సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, December 31, 2010

సింహావలోకనం-2 (కొన్ని discovered blogs)


ఇన్వెన్షన్ కీ డిస్కవరీకీ తేడా తెలిసేది కాదు నాకు చిన్నప్పుడు. అప్పుడు నాన్న చెప్పారు "ఏదైన కొత్త విషయాన్ని కనిపెడితే "ఇన్వెన్షన్", ఆల్రెడీ ఉన్నదాన్నే కొత్తగా కనుక్కుంటే "డిస్కవరీ" అని. అలాగ ఈ మధ్యన నేను డిస్కవర్ చేసిన బ్లాగులు కొన్నింటి గురించి ఈ టపాలో రాయాలని. అసలీ సింహావలోకనం-2 ఏమిటంటే, రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. క్రితం ఏడాది అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. ఆ టపా "ఇక్కడ" చూడవచ్చు. ఆ పోస్ట్ లో నేను అప్పట్లో చూసిన బ్లాగుల్లో నాకు నచ్చిన టపాలు కొన్ని ఏరి కూర్చాను.



కానీ ఈ సారి సగం ఏడాది దాకా అసలు నా బ్లాగు నేనే సరిగ్గా రాయలేదు. మూడు కొత్తవి తెరిచి, వాటిల్లోనూ అనుకున్నవి రాయలేకపోతున్నాను. ఇక బ్లాగులు చదవటం, వ్యాఖ్యానించటం కూడా చాలా తక్కువైపోయింది. సగం మంది బ్లాగ్మిత్రులు నన్ను మర్చిపోయారు. అడపాదడపా టపాల్రాసినా వ్యాఖ్యలు రావటం కూడా తగ్గిపోయాయి. అందుకని అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా బ్లాగ్లోకంలో విహరించటం మొదలుపెట్టాను. అప్పుడు పాత బ్లాగ్మిత్రులు చాలామంది టపాలు రాయటం తగ్గించేసారని అర్ధమైంది. బ్లాగుల నాణ్యత తగ్గిపోతోందని కూడా చాలామంది అనుకుంటున్నారని తెలిసింది.


అయ్యో, తెలుగు బ్లాగుల పరిస్థితి ఇదా? అని బాధపడుతూ బ్లాగ్విహారాలు చేస్తున్న ఇటీవల సమయంలో కొత్త బ్లాగులు డిస్కవర్ చేసాను...అంటే నేను అదివరకూ చూడనివన్నమట. నాకు బాగా నచ్చాయి. బ్లాగ్లోక సాహిత్యానికి మంచి రోజులు ఉన్నాయి అనిపించింది. వీటిని మించిన మంచి బ్లాగులు ఉండి ఉండవచ్చు. కానీ నా పరిధిలో, నా విహరణలో కనబడ్డ బ్లాగులు ఇవి. బ్లాగులను పరిచయం చేసేంత ప్రాముఖ్యం నా బ్లాగుకీ, నాకూ లేకపోయినా, ఈ బ్లాగులను గురించి ఓ నాలుకు వాక్యాలు రాయాలనిపించింది.

ముందుగా అందరికీ తెలిసినదే కానీ నేను ఆలస్యంగా చూసిన మంచి బ్లాగ్..."
నీలాంబరి ".
నా "సినిమా పేజీ" బ్లాగ్లో శారదగారు రాసిన కామెంట్ వల్ల ఆ బ్లాగ్ తెలిసింది. వీరు చాలా కాలం నుంచీ బ్లాగుతున్నారని ఖజానా చూస్తే తెలిసింది. ఎన్నో జ్ఞాపకాలు, బోలెడు పుస్తకాలు, సంగీతం, సాహిత్యం..ఎన్ని కబుర్లో...చదివిన ప్రతి టపా ఈ బ్లాగర్ పట్ల అభిమానం పెంచేసింది.

"అంచేత నేను చెప్పొచ్చేదేంటంతే!!!!!!"
అంటూ చెప్పుకుపోయే ఈయన ఈ బ్లాగ్ మొదలు పెట్టింది చాలా కాలం క్రితమైనా టపాలు చాలా తక్కువగా రాస్తూంటారు. "SHANKY" పేరుతో బ్లాగే ఈయన రాసే పేరడీలు భలే చమత్కారంగా ఉంటాయి. ఆసక్తికరమైన ఈ బ్లాగ్లోని చాలా టపాలను నేనింకా చదవాల్సి ఉంది. మర్క్ చేసుకుని మరీ చదవాల్సినంత మంచి బ్లాగ్ ఇది.

అనుకోకుండా నకు కనబడ్డ బ్లాగ్ "
కలం కలలు(పాత బ్లాగ్)"
ఈ బ్లాగుని మూసివేస్తున్నాను...అంటూ ఫణీంద్ర అనే ఆయన రాసిన టపా ముందర కనబడుతుంది. చాలా మంది బ్లాగ్మిత్రులు రాసిన వ్యాఖ్యలు కూడా కనబడతాయి. ఎందుకు మూసేసారో తెలీదు కానీ పుస్తకాలూ,సాహిత్యం అంటూ ఎన్నో మంచి విషయాలను రాసిన ఈయన మళ్ళీ బ్లాగ్ తెరిస్తే బాగుండును అనిపిస్తుంది ఆ టపాలను చదువుతూంటే.

కొన్ని బ్లాగులు చదవాలంటే సాహిత్యం పట్ల కాసింత అవగాహన, భాషపై పట్టు ఉండాలి. అలాంటి ఒక బ్లాగ్ "
కలం కలలు"
పైన మెన్షన్ చేసిన బ్లాగ్ పేరూ, ఈ బ్లాగ్ పేరూ ఒకటే. మరి రెండీటికీ లింక్ ఉండా లేదా అన్నది వాళ్ళని అడగి తెలుసుకోవాల్సినదే. మేంఇద్దరం రాస్తున్నం అంటూ "మెహెర్, సంహిత" కలిసి రాసే ఈ బ్లాగ్ నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది. సంహితగారు రాసే కవితలు ఎంతో భావయుక్తంగా చక్కని పదాల కూర్పుతో చదువుతూంటే తొలకరి జల్లుని, సంపెంగల సుగంధాన్ని గుర్తుకుస్తాయి. అంత మంచి కవితలవి. ఇక ఈ బ్లాగ్లో రాసే మిగతా సాహిత్యపు కబుర్లు కూడా సాహిత్యాభిమానులను ఆకర్షించేవిగానే ఉంటాయి.

"
MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం"
రెండు రోజుల క్రితం చూసిన బ్లాగ్ ఇది. బ్లాగ్ పేరు విచిత్రంగా అనిపించి చూద్దామని వెళ్ళా. చిత్తూరు గ్రీమ్స్ పేట్ మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు తమ సహాధ్యాయులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండేందుకు ఈ సైట్ నిర్మింపబడినది. అని రాసారు. చిన్నప్పటి గ్రూప్ ఫోటోలూ, కబుర్లూ చూసి వాళ్ళ నెట్వర్కకింగ్ ఐడియాకు సలాం చేసేసా. ఈ బ్లాగ్లో చిన్ననాటి ముచ్చట్లే కాక పాటలూ, సినిమాల తాలూకూ కబుర్లు కూడా ఉన్నాయి. ఈ బ్లాగ్లోని గ్రూప్ ఫోటోస్ అవీ చూసి నేను కూడా నా స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకున్న...ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో...ఆటోగ్రాఫ్ బుక్ తీసి ఆ ఎడ్రస్సులకి ఉత్తరాలు రాస్తే జవాబులు వస్తాయా? అనిపించింది. అప్పట్లో ఫోన్లు కూడా అందరికీ ఉండేవి కాదు మరి. అడ్రసులే ఆధారం.

ఇక "ఇందు" గారి చేస్తున్న
"వెన్నెలసంతకం"
గురించి నేను కొత్తగా ఏం చెప్పేది? ఈవిడ తోటలోని సీతాకోకచిలుకలు బాగున్నాయి నా తోటలోకి కూడా పంపించమని అడిగాను...ఎప్పటికి పంపుతారో...! ఈ బ్లాగ్ రచయిత్రి కథలు కూడా చాలా బాగా రాయగలరు అని మొదటి కథతోనే నిరూపించేసుకున్నారు.



బ్లాగ్ మొదలెట్టింది క్రితం ఏడాది. రాసినవి ఆరో ఏడో టపాలు. "ఈ పేరు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు" అని గోల పెట్టిన "శివరంజని"గారి పేరు మాత్రం బ్లాగ్లోకంలో మారుమ్రోగిపోతోంది.ఆద్యంతం హాస్యంతో నిండిన ఈ బ్లాగ్ల్ లోని అతి తక్కువ టపాలు మళ్ళీ ఎప్పుడు రాస్తారో అని ఎదురుచూసేలా చేస్తాయి.

ఇది మౌనరాగం కాదంటూ "మనసుపలికే" అపర్ణగారు ఆలపించే మధురమైన రాగాలు బ్లాగ్లోకమంతటా వినిపించేస్తున్నాయి. మా గోదావరి అమ్మాయిలు ఎక్కువైపోతున్నారే అని నేను సంబర పడిన బ్లాగ్ ఇది. ఇటీవలే ఈ బ్లాగ్లో పెట్టిన పాపికొండల ట్రిప్ ఫోటోలు అమాంతం గోదావరి దగ్గరకెళ్ళిపోయి ఆ సోయగాల్ని చూడాలనిపించేలా ఉన్నాయి.

"ఎన్నెల రామాయణం" అని మాలికలో చూసి అటువెళ్ళిన నేను ఆ వెన్నెల చల్లదనం చూసి మైమరచిపోయాను. అంత బాగుంటుంది ఆ చందమామ ఫోటో. టపాలు ఎక్కువ లేకపోయినా ఈ "ఎన్నెల" ఎందుకో మరి నా మనసు దోచేసింది. "వెన్నెల" పేరులో ఉన్న మేజిక్ అది. తెలంగాణా స్లాంగ్ లో ఈవిడ రాసిన ఎన్నెల రామయణం ఎంత చదువుదామని ఆత్రుత పడ్డా ఆ భాషరాక పట్టుమని నాలుగు లైనులైనా చదవలేకపోయాను..:( ఆ టపాలకు వచ్చిన వ్యాఖ్యలు ప్రశంసల వెన్నెలలు వెదజల్లాయి. ఈవిడ మరిన్ని మంచి మంచి టపాలు రాసి చిరునవ్వుల ఎన్నెలలు కురిపించాలని మనవి.

ఈ పల్లవులు కనుక్కోగలరా అని ఈ బ్లాగర్ విసురుతున్న సవాళ్ళు ఎన్నో పాత పాటలనూ, అంతే మంచి జ్ఞాపకాలనూ గుర్తుకు తెస్తున్నాయి. పాటలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చే బ్లాగ్ ఇది. జ్ఞాపకాల గులాబీల పరిమళాలు అంటూ "
మెహక్
" గుర్తుచేసే పాటలు అన్నీ మధురమైనవే.


గోదారి సుధీర గారి "పాపాయ్" నేనీమధ్యన చూసిన బ్లాగుల్లో ఒకటి. ఖలీల్ జిబ్రాన్ మాటలతో స్వాగతం చెప్పే ఈ బ్లాగ్లో బెంగాలీ సాహిత్యంతో పరిచయమున్న ప్రతివారికీ ఇష్టమయ్యే "శరత్" ఇల్లు, ఇంకా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఉండే ప్రదేశం తాలూకూ కబుర్లు, కొన్ని కథలతో ఆసక్తికరమైన బ్లాగ్ ఇది.

టపాలు తక్కువగా ఉన్నా మంచి అభిరుచి ఉందే అనిపించే బ్లాగ్ "కలభాషిణి" . ఈ బ్లాగ్లో టపాలు చదివితే ఆ సంగతి అర్ధమౌతుంది.

జూన్ నుంచీ మొదలైన "శ్రీసుగన్ ధ్" బ్లాగ్లో కూడా ఆరేడు టపాలకు మించి లేవు. కానీ వీరు టపాలు ఎక్కువ రాస్తే బాగుంటుంది అనిపించేలా ఉన్నాయి 'కేకే'గారి టపాలు.


*****************************
చిగురించే కొత్త ఆశలతో
పెదవుల నవ్వుల హరివిల్లులతో
గెలుపుబాటనే పయనంతో
మధుర క్షణాల జ్ఞాపకాలతో
మీ మరొక సంవత్సరం
నిండాలని మనసారా కోరుతూ

బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తృష్ణ.

Thursday, December 30, 2010

గొల్లపూడిగారి "సాయంకాలమైంది"


గతంలో గొల్లపూడి మారుతీరావు గారు రాసిన "ఎలిజీలు" చదివాకా ఆ పుస్తకం గురించి రాయాలనిపించింది. ఇప్పుడు "సాయంకాలమైంది" చదివగానే నాకు కలిగిన ఆలోచనలు రాయాలనిపించింది. కాబట్టి ఈ టపా నవల చదవగానే కేవలం నాలో కలిగిన అభిప్రాయాల సారం. అంతే.

