సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 31, 2010

సాక్షి ఆదివారం(28-3-10) పుస్తకం...

మా ఇంట్లో రోజూ వచ్చే దినపత్రికలు ఆంధ్ర జ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా,ఎకోనోమిక్ టైమ్స్. సాక్షి వచ్చిన కొత్తల్లో నా పోరు పడలేక కొన్నాళ్ళు "సాక్షి" తెప్పించినా తిరిగి ఆంధ్రజ్యోతి కే మారిపోయారు. కనీసం ఆదివారం సాక్షి పుస్తకం కొని తెండి అంటే మావారు ఎప్పుడు "మర్చిపోతారు" పాపం ... అలాంటిది మొన్న ఆదివారం అనుకోకుండా నామాట గుర్తుండి ఆదివారం "సాక్షి" కొనితెచ్చారు.

అదృష్టవశాత్తు అది వాళ్ళ రెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక అవటంతో కొన్ని మంచి సంగతులు దానిలో ఉన్నాయి. కూడలి నేను రేగులర్గా చూడటం లేదు కాబట్టి ఎవరన్నా దీనిని గురించి రాసేసారేమో తెలియదు. తెలియనివాళ్ళు ఉంటే చదువుతారని ఈ టపాలో రాస్తున్నాను...

28వ తారీకు ఆదివారం ఈ-పేపర్ లింక్ ఇక్కడ చూడచ్చు.
ఇంతకీ అందులో ఉన్న తాయిలం ఏమిటంటే ....


"తప్పక చూడాల్సిన 100 సినిమాలు"

"తప్పక చదవాల్సిన 100 తెలుగు పుస్తకాలు"


"తప్పక వినాల్సిన 100 తెలుగు పాటలు"

జాబితాలోని సినిమాలు ఒక పది తప్ప మిగిలినవన్నీ చూసినవే,పాటలు దాదాపు అన్ని విన్నవే. చాలామటుకు నాదగ్గర ఉన్నవే. కానీ పుస్తకాలు మాత్రం పది పదిహేను మించి చదివినవి లేవు...మిగిలినవన్నీ చదవాల్సినవే..!!


ఆలస్యమెందుకు...ఇప్పటిదాకా ఈ ఆదివారం పుస్తకం చదవనివాళ్ళు ఉంటే తప్పక చదివి ఆనందించేయండి మరి ...

Tuesday, March 23, 2010

శ్రీరామనవమి జ్ఞాపకాలు...


"ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.."


నాన్నకు కృష్ణుడంటే ఇష్టం. ఇంట్లో అన్ని కృష్ణుడు పటాలూ,పెద్ద విగ్రహం...!నల్లనయ్య ఇష్టమైనా రాముడంటే నాకు ప్రత్యేక అభిమానం. అదీకాక అమ్మానాన్నల పేర్లు సీతారాములవటం కూడా ఒక కారణం. 'సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి..." అని మేము పాడుతూ ఉంటాము.

శ్రీరామనవమికి అమ్మ చేసే వడపప్పు నాకు చాలా ఇష్టం. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు,మావిడి కోరూ వెసి,చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్తంత ఆవాలు,ఇంగువ పొపు పెట్టి అమ్మ చేసే వడపప్పు ఇప్పటికీ నోరురిస్తుంది. ఇక పానకం సంగతి చెప్పక్కర్లేదు. తీపి ఇష్టం కాబట్టి చేసిన పెద్ద గిన్నెడు పానకం మధ్యాహ్న్నానికల్లా పూర్తయిపోయేది.

మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో...

ఇక రేడియోలో పొద్దున్నే పదకొండింటికల్లా మొదలయ్యే భద్రాచల కల్యాణం తప్పక వినాల్సిందే...అందులోనూ "ఉషశ్రీ తాతగారి" గోంతులో వచ్చే వ్యాఖ్యానం వినితీరాలి. ఆయన గంభీరమైన గొంతుకు సాటి వేరే గొంతు ఇప్పటికీ లేదు.నాన్న రేడియోలోనే పని చేయటంవల్ల మాకు పరిచయమే కాక, మా నాన్నంటే ఉషశ్రీ తాతగారికి ప్రత్యేక అభిమానం ఉందేది. అమ్మని "అమ్మాయ్" అని పిలిచేవారు. మేము ఆయనను "తాతగారు" అని పిలిచేవాళ్ళం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన. రేడియో వినే వాళ్ళకు తెలవచ్చు ఆయన చెప్పిన "ధర్మ సందేహాలు" కార్యక్రమం ఎంత ప్రఖ్యాతి గాంచిందో..!

