సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, November 2, 2009

ఇవాళ..

ఈ రోజు గురించి నేను పెద్దగా రాసేందుకేమీ లేదు..అందరికీ తెలిసినదే.. కాని నేను ఇవాల్టి సంగతులని, నా ఇవాల్టి అనుభవాలను పంచుకోవాలని... ఇది రాస్తున్నాను..

ఎప్పటిలానే పొద్దున్నే శివాలయానికి వెళ్ళి చక్కగా ఆవునెయ్యిలో నానబెట్టి ఉంచిన వత్తులన్నీ పెద్ద ప్రమిదలో వెలిగించేసి...చంద్రశేఖరాయ నమ: ఓం..అని పాడేసుకున్నాను..! ఈసారి మారేడు,బిల్వ వృక్షాలు రెండు కలిపి ఉన్న చోట పెట్టాను దీపం.

కానీ గుడిలో ఓ పధ్ధతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు దీపాలు,ముగ్గులూ,పువ్వులూ...తొక్కేవాళ్లూ,తోసేవాళ్ళూ,తుడిచేసేవాళ్ళూ...ఏమిటో మనసు చిన్నబోయింది. మన ఇల్లయితే ఇలా చేస్తామా అనిపించింది. ఇదంతా శుభ్రం చేసుకునే సరికీ గిడివాళ్ళకి ఎంత సమయం పడుతుందో అనిపించింది. కొంచెమన్నా పరిశుభ్రత పాటించరేమిటో మరి..


కానీ ఈ కార్తీకంలో మొదటినుంచీ చెయ్యాలనుకుని చెయ్యలేకపొయిన ఒక పని ఇవాళ చేసాను..చక్కగా పుస్తకం పట్టుకెళ్ళి జనాలు ఎక్కువ లేని ప్రదేశం చూసుకుని, కూర్చుని..శివుడి మీద ఉన్న స్తోత్రాలు,అస్టోత్తరాలూ అన్ని వరస పెట్తి ప్రశాంతంగా చదివేసుకున్నాను..
అక్కడ మావారు లేరు కానీ ఉంటే 'ఓ పనైపోయింది హమ్మయ్యా అనుకున్నావా?' అని ఏడిపించేవారు. ఎందుకంటే మన భక్తి పారవశ్యం ఎంతపాటిదో ఆయనకు తెలుసును.
నిజం చెప్పాలంటే అసలు గుడికి వెళ్తే ఒహ దణ్ణం పెట్టుకుని వచ్చేయటం తప్ప ఏమి తెలిదు నాకు. ఇవాళ ఈ మాత్రం భక్తి నాలో ఉందంటే కారణం ఆయనే...!

ఇంతకీ మనకి ఉపవాసాలు అవీ పెద్దగా నమ్మకం లేదు..చిన్నప్పుడు అమ్మతో కొద్ది సార్లు ఉన్న గుర్తు అంతే..ఈసారి అమ్మ,వదిన,అటు మరదలు,ఇటు మరదలు..అందరూ ఉపవాసం ఉండేస్తున్నామనే సరికి నాకు కొంచెం ఆవేసం వచ్చేసింది...'ఆవేశం ఏనాటిదో..ఉపవాసం ఆనాటిది.." అని ట్యూన్ కట్టేసాను.

కాబట్టి మనమీవేళ ఉపవాసం...ఉండలేకపోవటం లేదు కానీ ఎప్పుడూ ఉండను కాబట్టి విన్నవాళ్ళందరికీ హాచ్చర్యం..!
(ఆయన వింటే ఢామ్మని పడిపోతారు...ఇంకా చెప్పలే పాపం)

"రేపు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ముత్తైదు భోజనం నీకే పెట్టుకుంటాను ఊండిపోవే" అంది అమ్మ.ఇవాళ ఉండటానికి నిన్న రాత్రే "అయ్యగారి పర్మిషన్" తీసేసుకున్నాను .
కాబట్టి అమ్మకి సరేనని మాటిచ్చేసాం ! అదీ సంగతి..
అమ్మావాళ్ళింట్లో ఉండటంవల్ల ఇవాళ పెడదామనుకున్న పాటలు అవీ ఏమీ పెట్టలేకపోతున్నాను...

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ సుధ్ధాయ దిగంబరాయ
తస్మై మకారాయ నమ:శ్శివాయ

11 comments:

చిలమకూరు విజయమోహన్ said...

కానీ గుడిలో ఓ పధ్ధతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు దీపాలు,ముగ్గులూ,పువ్వులూ...తొక్కేవాళ్లూ,తోసేవాళ్ళూ,తుడిచేసేవాళ్ళూ...ఏమిటో మనసు చిన్నబోయింది.
ఏ గుడిలో చూసినా ఇదే చిత్రమే.ఎప్పుడు మారతారో ఏమో!

సుభద్ర said...

మీ భక్తి చూశాక నాకు డౌట్ వచ్చేస్తూ౦ది ..మా ప్రార్దనలు వి౦టాడా ఆ దేవదేవుడు అని.

psm.lakshmi said...