అన్ని నవలల్లోనూ సాహసకృత్యాలో, రొమాన్సో, జనోధ్ధరణో చేసే హీరోనే ఉండనఖ్ఖరలేదు. కొన్ని నవలల్లో కథను తన చూట్టూ తిప్పుకునే ఒక ముఖ్య పాత్రధారి కూడా ఉంటూంటాడు. అతడే "Protagonist". ఎవరిచుట్టు అయితే కథ మొత్తం తిరుగుతుందో, ఎవరివైపైతే మన సానుభూతి వెళుతుందో, కథలో ప్రాముఖ్యత ఏ పాత్రకైతే ఉంటుందో అతడ్ని Protagonist అంటారు. "శంకరాభరణం" సినిమాలో Protagonist "శంకరశాస్త్రి"గారైతే, గొల్లపూడిగారి "సాయంకాలమైంది" నవలలో Protagonist "సుభద్రాచార్యులు" గారు. సుభద్రాచార్యులుగారి మరణంతో మొదలైన కథ ఆయన పూర్వీకుల చరిత్ర, ఆయన జీవనపయనం ఎలా గడిచిందో మొదలైన విశేషాలతో నడుస్తుంది. కథలో మిగిలిన పాత్రలు బలమైనవే అయినా మొత్తం కథకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ సుభద్రాచార్యులుగారు.

ఇది ఒక Picturesque novel. అంటే చదివే ప్రతి దృశ్యం, సన్నివేశం కళ్ల ముందు జరుగుతున్నట్లు ఉంటుంది. కళ్ళకుకట్టినట్లున్న వర్ణన ఇది కల్పితం కాదేమో ఎక్కడైనా నిజంగా జరిగిన కథేమో అనిపిస్తుంది. టైటానిక్ సినిమాలో సినిమా అయిపోయాకా పాడుబడిన షిప్లోంచి షాట్ మళ్ళీ లోపలికి వెళ్ళి అందరూ ఆడుతూ పాడుతూ ఉండే దృశ్యాన్ని చూపిస్తారు. అలాగ ఈ నవల చదవటం అయిపోయాకా అందులో పాత్రలన్నీ టాటా చెబుతూ వెళ్పోతున్నట్లు అనిపించింది. 2001లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో సీరియల్ గా వచ్చినట్లు పుస్తకంలో రాసారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తమ పిల్లలు విదేశాలలో ఉండే చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఏమీ మారలేదని ఇంకా దిగజారిపోయిందనే అనిపించింది నాకు.

కథలో నా ఆసక్తి అంతా సుభద్రాచార్యులుగారి పైనే ఉండిపోయింది. ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ, చిన్ననాటి నుంచీ దాన్ని కాపాడుకోవటానికి ఆయన పడే ఆరాటం, తాపత్రయం, అది కాపాడుకోలేకపోతున్నప్పుడు ఆయన పడే మానసిక వేదన ప్రత్యేకంగా వర్ణించకపోయినా పుస్తకం చదువుతున్నంత సేపూ ఆ భావనలు మన అనుభూతికి అందుతాయి. సాంప్రదాయాన్ని కాపాడాలని కాకపోయినా తండ్రిని బాధపెట్టకూడదని, సదాచారానికి ఏ లోటూ రాకుండా కాపాడిన పెదతిరుమలాచార్యులవారి పారంపర్యం సుభద్రాచార్యులుగారు స్వీకరించినట్లు అతని కుమారుడు తిరుమల కొనసాగించలేకపోతాడు. తల్లి మరణించినప్పుడు అతనిలో కలిగిన ప్రకంపనలు తండ్రి మరణం సమయానికి ఉండవు. తండ్రి కర్మకాండలకు ఎప్పుడో తీసేసిన యజ్ఞోపవీతాన్ని వేయించి కర్మకాండంతా జరిపించటం బాధను కలిగిస్తుంది. ఆ వాక్యంతోనే నవలలో రచయిత చెప్పదలుచుకున్న విషయం అర్ధమైపోతుంది. పెట్టిన నవలాశీర్షికకు అర్ధం గోచరమౌతుంది.

వరదమ్మ కాలంచేసాకా "సుభద్రాచార్యులవారి కథకు కాళ్ళు చేతులు లేవు" అంటారు రచయిత. ఆయన జీవితంలో ఆమె లేని లోటు ఆ ఒక్క వాక్యం చెబుతుంది. "మడిబట్ట ఆరవేసుకోవటం కొత్త...నళీనాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవటం కొత్త" "ఏభైఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద పలకకపోవటం కొత్త" లాంటి వాక్యాలు భార్యను పోగొట్టుకున్న భర్త ఏం కోల్పోతాడో తెలుపుతాయి. ఇద్దరు పిల్లల్ని కని కూడా చివరిరోజుల్లో అలా ఒంటరిగా, వండిపెట్టే దిక్కులేని దీనస్థితిలో ఉన్న ఈ నిష్ఠాగరిష్ఠులు జీవితంలో సాధించిందేమిటి? అనిపిస్తుంది. అంతవరకూ కాస్తో కూస్తో అభిమానం ఉన్న ఆయన పిల్లలపై కోపం వస్తుంది. రెక్కలు రాగానే కష్టనష్టాలు భరించి పెంచిన తల్లిదండ్రులను మరిచి ఎగిరిపోయే కృతజ్ఞత, బాధ్యత తెలీని పిల్లలపై కోపం వస్తుంది.

ఈ ఉత్కృష్టమైన కథలో ఉదాత్తమైన పాత్ర ఎవరిదైనా ఉందీ అంటే అది సంజీవి పాత్ర.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిండిన ఆ పాత్ర బరువు మిగిలిన పాత్రల మంచితనాన్ని ఆక్రమించేస్తుంది. పెళ్ళి రోజు బహుమతిగా నవనీతాన్ని తిరుమలతో మాట్లాడించినప్పుడే అతని వ్యక్తిత్వం ఆకాశం అంత ఎదిగిపోతుంది. మరొకరిని ప్రేమించే స్త్రీని మనస్ఫూర్తిగా తనదాన్నిగా చేసుకోవటం, జీవితాంతం అదే అనురాగాన్ని, అభిమానాన్ని అందివ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉద్రేకాలు, భేదాలు, ఖేదాలు లేని తృప్తి నిండిన ఆదర్శప్రాయమైన జంట వాళ్లది. మనస్థైర్యం, జీవనవేదాంతం ఉండాల్సిన పాళ్లలో ఉన్న నిండుకుండ నవనీతం పాత్ర.. తనపై జరిగిన అత్యాచారం తన శరీరానికే గానీ మనసుకు, ఆత్మకూ కాదన్న సత్యం అర్ధం అయిన స్థితప్రజ్ఞత నవనీతానిది. తిరుమలతో ఆమెకున్న అనుబంధం ఆత్మబంధం. వాళ్ళిద్దరూ ఆత్మబంధువులు. అంతే. కళ్ళు లేని "నారిగాడిని" పెంచుకుందానని భర్తను అడిగిన ఆమె కోరికలో మరొక బిడ్డ అనాథగా పెరగకూడదన్న సద్భావం కనబడుతుంది.

తల్లిని, చెల్లెలిని గొప్పగా అభిమానించి, ప్రేమించే తిరుమల తండ్రిపై గౌరవాభిమానాలున్నా వాటిని నిలబెట్టుకోలేని అసమర్ధునిలానే కనిపిస్తాడు. తరతరాలుగా మహోన్నతంగా కాపాడబడి వెలిగించబడిన శ్రీవైష్ణవ ఆచారం, సాంప్రదాయం అతని హయాంలో సన్నగిల్లుతుండగా చూసి బాధపడని పాఠకుడు ఉండడేమో. ఎంత వయసు ప్రభావం అని సరిపెట్టుకుందామన్నా శ్యామల విషయంలో అతని తొందరబాటూ, అమెరికాలో పాడ్ తో ప్రేమాయణం తిరుమల పాత్రలోని గాంభీర్యాన్ని పోగొడతాయి. నవనీతం వంటి ఉత్తమురాలితో అతని వివాహం జరగకపోవటమే మంచిదయింది అనిపిస్తుంది. సంజీవి తరువాత నన్ను ఆకర్షించిన మరో పాత్ర కూర్మయ్యది. విద్య వివేకాన్నీ, వినయాన్ని ఇస్తుందన్న వాక్యానికి ఉదాహరణ ఈ పాత్ర.. నవలలో కన్నతల్లిగా వరదమ్మ చూపెట్టిన పుత్రవాత్సల్యం సహజమైనదే. కానీ తండ్రుల్లో కూడా కన్నతల్లికి మించిన పుత్రవాత్సల్యాన్ని "రేచకుడు" పాత్రలో చూసి మనసు ఆర్ద్రమౌతుంది.

తిరుమల ఉన్నతికీ, అతనిలోని ప్రతిభ బయటకు రావటానికీ కారణభూతుడైన వెంకటాచలం ఎంత మంచిపని చేసాడనిపించినా, చివరలో అతనికి వచ్చిన వ్యాధి, కష్టాలు చదివితే నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యులు వంటి అమయక వైష్ణవుడిని మోసం చేసిన పాపమే అదని అనిపిస్తుంది. ప్రేమ ఎంత గొప్పదైనా తల్లిదండ్రుల గౌరవప్రతిష్ఠలను గాలికి వదిలేసి కూర్మయ్యను వివాహమాడిన ఆండాళ్ళు పాత్ర కూడా అటువంటిదే. తండ్రి పార్ధివశరీరాన్ని దగ్గర నుంచి చూసి, ఆఖరి నమస్కారం చేసుకోలేని దుస్థితి స్వయంకృతమే. కానీ "To err is human" కదా. అందుకనేనేమో మనకు కూడా perfection ఉన్న పాత్రల కన్నా పొరపాట్లు చేసే పాత్రల పట్లే సానుభూతి, దగ్గరితనం కలుగుతుంది. ఎందుకంటే అవి సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు కాబట్టేమో. అలా సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రల్లో మనల్ని మనం పోల్చుకోవటం వల్లనేమో చాలా నవలలు, వాటిల్లోని పాత్రలు మనకు గుర్తుండిపోతాయి.

"భరించరాని దు:ఖం మనిషిని ఆవరించినప్పుడు ఎండు జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. అంత:కరణ గల వ్యక్తి ఊహించని మలుపుతో ఏకోన్ముఖుడౌతాడు."
"కన్నీళ్ళు ఆర్ద్రతకీ, అభిమానానికీ, క్షమాపణకీ, పశ్చాత్తాపానికీ, ప్రేమకీ, ఆవేశానికీ అన్నిటికీ నిదర్శనమనే సంస్కృతిని చాలా చిన్నతనంలోనే నష్టపోయిన దురదృష్టవంతుడతను";
"ఇంకా సెంటిమెంటుకు దూరం కాని 22ఏళ్ళ నల్ల పిల్ల";
"కొత్త ఆకర్షణలు అలవాటయి, అవసరమయి, వ్యసనమయి, వదులుకోలేని లంపటమయి...";
"మేధస్సు అగ్నిశిఖలాంటిది. దాని ఆకర్షణకి లోనైన ఏ పదార్ధాన్ననినా అది జీర్ణం చేసుకుంటుంది."
"మృత్యువు కొందరికి విముక్తి, కొందరికి విజయం, కొందరికి ముగింపు, కొందరికి అవకాశం" మొదలైన నవలలోని ఎన్నో వాక్యాలు గొల్లపూడిగారి జీవితాన్ని, మనుషులనూ ఎంత బాగా అర్ధం చేసుకున్నారో తెలుపుతాయి. శ్రీవైష్ణావ సాంప్రదాయాన్నీ, పధ్ధతుల్నీ ఎంతో శ్రధ్ధతో తెలుపుతూ రాసిన రచనావిధానం ముచ్చటగొలుపుతుంది. అయితే అక్కడక్కడా కథలో చోటు చేసుకున్న కొన్ని "వర్ణనలు" అవసరమా అనిపించాయి. బహుశా ఒక వారపత్రికలో సీరియల్ కోసం రాసినదవటం వల్ల ఆ విధంగా రాయాల్సివచ్చిందేమో మరి. అటువంటి వర్ణనలు, సన్నివేశాలు లేకపోయినా ఈ ఉత్కృష్టమైన కథకు వచ్చే లోటేమీ లేదనిపించింది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

చదివిన చాలాకాలం మనసు పొరల్లో గుర్తుండిపోయే కథ, పాత్రలు రెండూ ఈ నవల ప్రత్యేకతలే. కేరెక్టర్ ఎనాలసిస్ కు ఉపయోగపడేలాంటి రకరకాల స్వభావాలు గల పాత్రలున్న ఈ నవలను పిజీ స్టూడెంట్స్ సిలబస్ లో ఒకపుస్తకంగా చేరిస్తే బాగుంటుండేమో అని కూడా అనిపించింది. అలాంటి ప్రతిపాదన ఇప్పటికే ఉందేమో తెలీదు మరి.

Wednesday, December 29, 2010

ఆత్మ బంధువు(1985)


"మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు
జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు.."

జానకి గొంతులో వినిపించిన ఈ పాట ఎన్నో స్మృతుల్ని నిద్ర లేపింది. ఈ సినిమా పాటలు బ్లాగ్లో పెడదాం అనిపించింది. చిన్నప్పుడు స్కూల్లో ఉండగా ఒకసారి టివీలో వస్తే చూసిన సినిమా ఇది. కానీ రాధ పాత్ర, సినిమా కథ, సినిమాలోని పాటలు బాగా గుర్తుండిపోయాయి. తరువాత సినిమా పాటలు సొంతంగా రికార్డ్ చేయించుకునే స్టేజ్ కి వచ్చాకా పాటలన్నీ రికార్డ్ చేయించుకున్నాను. రాధకు తాను చేసిన సినిమాల్లో, నటనకు ప్రాధాన్యత ఉన్న అతి తక్కువ పాత్రల్లో ఈ సినిమా ఒకటై ఉంటుందని నేననుకుంటూ ఉంటాను. శివాజీ గణేషన్ నటన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. పాటలు మాత్రం పక్కా ఇళయరాజా మార్క్ తో కళాకళాలాడుతూ ఇప్పటికీ పచ్చగా మురిపిస్తూ ఉంటాయి. అంతే చక్కని సాహిత్యం పాటలకు జీవం పోసింది. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రమిది.