మేము క్వార్టర్స్ లోకి మారాకా అక్కడ ప్రతి ఏడు రామనవమికి పందిరి వేసి కల్యాణం చేసేవారు. సాయంత్రాలు పిల్లలందరం కార్యక్రమాలు...నేనూ ఒకటి రెండు సార్లు పాటలు పాడాను...

శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..

బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఆశీస్సులు లభించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.

" మృత్యోర్మా అమృతంగమయ -- ౩ "

మొదటిభాగం
రెండవ భాగం తరువాయి....

కిషోర్ హాస్పటల్కు వెళ్తుంటే వైజాగ్ లో ఉన్న కూతురు శైలజ దగ్గరకు వెళ్తానని టికెట్లు రిజర్వ్ చేయించమని అడుగుతుంది కాంతిమతి. పదిరోజులకన్నా ఎక్కువ అయితే తను ఉండలేనని త్వరగా వచ్చేయమని చెబుతాడు కిషోర్. శైలు ఇంటికి వెళ్తుంది కాంతిమతి. అల్లుడిది మంచి ఉద్యోగం. ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కాపురం శైలుది. ఓ వారం గడిచాకా ఒకరోజు పక్కింట్లో జరిగిన ఒక సంఘటన కాంతిమతిని బాగా కదిలించివేస్తుంది. కొడుకు,కోడలు నిర్లక్యం వాళ్ళ అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన పక్కింటి సుబ్బరాయమ్మ గారి కధ ఆవిడ మనసును కలచివేస్తుంది. ప్రాణసమానంగా పెంచుకున్న కొడుకు పెళ్ళవగానే మారిపోయి కన్నతల్లి మరణానికి కారణం కాగలడన్న సంగతి ఆమె జీర్ణిమ్చుకోలేకపోతుంది. ఆ తరువాత శైలు స్నేహితురాలు, తన ఒకప్పటి స్టూడెంట్ అయిన నీరజను కలుస్తుంది. నీరజ అత్తగారు ఆమెను పెడుతున్న ఇబ్బందుల సంగతి తెలుసుకుని బాధపడుతుంది.

ఒకరోజు తన పీ.ఎఫ్. గురించి ఆరా తీసి వాటితో తనకు ఫ్రిజ్ కొనిపెట్టమని , రెండు జతల గాజులు చేయించమని అడిగిన శైలును చూసి ఆశ్చర్యపోతుంది కాంతిమతి. భర్తకు మంచి ఉద్యోగం ఉండీ, తనది పెన్షన్ లేని ఉద్యోగం అని తెలిసీ వచ్చే కొద్దిపాటి డబ్బుని పంచమన్నట్లు అడుగుతున్నా కూతురికి ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాదు ఆమెకు. "ప్రపంచంలో ఇటు చేసి కాని, అటు పెట్టి కాని ఎవ్వరినీ తృప్తి పరచలేము" అనుకుంటుంది మనసులో. వెళ్ళే ముందు తన మెడలోని గొలుసును శైలుకు ఇచ్చి, శైలు దగ్గర నుంచి మద్రాసులో ఉన్న పెద్దకొడుకు కృష్ణముర్తి దగ్గరకు బయల్దేరుతుంది కాంతిమతి.ఆమె రాకకు చాలా ఆనందిస్తాడు పెద్ద కొడుకు. అయితే ఆడపడుచు కూతురైన పెద్దకోడలు జానకి ఎత్తిపొడుపు మాటలు మాత్రం ఆమెకు చివుక్కుమనిపిస్తాయి. మాట్లాడకుండా కాళ్ళకు చుట్టుకున్న మనుమలిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది కాంతిమతి.

మద్రాసులోనే ఉంటున్న తన స్నేహితురాలు రేవతి కుమార్తె ఉమను కలుస్తుంది. పెద్దింటి సంబంధం , ఎంతో అదృష్టవంతురాలు అనుకున్న ఉమ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతుంది ఆమె. ముక్కు మొహం తెలియకపోయినా తనను ఎంతో ఆదరించిన ఉమ అత్తగారు, కోడలిని కొడుకుతో సరిగ్గా మాట్లాడనివ్వదని, వాళ్ళను అన్యోన్యంగా ఉండనివ్వదని తెలుసుకుని ఎంతో బాధ పడుతుంది. ఉమ ఇల్లు వెతుక్కుని వెళ్లి దూరపు చుట్టంగా పరిచయం చేసుకుని కాసేపు ఉండి వస్తుంది కాంతిమతి. ముక్కు మొహం తెలీని తననే ఆదరంగా చూసిన ఉమ అత్తగారు కోడలితో ప్రవర్తించే విధానం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. ఉన్న కాసేపులో కొడుకంటే ఉమ అత్తగారికి ఎంత ప్రాణమో తెలుసుకుంటుంది. తిరిగి వచ్చే దారిలో ఎన్నో ఆలోచనలు ఆమెను చుట్టుముడతాయి.

