నేను. వాళ్ళూ దేవుడికి పెడితే మంచిదే కదా అనేది మామ్మయ్య. సాయంత్రాలు రెండ్రోజులకోసారి ఎరుపు, పసుపచ్చా రంగుల్లో పూసిన కనకాంబరాలు, దోడ్లో పెరిగిన మరువమో, ధవనమో కలిపి అమ్మ దండ కడితే రెండు జడలకీ వంతెనలాగ అటు నుంచి ఇటు వచ్చేలా నా జెడల్లో కట్టిన దండ పెట్టేది అమ్మ.

డాబా మీదకు వెళ్ళి, సన్షేడ్ మీదకు దిగి మరీ దొరికినన్ని సన్నజాజులు కోసుకు రావటం నా సాయంత్రపు దినచర్య. ఆల్రెడీ జళ్ళో కనకాంబరం దండ ఉంటే అవి రేప్పొద్దున్నకి ఫ్రిజ్ లో దాచేవాళ్ళు. తరువాత ఆకు సంపెంగ చెట్ల చుట్టూ తిరిగి వాసనబట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి, ఇవాళ విడుస్తాయనిపించిన పూలు కోసి నీళ్లల్లో వేయటం ఓ పని. ఆ తర్వాత అన్నయ్యను నిచ్చెన వేయించి సింహాచలం సంపెంగ చెట్టు ఎక్కించి అందుబాటులో ఉన్న పూలన్నీ కోయించటం. "పువ్వుల కోసం నువ్వడగటం వాడెక్కటం బాగానే ఉంది" అని పెద్దవాళ్లు మందలించటం సరదాగా ఉండేది. ఆరు ఏడు అయ్యాక సాయంత్రమే కోసి నీటిలో వేసి మూత పెట్టిన ఆకు సంపెంగలు వంటింట్లోకి వెళ్తూనే గుప్పుమనేవి. రోజూ ఏడెనిమిది పూల దాకా పూసేవి ఆకుపచ్చ సంపెంగలు.

అలా శెలవులకు ఊరెళ్లినప్పుడల్లా నన్ను పలకరించే రకరకాల పూలన్నీ మామ్మయ్య ప్రేమగా పెంచినవే. తన చేత్తో వేస్తే ఏ మొక్క అయినా, కొమ్మ అయినా బ్రతికేది. పూల మొక్కలే కాక దబ్బకాయ, జామ, పనస, అరటి మొదలైన పెద్ద చెట్లు కూడా తన సంరక్షణలో పెరిగేవి. మామ్మయ్య పోయిన తరువాత తనను వీడి ఉండలేనట్లుగా తను పెంచిన దొడ్లోని చెట్లన్నీ చాలా వరకూ వాడి ఎండిపోయాయి. మామ్మయ్యకూ మొక్కలకీ ఉన్న ఆ అనుబంధం ఎంతో అపురూపమైనది..చిత్రమైనది. ఆ తోట, ఆ ఇల్లు, పూలు ఇప్పుడు లేకపోయినా తలచినప్పుడల్లా ఇప్పటికీ చుట్టుముట్టే ఈ జ్ఞాపకాల పూలన్నీ మనసులో పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి.


మధుర గీతాలు: ఇది కథ కాదు(1979) పాటలు

"ఇది కథ కాదు" సినిమాలో ఎంత వాస్తవికత ఉందో పాటలూ అంత అర్ధవంతంగా బావుంటాయి. బాలచందర్(దర్శకత్వం), ఆత్రేయ(సాహిత్యం), ఎం.ఎస్.విశ్వనాథన్(సంగీతం) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పాటలు మనసుకు దగ్గరగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. ఇందులో " తకధిమితక ధిమితకధిమి " పాట, "గాలికదుపు లేదు.." పాట సాహిత్యపరంగా నాకు చాలా నచ్చే పాటలు. ఒకో వాక్యంలో ఎంత అర్ధం దాగి ఉందో అనిపిస్తుంది. ముఖ్యంగా "జత జతకొక కథ ఉన్నది" పాటలో ప్రతీ వాక్యమూ ఎంత అనుభవపూర్వకంగా రాసారో ఆత్రేయగారు అనిపిస్తుంది. నాకు చాలా నచ్చే పాట అది. "గాలికదుపు లేదు" పాటలో జానకి గారి గళం నిజంగా గంగ వెల్లువలా పరవళ్ళు తొక్కుతుంది. వేరొకరెవరు పాడినా ఈ పాటకు న్యాయం చెయ్యలేకపోయేవారేమో.

ఆత్రేయ రచన పాటలకు ప్రాణమైతే, ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం ఊపిరి. బాలు, సుశీల ల యుగళగీతం "సరిగమలు గలగలలు" పాట వింటుంటే చక్కనైన ఏ జంటయినా ముచ్చటగా ఇలానే పాడుకుంటారేమో అనిపిస్తుంది. "జూనియర్ జూనియర్.." పాటలో బాలు పలికించిన భావాలు కమల్ నటనతో పోటీ పడతాయి. సుశీలమ్మ గొంతులో "జోలపాట పాడి ఊయలుపనా" పాట హృదయాన్ని భారం చేస్తుంది. ఓసారి ఈ పాటలు చూసేస్తూ...గుర్తుకు తెచ్చేసుకుందామా...

1)తకధిమితక ధిమితకధిమి..


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే ఛమ్ ఛమ్
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం

ఈలోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మ
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం

వెళ్తారు వెళ్ళేటివాళ్ళు
చెప్పేసెయ్ తుది వేడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు
కన్నీటి సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపు తానోడుతే దాని గెలుపు(౨)
గాయాన్ని మాన్పేది మరుపు ప్రాణాన్ని నిలిపేది రేపు(౨)
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

2)గాలికదుపు లేదు కడలికంతు లేదు



గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు?
మళ్ళి మళ్ళి వసంతమొస్తే మల్లె కేది ఆకుచాటు?

ఓ తెమ్మెరా ఊపవే ఊహల ఊయల నన్ను
ఓ మాలికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణయ్యింది పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతె తప్పేముంది?


3)సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము




4)జూనియర్ జూనియర్..
ఇటు అటుకానీ హృదయం తోటి
ఎందుకురా ఈ తొందర నీకు


5)"జోలపాట పాడి ఊయలూపనా, నా జాలి కథను చెప్పి జోల పాడనా" పాటను పి.సుశీల పాడారు. ఈ సాంగ్ వీడియో లింక్ దొరకలేదు.



ఈ సినిమా పాటలన్నీ వినేందుకు లింక్:
http://webcache.googleusercontent.com/search?q=cache:hJr90aoyqeoJ:www.cinefolks.com/telugu/AudioSongs/movie/Idhi%2BKadha%2BKaadu+gaali+kadupu+lEdu+song&cd=4&hl=te&ct=clnk&gl=in&source=www.google.co.ఇన్



http://webcache.googleusercontent.com/search?q=cache:hJr90aoyqeoJ:www.cinefolks.com/telugu/AudioSongs/movie/Idhi%2BKadha%2BKaadu+gaali+kadupu+lEdu+song&cd=4&hl=te&ct=clnk&gl=in&source=www.google.co.in