సినిమా చూసి ఇన్నాళ్ళైనా అందమైన రాధ,ఆద్భుతమైన ఆమె నటన, మంచి పాటలు, వాటికి సరిపోయే సాహిత్యం..ఇవే నాకు గుర్తుండిపోయినవి."muthal mariyathai" పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమా 1985 నేషనల్ అవార్డ్స్ లో ఆ ఏటి బెస్ట్ రీజనల్(తమిళ్) ఫిల్మ్ గానూ, బెస్ట్ లిరిసిస్ట్(తమిళంలో) సిల్వర్ లోటస్ అవార్డ్ లను పొందింది. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే పేచీకోరు, గయ్యాళీ అయిన భార్యతో విసిగివేసారిపోయిన ఒక గ్రామ పెద్దకు, ఒక పడవ నడిపే అతని కూతురితో ఏర్పడిన స్నేహం, ఆ స్నేహం వల్ల వాళ్ళ జీవితాల్లో ఉత్పన్నమైన అలజడులు ఏమిటి అన్నది కథ. స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోయినా కథా బలం, అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు ప్రాణాలు.

ముఖ్యంగా ఒక 'మ్యూజికల్ హిట్' గురించి రాయాలనుకున్నాను కాబట్టి సినిమాలోని కొన్నిపాటల లింక్స్ క్రింద చూసి, విని ఆనందించండి.

మనిషికో స్నేహం మనసుకో దాహం
మమతనే మధువు లేనిదే చేదు







మూగైన హృదయమా
నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలె లాలించే
ఎడదను ఇమ్మని అడుగుమా..




నీదాన్నీ ఉన్నాననీ నా తోడై నువ్వున్నావనీ
గుండెలోనా ఉన్నా ఊసు..






పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
ఆహా నా మావ కోసం..





ఇంకా "నేరేడు తోటంతా" అనే పాట, "ఏ గువ్వ చిట్టి గువ్వ" అనే పాట కూడా బాగుంటాయి.

ఈ songs "రాగా.కామ్"లో ఇక్కడ వినచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ ఇక్కడ

Tuesday, December 28, 2010

"ళృ ...ళౄ"



గుణింతం గుర్తులు
 మధ్యనే నేను మా పాపతో పాటూ గుణింతం గుర్తులు నేర్చుకున్నాను. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము etc..etc.. అంతవరకూ బానే ఉంది. చిన్నప్పటివి ఎలానూ గుర్తులేవు. మళ్ళీ నేర్చేసుకోవటం అయ్యింది. అక్షరాలు కూడబలుక్కుని పేపర్లో హెడ్డింగులు, ఏదైనా కథల పుస్తకంలో వాక్యాలు చదివిస్తూంటే చక్కగా చదువుతోంది పాప. అది చూసి రెండు కాకులమూ("కాకి పిల్ల..." సామెత ప్రకారం) చాలా ఆనందిస్తున్నాం.


ఇక గుణింతాలు రాయటం, పలకటం నేర్చుకుంటున్నాం(నేనూ,పాప). దాదాపు అన్ని గుణింతాలు వచ్చేసాయి. "" నుంచి "" వరకూ, ఆఖరుకి "" "క్ష" గుణింతాలు కూడా పలకటం వచ్చేసాయి. కానీ ఒక్క గుణింతం మాత్రం నాకు పలకటం రావట్లేదు. అది కూడా మొత్తం కాదు. రెండే రెండు అక్షరాలు. అదీ "" గుణింతం. , ళా, ళి, ళీ, ళు, ళూ వరకూ వస్తోంది ఇకపై నాలిక పలకటం లేదు... "ళృ ...ళౄ" నేను పలికిన తీరు చూసి మా పాప పడీ పడీ నవ్వుతోంది...:(

మీకెవరికైనా పలకటం వస్తోందేమో కాస్త చెబుదురూ...

Monday, December 27, 2010

మన్మథబాణం


* చాలా రోజుల తరువాత వ్యక్తిత్వం ఉన్న ఒక హీరోయిన్ ను చూడాలంటే
* పేరిస్, బార్సిలోనా, వెనిస్ మొదలైన అందమైన ఫారెన్ సిటీల్లో చిత్రీకరణ
* అందమైన లొకేషన్స్, నీట్ అండ్ క్లీన్ రోడ్స్ అండ్ fast మూవింగ్ ట్రైన్స్
* తనదైన స్టైల్లో smart even in his fifties అనిపించే సహజనటుడు కమల్ కోసం


* చిత్రంలో లీనమయ్యేలా చేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం
* వెకిలి హాస్యం, మితిమీరిన హింస, ఓవర్ ఎక్స్పోజింగ్ లేని cool movie కావాలంటే
* డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అర్ధమవుతూ నవ్వు తెప్పించే సంభాషణల కోసం
* చాలా రోజుల తరువాత హాయిగా నవ్వుకోవాలంటే
* ప్రేక్షకులు ఊహించలేనన్ని ట్విస్ట్ లతో పిచ్చెక్కించే తిక్క కధలు వద్దనుకునే వారు
* ఒక మామూలు సాధారణమైన ప్లైన్ కథ కావాలనుకునేవారు
* మాధవన్ sweet smile ఇష్టమైనవారు(ofcourse, ఈ సినిమాలో అవి ఎక్కువగా లేకపోయినా)
* రొటీన్ సినిమాలు చూసీ..చూసీ....బోర్ కొట్టినవాళ్ళు ఓ సినిమా చూసి బాగుందనుకోవాలంటే
* నటనకు అవకాశం ఉన్న పాత్రలో సంగీత ను చూడాలనుకుంటే


చూడాల్సిన చిత్రం "మన్మధబాణం". ముత్తు, సూర్యవంశం మొదలైన సూపర్ డూపర్ హిట్స్ తీసిన ప్రఖ్యాత తమిళ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ గతంలో కమల్ హాసన్ తో భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, దశావతారం మొదలైన సినిమలు తీసారు. మళ్ళీ కె.ఎస్.రవి కుమార్, కమల్ కాంబినేషన్ తో ఇటివలే రిలీజైన రొమాంటిక్ కామిడీ "మన్మథబాణం". ఇవాళ్టి రోజున తెలుగు సినిమాల్లో లోపించిన సహజత్వం నాకు ఈ సినిమాలో కనిపించింది. డబ్బింగ్ సినిమాలు సాధరణంగా నేను చూడను. ఈ సినిమాలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ, సినిమాలోని ప్లస్ పయింట్స్ చూసుకుంటే ఈ లోపాలు చిన్నవిగా కనబడతాయి.

కొన్ని లోపాలు చెప్పాలంటే:

* ప్రముఖ విలక్షణ గాయని "ఉషా ఉతుప్" వేయక వేయక ఇలాంటి అత్తగారి పాత్ర వేయటమేమిటి అని నవ్వు పుట్టిస్తుంది.
* కథనంలో ఉన్న స్లోనెస్ అప్పుడప్పుడు బోర్గా ఉందా అనిపించేలా చేస్తుంది.
* చివరలో మాధవన్ కూ, సంగీత కు కుదిర్చిన లింక్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
* రెండవ భాగంలో ఒక పాయింట్ లో కన్ఫ్యుజన్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది.
* అక్కడక్కడ క్లోజప్స్ లో కమల్ ఏజ్ కనబడినప్పుడు కాస్త కాన్షియస్ గా ఉండకూడదూ(ఐ మీన్ ఫేస్ యంగ్ గా కనపడటానికి) అన్పిస్తుంది.
* చివరలో బోట్ సీన్స్ దగ్గర పాత్రలతో పాడించిన కొన్ని సినిమా పాటల పల్లవులు డబ్బింగ్ కు సరిపోయేలా అతికినట్లు స్పష్టంగా తెలిసిపోయాయి.
* మాధవన్ ఫోన్ ఫ్రెష్ రూంలో జారిపడడం లాంటి తమిళ ప్రేక్షకులకు అలవాటైన, వాళ్ళకు హాస్యమనిపించే కొన్ని సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.



సినిమాలో నాకు నచ్చినవి:

* చాలా రోజుల తర్వాత డాన్స్ లు చేయటం, చాలీచాలని బట్టలతో ఎక్స్పోజింగ్ చేయటం తప్ప పెద్దగా ప్రాముఖ్యత లేని హీరోయిన్ ని కాక కాకుండా కాస్త ఆలోచన, విచక్షణ ఉన్న హీరోయిన్ కథలో ఉండటం.
* ఒక పాట మొత్తం రివర్స్ షాట్స్ తో తీయటం చాలా బాగుంది.
*"భూషణమా? పేరు ఓల్డ్ గా లేదు అన్నప్పుడూ కమల్ అనే "అంబుజం.. కన్నానా";

"అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలండీ." "అబ్బే నాకీ ఉడకడాలూ అవీ తెలీదు. నేను ప్రెషర్ కుక్కర్. ఒక్క విజిల్.. అంతే." లాంటి కొన్ని కొన్ని డైలాగులు,
* స్త్రీల చిత్త ప్రవృత్తి గురించి మాధవన్ చెప్పే డైలాగ్ లు,

* అప్పుడప్పుడు పిల్లల ప్రవర్తన గురించి, మగవారి నైజం గురించీ సంగీత చెప్పే డైలాగులు,
* ప్రొడ్యూసర్ కురుప్, అతని భార్య (వాళ్ళున్న ప్రతి ఫ్రేం)
* సంగీత పిల్లవాడి డైలాగులు
* మాధవన్ కూ, త్రిష కూ సినిమా మొదట్లో జరిగే ఘర్షణ తాలూకు డైలాగులు
* "ఏం మాయ చేసావే" సినిమాలో హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పిన వాయిస్ తోనే ఈ సినిమాలో త్రిషకు చెప్పించారు. స్వచ్ఛమైన తెలుగు పలకకపోయినా ఆ వాయిస్ లోని మెత్తదనం, మాట విరుపు అన్నీ నాకు బాగా నచ్చేసాయి.
* మాధవన్ కు అబధ్ధం చెప్పాకా కమల్ పాడే పాట సాహిత్యం, ఆ పాట లోని కమల్ డాన్స్
* కమల్ నటనకు అతికినట్లు ఉండే బాలూ డబ్బింగ్


ఈ సిన్మా గురించి ఇంకా ఏం చెప్పాలంటే:ఈ మధ్యన భారీ బడ్జట్లతో తీసిన మూడు కొత్త సినిమాలు చూసి కొత్త సినిమా అంటేనే భయం పట్టుకుంది. చివరిగా నెల క్రితం చూసిన ఒక సినిమాలోంచి అయితే వెళ్పోదాం అని లేచి వచ్చేసాను. జీవితంలో మొదటిసారి థియేటర్ లోంచి నేను బయటకు వచ్చిన సినిమా అది. అలాంటిది ఈ సినిమా చూస్తూంటే కొన్న టికెట్ కు పూర్తి న్యాయం జరిగింది. అనిపించింది. చూడగానే "అబధ్ధం" పాట గుర్తుకు తెచ్చే సంగీత ను మరి కాస్తంత బొద్దుగా చూడ్డం ఇబ్బందే అనిపించినా ఆ పాత్రకు ఉన్న వైటేజ్ మన దృష్టిని పాత్ర తాలూకు నటన వైపుకే లాగుతుంది.సినిమా మొదట్లో కాస్త లావుగా కనిపింఛిన కమల్, సంగీత ఇద్దరూ తరువాతి సీన్స్ లో కాస్త సన్నబడ్డట్టు కనిపిస్తారు.సంగీత నటన అప్పుడప్పుడూ ఓవర్ అనిపించినా మొత్తమ్మీద బాగా చేసిందనిపిస్తుంది. త్రిష నటన కూడా బాగుంది. కథంతా కమల్, త్రిష, సంగీతల చుట్టూ ఉండటంతో మాధవన్ కు పెద్దగా నటనకు చాన్స్ లేదు.

కమల్ అదివరకూ కూడా సినిమాల్లో పాటలు పాడారు. అయితే ఈ సినిమాలో పాడిన రెండు పాటల్లో వాయిస్ క్వాలిటీ పెరిగినట్లు అనిపించింది. దేవీశ్రీప్రసాద్ ఒక పాటలో ఓ చోటెక్కడో తళుక్కుమన్నారు. పాటలు బానే ఉన్నాయి కానీ నాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంది. "అనుమానం" మనిషిని ఎంత హీనమైన స్థితికి దిగజారుస్తుందో, దానివల్ల మనిషి ఏం పోగొట్టుకోగలడో మధవన్ పాత్ర బాగా తెలియజేస్తుంది. నాకు బాగుంది కానీ ఫార్ములా సినిమాలకూ, మూస సినిమాలకు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షక్లులకు ఈ సినిమా నచ్చుతుందా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే మరి తొడ కొడితేనో చిటిక వేస్తేనో విలన్ గానీ రౌడీలు కానీ అల్లంత దూరాన ఎగిరిపడే సీన్లూ్; జీపులూ,బస్సులూ తగలబడే సీన్లూ; రక్తం ఏరులా పారే వెర్రి హింస ఈ సినిమాలో లేవు మరి.