"కొడుకును అపురుపంగా చూసుకునే తల్లి కోడలిని కూడా ఎందుకు సమానంగా చూడదు? వారిద్దరూ అన్యోన్యంగా ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న అభద్రతా? పవిత్రమైన తల్లి ప్రేమ కొడుకు వైవాహిక జీవితానికి అడ్దంకు అవుతుందా? సృష్టిలోకెల్లా తీయనైన తల్లిప్రేమ ఇంత సంకుచితంగా, స్వార్ధపూరితంగా ఉంటుందా?...." మొదలైన అనేకరకాల ఆలోచనలతో ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టదు. నిద్రపట్టక దర్లుతున్న ఆమెకు పక్క గదిలోంచి పెద్దకోడలి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాంతిమతి పేరన ఉన్న ఇల్లును వాళ్ళ పేరన రాయించుకొమ్మని భర్తతో ఘర్షణ పడుతుంది జానకి. అందుకు ససేమిరా ఒప్పుకోడు కృష్ణమూర్తి. పాత రోజులు కళ్ళ ముందుకు వస్తాయి కాంతిమతికి.

"దానికి అన్యాయం జరిగిందర్రా. కోడలైనా కూతురిలా సేవ చెసింది. ఇంటి బాధ్యతలన్నీ తనపై వేసుకుని తీర్చింది .." అంటు ఆమె అత్తగారు ఆఖరి ఘడియల్లో సర్వహక్కులతో తన పేర్న ఉన్న ఇల్లును పట్టుబట్టి కాంతిమతి పేర్న రాయిస్తుంది. ఆగ్రహించిన మరుదులూ, ఆడపడుచూ అత్తగారు పోయాకా కార్యక్రమాలకు ఖర్చులన్నీ కాంతిమతే భారించాలని వాదిస్తారు. తాకట్టు పెట్టిన గొలుసుని విడిపించి డబ్బు సర్దుతాడు అంత్యక్రియలకు వచ్చిన ఆమె భర్త గోపాలరావు. ఇల్లు తనకు వద్దనీ వాళ్ళందరికీ రాసేస్తానని అన్న కాంతిమతిని భర్త వారిస్తాడు. పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించి చేస్తారనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇల్లును ఎవరిపేరనా రాయొద్దనీ, ఆ ఊరునూ ఇంటినీ వదిలి వెళ్ళొద్దని మాట తీసుకుంటాడు గోపాలరావు.


బాధామయ గతాన్ని తలుచుకుంతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది కాంతిమతి. కొద్ది రోజుల తరువాత వెళ్పోతూ వెళ్పోతూ తన మెడలోని మరొక పేట గొలుసును ఇచ్చినప్పుడు మాత్రం జానకి మొహం విప్పారుతుంది. తిరువణ్ణామలై కు టికెట్ కొనుక్కున్న తల్లిని చూసి ఆశ్చర్యపోతాడు స్టేషన్ కు వచ్చిన కృష్ణమూర్తి. బాధ్యతలు తీరాయి కద్దా కొన్నాళ్ళు ప్రసాంత వాతావరణంలో గడపాలనుందని చెబుతుందామె. అరుణాచెలం,పుదుచ్చేరి తిరిగి నెల తరువాత ఇల్లు చేరుతుంది కాంతిమతి.

(ఇంకా ఉంది..)

Sunday, March 21, 2010

గాయం..



హృదయం ముక్కలవుతుంది
దెబ్బతిన్న ప్రతిసారీ..

మౌనం వెక్కిరిస్తుంది
మాటలు కరువైన ప్రతిసారీ..

మనసు విలవిలలాడుతుంది
అభిమానం అవమానింపబడిన ప్రతిసారీ..

గాయం మాననంటుంది
లోతుగా తగిలిన ప్రతిసారీ..

కన్నులు మసకబారతాయి
ఆరని మంటలు ప్రజ్వలించిన ప్రతిసారీ..

ఆత్మ ఆక్రోశిస్తుంది
చేయని తప్పుకు శిక్ష పడిన ప్రతిసారీ..

ఏదేమైనా లేవాటానికే ప్రయత్నిస్తాడు మనిషి
క్రిందపడిన ప్రతిసారీ..