కొన్ని గుళ్ళల్లో పెట్టిన దీపాలు పెట్టినట్లే చిమ్మేస్తూంటారు పనివాళ్ళు. దీపావదగ్గర కొందరు పెట్టే డబ్బులకోసం రెడీగా వుంటారు పిల్లలు.గుడికి రష్ లేని టైములో వెళ్ళటం ఉత్తమోత్తమం.
psmlakshmi

కొత్త పాళీ said...

very nice

జయ said...

తృష్ణ, నాకైతే గుడిలో కన్నా ఇంట్లోనే ప్రశాంతంగా ఎంత సేపైనా మనకు తోచిన పూజ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ప్రత్యేక సందర్భాలలో గుడికి పోతే చికాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అక్కడి హడావుడే ఎక్కువగా ఉంటుంది. మనకి ఏకాగ్రత కి అవకాశమెక్కడుందిక.

తృష్ణ said...

విజయమోహన్ గారూ, అవునండీ....కానీ ముందు మనం సరిగ్గా చేస్తే , మనల్ని చూసి మరికొందరన్నా అలా చేస్తారేమో అని వీలైనంత మటుకు జాగ్రత్తగా తుక్కు అదీ డస్ట్ బిన్ వెతుక్కుని వెళ్ళి పడేస్తు ఉంటానండీ నేను..

సుభద్ర: మీరు మరీ నండీ...నేనెంత నా భక్తెంత...ఏదొ సరదా కొద్ది బ్లాగ్ లో రాసుకోవటం కానీ... నన్ను మిమ్చినవారు బోలెడు మంది..!

తృష్ణ said...

@psmlakshmi: పొద్దున్న నా ఎదురుగానే ఒక పనిపిల్ల ఎవరో వెలిగించిన దీపం ఇంకా ఆరని ప్రమిదను తుడిచేస్తోంది...ఏం చెప్పాలి వాళ్ళకి? ఏమన్నా అంటే క్లీనింగ్ అంటారు..

@కొత్తపాళీ: ధన్యవాదాలు.

తృష్ణ said...

జయ: మీరన్నది నిజమేనండీ..కానీ కొన్ని సందర్భాల్లో గుడిలోకి వెళ్ళటం తప్పనిసరి అవుతుంది ఇవాళ్టి లాగ. నాకు కార్తీక పౌర్ణమికి దీపాలు గుడిలో పెట్టడమే ఇష్టం...
అయితే మీరన్నట్లు కొన్ని పండుగల్లో మాత్రం నేనూ ఇంట్లోనే పూజ చేసుకోవటం ఇష్టపడతానండీ..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అమ్మకి ఫొన్‌చేస్తే నీరసంగా మాట్లాడుతోంది. విషయం ఏవిటంటే ఈరోజు అరుణాచలం వెళ్లాలి అనుకుంది. కుదరక కాళహస్తికి వెళ్లింది. ఇక దర్శనం టికెట్లు, క్యూలు, వీఐపీ దర్శనాలు, మొదలైన తతంగాలు. సర్లే నాకోసం మొక్కుకున్నావా? అంటే అక్కడికొచ్చే సరికే అల్లుడుగారి పేర అర్చనలు. ప్చ్ ఏమి చేద్దాం ఆయన గెజిటేడ్ రాంక్ కదా :)

తృష్ణ said...

@ చైతన్య: ఇంకేం చేస్తాం ఎడ్జస్ట్ అవుదాం...జిందగీ మొత్తం సర్దుకుపోదాం....
(సరిగ్గా రాసానా లైన్లు)

veera murthy (satya) said...

గుడికి వెళ్ళడమెందుకు? మనసులొ భక్తి వుండాలి కనీ అంటారు స్నేహితులు....

నేనంటానూ, భావం (భక్తి/ప్రేమ) మానసికమైంది మాత్రమె కాదు...శారీరకమైంది కూడా అని...ఈన్నొ రోజుల తరవాత మనకి కావలిసిన వాళ్ళు కలిస్తె మనకి తెలీకుండానె మనమే ఎదురు వెళ్ళి కలుస్తాం...అది శరీరక స్పందన...శరీరాన్ని కదల్చ కుండా భావాలని పలికించద కస్టం కూడానూ... అందుకే ఆలయాలలో..శరీరానికి మౌనం- మనసుకి మననం నియమగా పెట్టారు....అది ఎనాడో మనం పొగొట్టుకున్నాం...

ఆచారాల పేరున,ఆర్భాటాలు చెస్తున్నాం.
ఏది పొగొట్టుకున్నమో అలోచించక..
ఏం కొల్పోతున్నామా అని యోచిస్తున్నాం.


కాని భూమి గుండ్రంగా వుంది ...త్వరలోనె మన రాబోఏ తరాలు, మెల్కొని సత్సంప్రదాయాలని పునర్జీవింప జేసుకుంటాయి...బ్రతుకులని పండిచుకుంటాయి...