"సతీ లీలావతి" అంతటి పూర్తిహాస్యభరిత చిత్రం కాకపోయినా చూసాకా "బాగుంది. చాలా రోజులకు ఒక మంచి(డబ్బింగ్) సినిమా చూసాం" అని తప్పక అనిపిస్తుంది. క్రితం నెల జయప్రదం(లోకల్)లో ప్రసారమైన కమల్ ఇంటర్వ్యూ చూసాకా ఇప్పటివరకూ అన్నయ్య అభిమాన నటుడిగానే నాకు నచ్చే కమల్ ఒక అసాధారణ వ్యక్తిగా నాకు అనిపించాడు. పర్సనల్ రిలేషన్స్ సంగతి ఎలా ఉన్నా హీ ఈజ్ డెఫినేట్లీ ఏ గుడ్ హ్యుమన్, ఏ నాలెడ్జబుల్ మేన్ అనిపించాడు. నిన్న రాత్రి సినిమా చూసాకా నాకనిపించినవన్నీ రాసేసాననే అనుకుంటున్నాను...:)

Sunday, December 26, 2010

(గడచిన)కాలానికి కృతజ్ఞత


T.S.Eliot ఒక poemలో "I have measured out my life with coffee spoons.." అని చెప్పినట్లుగా చెప్పాలంటే నేనొక సగటు వ్యక్తిని మాత్రమే. కానీ నేను నా ఆలోచనలనూ, కొన్ని జీవిత సంఘటనలనూ ఇలా బ్లాగులో గొప్పకో సరదాకో రాయను. నేను తెలుసుకున్న సత్యం మరెవరికైనా ఉపయోగపడుతుండేమో అని రాస్తాను. అది అర్ధమయ్యేవారే 'తృష్ణవెంట' నడుస్తారు. వణికించే చలి వాకిట తిరుగుతున్న ఈ పొద్దుటి పూట ఓసారి ఈ ఏడాది ఎలా గడిచిందా అని వెనక్కి తిరిగి చూసాను..

కాలం గిర్రున తిరిగింది అంటూంటారు కధల్లోనూ నవలల్లోనూ. జీవితంలో మొదటిసారి అది ప్రాక్టికల్ గా తెలిసింది ఈ సంవత్సరంలో. ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు ఈ ఏడాది. ఇక నాలుగురోజులు మిగిలి ఉంది. ఈసారి మొదటి రెండు మూడు నెలల తరువాత డైరీ ముట్టుకున్నదే లేదు. అయితే ఇది అలా వెళ్ళిపోవటమే బాగుంది. ఎందుకంటే ఈ ఏడాది విధి నాకు చూపించిన విశ్వరూపం బహుశా నే ఎప్పుడూ చూసి ఎరుగను. రోజులు తెలిసేలా గడిస్తే వాటి భారాన్ని మోయటం కష్టమే. ఈ ఏడు నేను చూసినది పదినెలల అమావాస్యని. కోల్పోయినవి ఎన్నో...ఒక నమ్మకాన్ని, ఒక నిజాన్ని, ఒక అనుభూతినీ, ఒక గౌరవాన్ని...ఎన్నింటినో. ఇంట్లో జరిగిన అనర్ధాలు కూడా ఎన్నో పాఠాలు నేర్పించాయి. చేతికొచ్చిన పంట కళ్ళెదురుగా నష్టపోతూంటే విలవిల్లాడిన రైతు సోదరుల్లాగ, నా ఆశలు ఫలించబోయే తరుణంలో జరిగిన అనర్ధం నా చైతన్యాన్ని వేళ్ళతో కుదిపేసింది. ఒకటి రెండు కాదు...మూడో నష్టం. ఒక ఆరని మంటని రగిల్చింది. మిగిలిన సంఘటనలు అయితే నాలోని వివేకాన్ని, వివేచననీ తొక్కివేసాయి. నమ్మకం అన్న పదానికున్న నమ్మకాన్నే పోగొట్టాయి.

కాలం ఎంత మధురమైనదో అంత జాలిలేనిది కూడా. మన కోసం ఎక్కడా ఆగదు. తన దారిన తాను పోతూ ఉంటుంది. విచిత్రమేమిటంటే కాలం చేసిన గాయాలకు కాలమే మందు. మొన్నలా నిన్న, నిన్నలా ఇవాళ అసలు ఉండనే ఉండవు. ఇదే సృష్టి రహస్యమేమో మరి. నేనూ ఆ సూత్రానికి లొంగిపోయను. లేచి నిలబడ్డాను. ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మళ్ళీ నడవటం మొదలెట్టాను. కాలం నేర్పిన పాఠాలు మననం చేసుకుంటూ. కొత్త పాఠాలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ.

నిలబడటానికి మరో చేయి అవసర మౌతుందేమో అనుకున్న క్షణం నిర్ణయించుకున్నాను no more help..అని. "ఇంతా తెలిసియుండి.." అని పాడినట్లు ఇంతకాలం, ఇన్నేళ్ళు జీవించాకా ఇంకా ఊతం కోసం ఎదురుచూడటం మూర్ఖత్వమే. పేజీలు తిప్పబడిన కేలండర్లు, పెట్టె నిండిన పాత డైరీలు నేర్పిన అనుభవల పాఠాలు మర్చిపోతే ఎలా? దారిలో వచ్చిన ప్రతి అడ్డంకి దగ్గరా ఆగిపోతే గమ్యం ఎప్పటికైనా చేరతామా? nobody can help us untill we help ourselves అని ఎప్పుడో చెప్పారు కదా. రేపు ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. ఇక ఇవాళలో జీవించకపోతే ఇన్నాళ్ల జీవితం ఎందుకు? అనుకున్నాను. and then...i stood up. జీవితాన్ని ఆస్వాదించటానికి ఏవైతే చెయ్యగలనో అవన్నీ చేసాను..చేస్తున్నాను... finally iam here writing my blog posts. మళ్ళీ అసలు తెరవననుకున్న బ్లాగ్ రెండునెలలలోపే తెరిచాను. రాస్తూనే ఉన్నాను. రాస్తూనే ఉండాలనుకుంటున్నాను..ప్రస్తుతానికి...:)

అయితే ఇన్ని గాయాలు చేసినా ఈ సంవత్సరానికి నేనెంతో ఋణపడిపోయాననిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు నేర్పిన పాఠాలు చాలా విలువైనవి. నన్ను కొంతైనా ప్రాక్టీకల్ గా తయారుచేసింది. నాలో గొప్ప మార్పుని తెచ్చింది. అది నేను నిలబెట్టుకోవాలి. కాలం మామూలుగా గడిచిపోయి ఉంటే ఈ మర్పు వచ్చేదే కాదు. అందుకే నన్నెంతో బాధపెట్టి మనసు విరిచేసిన ఈ సంవత్సరం అంటే నాకు ఎంతో కృతజ్ఞత.




==========================================
note:ఈ టపా కేవలం ఈ సంవత్సరం గురించిన నా మనోభావాలే తప్ప నేనేవిధమైన వ్యాఖ్యలనూ ఆశించి రాయలేదు. అందువల్ల కామంట్ మోడ్ తొలగిస్తున్నను.ఇప్పటిదాకా కామెంట్లు రాసినవాళ్ళకు ధన్యవాదాలు.

Saturday, December 25, 2010

"క్రిస్మస్ జ్ఞాపకాలు "


"క్రిస్మస్" ఈ పేరుతో నాకున్న అనుబంధం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. నేను ఏడవతరగతి దాకా చదివినది ఒక క్రిస్టియన్ స్కూల్లో. కొందరు స్నేహితులు, టీచర్స్ క్రిస్టియన్స్ అవటంతో ప్రతి ఏటా ఎవరో ఒకరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనే అవకాశం వస్తూ ఉండేది. ఆ తరువాత కాలేజీ కూడా విజయవాడలోని మారిస్టెల్లా, (నాకు చాలా ఇష్టమైన కాలేజీ) అవటంతో "క్రిస్మస్" బాగా ఆత్మీయమైన పండుగ అయిపోయింది నాకు.

స్కూల్లో ఉండగా మా సందుకి రెండు సందుల అవతల ఒక క్రిస్టియన్ స్నేహితురాలి ఇల్లు ఉండేది. క్రిస్మస్ రోజు నాకు ప్రత్యేక ఆహ్వానం ఉండేది. నేను ఆ పార్టీ ఎప్పుడూ మిస్సయ్యేదాన్ని కాదు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళ ఇంట్లో తయారయ్యే స్పెషల్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. స్వతహాగా స్వీట్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల కేక్ అంటే కూడా భలే ఇష్టం ఉండేది నాకు. వాళ్ళింట్లో కేక్ తిని వచ్చి మా ఇంట్లో కేక్ ప్రయోగాలు చేసేదాన్ని. స్పాంజ్ కేక్, ఎగ్ లెస్ కేక్, ఫ్రూట్ కేక్ అంటూ రకరకల కేక్స్ ప్రయత్నించేదాన్ని. కాస్త వంటగత్తెనే కాబట్టి ప్రయోగాలు బానే వచ్చేవి కూడా. అమ్మ మాత్రం గిన్నెలు, ఇల్లూ వాకిలీ ఎగ్ కంపు అని గోలపెట్టేది.

ఇక మిత్రుల కోసం క్రిస్మస్ గ్రీటింగ్స్ స్వయంగా తయారు చేయటం ఒక సరదా. అదవ్వగానే న్యూ ఇయర్ కోసం. క్రిస్టియన్స్ న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంతైనా స్వహస్తాలతో మిత్రులకు ఏదైనా చేసివ్వటం ఎంతో తృప్తిని ఇస్తుంది. నాన్న అయితే మేం సరదా పడుతున్నామని స్టార్ కూడా కొని తెచ్చేవారు. మేం అది ఇంటి ముందు పెట్టుకుంటే ఇంటివైపు వచ్చిన మిత్రులు మీరు క్రిస్టియన్సా? అని అడిగేవారు. కాదు సరదాకు పెట్టుకున్నాం అంటే వింతగా చూసేవారు. అవన్నీ కాక కాలేజీరోజుల్లో నాకు అందరికాన్నా దగ్గరైపోయిన నా ప్రియనేస్తం ఒకమ్మాయి చదువయ్యాకా ఒక క్రిస్టియన్ ను మేరేజ్ చేసుకుంది. నా కుటుంబం తరువాత నాకత్యంత సన్నిహితురాలు తనే. కానీ విచిత్రం ఏమిటంటే ప్రత్యేక కారణాలు లేకపోయినా జీవనయానంలో యాంత్రికమైపోయిన పరుగుపందాల్లో తను నాకు చాలా దూరంగా వెళ్లిపోయింది తను. అయినా ఇప్పటికీ తనకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపిస్తూనే ఉంటాను. "where is the time to hate, when there is so little time to love" అన్న పాటలోని మాటలు నేను నమ్ముతాను. నాకు తను ఎప్పటికీ ప్రియమైన నేస్తమే. "our sweetest songs are those that tell saddest thoughts.." అని ప్రఖ్యాత ఆంగ్లకవి షెల్లీ అన్నట్లు బాధాకరమైనవైనా కొన్ని స్మృతులు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి.


ఇక ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నా ప్రతిఏడూ మా ఇంట్లో మాకు పరిచయం ఉన్న క్రిస్టియన్ మిత్రులందరికీ ఫొన్లు చేసి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూంటాం నాన్న, నేను. ఇంతే కాక ఈ రోజున నా మరో క్లోజ్ ఫ్రెండ్ "రూప" పుట్టినరోజు. తన గురించి నేను క్రిందటేడు రాసిన టపా "ఇక్కడ".ఇక ఇప్పుడు బ్లాగ్లోకంలోకి వచ్చాకా పరిచయమై అభిమానంతో ఆప్తుడైన తమ్ముడు చైతన్య పుట్టినరోజు కూడా ఇవాళే. ఇద్దరికీ బ్లాగ్ముఖంగా "పుట్టినరోజు శుభాకాంక్షలు".

Friday, December 24, 2010

తోట కబుర్లు

మొలకెత్తే చిట్టి చిట్టి మొక్కలను రోజూ చూసుకోవటం భలే ఉంటుంది

చిన్నారి చుక్కకూర మొక్కలు


చిగురులు తొడిగిన పుదీనా


తోటకూర మడిఇన్ ప్రోగ్రెస్...












తల ఎత్తుతున్న బెండ మొక్క

తల ఎత్తిన మూడు బెండకాయ మొక్కలు


పూసిన మొదటి నందివర్ధనం


పెరిగిన మెంతికూర

Thursday, December 23, 2010

నాన్నతో మ్యూజిక్ స్టోర్స్ కి ..


మధ్యన కొన్ని(చాలానే) సినిమా సీడీలు, డివీడిలు కొన్నాకా మళ్ళీ ఇప్పట్లో మ్యూజిక్ షాప్ కు వెళ్లద్దనుకున్నా. మొన్నొక రోజు బయటకు వెళ్తుంటే నాన్న ఫోన్ చేసి ఈ మధ్యన "sa re ga ma" వాళ్ళు కొన్ని మంచి మంచి ఎం.పీ3 ఆల్బంలు రిలీజ్ చేసారు...చూస్తావేమిటీ వెళ్ళి" అనడిగారు. ఈ మధ్యన రెస్ట్ గా ఉండటంవల్ల ఆయన ఎక్కడికీ వెళ్లటం లేదు. సరే నా కోసం కాదులే నాన్న కోసం కదా అని దారిలోనే ఉన్న మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళా. మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్లోనే నాతో పాటూ నాన్నతో కూడా షాపింగ్ చేయించేసా. నేను ఒకో సీడీ లిస్ట్ చెప్పటం, కొనాలో వద్దో తను డిసైడ్ చెయ్యటం. తనకు కావాల్సినవి కొనేసా. నా భ్రమ కానీ మ్యూజిక్ షాపుకెళ్ళి నేనెప్పుడూ ఖాళీగా వచ్చాను...? పనిలో పని నాన్న చెప్పిన సీడీలతో పాటూ నేనూ రెండు మూడు కొనేసుకున్నా.