ఒక అపార్ధం నుంచి వచ్చిన నిరసన, నిర్లక్ష్యం వల్ల కలిగిన ఆవేదనలోంచి వచ్చిన వాక్యాలు ఇవి...అవుట్లెట్ కోసం రాసినవి మాత్రమే! ఎందుకంటే మనిషికి కలిగే బాధ స్వయంకృతం. అది మనం ఎదుటి వ్యక్తికీ ఇచ్చే విలువను,ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఈ ఇహలోకపు భ్రమల్లో సంచరిస్తూ ఉన్నంతకాలం మనకు మనం విధించుకునే సంకెళ్ళు ఈ భావోద్వేగాలు...వీటిని అధిగమించటానికి భగవదనుగ్రహం కావాలి...అంతవరకు తప్పవు ఈ గాయాలు..

*******************************************

నేను పరిచయం చేస్తున్న సీరియల్ చదువుతున్న ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే వారికి ఈ గమనిక...

నిన్న కష్టపడి ఒక గంట కూర్చుని మూడవ భాగం రాసాను..కానీ రాస్తున్నది ఆన్లైన్లో అవటం వల్ల చివరి క్షణంలో కరెంట్ పోయి మొత్తం డిలిట్ అయిపోయింది. నా సిస్టం పాడయిపోవటం వల్ల కలుగుతున్న తిప్పలు... చదివేవారు కొందరైనా మొదలెట్టినది పూర్తి చేయాలి కదా..మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాకా, ఈ బ్లాగ్లో టపాలు తాత్కాలికంగా ఆగిపోయేలోపు తప్పక పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను.

--తృష్ణ.

Tuesday, March 16, 2010

అందరికీ శుభాకాంక్షలు...



ఉగాది అంటే మన నూతన సంవత్సరం...
ఈ రోజున ప్రతి తెలుగు ఇంటా వెల్లివిరుస్తుంది ఉత్సాహం...
ఆ ఉత్సాహం కావాలి నవోదయానికి స్వాగతం...
అది తేవాలి ప్రతి మనసుకూ చిరునవ్వుల శుభోదయం...!!


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

Friday, March 12, 2010

"మౌన గీతం " నుంచి నాలుగు పాటలు ...

ఇష్టమైన పాటల గురించి రాసి చాలా రోజులైంది అని ఆలోచిస్తుంటే 1981 లో జే.మహేంద్రన్ దర్శకత్వం వహించిన "మౌన గీతం" సినిమాపాటలు గుర్తు వచ్చాయి. సుహాసిని నటించిన మొదటి సినిమా ఇది. హీరోయిన్ గా బుక్ చేసుకున్న పద్మిని కొల్హాపురి రాకపోతే ఆఖరు నిమిషంలో సినిమాకు అసిస్టెంట్ కెమేరా ఉమన్ గా పనిచేస్తున్న సుహాసిని ని హీరోయిన్ గా తీసుకోవటం జరిగిందని చెబుతారు. ప్రతాప్ పోతన్,మోహన్,సుహాసిని ప్రధాన తారాగణం. సినిమాలో నాలుగు పాటలు చాలా ఆదరణ పొందినవే. ఇళయరాజా మార్కుతో ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పాటలు అవి. తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన ఈ తమిళ్ సినిమా (" Nenjathai Killathey ") కూడా మంచి సినిమాల కేటగిరిలోకి వస్తుంది. 1986 లో మణిరత్నం దర్శకత్వం వహించిన 'మౌన రాగం' చిత్ర కధ ఈ సినిమా కధకు కాస్త దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నేను రాస్తున్న నాలుగు పాటలు "ఆచార్య ఆత్రేయ"గారు రచించారు. మార్నింగ్ వాక్ తో మొదలైయ్యే "పరువమా చిలిపి పరుగు తీయకు.. పరుగులో పంతాలు పోవకు.." బాలు, s.జానకి గళాల్లో జీవం పోసుకున్న ఒక గొప్ప రొమాంటిక్ సాంగ్ ఇది. రెండవ పాట "చెలిమిలో వలపు రాగం వలపులో మధురభావం" మూడవ పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. "నా రాగమే తోలి పాటై పాడెను.. ఆ పాటకు ఎద వీణై మ్రోగెనే మీటేదెవరోపాడేదెవరో.. తెలుసుకో నేనే..." ఇక నాలుగవది చాలా ప్రత్యేకమైన పాట. "పాపా పేరు మల్లి నా ఊరు కొత్త ఢిల్లీ అర్ధ్రరాత్రి నా కల్లోకి వచ్చిలేపి నా సంగీతం గొప్ప చూపమంది..." దీనిని ఎస్.జానకి గారు పాడారు అంటే ఎవరు నమ్మలేరు. ఒక తాగుబోతు గొంతును ఇమిటేట్ చేస్తూ ఆవిడ పాడిన విధానం "ఔరా" అనిపిస్తుంది. జానకిగారు పాడిన వైవిధ్యమైన పాటల జాబితాలో చేర్చుకోదగిన పాట ఇది.