ఏమైనా "sa re ga ma"వాళ్ళు మంచి ఎం.పి౩లు చేసారు. ఎంపిక చేసిన పాటలు కూడా మంచివే ఉన్నాయి. ఒకోసారి పేరు బాగుంటుంది తప్ప ఆల్బంలో పాటలన్నీ బాగుండవు. వేటూరిగారివి రెండు సీడిలు చూశాను. ఎవరు కంపైల్ చేసారో కానీ రెండింటిలోనూ పెద్దగా కొని దాచుకోవాల్సిన కలక్షన్ లేదు. ఇంతకీ ఈ "sa re ga ma"వాళ్ళు సీడీల్లో కొన్నింటికి కర్టసీ విజయవాడలో ఉండే నేమాని సీతారాం గారు. బోలెడు పాత పాటల కలక్షన్ ఉంది ఆయన దగ్గర. హెచ్.ఎం.వి వాళ్ళు కూడా కొన్ని సీడీలకూ, కేసెట్లకూ పాటలకోసం ఆయనను సంప్రదిస్తూ ఉంటారు. నా దగ్గర నాకిష్టమైన పాత పాటల లిస్ట్ ఒకటి ఉండేది. నేను కూడా విజయవాడలో ఉండగా ఆ పాటలన్నీ ఆయన దగ్గర రికార్డ్ చేయించుకున్నాను. డివోషనల్, డ్యూయెట్స్, మేల్ సోలోస్, ఫీమేల్ సోలోస్, పేథోస్...అంటూ వాటిని డివైడ్ చేసి దాదాపు పది కేసెట్లు దాకా చేయించుకున్నా.

ఇంతకీ నే కొన్న సీడీల దగ్గరకు వచ్చేస్తే, చాలా వరకూ మా దగ్గర ఉన్నవే కాబట్టి లేనివాటి కోసం వెతికాము.(షాపులో నేను, ఫోనులో నాన్న..)
1)"హిట్ పైర్ - మాధవపెద్ది సత్యం ఽ పిఠాపురం నాగేశ్వరరావు" సీడి ఒకటి. ఇందులో
* అట్టు అట్టు పెసరట్టు
* భలే చాన్సులే
*అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే
*సైకిల్ పై వన్నెలాడి
*సోడా సోడా
*వివాహభోజనంబు
*ఏం పిల్లో తత్తరబిత్తరగున్నవు
మొదలైన సరదాపాటలు ఏభై దాకా ఉన్నాయి. కొనేసా.

2)రెండవది "మొక్కజొన్న తోటలో - మెలొడీస్ ఆఫ్ సుశీల". ఇందులో
* మొక్కజొన్న తోటలో
*నీవు రావు నిదుర రాదు
*అందెను నేడే
*గోరొంక కెందుకో
*నిదురించే తోటలోకి
*కన్ను మూసింది లేదు
*నీ కోసం
*నీ చెలిమి నేడే కోరితిని
*మీరజాలగలడా
మొదలైన మధురమైన పాటలు ఉన్నాయి. ఇదీ కొనేసా.

3) మూడవది "మసక మసక్ చీకటిలో...ఎల్.ఆర్.ఈశ్వరి హిట్స్". ఇందులో
*మసక మసక చీకటిలో
*ఏకాంతసేవకు
*మాయదారి లోకం
*అలాటిలాటి
*కలలో కనిపించావులే
మొదలైన పాటలు ఉన్నాయి. పదే పదే వినదగ్గవి కాకపోయినా ఒక రేర్ వాయిస్ గల గాయని పాటలుగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ సీడీని. సో, కొనేసా.

4) "సరసాల జవరాలను....డాన్స్ సాంగ్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్స్" అని ఇంకో సీడి. ఇది కొనుక్కో దగ్గ మంచి సీడీ. నాకు బాగా నచ్చినది. ఇందులో మంచి జావళీలు, ఇంకొన్ని ప్రఖ్యాతిపొందిన డాన్స్ సాంగ్స్ ఉన్నాయి.
* అందాల బొమ్మతో
*సరసాల జవరాలను
*బాలనురా మదనా
*నిను చేర మనసాయెరా
*పిలిచిన బిగువటరా
*చూచి చూచి నా మనసెంతో
*ఇంతా తెలిసియుండి
*ముందటీవలే నాపై
*ఎంతటి రసికుడవో
మొదలైన రసభరితమైన పాటలు జావళీలపై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతాయి. కొనేసా..!!

5)తరువాత ఆదిత్యవాళ్లది "సిరివెన్నెల హిట్స్" ఒకటీ సాంగ్స్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను.
*ఉన్నమాట చెప్పనీవు
*ఏ శ్వాసలో
*వేయి కన్నులతో
*చెప్పవే ప్రేమా
*ఏ చోట నువ్వున్నా
*నీకోసం ఒక మధుమాసం
*దేవుడు కరుణిస్తాడని
*నీకోసం నీ కోసం
*ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు
*కొంచెం కారంగా
*గుమ్మాడి గుమ్మాడి
*పెదవిదాటని
ఇలా రాస్తు పోతే సీడీలోని పాటలన్నీ రాసేయాలి. అంత మంచి పాటలున్నాయి దాంట్లో.

ఇంకా ఏం తీసుకున్నానంటే..(6)"ఆదిత్యా" వాళ్ళ కొత్త రిలీజ్ "జెమ్స్ ఆఫ్ దీక్షితార్ ". ఇక ఫైనల్గా గజల్స్ కొనుక్కోకుండా నా పాటల షాపింగ్ అవ్వదు కాబట్టి (7)"mementos" అని ఒక గజల్స్ ఆల్బం కొన్నా. ఇంకా నాన్న మాట్లాడుతున్నారు...ఇంక కళ్ళు మూసుకుని బయటకు వెళ్పోతా నాన్నా చాలా బిల్లయింది అన్నా. సర్లెమ్మని పెట్టేసారు. అదీ రీసెంట్ గా నే చేసిన సీడీ షాపింగ్.

Wednesday, December 22, 2010

BLOG...connecting friends


"శారద" గుర్తుకు రాగానే మంచులో తడిసిన నందివర్ధనం పువ్వు గుర్తుకు వస్తుంది. తెల్లటి తెలుపులాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. ఎంతో అణుకువగల సుగుణాల రాశి. అలాంటి అమ్మాయిలు చాలా తక్కువమంది ఉంటారు. బహుశా ఓ ఇరవైఏళ్ల క్రితం పుట్టవలసిన అమ్మాయి ఇప్పుడు పుట్టింది అనిపించేది తనని చూస్తే. మేం క్వార్టర్స్ లోకి వచ్చాకా పరిచయమైంది. గేటు ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉండేది. లోపలికి వెళ్ళేప్పుడూ వచ్చేప్పుడూ చిరునవ్వుల ఎక్స్చేంజ్ లు అయ్యిన కొంతకాలానికి మా స్నేహం పెరిగింది. ఇప్పటికి దాదాపు ఇరవైఏళ్ళ స్నేహం మాది. టేబుల్ రోజంత పెద్ద పువ్వు పూసే మల్లె మొక్క వాళ్ళింట్లో ఉండేది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా నాకోసం ఆ పెద్ద పెద్ద మల్లెపూలు తెచ్చేది. భలే ఉండేవి ఆ మల్లెపూవులు. తను నాకన్నా ఏడాది పెద్దది. ఇంటర్ తరువాత ఎమ్సెట్లో రేంక్ వచ్చి కాకినాడలో ఇంజినీరింగ్ చదివింది. అన్నయ్య కూడా అక్కడే చదవటం వల్ల మా ఇంటికి కూడా వెళ్తూండేది. మా అత్త తనూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మేం కాకినాడ వెళ్ళినప్పుడల్లా నేను వాళ్ళ హాస్టల్కు వెళ్ళేదాన్ని. ఇంజినీరింగ్ నాలుగేళ్ళు పూర్తయ్యేసరికీ తను విజయవాడ నుంచి తెచ్చి హాస్టల్లో వేసిన పారిజాతం మొక్క పెద్ద వృక్షమై బోలెడు పువ్వులు పూస్తూ ఉండేది. ఇప్పటికీ కాకినాడ లేడీస్ హాస్టల్లో శారద నాటిన ఆ పారిజాత వృక్షం ఉంది.

తను విజయవాడ వదిలాకా మా కమ్యూనికేషన్ ఉత్తరాల ద్వారానే. తన పెళ్ళి కూడా విచిత్రమే. అబ్బాయి తన క్లేస్మేటే, వచ్చి అడిగారు చేసుకుంటామని అని వాళ్ళమ్మగారు చెప్పారు. ఎవరా అంటే నా మరో క్లోజ్ ప్రెండ్ మాధవి వాళ్ళ అన్నయ్యే పెళ్ళికొడుకు. అలా రెండు రకాలుగా దగ్గరైపోయింది తను. చాలా ప్రత్యేకమైన స్నేహితురాలు తను. పెళ్ళైన కొన్నాళ్ళాకే వాళ్ళిద్దరూ అమెరికా వెళ్పోయారు. అమెరికాలో కూడా గుడికెళ్ళి మరీ సాయిపారయణ చేసేంత భక్తురాలు శారద. ఉపవాసాలు, పూజలూ ఇష్టం. పిల్లలిద్దరూ అమెరికాలోనే పుట్టారు. సంసార సాగరంలో పడ్డాకా మా మధ్యన ఉత్తరాలు ఈమైల్స్ గా మారాయి. ఉద్యోగాల హడావుడి పరుగుపందాల్లో నెమ్మదిగా అవీ పండగలకీ, పుట్టినరోజులకీ గ్రీటింగ్స్ పంపుకునేంతగా తగ్గిపోయాయి. మాధవి ద్వారా వాళ్ళ కబుర్లు తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడన్నా ఫోన్ చేసేది తను. కమ్యూనికేషన్ లేకపోయినా ఒకటి రెండు సంవత్సరాల తరువాత తను మాట్లాడినా నిన్ననే మాట్లాడినట్లుగా మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని స్నేహాలు అంతేనేమో. విడిపోవటాలూ కలవటాలూ అనేవి ఉండవు. దూరంలో ఉన్నా, కలవకపోయినా ఆ స్నేహంలోని మాధుర్యం ఇద్దరి మధ్యన ఉన్న బంధాన్ని తాజాగా నిలిపే ఉంచుతుంది.

ఆ మధ్యన ఏవో టపా లింకులు కొందరు స్నేహితులకు పంపుతూ తనకూ పంపాను. తర్వాత మర్చిపోయాను. కొన్నాళ్ళ తరువాత తన ఈమైల్ వచ్చింది. నీ బ్లాగ్ చూసాను. చాలా బాగుంది. ఓపిగ్గా ఉత్తరాలు రాసినట్లే రాస్తున్నావు అని. మా మధ్యన మళ్ళీ ఉత్తరాలు(మైల్స్) మొదలైయ్యాయి. పాత ఐడీ తాలూకూ మైల్బాక్స్ చాలా రోజుల తరువాత నిన్ననే తెరిచి చూసాను. క్రితం వారం శారద రాసిన మైల్ ఉంది. ఆశ్చర్యం. అన్ని కబుర్లూ తనే అడుగుతోంది... ఇల్లు సర్దుకోవటం అయ్యిందా? గుమ్మిడివడియాలు బాగా ఎండాయా? భలే పెట్టేసావు...అంటూ. చివరలో రాసింది "అదివరకూ ఖాళీ ఉంటే నెట్లో ఈనాడు చూసేదాన్ని. ఇప్పుడు నీ బ్లాగ్ మాత్రమే చదువుతున్నాను.బాగుంటోంది...నీ బ్లాగ్ చదువుతూంటే మనం మళ్ళీ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది..." అని. ఎంత ఆనందం వేసిందో. నా బ్లాగ్ చదువుతున్నందుకు కాదు. బ్లాగ్ వల్ల దూరమైన స్నేహితులు కూడా మళ్ళీ దగ్గరౌతున్నందుకు. తనలాగే ఈ మధ్యన దూరాల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ "నీ బ్లాగ్ చదువుతున్నాం రెగులర్ గా. చాలా బాగుంది. నీ కబుర్లు కూడా తెలుస్తున్నాయి..." అని ఫోన్ లో చెప్పారు.

బ్లాగ్ వల్ల ఇతర ఉపయోగాల సంగతి ఎలా ఉన్నా దూరమైన స్నేహితులను కూడా కనక్ట్ చేసే శక్తి బ్లాగ్ కి ఉంది అని అర్ధమైంది. వెరీ నైస్ కదా. కామెంట్లు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? నా ప్రియమైన స్నేహితులు చదివి నాకు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మళ్ళీ దగ్గరౌతున్నారు. అంతకన్నా ఏం కావాలి? నిన్న శారద మైల్ చదివాకా అన్పించింది " NOKIA...connecting people" అయితే "BLOG...connecting friends" అని.

Tuesday, December 21, 2010

చిత్రమాలికలో - The Sound of Music(1965)



నాకిష్టమైన సినిమాల్లో ఒకటైన "The Sound of Music" గురించి చాలా రోజుల్నుంచీ రాయాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఈ సినిమా గురించి నేను రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవండి.

---------------------------


అదే ఆర్టికల్ ఇక్కడ క్రింద:



సినిమాను అర్ధం చేసుకుని, ఆస్వాదించేంత ఊహ వచ్చాకా నేను థియేటర్ లో చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా "The Sound of Music". ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాలో ఒకటి. 1965లో "38వ ఆస్కార్ బెస్ట్ పిక్చర్"గా అవార్డ్ అందుకున్న ఈ సంగీతభరితమైన చిత్రం ఏభైఏళ్ల తరువాత కూడా సినీసంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. 1959లో అప్పటి ప్రముఖ సంగీతరూపకకర్తలైన Richards Rodgers మరియు Oscar hammerstein II బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం సంయుక్తంగా రచించిన సంగీతరూపకం The Sound of Music. "జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్" అనే మిలిటరీ కేప్టెన్ జీవిత కథ ఈ సంగీతరూపకానికి ఆధారం. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ సంగీతరూపకాన్ని 1965లో Robert Wise తానే దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టి సినిమాగా తీసి 20th century fox ద్వారా విడుదల చేసారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తూ ఈ సినిమా అఖండ విజయాన్ని చవిచూసి కాసుల వర్షం కురిపించింది. అంతర్జాతీయ ప్రఖ్యాతిని సంపాదించుకున్న ఈ సినిమా వందేళ్ళ ప్రపంచసినీ చరిత్రలో నూరు గొప్పచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. "వన్ ఆఫ్ థ బెస్ట్ మ్యూజికల్స్ ఎవర్ మేడ్" అనిపించుకుంది.




దక్షిణ జర్మనీ కి చెందిన ఆస్ట్రియాలోని "సాజ్బర్గ్" అనే పట్టణంలోని "వోన్ ట్రాప్" అనే మిలిటరీ కెప్టెన్ జీవితకథ The Sound of Music చిత్ర కథకు ఆధారం. ఆస్ట్రియన్ నేవీ నుండి రిటైరైన కమాండర్ జార్జ్ లుడ్విగ్ వోన్ ట్రాప్. భార్యను పోగొట్టుకున్న అతనికి ఏడుగురు సంతానం. ఆర్మీ కెప్టెన్ కావటం వల్ల పిల్లలను కూడా క్రమశిక్షణతో కట్టుదిట్టంగా పెంచుతూ ఉంటాడు. అయితే అతని కట్టుదిట్టమైన పెంపకం ఇష్టంలేక అల్లరిగా తయారైన అతని ఏడుగురు పిల్లలను చూసుకోవటానికి కెప్టెన్ తీసుకువచ్చే గవర్నెస్ లు ఎవ్వరూ ఆ పిల్లల అల్లరిని భరించలేక పారిపోతూ ఉంటారు. కొత్త గవర్నెస్ కోసం ఒక మొనాస్ట్రీ లోని మదర్ కు లెటర్ పంపుతాడు కెప్టెన్.



నన్ గా మారటానికి ఆ మొనేస్ట్రీ లో చేరుతుంది మరియా. కానీ అక్కడి కట్టుబాట్లతో ఇమడలేకపోతూ ఉంటుంది. అమెదొక స్వేచ్ఛా ప్రపంచం. ఆమె మనసుని అర్ధం చేసుకున్న మదర్ మార్పు కోసం ఆమెను కెప్టెన్ ఇంటికి కొత్త గవర్నెస్ గా పంపిస్తుంది. అక్కడ పిల్లలు ఆమెను బెదరగొట్టడానికి పెట్టే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. నెమ్మదిగా తన సంగీతంతో, వాత్సల్యంతో పిల్లలకు దగ్గరౌతుంది మరియా. వారిలో ఒకరిగా కలిసిపోయి కెప్టెన్ నియమించిన రూల్స్ అన్నింటినీ మార్చేసి, పిల్లలకు స్వేచ్ఛాపూరిత ప్రపంచాన్ని చూపిస్తుంది మరియా. ఆమెలో మాతృత్వ వాత్సల్యంతో పాటూ తాము ఎన్నడూ చూడని సరదాలను, కొత్త అనుభూతులను చవిచూస్తారు పిల్లలు. ఆమె వల్లనే పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారని మరియాను మందలిస్తాడు కెప్టెన్. అయితే ఆమెలోని చలాకీతనానికీ, సంగీత పరిజ్ఞానానికీ అతడు ముగ్ధుడౌతాడు. ఎల్సా తో ఎంగేజ్మెంట్ అవబోతున్న కెప్టెన్ పై తన మనసు మళ్ళుతోందని అర్ధమైన మరియా అది నన్ గా మారాలనుకుంటున్న తన నిర్ణయానికి విరుధ్ధమని భావించి ఇల్లు విడిచి తిరిగి మొనాస్ట్రీకు వెళ్పోతుంది.

మరియా వెళ్పోయాక తన మనోభావాలను స్పష్టం చేసుకున్న కెప్టెన్ తాను ఎల్సాకు తాను మరియాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటాడు. మరియా కోసం మొనాస్ట్రీ కు వెళ్తాడు కెప్టెన్. మనసు చలించే చోటికి తానిక వెళ్లనని అంటుంది మరియా. కానీ మదర్ బలవంతం మీద కొత్త గవర్నెస్ వచ్చేదాకా ఉండటానికి ఒప్పుకుని బయల్దేరుతుంది. కెప్టెన్ ఆమెను పెళ్ళికి ఒప్పించగలుగుతాడా? ఆర్మీ నుంచి వచ్చిన పిలుపును తప్పించుకోవటానికి కెప్టెన్ ఏం చేసాడు? సజ్బర్గ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వోన్ ట్రాప్ కుటుంబం పాల్గొనగలిగారా? నాజీ ఆర్మీ నుంచి తప్పించుకుని ఆ కుటుంబం ఎలా ఆస్ట్రియా దాటివెళ్తారు అన్నది మిగిలిన కథ.

కొన్ని సన్నివేశాల తాలూకూ యూట్యూబ్ వీడియో ఇక్కడ



సినిమలో ప్రధాన ఆకర్షణ సంగీతం. 1959లో Richards Rodgers మరియు Oscar hammerstein II సంయుక్తంగా బ్రాడ్వే మ్యూజికల్ థియేటర్ కోసం రూపొందించిన సంగీతరూపకం The Sound of Musicలోని పాటల బాణీలనే సినిమాలో కూడా వాడుకున్నారు. అయితే సినిమా రిలీజయ్యే hammerstein చనిపోవటంతో మరో రెండు పాటలను చిత్రం కోసం Rodgers తానే రాసి బాణీ కట్టారు.



టైటిల్ సాంగ్ :

"The hills are alive with the sound of music

With songs they have sung for a thousand years

The hills fill my heart with the sound of music

My heart wants to sing every song it hears",



వెస్ట్రన్ సంగీత స్వరాలను వర్ణించే

"Doe, a deer, a female deer

Ray, a drop of golden sun

Me, a name I call myself

Far, a long, long way to run

Sew, a needle pulling thread",



మరియా ఫేవరేట్ థింగ్స్ ..

"Raindrops on roses and whiskers on kittens

Bright copper kettles and warm woolen mittens

Brown paper packages tied up with strings

These are a few of my favorite things",



మదర్ ఎబెస్ పాడే

"Climb every mountain,

Search high and low,

Follow every byway,

Every path you know.",



కెప్టెన్ ప్రేమని తెలిపినప్పుడు మరియా పాడే

"Perhaps I had a wicked childhood

Perhaps I had a miserable youth

But somwhere in my wicked, miserable past

There must have been a moment of truth

For here you are, standing there, loving me

Whether or not you should

So somewhere in my youth or childhood

I must have done something good",



మొనాస్ట్రిలో నన్స్ పాడే "How to solve a problem like maria",

పిల్లలు పాడే "So Long, Farewell",

ఇంకా "iam sixteen going on seventeen",

"Edelweiss" మొదలైన అన్ని పాటలు కూడా సంగీతం, సాహిత్యం రెండింటిలోనూ వేటికవే సాటి. ఈ సినిమా కథ ఇన్స్పిరేషన్ తో పాతిక ఆంగ్లేతరభాషల్లో మరో పాతిక సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో శాంతినిలయం(1969), తరువాత తీసిన "రావుగారిల్లు" సినిమా, రాజా చిన్ని రోజా(ఇది డబ్బింగ్ సినిమా అనుకుంటా), హిందీలో గుల్జార్ తీసిన "పరిచయ్"(ఇందులో టీచర్ జీతేంద్ర . అంతే తేడా) మొదలైన సినిమాలకు Sound of Music సినిమా కథే ఆధారం. ఇళయరాజా, రెహ్మాన్ కూడా ఈ పాటల బాణిలను తమ సొంత బాణిలల్లో వాడుకున్నారు.



65లో ఐదు ఆస్కార్లు గెలుచుకున్న ఈ సినిమా మరెన్నో చోట్ల నామినేషన్లు, ప్రశంసలు పొందింది. సినిమాలో కెప్టెన్ గా "క్రిష్టఫర్ ప్లమ్మర్" నటించారు. మదర్ ఎబెస్ గా "పెగ్గి వుడ్" నటించారు. మరియాగా నటించిన "జూలీ ఏండ్రూస్" సినిమాలో పాటలు స్వయంగా పాడిన గాయని కూడా కావటంతో సినిమాకు జూలీ ఏండ్రూస్ సగం ప్రాణం. Ted D.McCord చేసిన సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా ఉంటుంది. అప్పట్లోనే 70mm లో తీసిన ఈ చిత్రంలోని లొకేషనల్ అందాలు మనసు దోస్తాయి. సినిమా మొదట్లో స్క్రీనంతా నిండుకున్నట్లున్న పచ్చని కొండలు, గ్రీనరీ నుంచీ సినిమా చివర్లో కనిపించే ఆల్ఫ్ మంచు కొండలు వరకూ ప్రతి ఫ్రేమ్ అందమైనదే. చాలా సార్లు సినిమా చూసి ఉండటంతో పాటల సాహిత్యం అంతా కంఠతా నాకు. ముఖ్యంగా "Do-Re-Mi", "My favourite Things" నాకు చాలా ఇష్టమైన పాటలు.



ఒక యదార్ధ జీవితకథ, చక్కని పాటలు, పాత్రలలో కనిపించే రకరకాల భావోద్వేగాలు,గుర్తుండిపోయే సన్నివేశాలతో ఈ సినిమా చూసిన ప్రతివారికీ తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం. సినీప్రేమికులందరూ తప్పక కొని దాచుకోవాల్సిన మంచి సినిమా. ఈ సినిమాలోని పాటల బిట్స్ క్రింద చూడండి.













Monday, December 20, 2010

మౌనమే నా భాష


ప్రస్తుతానికి మౌనమే నా భాష. "మాటరాని మౌనమిది..." అని పాడుకుంటూ రెండు రోజులుగా కాలం వెళ్లబుచ్చుతున్నాను. కారణమేమనగా చలితిరిగింది కదా రెన్నాళ్ళ క్రితం గొంతు బొంగురుపోయింది. పోతే పోయిందని ఊరుకోక ఆదివారం శలవు దినం ఉంది కదా అని శనివారం కాసంత బయటకు తిరిగివచ్చేసరికీ కాస్తో కూస్తో బొంగురుగానైనా పలుకుతున్న గొంతు కాస్తా పూర్తిగా మూగబోయింది. ఆదివారం పొద్దుటి నుంచీ నో సౌండ్. దూరదర్షన్లో మధ్యాన్నం బధిరుల వార్తల్లో లాగ అన్నీ మూగ సైగలే. పిలవాలంటే చప్పట్లు...ఏదైనా చెప్పాలంటే పాప చదువుకునేందుకు కొన్న బోర్డ్ పై రాతలు. 'ఫోనులు చెయ్యద్దు నేను 'మాట్లాడలేను ' అని ఫ్రెండ్స్ కు ఎస్.ఎం.ఎస్ లు, మైల్స్ చేసేసాను. ఇదీ వరస.

'అబ్బ...ఎంత హాయిగా ఉందో రెండు రోజులు నేను ప్రశాంతంగా ఉండచ్చన్నమాట. రెండురోజుల్లో అదే వస్తుందిలే...' అన్న శ్రీవారి కులాసా వాక్యంతో అసలే నెప్పిగా ఉన్న గొంతు ఇంకొంచెం భగ్గున మండింది. నాకసలే ఒకటికి నాలుగు వాక్యాలు చెప్పటం అలవాటు. నోరు కట్టేసినట్లు ఉందనటానికి ఇంతకంటే గొప్ప ప్రాక్టికల్ ఎక్జాంపుల్ ఏముంటుంది? అనుకున్నాను. ఎప్పుడో స్కూల్లోనో, కాలెజీలోనో ఉన్నప్పుడు ఇంతలా గొంతు పోయింది. ఆ తరువాత మళ్ళీ ఇదే. ఎంతైనా ఇన్నాళ్ళూ నన్ను రక్షించిన "జలనేతి" ఎఫెక్ట్ తగ్గిపొతోందని గ్రహించాను. "జలనేతి" ఏమిటీ అంటే, "బీహార్ స్కూల్ ఆఫ్ యోగా" వాళ్ల దగ్గర నేను యోగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్పించిన ఓ ప్రక్రియ "జలనేతి". తల పక్కకు వంచి, కొమ్ము జారీ లోంచి గోరువెచ్చని ఉప్పు నీరు ఒక నాస్ట్రిల్ లోంచి లోపలికి పోసి, ఇంకో నాస్ట్రిల్ లోంచి బయటకు వదిలే ప్రక్రియ. అందువల్ల కలిగే ప్రయోజనాలైతే కోకొల్లలు. చాలా రకాల తలనెప్పులు, ఆస్థ్మా, బ్రోంకైటిస్, సైనస్ ప్రాబ్లమ్స్, జలుబులు ఇంకా బోలెడు నయమవుతాయి. ముక్కు లోంచి శారీరంలోకి కనక్ట్ అయ్యే కొన్ని వేల నాడులు ఈ ప్రక్రియ ద్వారా శుభ్ర పడతాయి. కానీ ఇది ట్రైన్డ్ టీచర్ దగ్గరే నేర్చుకోవాలి. మొదటిసారి మేడం మాతో చేయించిన తరువాత పొందిన అనుభూతి చెప్పలేనిది. ఆ తరువాత ఆరునెలలు చాలా జాగ్రత్తగా రోజూ యోగా, జలనేతి అన్నీ మానకుండా చేసేదాన్ని. తర్వాత తర్వాత బధ్ధకం ఎక్కువై కొన్నాళ్ళు, కుదరక కొన్నాళ్ళు...అలా అలా గడిచిపోయింది.