Thursday, March 11, 2010

" మృత్యోర్మా అమృతంగమయ - 2"

మొదటి భాగం తరువాయి....

వృత్తిరీత్యా అదే ఊళ్ళో డాక్టరు ప్రకాశరావుగారు. పేరుకు కాంతిమతికి పెదతల్లి కొడుకైనా సొంత అన్నగారి కంటే అభిమానంగా ఉంటారు. కాంతిమతికి పెళ్ళి సంబంధం కుదిర్చింది మొదలు,ఆమెకు టీచర్ ఉద్యోగం, ట్రైనింగ్, పీ.జీ., అయ్యాకా లెక్చరర్ ఉద్యోగం ఇప్పించటం వరకూ ఆమెకు ఎంతో సహాయకంగా ఉంటూ వచ్చారు. కుటుంబంలో ఆర్ధిక సమస్యలున్న మంగ అనే పధ్ధెనిమిదేళ్ళ ఒక అమ్మాయికి ఆసరా చూపించవలసినదిగా కాంతిమతి అన్నగారిని కోరుతుంది.

ప్రకాశరావుగారి
ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు అమెరికాలో ఉండగా, మూడవ కొడుకు సురేష్ బాధ్యతలు విస్మరించి అల్లరిగా తిరగటం ఆయనకు ఉన్న ఏకైక చింత. చిన్న వయసులో కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయటం కోసం ఉద్యోగానికి సిధ్ధపడ్డ మంగను చూసి ముచ్చటపడతారు ఆయన. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పించేవరకు తన మందుల షాపులోనే పనిలో పెట్టుకుంటానని మాట ఇస్తారు ప్రకాశరావుగారు. హౌస్ సర్జన్సీ పూర్తి చేసిన చిన్న కొడుకు, కోడలుకూ అదే ఊళ్ళో డాక్టర్లుగా స్థిరపడటానికి కూడా ప్రకాశరావుగారి పలుకుబడే కారణం. కాంతిమతి దగ్గర ఉంటూ ఆమెను ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉంటారు అబ్బాయి కిషోర్,కోడలు మంజు.

* * * * * * * * *

రిటైరయిన మర్నాడు పొద్దున్న లేచేసరికీ వంట ప్రయత్నంలో ఉన్న కోడలును చూసి తనను లేపలేదేమని అడుగుతుంది కాంతిమతి. ఇన్నేళ్ళ తరువాత విశ్రాంతిగా పడుకున్న ఆవిడను లేపాలనిపించలేదంటుంది మంజు. ఆ రోజు శుక్రవారం ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకుందామని అన్నీ అమర్చుకుని కూర్చుందామనుకునేసరికీ కొలీగ్ శారద "లెక్చర్ నోట్స్" తన హేండ్ బ్యాగ్లో ఉండిపోయిన సంగతి గుర్తు వస్తుంది ఆవిడకు. ఆ నోట్స్ ఇచ్చేసి వచ్చి పూజ చేసుకోవచ్చని, పక్కవీధిలోని శారద ఇంటికి బయల్దేరుతుంది ఆమె.

ఓరవాకిలిగా వేసిఉన్న తలుపు లోపల నుంచి పెద్దగా వినిపిస్తున్న మాటలు విని కాంతిమతి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. శారదా వాళ్ళ పాపకు జ్వరంగా ఉండటం వల్ల,పనిపిల్ల మానివేసిన కారణంగాను ఆఫీసుకు శెలవు పెట్టుకునే విషయంలో ఘర్షణ పడుతున్న ఆ భార్యాభర్తల సంభాషణ వింటుంది ఆమె. తాను శెలవు పెట్టడం ససేమిరా వల్లకాదని, కావాలంటే ఉద్యోగం మానుకోమని ధుమధుమలాడుతూ కాంతిమతిని దాటుకుని బయటకు వెళ్పోతాడు శారద భర్త.