చిన్నప్పుడు అస్తమానం జలుబు చేసేసేది. "మా ఆయనకు కోపం రానే రాదు. వస్తే సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది. వచ్చినప్పుడలా ఆరునెలలు ఉంటుంది" అనే సామెత లాగ నాకు జలుబు సంవత్సరానికి రెండేసార్లు వచ్చి, వచ్చినప్పుడల్లా ఆరునెలలు ఉండేది. అలాంటిది అప్పట్లో ఆరు నెలలు చేసిన "జలనేతి" వల్ల దాదాపు తొమ్మిది,పదేళ్ళు దాకా ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉండగలిగాను. కొమ్ము జారీని పాడేయకుండా ఎక్కడికి వెళ్ళినా వెంటపెట్టుకుని వెళ్ళాను కానీ జలనేతి మాత్రం చెయ్యలేదు మళ్ళీ. ఈ మధ్యనే ఇక త్వర త్వరగా జలుబు వచ్చేస్తోంది. ఇక ఈసారి చలి ఎక్కువగా ఉండటం వల్ల సంపూర్ణంగా గొంతు మూగబోయింది.

మాట్లాడాలి అనుకున్నవి మాట్లాడలేకపోతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నిజంగా. చప్పట్లు కొట్టి ఇంట్లో వాళ్లను పిలవటం, పాప బోర్డ్ మీద వాక్యాలు రాసి ఇదీ అని చెప్పటం...నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. రెండు రోజులకే ఇలా ఉంటే నిజంగా ఎప్పటికీ మాట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏమిటీ? అనిపించింది. ఏదన్నా లేనప్పుడే కదా దాని అసలైన విలువ తెలిసేది.

Sunday, December 19, 2010

"గుర్రు"


శ్రీమహా విష్ణువు ఎప్పుడూ గుర్రు పెట్టిన దాఖలాలు లేవు. లేకపోతే ట్వెంన్టీఫోర్ అవర్సూ లక్ష్మీదేవికి ఎంత డిస్టర్బెన్స్...!! "గుర్రు". ఎవరుపెట్టారో కానీ భలే పేరు పెట్టారు. "గుర్రు"కు ఇంతకన్నా మంచి పేరు దొరకదేమో.

చిన్నప్పుడూ ఓ రోజు మేం స్కూల్ నుంచి వచ్చేసరికీ హాల్లో ఓ బేగ్ ఉంది. ఎవరో చుట్టాలు వచ్చారని చాలా సంబరపడుతూ అమ్మని అడిగాం ఎవరొచ్చారమ్మా అని. ’బొజ్జతాత’ వచ్చారు అండి అమ్మ. "బాబోయ్" అన్నాం వెంఠనే. తప్పు అలా అనకూడదు అని అమ్మ మందలించింది. బొజ్జతాత అనే ఆయన మా తాతయ్యకు వరసకు తమ్ముడు అవుతారు. పేద్ద బొజ్జ ఉండేదని బంధువుల్లో ఆ పేరు ఖాయం అయ్యిందాయనకు. ఈయన రెండు విషయాలకు ఫేమస్. ఆయనకు రెండడుగుల దూరానికి వెళ్ళగానే విపరీతమైన సిగరెట్టు కంపు. రాత్రికి ఆయన ఏ ఇంట్లో బస చేస్తే వాళ్ళకి నిద్ర ఉండదు. అంత భయంకరమైన గుర్రు పెట్టేవారాయన(పాపం ఇప్పుడు లేరు). మా ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఎవరికీ సిగరెట్ అలవాటు లేకపోవటం వల్ల నాకు ఆ వాసనకు అస్సలు పడదు. ఇక రాత్రి పూటలు చీమ చిటుక్కుమన్నా మెలుకువ వచ్చేసే నిద్ర నాది. మెలుకువ వస్తే ఓ పట్టాన ఇక ఆ పూట నిద్ర అయినట్లే.

ఎవరన్నా వస్తే హాల్లో నవారు మంచం వేసి పక్క వేసే డ్యూటీ నాది. బొజ్జతాతగారికి పక్క వేసేంతలో ఆయన వచ్చేసారు. ఏమ్మా బాగున్నావా? అని దగ్గరగా వచ్చి బుగ్గలు లాగారు. కంపు కంపు...! ఎలాగో తప్పించుకుని లోపలికి పరిగెట్టా. ఇక రాత్రికి భయంకరమైన గుర్రు...పాపం ఆయనను మాత్రం ఏం అంటాం. ఎవరి అలవాట్లు వారివి. మనకు గిట్టకపోతే మన ప్రోబ్లం. రెండు రోజులూ ఉండి, వచ్చిన పని అయ్యాకా మా ఆతిధ్యాన్ని మెచ్చుకుంటూ వెళ్పోయారాయన.

కొన్నాళ్ళ తరువాత ఓ రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మ మమ్మల్ని కూర్చోపెట్టి టేప్రికార్డర్లో ఓ కేసెట్ పెట్టి ఇదేమిటో కనుక్కోండే అంది. చెప్పుకోవాలని చాలా ప్రయత్నించాం కానీ చెప్పలేకపోయాం. తగ్గుతోంది హెచ్చుతోంది...ఒక విచిత్రమైన సౌండ్ అది. మావల్ల కాదు కానీ అదేమిటో చెప్పమ్మా అన్నాం. "కొన్ని రోజులుగా మీ నాన్న గుర్రు పెడుతున్నారు. చెప్తే నమ్మటం లేదు. నేనేమిటి గుర్రేమిటి అని. అందుకని గుర్రు పెడుతూంటే రికార్డ్ చేసాను" అంది. నాన్న గుర్రు పెడుతున్నారా? ఆశ్చర్యపడీపోయాం. గుర్రు అంటే ఎవరో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు మాత్రమే పెడతారని మా అభిప్రాయం. అదిమొదలు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఇదేమిటో చెప్పుకోండి అని ఆ కేసెట్ వినిపించేవాళ్ళాం. అప్పటి నుంచీ మా ఇంట్లో కూడా గుర్రు మొదలైంది.


అత్తగారింట్లో మొదటి రోజు మధ్యలో మెలుకువ వచ్చింది. కొత్త కదా అనుకునేలోపూ పక్కనుంచి గుర్రు వినబడింది. అమ్మో ఈయన గుర్రు పెడతారా...అనుకునే లోపూ మరో రెండూ మూడూ గుర్రు సౌండ్లు వినిపించాయి. బాబోయ్ వీళ్ళింట్లో అందరూ గురక పెడతారన్న మాట...అనుకున్నా. మిగతావాళ్ళ సంగతి సరే ఏం చెయ్యలేం. పక్కనున్న పతిదేవుడి సంగతి ఏమిటో అనుకున్నా. కొన్నాళ్ళకు సౌండ్ తీవ్రమైనప్పుడల్లా కాస్త కదిపితే (టేప్ రికార్డర్ సౌండ్ తగ్గించినట్లు)మళ్ళీ సౌండ్ తగ్గుతుంది అని తెలుసుకున్నా. ఇక ఆ సిస్టం ఫాలో అవటం మొదలెట్టా. కాస్త రిలీఫ్. కానీ అప్పుడప్పుడూ ఆఫీస్ వర్క్లోడ్ ఎక్కువ ఉన్నప్పుడూ ఈ గుర్రు సౌండ్ మరీ పెరిగిపోతుంది. నాకు మెలుకువ వచ్చేసి ఇక నిద్ర పట్టనంత. మధ్యలో సౌండ్ తగ్గించటానికి కదిపినా అయ్యగారి నిద్రకు ఏం ఆటంకం కలగదు. పిలిస్తే వస్తుంది నిద్రాదేవి ఆయన దగ్గరకు. శలవురోజు మధ్యాహ్నం అయినా సరే ఓ కునుకు పట్టిందంటే "గుర్రు" లేకుండా నిద్ర అవ్వదు.

ఆమధ్యన ఓసారి మధ్యాహ్నం అమ్మావాళ్ళింటికి వెళ్లా. అన్నయ్య నిద్రపోతున్నాడు. ఎక్కడనుంచో పెద్ద గుర్రు వినిపిస్తోంది. ఎవరూ?పక్కింట్లోంచా? అన్నా. "ఇంకెవరూ మీ అన్నయ్యే..." అంది వదిన. "పాపం వదిన" అనుకున్నా మనసులో. రాత్రి మెలుకువ వచ్చేసింది. పక్కన అమ్మ నాన్న కన్నా పెద్ద గుర్రుపెడుతోంది. ఇదేంటి నాన్నా అనడిగా పొద్దున్నే. 'ఈమధ్యనే అప్పుడప్పుడూ పెడుతోందే. అలసట ఎక్కువైపోయీ...' అన్నారు.

Saturday, December 18, 2010

ఏమండీ...నువ్వు


"ఏమండీ.." "ఏమండీ.."
ఇదేం పదం బాబూ?
ఎవరుకనిపెట్టారో?
ప్చ్..!
వాళ్ళనీ...
అసలూ ఎవరో పక్కింటివాళ్ళనో, పరిచయంలేనివాళ్ళనో, రోడ్డు మీడ వెళ్ళేవాళ్ళనో పిలిచినట్టు జీవితభాగస్వామిని "ఏమండీ" అని పిలవటమా? నాన్సెన్స్. నువ్వు కాబట్టి పిలుస్తున్నావు. నేనస్సలు పిలవను. నేను చక్కగా పేరు పెట్టో, నువ్వు అనో పిలుచుకుంటా....

హు...హు..హు..! ఇవన్నీ పెళ్ళికి ముందు పలికిన ప్రగల్భాలు. అమ్మ దగ్గర పేల్చిన ఉత్తుత్తి తూటాలు. అమ్మకు నాన్న వరసకు "బావ" అవుతారు. పదవ తరగతి అవ్వగానే పెళ్ళి చేసేసారు. అందరితో పాటుగా అమ్మ కూడా ’బావా బావ” అంటూంటే అత్తారింట్లో "అదేంటమ్మా, ఇప్పుడిక బావా అనకూడదు. భర్తని "ఏమండీ" అనాలి..." అని క్లాస్ ఇచ్చేసారుట. పాపం అమ్మ "బావా..నువ్వు.." అనే స్వాతంత్ర్యం పోగొట్టేసుకుని "ఏమండీ..మీరు.." అనే మొహమాటపు పిలుపుల్లోకి దిగిపోయింది. ఇప్పుడైనా పిలవచ్చు కదమ్మా అంటే..అలవాటైపోయిందే. అంటుంది. "నువ్వు" అనే పిలుపులోని దగ్గరతనం "మీరు" అనే పిలుపులో ఎప్పటికైనా వస్తుందా? రాదంటే రాదు. ఎంత దగ్గరైనా "మీరు" అనే పిలుపు మాత్రం ఎదుటి మనిషిని అల్లంత దూరాన్నే నిలబెట్టేస్తుంది. ఆ గీత దాటి మరింత దగ్గరకు వెళ్ళాలన్నా ఈ పదం అస్సలు వెళ్ళనివ్వదు. నాకయితే అది అచ్చం ఓ మొహమాటపు పిలుపులానే అనిపిస్తుంది. బాగా సన్నిహితమైతే తప్ప నేనెవరినీ "నువ్వు" అనను. పేపర్ అబ్బాయినీ, ఆటో డ్రైవర్నూ కూడా "మీరు" అని పిలవటం నేను నాన్న దగ్గర నేర్చుకున్నా.

పూర్వకాలం కొద్దిగా అలుసిస్తే నెత్తినెక్కే భర్యలు ఉండేవారేమో అందుకని భార్యలను అదుపులో ఉంచుకోవాలనో, తమ గౌరవాన్ని ఎక్కువ చేసుకోవాలనో ఇలాంటి పిలుపుని నిర్ణయించి ఉంటారు అని నా అభిప్పిరాయం. లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా దగ్గరి స్నేహితులను "ఏమండీ...మీరు" అని పిలుస్తారా? మరి భర్త అంటే స్నేహితుడే కదా. జీవితాంతం మిగిలిన అందరి కంటే భార్యకు దగ్గరగా, అనుక్షణం వెంటే ఉండే భర్త అందరికంటే ఎక్కువ సన్నిహితుడైన మిత్రుడే కదా. మరి అలాంటి మిత్రుడిని "ఏమండీ" అని ఎందుకు పిలవాలి? అసలా పిలుపుతో ఇద్దరి మధ్యన ఏర్పడిన లేక ఏర్పడబోయిన సన్నిహిత అనుబంధం కాస్తైనా దూరం అయిపోతుంది అని నా భావన. మగవాళ్ళు మాత్రం భార్యలను "ఏమే" "ఒసేయ్" "రావే" "పోవే" అని పిలవచ్చా? ఇదెక్కడి న్యాయం? అంటే ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నవాళ్ళ గురించి నేనేం మాట్టడటం లేదన్నమాట. కొందరు "ఒరే" అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. అది పూర్తిగా వేరే టాపిక్.

మాది ఎరేంజ్డ్ మేరేజ్ అవటం వల్ల, నా పెళ్ళికి ముందు మావారితో పరిచయం గానీ, స్నేహం గానీ లేకపోవటం వల్ల పెళ్ళయ్యాకా ఏమని పిలవాలో తెలిసేది కాదు. "మీరు" "ఏమండి" అనటం నా భావాలకు విరుధ్ధం. "ఏయ్" ఓయ్" అని అవసరార్ధం ఎక్కడైనా అనాల్సి వచ్చేది...అవి కాస్తా మా అత్తగారి చెవిన పడనే పడ్డాయి. "ఏమిటమ్మా, మొగుణ్ణి పట్టుకుని ఏయ్..ఓయ్..అంటావేమిటీ? శుభ్రంగా ఏమండీ అని పిలువు" అని గీతోపదేశం చేసారు. ఏం చేస్తాం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి నేను సైతం ఆ పిలుపుకే అలవాటు పడ్డాను.కానీ మనసులో ఎక్కడో ఓ మూల బాధ. ఆ కొత్తల్లోనే ఓ రోజు సినిమాకు వెళ్ళాం. సినిమా అయ్యాకా నన్ను గేట్ దగ్గర ఉండమని తను బండి తెచ్చుకోవటానికి వెళ్ళారు. నేనో గేట్లోంచి బయటకు వచ్చాను. తనో గేట్లోంచి బయటకు వచ్చారు. కాసేపు వెతుకులాట సరిపోయింది. ముందు నాకు తను కనిపించారు. "ఏమండి..ఏమండి" అని ఆ జనంలో పిలుస్తూంటే అందరూ వెనక్కు తిరిగి చూస్తూంటే నాకే నవ్వు వచ్చింది. అప్పుడొచ్చింది భలే కోపం. భర్తను ఏమండీ అని పిలవమని రూలు పెట్టిన వాళ్ళానీ... అని బాగా తిట్టేసుకున్నాను. చివరికి ధైర్యం చేసి పేరు పెట్టి పిలిచేసా. అప్పుడు వెనక్కు తిరిగి చూసారు అయ్యగారు.

ఇక అప్పటినుంచీ నా రూలైతే మారిపోయింది. "మొగుణ్ణి పేరు పెట్టి పిలుస్తావా? హన్నా" అని అయ్యగారే ఓ క్లాస్ తీసుకుంటారు కాబట్టి తనను పేరు పెట్టి పిలవను కానీ దరిదాపుల్లో మూడో వ్యక్తి లేకపోతే మాత్రం "నువ్వు" అనే పిలుస్తాను. కాస్తలో కాస్త సేటిస్ఫాక్షన్ అన్నమాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మా అన్నయ్య, తమ్ముడు మాత్రం పెళ్ళిళ్ళు కుదరగానే "పేరు పెట్టి పిలువు"..."నువ్వు" అను అని భార్యలకు ఫ్రీడం ఇచ్చేసారు. ఎంతైనా నాకు సహోదరులు కదా...:) భర్తకు ఇవ్వల్సిన గౌరవం ఎప్పుడూ ఇవ్వాలి. కాదనను కూడా. కానీ నా కంప్లైంట్ అంతా ఆ "ఏమండీ" అనే పిలుపు మీదే. ఎప్పటికైనా ఆ పిలుపులో మార్పుని తెచ్చే ఎమెండమెంట్ ఏమన్నా వస్తుందేమో అని చిన్న ఆశ.

Friday, December 17, 2010

గీతాసారం

రెండు పర్వదినాలు ఇవాళ ఒకేసారి వచ్చేసాయి. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి. ముక్కోటి ఏకాదశి గురించి ఇక్కడ అదివరకూ రాసాను. ఇక "గీతా జయంతి" సందర్భంగా సంక్షిప్తం చేసిన గీతాసారం:


గీతా సారం:

* ఏమి జరిగిందో, అది బాగా జరిగింది.
* ఏమి జరుగుతోందో, అది బాగా జరుగుతోంది.
* ఏమి జరగబోతోందో, అది కూడా బాగానే జరగబోతోంది.
* నీది ఏది పోయింది, ఎందుకు నీవు బాధ పడుతున్నావు?
* నీవు ఏమి తెచ్చావని,
* అది పోయిందని బాధ పడుతున్నావు?
* నీవు ఏమి సృష్టించావని అది నష్టపోయిందనడానికి?
* నీవు ఏమి తీసుకున్నావో, ఇక్కడ నుంచే తీసుకున్నావు.
* నీవు ఏమి ఇచ్చావో, ఇక్కడనే ఇచ్చావు.
* ఈవేళ ఏది నీదో, అది న్నిన్న ఎవరిదో మరెవరిదో అయిపోతుంది.
* పరివర్తన సంసారం యొక్క నియమం.

********************************

పైన రాసిన "గీతాసారం" ఒక కేలండర్లో మా హాల్లో ఉండేది చాలా ఏళ్ళు. చాలా మంది బాగుందని రాసుకుని వెళ్ళేవారు కూడా. క్రితం ఏడు "గీతా జయంతి"నాడు నేను ఊళ్ళో లేనందువల్ల టపా రాయలేక, చైతన్యను తన బ్లాగ్లో పెట్టమని చెప్పాను. ఆ టపా ఇక్కడ. అప్పుడు నా బ్లాగ్లో రాయలేదన్న లోటూ ఈసారి ఇదిగో ఇలా తీర్చేసుకున్నాను...:)

Thursday, December 16, 2010

ధనుర్మాస ప్రారంభం - మొదటి ముగ్గు !!






ఇవాళ నుంచీ ధనుర్మాసం మొదలు. ముగ్గులు మొదలు. కానీ ఇదేమిటి మొదటి ముగ్గు అని మూడు ముగ్గుల ఫోటోలు పెట్టాను? చిన్నది తులశమ్మ దగ్గర ఎలాగో ఫిక్స్ అయిపోయింది. ఇక పెద్ద ముగ్గులు రెంటిలో ఏ ముగ్గు పెడదామా అని ఆలోచిస్తున్నానన్నమాట. అందుకని మూడూ పెట్టేసాను...:) నాకు మామూలు ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు బాగా ఇష్టం. ఎక్కువగా అవే వేస్తాను.

ముగ్గులు గురించి అదివరకూ రెండు సార్లు( 1, 2) రాసేసాను. అందుకని ఇక రాయటం లేదు.

Monday, December 13, 2010

ఆ మేజికల్ స్వరమే "కేకే"

"दर्द में भी येह लब मुस्कुरा जाते हैं
बीते लम्हे हमें जब भी याद आते हैं ...

... आज भी जब वो मंज़र नज़र आते हैं
दिल की वीरानियॊं को मिटा जाते हैं..." (The Train)


అని వింటూంటే అప్రయత్నంగా పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. ఆ గొంతులో ఒక ప్రత్యేకత అతడిని గొప్ప గాయకుడిగా నిలబెట్టింది. ఒక తపన, తెలియని వేదన, కాస్తంత నిర్వేదం, హృదయాన్ని కుదిపేసే భావన అన్నీ కలిసి ఒక మేజిక్ సృష్ఠిస్తే ఆ మేజికల్ స్వరమే "కేకే" అనబడే 'Krishna kumar kunnaath'ది. కేరళలో పుట్టిన మరో సౌత్ ఇండియన్ గాత్రాన్ని బోలీవుడ్ వరించింది. దేశమంతా మెచ్చింది.



"యారో..." అంటూ "పల్" ఆల్బంలోని పాటతో ఎందరో స్టూడెంట్స్ గుండెల్లో గూడు కట్టేసుకున్నాడు. "లుట్ గయే...హా లుట్ గయే..." అంటూ "హమ్ దిల్ దే చుకే" పాటతో యావత్ భారత దేశ ప్రజానీకాన్నీ ప్రేమావేశంలో ముంచేసాడు. ఇవాళ్టికీ ఆ పాట వింటే భగ్న ప్రేమ తెలియకపోయినా, మనసు తెలియని లోకాల్లోకి వెళ్పోయి...తనలోని దు:ఖ్ఖాన్నంతా సేదతీర్చేసుకుంటుంది.

"तु ही मेरी शब है सुबाह है..."(gangster) అనీ "यॆ बॆखबर..यॆ बॆखबर" (जेहर) అనీ వింటూంటే మన కోసం ఇలా ఎవరైనా పాడకూడదూ... అనే ఆశ పుట్టిస్తుంది ఆ గొంతు!


"ఆవారాపన్ బంజారాపన్..." అని "जिस्म"లో పాట వింటూంటే ఆర్ద్రతతో మనసు బరువెక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పాటలు...ఎన్నిటి గురించి చెప్పేది? ఏ పాటను వర్ణించేది? నలభైయేళ్ళ ఈ మధుర గాయకుడి పాటలు విన్నాకా అభిమానులవ్వనివారు ఎవరుంటారు? అనిపిస్తుంది నాకు.
"కేకే" పాడిన నాకిష్టమైన కొన్ని హిందీ పాటలు....

ज़िंदगी दॊ पल की (kites)
दिल क्यू मेरा (Kites)

छॊड आयॆ हुम वो गलियां (maachis)

प्यार में कभी कभी (Pyaar Mein Kabhi Kabhi)

तदप तडप के इस दिल से (हम दिल दॆ चुकॆ सनम)

यारॊं (Rockford / Pal)

मुझॆ कुछ केहना है (Mujhe Kucch Kehna Hai)

ऎ दिल दिल की दुनियां मॆं (Yaadein)

कोई कहॆ (दिल चाह्ता है)

सच केह रहा है दीवाना(रेहना सै तेरॆ दिल में)

बर्दाश (हम्राज़)

डॊला रॆ डॊला (दॆवदास)

मार डाला (दॆवदास)

रुलाती है मोहोब्बते (Kitne Door Kitne Paas)

जीना क्या जीवन सॆ हार् कॆ (Om Jai Jagadish)

आवारापन बन्जारापन (जिस्म)

चली आयी (Main Prem Ki Diwani Hoon)

ऒ अज्नबी (Main Prem Ki Diwani Hoon)

कबी खुशबू (साया)

उल्झनॊं कॊ दॆ दिया (Main Prem Ki Diwani Hoon)(duet)

दस बहानॆ (दस)

सीधॆ सॆ ढंग सॆ (सोचा न था)

गुजारिश (guzaarish)

तॆरॆ बिन (Bandish)

दर्द मॆं भी यॆ दिल (THE TRAIN )

यॆ बॆखबर (जेहर)

तु हि मेरि शब है (gangster)

ऒ मॆरी जान - (tum mile)

ప్రస్తుతానికి గుర్తున్న 'కేకే' పాడిన(నాకు నచ్చే) తెలుగు పాటలు...:


ఉప్పెనంత (ఆర్యా 2)

ఆకాశానా (మనసంతా నువ్వే)

ఎవ్వరినెప్పుడు (మనసంతా నువ్వే)

ఐయామ్ వెరీ సారీ (నువ్వే నువ్వే)

దేవుడే దిగి వచ్చినా (సంతోషం)

ఫీల్ మై లవ్ (ఆర్య)

గుర్తుకొస్తున్నాయి (నా ఆటోగ్రాఫ్)

ఓ చలియా (హోలీ)

ఊరుకో హృదయమా(నీ స్నేహం)

ఒకరికి ఒకరై (స్టూడెంట్.నం.వన్)

ప్రేమా ప్రేమా(జయం)

వెళ్తున్నా(బాస్)

తలచి తలచి చూస్తే (7G బృందావన్ కాలనీ)

Tuesday, December 7, 2010

శ్రీ కె.జె.ఏసుదాస్ గారి "Hymns from the Rig-Veda"


మైమరపించే గాయకుడు శ్రీ కె.జె.ఏసుదాస్ తన గాత్రాన్నందించిన గొప్ప ఆల్బం లలో ఒకటి "Hymns from the Rig-Veda ". వేదాలన్నింటిలోకీ పురాతనమైనదిగానూ గొప్పదిగానూ చెప్పబడే ఋగ్వేదం లోని కొన్ని శ్లోకాలను ఏసుదాస్ గారు మధురంగా గానం చేసారు ఈ ఆల్బంలో. వింటూంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నలభై నిమిషాల ఈ కేసెట్లో ఋగ్వేదం లోని V,VII,X మండలాల్లోని 37శ్లోకాలను ఏసుదాస్ రాగయుక్తంగా పాడారు.


ఈ ఆల్బం 1979 లో Oriental Records ద్వారా రిలీజ్ చేయబడింది. శ్రీ రంగసామి పార్థసారధిగారు ఈ ఆల్బంలోని శ్లోకాలకు స్వరాలను సమకూర్చారు. సంగీతానికి ఉపయోగించినవన్నీ భారతీయ వాయిద్యాలే. కేసెట్ లోపల ఈ సంస్కృత శ్లోకాలు, వాటికి ఆంగ్ల అనువాదంతో కూడిన చిన్న బుక్లెట్ కూడా ఇచ్చారు. ఈ కేసెట్ సి.డి.రూపంలో కూడా వచ్చింది. నా దగ్గర ఉన్న కేసెట్ లోంచి ఒక చిన్న శ్లోకాన్ని ఇక్కడ వినటానికి పెడుతున్నాను.