కాంతిమతి పలకరించగానే కన్నీళ్ళు పెట్టుకున్న శారద, ఇద్దరు సంపాదిస్తూంటేనే చాలని జీతాలతో ఉద్యోగాన్ని మానివేస్తే సంసారమేలా ఈదటం అని బాధ పడుతుంది. ప్రస్తుతం ఖాళీ కాబట్టి పనిపిల్ల దొరికేదాకా పాపను చూస్తానని హామీ ఇచ్చి, అవసరమైన వస్తువులు తీసుకుని శారదను కాలేజీకు పంపించి పాపతో ఇల్లు చేరుతుంది కాంతిమతి. సాయంత్రం పాపనెత్తుకుని సంతృప్తిగా వెళ్ళిపోతున్న శారదను చూసిన కాంతిమతికి ఉదయం పూజ పూజ చేసుకోలేదన్న విషయం పెద్దగా బాధించదు.

కానీ మంజు కూడా ఉద్యోగాస్తురాలు. రేపు పిల్లలు కలిగాకా వారు కూడా ఏ పనిపిల్ల చేతుల్లోనో పెరగటం, దాని వల్ల కొడుకు కోడలు కూడా ఇలాగే కిచులాడుకుంటారా అన్న సందేహం ఆమెకు కలుగుతుంది. రకరకాల ఆలోచనలతో కుదుటపడని ఆవిడ మనసుని భగవద్గీత పఠనం ప్రశాంత పరుస్తుంది.

ఆ తరువాత అనుకోకుండా శారద పక్కింట్లో ఉన్న మరో ఉద్యోగాస్తురాలు సీత బాబును కూడా చూసే బాధ్యతా తీసుకుంటుంది కాంతిమతి. పనిపిల్లల్ని పెట్టుకున్నాకా కూడా ఆ పిల్లలతో సహా పిల్లల్ని ఆవిడకే అప్పగించి వెళ్ళేవారు శారద, సీత. నెలరోజులు గడిచేసరికి పిల్లలు కాంతిమతికి బాగా చేరువయి, శ్రద్ధగా చూసుకోవటం వల్ల గుమ్మడిపళ్ళలా తయారవుతారు.

(
ఇంకా ఉంది ...)


Saturday, March 6, 2010

" మృత్యోర్మా అమృతంగమయ - 1"



మహిళా బ్లాగర్లందరికీ ముందుగానే ఉమెన్స్ డే శుభాకాంక్షలు.

రాబోతున్న "ఉమెన్స్ డే" సందర్భంగా మొన్నటి టపాలో ప్రస్తావించిన ఒక "
పాత పత్రిక--ఆంధ్రప్రభ" నుంచి ఒక నవలను పరిచయం చేయాలని సంకల్పం. ఇది 1975లో ఆంధ్రప్రభ పత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన శ్రీమతి ఏ.తేజోవతిగారి నవల "మృత్యోర్మా అమృతంగమయా". తేజోవతి గారి ఇతర రచనలు (నవలలు,కధలు) అంతకు ముందు కూడా ఆంధ్రప్రభలో ప్రచురితమయ్యాయి. అవి పుస్తకరూపంలో ప్రచురితమయ్యాయా లేదా అనేది నాకు తెలియదు. కధల సంపుటి మాత్రం అచ్చయినట్లు రచయిత్రి ఒకచోట పేర్కొన్నారు.

ఎం.ఏ.ఇంగ్లీష్ లిటిరేచర్ చదివిన ఈ రచయిత్రి అప్పట్లో గుంటూరులోని పలు కళాసాలల్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసినట్లు కూడా తన పరిచయంలో తెలిపారు. రిటైర్ అయిన ఒక మహిళా లెక్చరర్ తన శేష జీవితాన్ని సమాజానికీ, ఉదోగస్థులైన ఇతర మహిళలకూ ఉపయోగపడేలా ఎలా మలుచుకున్నదీ ఈ నవల కధాంశం. ఒక ఆశ్రమానికి వెళ్ళి తన రిటర్డ్ లైఫ్ గడపాలనుకున్న ఆమె తన చూట్టూ జరిగిన కొన్ని సంఘటనలకు స్పందించి, తన చిరకాల కోరికను వదులుకుని సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కధ.


రచయిత్రి రాసిన విధానం, తన చుట్టూ ఉన్న కొందరు మనుషుల ఇబ్బందులు, బాధలూ చూసి వారికి ఏదన్నా సాయం చేయాలని ప్రధాన పాత్రధారి పడే ఆరాటం, ఆమెకున్న సేవా దృక్పధం, ఎదుటి వ్యక్తిని ఆమె అర్ధం చేసుకునే తీరు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆమె కేరక్టరైజేషన్ చాలా బాగుంది. ముఖంగా రచయిత్రి నవలను మహిళా లోకానికి అంకితం ఇచ్చిన వాక్యాలు నాకెంతగానో నచ్చాయి.
"ఇటు గృహిణులుగానూ, అటు ఉద్యోగినులుగానూ అష్టావధానం చెయ్యలేక సతమతమవుతున్న మహిళాలోకానికి" అని రాసారు .

ఈ నవల బయట దొరకదేమో అనే ఉద్దేశంతో మొత్తం కధను రాయదలిచాను.మరి నవలా కధను నాకు చేతనైన విధంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను...

మృత్యోర్మా అమృతంగమయా:


ఉమెన్స్ కాలెజీ లెక్చరర్ గా "కాంతిమతి" ఉద్యోగ విరమణ సభతో కధ మొదలౌతుంది. అభిమానంతో,పూలమాలలతో విద్యార్ధినులు,సహోద్యోగినులూ సన్మానించి, భారమైన మనసులతో రిక్షా ఎక్కించి కాంతిమతి ని ఇంటికి పంపిస్తారు. కానీ ఉద్యోగ విరమణ బాధ కన్నా ఎన్నో సంవత్సరాల బంధనాల నుంచి విముక్తి లభించిందన్న ఆనందంతో ఆమె ఇంటికి చేరుతుంది. ఎస్.ఎస్.ఎల్.సి తరువాత వివాహమైన ఆమె మామగారి మరణం, భర్త చిరుద్యోగం, కుటుంబ బాధ్యతలు వల్ల స్కూలు తిచరుగా ఉద్యోగం ప్రారంభిస్తుంది. ఆ తరువాత పిల్లల పోషణ నిమిత్తం పై చదువులు చదివి లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకోగలుగుతుంది . చిన్ననాటి నంచీ తనకు ఇష్టమైన పూజా పునస్కారాలూ, హరికధా కాలక్షేపాలు మొదలైనవాటికి సమయం కేటాయించుకోలేని బాధ ఆమెలో మిగిలిపోతుంది.


ఇప్పుడిక సమయ పరిమితి,నిబంధనలు లేకుండా తన ఇష్టాన్ని కొనసాగించవచ్చని ఎంతో ఆనందిస్తుందామె. తన చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయిందని, దానిని తీర్చుకోవటానికి అడ్డు చెప్పవద్దని తన వద్ద ఉంటున్న చిన్న కొడుకుని కోరుతుంది కాంతిమతి .
(ఇంకా ఉంది..)

Tuesday, March 2, 2010

పాత పత్రికలూ...మధుర స్మృతులు!

నేను ఊహ తెలిసేసరికీ ఇద్దరు తాతయ్యలనీ ఎరుగను. అందువల్ల నా పాపకు పెద్దల ముద్దుమురిపాలు వీలయినంత అందించాలనేది నా ఆశయం. మా మామగారు కూడా రెండేళ్ళ క్రితం కాలం చేయటంతో మా ఇంట్ళో దాని కాలక్షేపం ఒక్క "నానమ్మ"తోనే. పాపకు అమ్మమ్మ,తాతయ్యల ప్రేమను కూడా అందించాలనే కోరికతో ఈ ఊరు వచ్చినప్పటి నుంచీ స్కూలు సెలవులు ఉన్నప్పుడల్లా, వారం పదిరోజులకోసారైనా, ఓపిక ఉన్నా లేకపోయినా పాపను అమ్మావాళ్ళింటికి తీసుకువెళ్తూ ఉంటాను. కానీ ఈసారి దాదాపు నెల తరువాత ఇంటికి వచ్చాను. ఈసారి ఇంట్లోని పాత పుస్తకాలన్నీ ఓసారి చూడాలనిపించింది. ఎన్నిసార్లు వచ్చినా చదవటం అయిపోనన్ని పుస్తకాలు, వినటం అయిపోనన్ని కేసెట్లు మా ఇంట్లో. నా బాల్యం, సగం జీవితం ఈ పుస్తకాల మధ్యన, కేసెట్ల మధ్యనే గడిచిపోయింది. వాట్ని చూస్తే నా ప్రాణం లేచి వచ్చినట్లు, మళ్ళీ నాలో కొత్త జీవం ప్రవేశించినంత ఆనందం కలుగుతుంది. పాత పుస్తకాలంటే కధలూ,నవలలు...ఇతర పుస్తకాలూ కాదు. పాత పత్రికల తాలుకూ బైండింగ్స్.

మా చిన్నప్పుడు ఇంట్లో చాలా పత్రికలు తెప్పించేవారు. పూర్తి సినిమా కబుర్లతో ఉండే "విజయచిత్ర", "వనిత", "ఆంధ్ర సచిత్ర వార పత్రిక", "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ", "రీడర్స్ డైజస్ట్", 'స్పేన్"...అప్పుడప్పుడు సితార మొదలైన పొడుగాటి సినీ పత్రికలు...ఇలా రకరకాల పత్రికలు ఇంట్లో ఉండేవి. మా పిల్లల కోసం "ట్వింకిల్","బాలజ్యోతి", బాలమిత్ర", "చందమామ","అమర చిత్ర కధలు" మొదలైనవి కూడా తెచ్చేవారు నాన్న. నాకు తెలుగు చదవటం బాగా వచ్చాకా అప్పట్లో పావలాకు అద్దెకు ఇచ్చే "పగడాల పడవ","రాకాసి లోయ" లాంటి చిన్న కధల బుల్లి పుస్తకాలూ, మిగతా పిల్లల పుస్తకాలతో పాటూ అవీ ఇవీ అని లేకుండా నవలలూ,పత్రికలు కూడా చదివేస్తున్నానని అమ్మ నన్ను కంట్రోల్ చేయటానికి చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ అమ్మ మధ్యాహ్నం నిద్రోయినప్పుడూ, శెలవు దినాల్లోనూ అమ్మకు కనబడకుండా నా చదువు కొనసాగుతూ ఉండేది.


మా అప్పటి ఇంట్లో ఒక చిన్న గదిలో బాగా ఎత్తుమీద ఒక కిటికీ ఉండేది. దానికో బుల్లి అరుగు కూడా ఉండేది. అందులోకి ఎక్కి ఎవరికీ కనపడకుండా పత్రికలన్నీ చదివేస్తూ ఉండేదాన్ని. అది కనిపెట్టిన అమ్మ నా క్షేమాన్ని కాంక్షించి అసలు వార పత్రికలు కొనటమే మానేసింది. కానీ అప్పటిదాకా తెప్పించిన పత్రికల్లోని మంచి కధలనూ, సీరియల్స్ నూ, ఇతర విషయాలనూ కొన్నింటిని కట్టింగ్స్ చేసి జాగ్రత్తగా బైండింగ్ చేయించి దాచింది. పిల్లల పుస్తకాలన్నీ కూడా భద్రంగా దాచి బైండింగ్స్ చేయించింది అమ్మ. అవన్ని నా టెంత్ క్లాస్ అయ్యాకా శెలవుల్లో,నేను కాలేజీలోకి వచ్చాకా చదవనిచ్చేది. అప్పుడు మొదలు సమయం దొరికినప్పుడల్లా ఆ బైండింగ్స్ ను ఎన్నిసార్లు చదివానో...

ఇంతకీ ఆ బైండింగ్స్ లో ఏమున్నాయంటే పురాణం సీతగారి "ఇల్లాలి ముచ్చట్లు" , మాలతీ చందూర్ గారి "ప్రమదావనం" తాలూకూ కట్టింగ్స్ ఒక బైండ్; "వనిత"లోని కధలు, సీరియల్స్ ఒక బైండ్, "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లోని కొన్ని సీరియల్స్ ఒక బైండ్, "విజయచిత్ర" పత్రికల్లోని కట్టింగ్స్ సంవత్సరం వారీగా ఒక పదేళ్ళపైగా ఉన్న కొన్ని బైండ్స్, "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ"లో ప్రచురించిన మంచి మంచి ఫొటొగ్రాఫ్స్ తో
ఒక బుక్కు, అన్నిరకాల పత్రికల్లోంచీ సేకరించిన కొన్ని మంచి కధలతో ఒక బైండ్, ఇవికాక మేం పిల్లలం ఇప్పటికీ నాకంటే నాకని దెబ్బలాడుకునే "చందమామా" "బాలజ్యోతి" "ట్వింకిల్" "అమర చిత్ర కధలు" మొదలైనవాటి బైండింగ్స్...ఇంక్లా పైంటింగ్స్, వంటా-వార్పూ, సలహాలు,సూచనలు....ఇలా రాసుకుపోతే రెండు టపాలకు సరిపోయేన్ని నిధి నిక్షేపాలను మా అమ్మ పదిలపరిచింది.

ఇవాళ పొద్దున్నే వాటిని తిరగేసి , చదవటానికి కొన్నింటిని తీసుకున్నా. ఇవన్నీ నేను ఇదివరలో చాలా సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఉంటాయి. అంత మంచి కధలూ, విశేషాలూ అవన్నీ. ఇన్నాళ్ళ తరువాత వాటిని చూసాకా వాటి గురించి బ్లాగులో రాయాలని మనసైంది....ఈ టపా తయారైంది..!!